
దాదాపు 800 కోట్ల మంది ప్రజల ఆకలి తీర్చే, భద్రత కల్పించే, ఆరోగ్యాన్ని కాపాడే, జీవనోపాధిని ప్రసాదించే శక్తి సారవంతమైన నేలలకే ఉంది. మనకు జీవనాధారమైన ఈ నేల తల్లికి ప్రమాదం పొంచి ఉంది. ప్రకృతి వైపరీత్యాలతో పాటు, మన స్వయం కృతాపరాధం వల్ల ఈ నేలల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని పర్యవసానంగా నేల ఎడారిగా మారి, కరువులు విలయతాండవం చేసే అవకాశాలున్నాయి. ఎడారీకరణ, కరువులు అనేవి నేడు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద పర్యావరణ సవాళ్లు.
కరువు, ఎడారీకరణ అంటే ఏమిటి?
ఒక ప్రాంతంలో ఎక్కువ కాలం వర్షాలు కురవక పోవడం వలన పంటల ఉత్పత్తి తగ్గే స్థితిని కరువు అంటాం. సారవంతమైన భూమిలో ఏ రకమైన పంటలూ పండే వీలు లేకపోవడాన్ని ఎడారీకరణ అంటారు. ఈ రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. ఐక్యరాజ్యసమితి సమాచారం చూస్తే గుండె దడ పుడుతుంది. గత దశాబ్దకాలంలో ఎడారీకరణ తీవ్రత 35 రెట్లు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు సుమారు నాలుగు ఫుట్బాల్ మైదానాల విస్తీర్ణంలో సారవంతమైన భూమి క్షీణిస్తోంది. 2040 నాటికి 25 శాతం మంది పిల్లలు నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని, 2050 నాటికి ప్రపంచ జనాభాలో 75 శాతం మంది కరువులకు గురవుతారని నివేదికలు చెబుతున్నాయి. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, మానవ మనుగడకే ముప్పు.
మనదేశ పరిస్థితి:
ఆంధ్రప్రదేశ్లో 14.35 శాతం, తెలంగాణలో 31.40 శాతం భూములు నిరుపయోగంగా మారాయి. ఏపీలో అనంతపురం జిల్లా, తెలంగాణలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికంగా ఎడారీకరణ జరుగుతోంది. మనదేశ భూభాగంలో దాదాపు 32% క్షీణించింది. 25% ఎడారీకరణకు గురవుతోంది. సుమారు 115 నుండి 120 మిలియన్ హెక్టార్లు నేల క్షీణతకు గురైంది. ఇందులో నీటి కోత, గాలి కోత, లవణీయత, వృక్షసంపద నష్టం వంటివి ఉన్నాయి. 2015 నుండి 2019 మధ్యలో మన దేశంలో 30.51 మిలియన్ హెక్టార్ల నేల క్షీణించింది. 2015లో 4.42 శాతంగా ఉన్న ఈ క్షీణత 2019 నాటికి 9.45 శాతానికి పెరిగింది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డెసర్టిఫికేషన్ నివేదిక ప్రకారం మనదేశ భూభాగంలో 36.8% కరువు ప్రభావిత ప్రాంతంగా ఉంది. 85.44 కోట్లు (83.85%) భారత జనాభా కరువు పరిస్థితులకు గురయ్యారని ఈ నివేదిక పేర్కొంది.
వాతావరణ మార్పుల వల్ల సంభవించే కరువులు దేశవ్యాప్తంగా ముఖ్యంగా పంజాబ్తో సహా రైతుల దుస్థితిని తీవ్రతరం చేస్తున్నాయి. 2023 అక్టోబర్ 25 నాటికి 25.1 కోట్ల మంది భూమి క్షీణత బారిన పడ్డారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ప్రతీ సంవత్సరం 12 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణం అంటే నిమిషానికి 23 హెక్టార్లు కరువులు, ఎడారీకరణ కారణంగా నష్టపోతున్నాయి. దీని వల్ల నిమిషానికి ఇరవై మిలియన్ టన్నుల ధాన్యం కోల్పోయినట్లేనని అంచనా.దేశవ్యాప్తంగా చూస్తే, రాజస్థాన్లో 21.23 మిలియన్ హెక్టార్ల భూమి ఎడారిగా మారగా, మహారాష్ట్ర, గుజరాత్లో వరుసగా 14.3 మిలియన్ హెక్టార్లు, 1.02 మిలియన్ హెక్టార్ల భూమి క్షీణించింది.
