HISTORY CULTURE AND LITERATURE

ఈ వ్యక్తి గురించి మీకు తెలుసా?

స్వాతంత్య సమరయోదులు అంటే గాంధీ,నెహ్రు,సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వారి గురించే చాలా మంది చెప్తారు,కానీ మన తెలుగు వాళ్ళే కాకుండా స్వాతంత్రం కోసం పోరాడిన అజ్ఞాత వ్యక్తులు కూడా కొందరు ఉన్నారు. వారిలో ఒకరే అష్ఫాకుల్లా ఖాన్,వీరు అక్టోబర్ 22,1900 -డిసెంబర్ 19,1927 లో స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్న సమరయోధుడు.

నా మాతృభూమిని ఆంగ్లేయుల సృకలల నుండి విముక్తం చేయాలనుకున్నా,నా త్యాగం వృధా కాదు,మరెందరో త్యాగధనులకు స్పోర్తినిస్తుంది నా హిందూస్తాన్ స్వేచ్చా వాయువులు పిలుస్తుంది,చాలా త్వరగా బానిస సంకెళ్ళ నుండి విముక్తి పొందుతారు అనే నినాదం ఆయన వ్యక్త పరిచారు.

దేశంలోని ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబాన్ని ఎక్కబోతున్న మొట్ట మొదటి అదృష్టవంతుడుగా గర్వపడుతున్నాను’ అంటూ అష్ఫాఖుల్లా ఖాన్ ఉరితాడును ముద్డాడి మెడలో తానే వేసుకున్నాడు.

నా దేశ సోదరులారా! మీరు మొదట భారతీయులు. ఆ తర్వాతే వివిధ మతా లవారు. మీరే మతం వారైనప్పటికీ పరస్పరం కలహించుకోకండి. ఐకమత్యంతో ఆంగ్లేయులను ఎదిరించండి.దేశ విముక్తే మన లక్ష్యం కావాలి అని అష్ఫాకుల్లా ఖాన్ అన్నారు.

భరతమాత స్వేచ్ఛ కోసం సర్దార్ భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల కంటే నాలుగు సంవత్స రాల ముందే ఉరిశిక్షపడిన దేశభక్తుడు అష్ఫాఖుల్లా ఖాన్.వారి జీవిత విశేషాలను తెలుసుకోవడం మన కనీస ధర్మం.

బాల్యము

అష్ఫాకుల్లా ఖాన్ ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్‌పూర్లో షఫీకుర్ రెహమాన్, మజ్హరున్నీసా దంపతులకు 1900 అక్టోబర్ 22న జన్మించాడు.ఈయన తండ్రి షఫీకుర్ రెహమాన్ పొలీసు శాఖలో పనిచేసేవాడు. తల్లి పేరు మజ్హరున్నీసా. అష్ఫాకుల్లా ఈ దంపుతుల ఆరుగురు సంతానములో చివరివాడు.మహాత్మా గాంధీ సహాయనిరాకరణోద్యమము ప్రారంభించినప్పుడు అష్ఫాక్ పాఠాశాలలో చదువుతున్నాడు.

సహాయనిరాకరణోద్యమము

మహాత్మాగాంధీ, చౌరీ చౌరా ఉదంతము తర్వాత సహాయనిరాకరణోద్యమము నిలిపివేయడముతో అనేక మంది భారతీయ యువకులు నిరాశ చెందారు. అలాంటి యువకులలో అష్ఫాక్ ఒకడు. ఈయన భారతదేశాన్ని వీలయినంత త్వరగా పరాయి పాలన నుండి విముక్తము చేయాలన్న తపనతో, అతివాద ఉద్యమకారులతో చేరాడు.

ఈ సమయములోనే ఈయనకు షాజహాన్‌పూర్ కు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు రాంప్రసాద్ బిస్మిల్తో పరిచయమేర్పడింది.

రాంప్రసాద్ బిస్మిల్ తో స్నేహము

హిందూ మతము యొక్క గొప్పతనము గురించి ఇతర మతస్థులకు బోధించడానికి వెనుకాడని ఆర్య సమాజ్ సభ్యుడైన రాంప్రసాద్ బిస్మిల్ తో సాంప్రదాయ ముస్లిం మతస్థుడైన అష్ఫాకుల్లా ఖాన్ యొక్క స్నేహము కొంత విభిన్నమైనదే. అయినా వారిద్దరి సమష్టి లక్ష్యము ఒకటే, భారత స్వాతంత్ర్యము. దీనితో ఇద్దరు మంచి మిత్రులయ్యారు. ఇద్దరూ ఒకే రోజు, కాకపోతే వేర్వేరు జైళ్లలో భారతదేశ స్వాతంత్ర్యము కోసం ప్రాణాలు అర్పించారు.

కాకోరీ రైలు దోపిడి

తమ సాయుధ ఉద్యమానికి ఊపునివ్వడానికి, సాయుధ పోరాటానికి కావలసిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొనుగోలు చేయడానికి ఉద్యమకారులు 1925, ఆగష్టు 8 న షాజహాన్‌పూర్లో ఒక సభను నిర్వహించారు. చాలా తర్జనబర్జనల తర్వాత ఆ సభలో రైళ్లలో రవాణా చేసే ప్రభుత్వ కోశాగారాన్ని దోచుకోవాలని నిర్ణయించారు.

