GREAT PERSONALITIESTelugu Special Stories

విప్లవవీరుడు భగత్‌సింగ్‌..జయంతి నేడు!

ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అంటూ స్వరాజ్యం కోసం నినదించిన వీరుడు..  23ఏళ్ల వయసులో దేశంకోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుడు.. 

వారసత్వంగా విప్లవభావాల్ని తాతతండ్రుల నుంచి పుణికిపుచ్చుకున్న ధీరోదాత్తుడు… 

మనుషులను శారీరకంగా చంపగలరేమో కానీ, వారి ఆశయాలను చంపలేరని చాటిచెప్పిన విప్లవ వీరుడు సర్దార్‌ భగత్‌సింగ్ జయంతి.. నేడు(28 సెప్టెంబర్). ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలు మీకోసం…

కుటుంబ నేపథ్యం

భగత్ సింగ్ సొంతూరు బంగా. తండ్రి కిషన్ సింగ్, తల్లి విద్యావతి. తాత అర్జున్ సింగ్. వీరిది సామాన్య కుటుంబం. తాత పంజాబ్, హిందీ, సంస్కృతం, పర్షియన్, ఉర్దూ వంటి పలు భాషల్లో ప్రావీణ్యులు.. అప్పట్లో జాతీయభావాలను ప్రజల్లో ముమ్మరంగా వ్యాప్తి చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఆర్య సమాజ్ వంటి కార్యకలాపాల్లోనూ పాలు పంచుకున్నారు. అంతేకాక ఈయన రైతు, యునాని వైద్యం చేసేవారు. ప్లీడరు గుమస్తాగా ఉద్యోగం సైతం చేశారు. బానిసత్వపు సంకెళ్ళ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలని నిరంతరం తపించాడు. భగత్ తన బాల్యమంతా తాతయ్య వద్దే పెరగడంతో అయన తాలూకు విప్లవభావాలు భగత్ లోనూ ఉండేవి.

1907 సెప్టెంబర్ 28న పంజాబ్ లోని బంగాలో జన్మించాడు భగత్ సింగ్. ఇతడు పుట్టిన నాటికి తన తండ్రి దగ్గర లేడు. బ్రిటిష్ వారి నుంచి అరెస్టును తప్పించుకోవడానికి దేశాంతరం వెళ్ళాడు. అటువంటిది తండ్రి, ఇద్దరు తమ్ముళ్లు తిరిగి వస్తున్నట్లు కబురు అందడంతో ఆ ఇంట్లో ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. భగత్ పుడుతూనే ఇంటికి భాగ్యం తెచ్చాడని, భాగన్ లాల్, భగత్ అని పిలుస్తూ.. తర్వాత భగత్ సింగ్ గా పేరు స్థిరపడిపోయింది. అలా తిరిగొచ్చిన వారిని ఎప్పుడు అరెస్టు చేస్తారో, పట్టుకొని ఎప్పుడు ఉరి వేస్తారో తెలియదు కనుక భగత్ సింగ్ తండ్రి.. అయన సోదరులైన అజిత్ సింగ్ ను విదేశాలకు పంపాడు. స్వరణ్ సింగ్ మాత్రం ఇక్కడే ఉండటంతో, వారికి చిక్కి, జైల్లోనే జీవితం గడిపాడు. అక్కడ ఉన్నప్పుడే క్షయ వచ్చింది. అది ముదిరి జైల్లోనే చనిపోయాడు. 

ఇక తండ్రి కిషన్ సింగ్ మాత్రం ఇంటి వద్దే ఉంటూ…  పలు విప్లవ కార్యకలాపాలకు సాయపడుతూ ఆర్థిక సూచనలు చేస్తూ ఉండేవాడు. ఇలా ఏ అవసరం ఉన్నా, వెళ్తుండేవాడు. ఇంటికెప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉండేవాళ్ళు. ఈ రకంగా భగత్ ఇల్లు ఒక రహస్య ఆశ్రయంగా మారింది.  తాత అర్జున్ సింగ్ జాతీయవాదులకు పెద్ద అండ. అలా ఇంట్లో ఎప్పుడు రాజకీయ చర్చలు, రహస్య ప్రణాళికలు, వాటికి సంబంధించిన సమాలోచనలు జరుగుతుండేవి. ఇవన్నీ చూస్తూ పెరిగిన భగత్ తెల్లవాళ్లు మన దేశానికి చేస్తున్న ద్రోహాన్ని, అన్యాయాన్ని వాళ్ల సంభాషణల్లో వినేవాడు. 

