ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాస్కో పర్యటనలో భాగంగా రష్యా ప్రభుత్వ నియంత్రిత ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ ‘స్బేర్బ్యాంక్’ (Sberbank) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్తో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. వెస్ట్రన్ ప్లాట్ఫామ్లకు సురక్షితమైన, లోకలైజ్డ్ జనరేటివ్ ఏఐ ప్రత్యామ్నాయాన్ని సృష్టించిన స్బేర్బ్యాంక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ భేటీ సాగింది.
దేశీయ బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలలో స్బేర్బ్యాంక్కు చెందిన సుప్రసిద్ధ ‘గిగాచాట్ ఎల్ఎల్ఎం’ (GigaChat LLM) వ్యవస్థను విస్తరించాలని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ కోరారు. భారతదేశ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా రష్యా ఏఐ ప్లాట్ఫామ్లను అనుసంధానించడం ద్వారా డిజిటల్ గవర్నెన్స్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ చర్చలలో భాగంగా భారతదేశ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను మరింత పటిష్ఠం చేసే అంశాలపై లోకేశ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా జాతీయ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) నెట్వర్క్ భద్రతను పెంచేందుకు, స్బేర్బ్యాంక్కు చెందిన అడ్వాన్స్డ్ వాయిస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ యాంటీ-ఫ్రాడ్ నెట్వర్క్ను భారత బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు.
దీనితో పాటు, దేశంలో కొనసాగుతున్న ప్రతిష్టాత్మక ‘స్మార్ట్ సిటీ మిషన్’లో భాగంగా మున్సిపల్ కార్యకలాపాలను ఆధునీకరించేందుకు స్బేర్బ్యాంక్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్, స్మార్ట్ ట్రాన్సిట్ సర్వైలెన్స్, డిజిటల్ సేఫ్టీ సిస్టమ్ల వంటి అధునాతన తరం సాంకేతికతలను విస్తరించాలని కోరారు. ఈ డిజిటల్ సేఫ్టీ సిస్టమ్ల ద్వారా నగరాల నిర్వహణ మరింత సులభతరం కావడమే కాకుండా పౌరుల భద్రతకు పెద్దపీట వేసినట్లవుతుందని మంత్రి పేర్కొన్నారు.
మరోవైపు, ప్రపంచస్థాయి సాఫ్ట్వేర్, ఏఐ ఇంజినీర్లను దేశంలోనే తయారు చేసేందుకు వీలుగా, స్బేర్బ్యాంక్ నిర్వహిస్తున్న వినూత్న గేమిఫైడ్, పీర్-టు-పీర్ ‘‘స్కూల్ 21’’ కోడింగ్ అకాడమీలను భారతదేశంలోని ప్రధాన విద్యా కేంద్రాలలో ఏర్పాటు చేయాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. అలాగే వేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నంలో ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుల ప్రయోజనాల కోసం దూరప్రాంతాలకు ఉపయోగపడే రూపాయి-రూబుల్ వాణిజ్య అనుమతులను, వ్యవస్థీకృత రుణాలను మంజూరు చేయాలని కోరారు.
ఈ ప్రతిపాదనలపై స్బేర్బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్ సానుకూలంగా స్పందిస్తూ… ప్రస్తుతం తమ బ్యాంక్ న్యూదిల్లీ కార్యాలయం ద్వారా భారత్-రష్యా కార్పొరేట్ బ్యాంకింగ్, కమర్షియల్ ఫైనాన్స్ సేవలను విజయవంతంగా అందిస్తోందని గుర్తుచేశారు. మంత్రి నారా లోకేశ్ అందించిన అద్భుతమైన ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి, త్వరలోనే ఉన్నత స్థాయి నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.










