
వర్షాకాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు వంటి సమస్యలు వచ్చేస్తుంటాయి. అయితే వీటిని ఇంగ్లిష్ మందులకు బదులుగా ఆయుర్వేదం, ఇంటి చిట్కాలను పాటించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉపశమనం పొందవచ్చు. ఇందులో భాగంగా, రోజూ 2 లేదా 3 సార్లు అల్లం, తులసి, కమోమిల్, పెప్పర్మింట్ వంటి హెర్బల్ టీలు తాగాలి.
వీటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇన్ఫెక్షన్లను తగ్గించి, దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వేడి చికెన్ లేదా వెజిటబుల్ సూప్ తాగడం వల్ల కఫం కరిగి ఉపయోగం ఉంటుంది. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల కోసం, ఒక టీస్పూన్ తేనెను గోరువెచ్చని నీటిలో నిమ్మరసంతో కలిపి రోజుకు 2-3 సార్లు సేవించాలి.
అలాగే, అల్లం రసాన్ని తేనె, నిమ్మతో కలిపి రోజుకు 2-3 సార్లు తాగడం లేదా వెల్లుల్లి రెబ్బలను నలిపి తేనె కలిపి తినడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా, పసుపు, మిరియాల పొడి లేదా దాల్చిన చెక్క పొడిని పాలలో కలిపి తీసుకుంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచి, దగ్గు, జలుబు నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.
ఇక, నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలోని అధిక విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఈ పండ్లను తేనెతో కలిపి తింటే మరింత మెరుగైన ఫలితం ఉంటుంది. ఈ ఇంటి చిట్కాలను పాటించడం వల్ల దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందడమే కాకుండా, ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.