తన ఈడూ పిల్లలంతా బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే, భగత్ మాత్రం దేశ విముక్తి కోసం తెల్లవాళ్ళను తరిమి కొట్టేందుకు ముందుకు ఎలా ఉరకాలని చూసేవాడు. ఏదైతేనేం బంగాలోని ప్రైమరీ స్కూల్ లో చేరాడు. చదువుపై ఇష్టం ఏర్పడింది. ఆటల్లో, చదువులో ఎప్పుడు చురుకుగానే ఉండేవాడు. కానీ భగత్ తనకున్న స్వేచ్ఛాయుత ఆలోచనల వల్ల ఎప్పుడు ఒంటరిగా ఉండటాన్నే ఇష్టపడేవాడు. తన మేధస్సును చూసి పాఠాలు చెప్పే టీచర్లు సైతం అబ్బురపోయేవారు. పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే మాత్రం గుక్కతిప్పుకోకుండా.. నేను నాకోసం ఏమవుతానో నాకైతే తెలియదు కానీ, ఏది చేసిన ఈ దేశం కోసం, ప్రజల కోసం మంచినే చేస్తా అని అన్నాడట.. 

ఇక భగత్ కు అన్న జగత్ సింగ్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడు వెంటే తిరుగుతూ ఉండేవాడు. అలాంటిది జగత్ ఉన్నటుండి జ్వరం బారిన పడి, అది ముదిరి, చనిపోయాడు. దీంతో భగత్ కు ఎప్పుడు తోడుగా ఉండే అన్న దూరం కావడాన్ని తట్టుకోలేకపోయాడు. మానసికంగా కుంగిపోయాడు. ఎప్పుడు దిగాలుగా కూర్చోడం, తిండి సరిగా తినకపోవడంతో.. ఉన్న ఒక్క కొడుకు కూడా ఏమైపోతాడోనని తండ్రి కిషన్ సింగ్ లాహోర్ కు మకాం మార్చాడు.  

భగత్ కి తొమిదేళ్ళు.. స్థానికంగా ఉన్న డి.ఏ. వి పాఠశాలలో చేర్పించాడు. కొత్త వాతావరణం, కొత్త మనుషుల వల్ల భగత్ కాస్త తిరిగి అందరిలో తిరుగుతున్నాడు. లాహోర్ లోనూ తండ్రి రాత్రి, పగలు లేకుండా చేసే రాజకీయ చర్చలు విని.. తన ఆలోచన విధానమే పూర్తిగా మారిపోయింది. తన పాఠ్యపుస్తకాల కంటే మహనీయుల జీవితానుభవాలనే పాఠాలుగా నేర్చుకున్నాడు. 

తండ్రి వద్దన్నా వినకుండా స్కూల్ మానేసి అప్పట్లో గొప్పగా సాగుతున్న గాంధీయ ఉద్యమంలో చేరాడు. వస్తుందనుకున్న స్వరాజ్యం అయితే రాలేదు. కానీ ఏడాది చదువు పోయింది. సరిగా చదివి ఉంటే ఈపాటికి పదవ తరగతి అయిపోయి.. కాలేజీలో చేరి ఉండేవాడు. నిజానికి తనకు సర్కారు కాలేజీలో చేరడంకన్నా కూడా లాలాలజపతి రాయ్ స్థాపించిన నేషనల్ కాలేజిలో చేరాలనే ఆకాంక్షే ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ జాతీయవిద్యను బోధిస్తారని తెలిసి, అక్కడైతేనే తాను ఏదైనా చేయగలనని భావించాడు. అలా ఈ కాలేజీలో చేరిన తక్కువ కాలంలోనే భగత్ సింగ్ సామాన్యుడు కాదని, ఎంతో ప్రతిభావంతుడని, ఆయన ప్రజ్ఞకు ముగ్దుడై మరిన్ని పుస్తకాలు చదువుకోమని అక్కడి లెక్చరర్లు ప్రోత్సహించారు. 