మన దేశంలో 21 శాతం ప్రాంతంలో ఏటా 700 మి.మీ కంటే తక్కువ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతాలు కరువు ప్రాంతాలుగా మారుతున్నాయి. అహ్మదాబాద్లోని భారత స్పేస్ అప్లికేషన్ సెంటర్ రూపొందించిన ‘ఎడారీకరణ, భూసార క్షీణత అట్లాస్’ ప్రకారం దేశంలో భూసార క్షీణత, ఎడారీకరణ సుమారు 97.84 మిలియన్ హెక్టార్లుగా తేలింది. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలకు గాను 26 రాష్ట్రాల్లో గత పదేళ్లలో ఎడారి ప్రాంతం గణనీయంగా పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో 50% కంటే ఎక్కువ విస్తీర్ణం ఎడారీకరణ, భూక్షీణత కింద ఉంది. వీటిలో రాజస్థాన్ (6.46 శాతం) అగ్రస్థానంలో ఉండగా, మహారాష్ట్ర (4.35 శాతం), గుజరాత్ (3.12 శాతం), లడఖ్ (2.16 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎడారీకరణ వేగంగా పెరుగుతున్న రాష్ట్రాలలో మిజోరాం ఒకటి. 2003 – 05 నుండి 2018 -19 మధ్య 0.18 మిలియన్ హెక్టార్లు క్షీణించాయి. ఇది 188% కంటే ఎక్కువ పెరుగుదల. ఇదే రాష్ట్రంలో లంగ్లే ప్రాంతంలో నేల పెళుసుబారడం మరీ ఎక్కువగా పెరిగిపోతోంది (5.8%). 2003 నుండి 2011 మధ్యలో అత్యధికంగా 18 లక్షల హెక్టార్ల భూమి ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఈ క్షీణత అరుణాచల్ ప్రదేశ్లో 46% పెరుగుదల, నాగాలాండ్లో 29.4% పెరుగుదల నమోదైంది.
కారణాలు:
ఈ రెండింటికీ నేల క్షీణత ఒక ప్రధాన కారణం. నేల కోత లేదా క్షీణత ముఖ్యంగా వర్షపు తుఫానుల వల్ల సంభవిస్తుంది. వర్షపాతం రిల్ కోత, గల్లీ కోత, షీట్ కోత, స్ప్లాష్ కోత వంటి అనేక రకాల నేల కోతలకు దారితీస్తుంది. ఈ మట్టి కణాలు వర్షపు జల్లుల ద్వారా చెదిరిపోయి, నదులు, వాగుల్లోకి కొట్టుకుపోతాయి. తరచుగా తీవ్రమైన వర్షాలు కురిసే ప్రాంతాల్లో భారీ మట్టి నష్టం సంభవిస్తుంది. వరదల సమయంలో ప్రవహించే నీరు కూడా చాలా మట్టిని నాశనం చేస్తుంది. ఎడారీకరణకు వాతావరణ వైవిధ్యాలు ఒక కారణం. మానవ కార్యకలాపాలు మరొక ప్రధాన కారణం. ముఖ్యంగా సహజ వృక్షసంపదను తొలగించడం, సున్నితమైన భూముల్లో నిరంతరం సాగు చేయడం, నీటిని సమర్థవంతంగా వినియోగించుకోకపోవడం, పశువులు పచ్చిక బయళ్లను పూర్తిగా మేసివేయడం వల్ల నేల బహిర్గతమై కోతకు గురవుతుంది. ఈ నిలకడలేని భూ నిర్వహణ పద్ధతులు నేల రసాయన శాస్త్రం, హైడ్రాలజీని మార్చి, భూమిపై అపారమైన ఒత్తిడిని కలిగిస్తాయి. అటవీ నిర్మూలన, పట్టణ విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వెలికితీత పరిశ్రమలు ప్రధాన కారణాలు.