ఆగష్టు 9న అష్ఫాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్ సింగ్, సచీంద్ర బక్షీ, చంద్రశేఖర్ ఆజాద్, కేశవ్ చక్రవర్తి, బన్వారీ లాల్, ముకుంది లాల్, మన్మధనాథ్ గుప్తలు కలిసి కాకోరీ గ్రామం వద్ద ప్రభుత్వ ధనమును తీసుకెళుతున్న రైలును దోచుకున్నారు.

1925 సెప్టెంబరు 26 ఉదయాన పొలీసులు రాంప్రసాద్ బిస్మిల్ ను పట్టుకున్నారు.అయితే అష్ఫాక్ మాత్రము పోలీసులకు దొరకలేదు. ఆయన అజ్ఞాతములో బీహార్ నుండి బనారస్ కు వెళ్లి అక్కడ 10 నెలలపాటు ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేశాడు. అజ్ఞాతములో మరెంతో కాలము ఉండలేక దేశానికి ఉపయోగపడుతుందని విదేశాలకు వెళ్లి ఇంజనీరింగు చదవాలని నిశ్చయించి, దేశాన్ని వదిలి వెల్లడానికి మార్గాలు అన్వేషిస్తూ ఢిల్లీ చేరాడు.

అక్కడ ఒక పఠాన్ స్నేహితున్ని ఆశ్రయించాడు. కానీ అదే స్నేహితుడు అష్ఫాక్ ను వెన్నుపోటు పొడిచి పోలీసులకు ఆయన జాడ తెలియజేసాడు.

అష్ఫాకుల్లా ఖాన్‌ను ఫైజాబాద్ జైల్లో బంధించి కేసు నమోదు చేశారు. అష్ఫాక్ పెద్దన్న రియాసతుల్లా ఖాన్ చివరి వరకు అష్ఫాక్ తరఫు న్యాయవాదిగా వాదించాడు. జైలులో ఉండగా ఈయన ఖురాన్ పఠనము చేసేవాడు.

కాకోరీ దోపిడి కేసు రాంప్రసాద్ బిస్మిల్, అస్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, రోషన్ లకు మరణ శిక్ష్, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించడముతో ముగిసినది.

మరణము

అష్ఫాకుల్లా ఖాన్ ను 1927, డిసెంబర్ 19 న ఉరితీశారు. షాజహాన్‌పూర్ లోని ఈయన సమాధి ఇప్పుడు ఒక స్మారక స్థలమైనది. కొందరు చరిత్రకారులు అష్ఫాకుల్లా ఖానే రాజద్రోహ నేరముపై ఉరితీయబడిన తొలి ముస్లిం అని భావిస్తారు.

ఈయన దేశానికి తన చివరి సందేశములో “నా దేశ స్వాతంత్రం కోసం ఉరికంభమెక్కిన ప్రప్రధమ ముస్లింనైనందుకు నేను గర్వపడుతున్నాను” అని రాశాడు. “ఓ నా మాతృదేశమా సదా నీకు సేవ చేస్తూనే వుంటాను ఉరిశిక్ష పడినా,జన్మఖైదు విధించినా, బేడీల దరువుతో నీనామ స్మరణ చేస్తూనే వుంటాను” [హే మాతృభూమీ తేరి సేవా కియా కరూంగా, ఫాంసీ మిలే ముజే, యా హో జన్మఖైద్ మెరీ, బేడీ బజా బజా కర్ తేరా భజన్ కరూంగా”] అని హిందీలో తన దేశ ప్రజలను ఉద్దేశించి అష్ఫాకుల్లా ఖాన్ పిలుపునిచ్చారు.

అష్ఫాకుల్లా ఖాన్,ఈయన సహచరులు చేసిన పనులను 2006లో విడుదలైన రంగ్‌దే బసంతీ అను హిందీ సినిమాలో చిత్రీకరించారు. ఈ చిత్రములో అష్ఫాకుల్లా ఖాన్ పాత్రను కునాల్ కపూర్ పోషించాడు.

చివరగా.. స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముస్లీం మొట్ట మొదటిగా ఉరిశిక్ష పడిన వ్యక్తిలో ఈయన ఒకరు.కాకపోతే వీరి గురించి చరిత్రలో ఎక్కడా లిఖించబడలేదు.ఎక్కడో చిన్నగా మారుమూలన వీరి గురించి కొందరు చరిత్రకారులు ప్రస్తావించారు.అందువల్ల వీరి గురించి ఎవరికీ తెలియకుండా పోయింది.చరిత్రలో ఎందరో పేర్లు ఉన్నా స్వాతంత్రం కోసం పోరాడి,ప్రాణాలు అర్పించిన అజ్ఞాత వ్యక్తులు ఎందరో,వారి త్యాగం వల్లనే మనకు స్వాతంత్ర్యం వచ్చి,స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నాం.ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ..జైహింద్

Show More
Back to top button