*1919.. జలియన్‌వాలాబాగ్‌ సంఘటన జరిగిన అనంతరం.. బ్రిటిష్‌వారు అవలంబించిన ‘విభజించి పాలించు’ పద్ధతికి మరింత పదునుపెట్టారు. ఈ ఘటనలో మరణించిన వారిలో అన్ని మతాల వారున్నారు. దీని తర్వాత 1924లో దేశవ్యాప్తంగా మత ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలపై ఒక జాతీయ చర్చ తెరపైకి వచ్చింది. సార్వత్రికంగా అలాంటి మత ఘర్షణలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని స్వాతంత్య్రోద్యమం గుర్తించింది. ఈ పరిణామాలతో నాటి కాంగ్రెస్‌ నాయకత్వం హిందూ, ముస్లిం నాయకులతో శాంతి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించే ప్రయత్నం చేసింది. దీనికి భగత్‌సింగ్‌ కూడా మద్దతు ఇచ్చారు. ఇస్తూ ఇలా పలికాడు.. ‘నేడు భారతదేశ పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక మతానికి చెందిన ప్రజలు పరస్పరం ఇతర మతస్తులను శత్రువులుగా భావిస్తున్నారు. కనుక రాజకీయాల నుంచి మతాన్ని వేరుచేయడమే దీనికి పరిష్కారం’ అని భగత్‌సింగ్‌ అన్నాడు. 

*ఈ విధంగా వర్గచైతన్యమే మతతత్వాన్ని నిర్మూలిస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి భగత్‌సింగ్‌.

సమానత్వం, సామాజిక న్యాయం గురించి భగత్‌ చాలా రచనలు చేశారు. 

*‘ప్రజలందరూ సమానులేనని, వర్గాల విభజన, అంటరానితనం అనే విభజన ఉండకూడదనీ, మతానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటామని ప్రతిజ్ఞ చెయ్యాలి లేదా దాన్ని కచ్చితంగా వ్యతిరేకించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. 

*1928లో శాంతియుతంగా ఉద్యమిస్తున్న లాలా లజపతిరాయ్‌.. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా బ్రిటిష్‌ పోలీసుల దాడిలో మరణించారు. ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని భగత్‌సింగ్‌ ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు. 

*ఉరికొయ్య ముందు నిల్చొని ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అనే నినాదమిచ్చారు. ఆ ధైర్యమే విప్లవ ప్రవాహంలా మారి, తర్వాతి తరాలకు మార్గదర్శనం అయింది.

*నేషనల్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు భగవత్‌ చరణ్‌ సుఖ్‌దేవ్, యశ్‌పాల్‌లు భగత్‌ సింగ్‌కు స్నేహితులు అయ్యారు. వారితో కలిసి దేశ చరిత్ర, విప్లవాలపై నిత్యం అధ్యయనం చేసేవాడు. ఈ  క్రమంలో ముగ్గురు సన్నిహిత మిత్రులయ్యారు.  

అప్పట్లో నవజవాన్‌ భారతసభను స్థాపించాడు. ఆపై నవజవాన్‌ భారత సభను.. చంద్రశేఖర్‌ ఆజాద్‌ స్థాపించిన హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ ఆర్మీని కలుపుతూ హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రివల్యూషన్‌ ఆర్మీగా నెలకొల్పారు. ఈ కారణం చేత బ్రిటిష్‌ ప్రభుత్వం వీరిని అరెస్ట్‌ చేసింది. మరోవైపు శాండర్స్‌ హత్య కేసులో భాగంగా సుఖదేవ్, రాజ్‌గురులనూ అరెస్ట్‌ చేసి, రెండేళ్లపాటు జైల్లో ఉంచింది. 

*1931 మార్చి 24న భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీయాలని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం దేశవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనలకు భయపడి ఒక్కరోజు ముందుగానే అంటే, 1931 మార్చి 23న సాయంత్రం 7 గంటలకు వీరిని ఉరితీసింది. ఈ రకంగా భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌ దేవ్‌లు 23 ఏళ్ల ప్రాయంలో ఉరితాళ్ళను ముద్దాడుతూ, ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అంటూ ప్రాణాలు వదిలారు. 

ఉరిశిక్ష ఖరారైనప్పటికీ ఈ పోరాటం తమతో ఆరంభం కాలేదని, అలాంటిది తమతోనే అంతం కాదని భగత్‌సింగ్ చాటాడు. 

ఆయన ఆశయాలు, ఆలోచనలు, ఆవేశం ఎంతోమంది యువకుల్లో ఎనలేని స్ఫూర్తి నింపింది. 

గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయాడు భగత్‌సింగ్‌. 

Show More
Back to top button