అతిగా మేపడం, నిలకడలేని వ్యవసాయ పద్ధతులు వంటివి మన ప్రపంచంలోని పొడి భూములను ఎడారులుగా మారుస్తున్నాయి. రసాయనిక ఎరువుల అధిక వినియోగం, సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం లేకపోవడం, అక్రమ మైనింగ్, పారిశ్రామిక కాలుష్యం నేల క్షీణతకు దోహదపడుతున్నాయి. ఇస్రో యొక్క ‘డెసర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డెగ్రాడేషన్ అట్లాస్’ ప్రకారం, నీటి కోత భారతదేశ భూమి క్షీణతకు అత్యంత ముఖ్యమైన కారణం, ఇది 11.01% భూమిని ప్రభావితం చేస్తుంది. వృక్షసంపద క్షీణత 9.15%, గాలి కోత 5.46% ఎడారీకరణకు కారణం. దాదాపు 21 మిలియన్ హెక్టార్ల అటవీ భూమి (మొత్తం అటవీ విస్తీర్ణంలో 30%) క్షీణించింది. ఉపాంత భూముల్లో సాగును విస్తరించడం, సరిపడని నేల, నీటి సంరక్షణ చర్యలు, ఇంటెన్సివ్ పంట విధానాలు, పేలవమైన నీటిపారుదల నిర్వహణ, భూగర్భజలాలను అతిగా వినియోగించుకోవడం లాంటివి మన దేశంలో ఎడారీకరణకు ప్రధాన కారకాలు.
నష్టాల పరిణామాలు:
ఈ ఎడారీకరణ, కరువులు మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇది వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ప్రపంచంలో 160 కోట్ల హెక్టార్ల పంటభూమి క్షీణత 32 కోట్ల ప్రజల మీద ప్రభావం చూపుతుంది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో మూడొంతుల మంది కరువులకు లోనవుతారు. 480 కోట్ల నుండి 570 కోట్ల మంది ప్రజలు ప్రతీ ఏడాది ఒక నెల పాటు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. నీటి కొరత, క్షీణిస్తున్న పంట ఉత్పాదకత, సముద్ర మట్టం పెరుగుదల, అధిక జనాభా వంటి ఇతర అంశాలతో పాటు కరువు కారణంగా 2050 నాటికి 21.6 కోట్ల మంది ప్రజలు వలస వెళ్లవలసి వస్తుంది. ఇది కేవలం నీటి కొరత, ఆహార అభద్రతకే దారితీయదు. అనారోగ్యాలతో పాటు పేదరికం, నిరుద్యోగానికి కూడా దారి తీస్తుంది. ఇవి ప్రజల్లో ఆర్థిక అసమానతలను పెంచుతాయి.
జీవవైవిధ్యం, నీటి వనరులు, వృక్షసంపదకు నష్టం కలిగిస్తాయి. 2040 నాటికి ఆహార ధరలు 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. పంటలకు అత్యంత తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తాయి. అన్ని వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తుంది. మంచినీటి పర్యావరణ వ్యవస్థలు, జలవనరులు క్షీణించి పంటలను పండించడం, పశువులను పెంచడం కష్టతరం చేస్తుంది. భారతదేశం ప్రపంచ మంచి నీటి వనరుల్లో కేవలం 4% వాటా కలిగి ఉన్నప్పటికీ, భారీ జనాభా అవసరాలను తీర్చలేకపోతోంది. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో అత్యంత నీటి ఒత్తిడి ఎదుర్కొంటున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. తాజా అధ్యయనం ప్రకారం 2050 నాటికి దేశంలోని సగం జిల్లాలు నీటి కొరతను ఎదుర్కోనున్నాయి. అదే సమయంలో తలసరి నీటి లభ్యత 15% తగ్గుతుందని, జల వనరుల డిమాండ్ 30% పెరుగుతుందని అంచనా. నీటి ఎద్దడి కారణంగా దేశ స్థూల దేశీయోత్పత్తిలో ఆరు శాతం తగ్గుదల నమోదు కావచ్చని నీతి ఆయోగ్ నివేదించింది.
మనం ఏం చేస్తున్నాం? ఏం చేయాలి?
ఈ ప్రమాదాన్ని గుర్తించి మన దేశంలో కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. భారతదేశం తన జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 2030 నాటికి భూసారం క్షీణించిన 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2.5 నుండి 3 బిలియన్ టన్నుల బొగ్గుపులుసు వాయువుకు సమానమైన హరితవాయు ఉద్గారాల శోషణకు దారితీస్తుంది. గుజరాత్లోని బన్నీ ప్రాంతంలోగల ‘రాన్ ఆఫ్ కచ్’లో చేపట్టిన భూమి పునరుద్ధరణ విజయవంతమైన ఉదాహరణగా నిలుస్తుంది. అక్కడ పచ్చిక బయళ్లను అభివృద్ధి చేయడంతో భూసార క్షీణతను తగ్గించి, జీవనోపాధిని మెరుగుపరిచారు. పది లక్షల హెక్టార్ల నేల అటవీ నిర్మూలనను పునరుద్ధరించారు. మన దేశంలో 1988 నాటి జాతీయ అటవీ విధానం లక్ష్యంగా మొక్కలను నాటడం, అడవుల విస్తీర్ణం పెంపు ద్వారా ఎడారీకరణను ఎదుర్కొంటున్నారు. 2021 నుండి 2022 మధ్య 1.894 కోట్ల హెక్టార్ల అటవీ పెంపకం జరిగింది. జాతీయ తీర ప్రాంత మిషన్ ద్వారా మడ అడవులు, పగడపు దిబ్బలను పరిరక్షిస్తున్నారు.
ఇంకా చేయవలసినవి:
పునరుద్ధరణలో మట్టి నష్టాన్ని నివారించడం కీలకమైన భాగం. సాధారణ అడవులతో పాటు మడ అడవులను కూడా కాపాడాలి. కొత్తగా మొక్కలను పెంచాలి. వర్షపు నీరు నదులు, సముద్రాలలో వృధా కాకుండా చెక్ డ్యామ్ల నిర్మాణాలు చేపట్టాలి. నీటి వనరులను సంరక్షించాలి. భూసార పరిరక్షణ, జీవ వైవిధ్యం పెంపుతో పాటుగా వ్యవసాయ భూములలో నిర్మాణాలు చేపట్టరాదు. పరిమితికి మించి వ్యవసాయ బోర్లు త్రవ్వకూడదు. పట్టణాలలో అధిక అంతస్తుల గృహాలను నివారించాలి. గృహాలలో పరిమితికి మించి నీటి బోర్లను అనుమతించకూడదు. ఈ సమస్యను మనం తీవ్రంగా పరిగణించాలి. ప్రభుత్వాలు, సంస్థలు మాత్రమే కాకుండా, ప్రతి వ్యక్తి కూడా తమ వంతు కృషి చేయాలి. మనందరం కలిసికట్టుగా కృషి చేస్తేనే, ఈ నేల తల్లిని రక్షించుకోగలం. లేదంటే, మన భవిష్యత్తు తరాలు తీవ్రమైన కరువులు, ఎడారీకరణతో కూడిన ప్రపంచంలో జీవించాల్సి వస్తుంది. రేపటి కోసం నేడు మనం చర్యలు తీసుకుందాం.