Telugu News

నా శత్రువులే నా సక్సెస్‌కు కారణం: కృష్ణ తేజ IAS

ఏళ్ల తరబడి ఎక్కువమంది ప్రిపేర్ అయ్యే పరీక్ష ఏదైనా ఉందంటే.. అది సివిల్ సర్వీసెస్‌. ఈ ప్రయాణంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైతే అనుకున్న లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేస్తుంటారు. కానీ కొందరు మాత్రం అనుకున్న లక్ష్యాన్ని సాధించేదాక వదలరు. అలాంటి వారిలో ఒకరే.. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటకు చెందిన మైలవరపు కృష్ణ తేజ. టెన్త్‌, ఇంట‌ర్‌, ఇంజ‌నీరింగ్‌లో నేనే టాప‌ర్‌ని క‌దా… అని ఇగోతో సివిల్స్ రాశారట. దీంతో మూడు సార్లు ఫెయిల్ అయ్యారట.

అయినా కూడా ఎక్కడా తగ్గలేదు. చివరికి నాలుగోసారి ప్రయత్నించి జాతీయ స్థాయిలో 66వ ర్యాంకు సాధించారు. అయితే ఈ విజయానికి బంధువులో.. మిత్రులో కారణం కాదు. కేవలం శత్రువుల వల్లనే ఇలాంటి విజయం సాధించానని కృష్ణ తేజ పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. అసలు కృష్ణ తేజ విజయం వెనుక శత్రువులు ఎలా హెల్ప్ చేశారు..? ఆయన ప్రయాణం ఎలా జరిగింది? పదండి ఓ లుక్ వేద్దాం.

మూడు ఓటములతో నిరాశ చెంది లోపాల‌ను స‌రిచేసుకోవ‌డం మొద‌లు పెట్టారట. కానీ ఆయనలో ఏ త‌ప్పులు క‌న్పించ‌లేదట. చివ‌రికి స్నేహితుల‌తో తనకు ఐఏఎస్ కావాల‌ని ఉంది… తనలోని లోపాల‌ను చెప్ప‌మ‌ని వాళ్ల‌ను అడిగారట. వాళ్లు కూడా ఎవరు ఏమీ చెప్పింది లేదు. అంతా బాగుంది క‌ద‌రా.. బాగా చ‌దువుతావ్ కదా.. అన్నారే కానీ.. ఆయనలో లోపాలు చెప్ప‌లేదు. దీంతో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చి.. ఏదో జాబ్‌కు తిరిగి వెళ్లి పోతానని ఆయన ఫ్రెండ్స్‌కు చెప్పారట. ఈ విష‌యం ఆయన శత్రువుల‌కు తెలిసింది. వాళ్ల‌కు ఎక్క‌డలేని ఆనందం. ఉదయాన్నే కృష్ణతేజ శత్రువులు ఆయన రూమ్‌కు వ‌చ్చి నువ్వు చాలా మంచి నిర్ణ‌యం తీసుకున్నావ్ తేజ‌… Congratulations అని Wishes చెప్పారట. వాళ్లు తనకు ఐటీ జాబే క‌రెక్ట్.. ఐఏఎస్ రాదని అన్నారట. దాంతో చాలా కోపంతో… ‘స‌రే నాకు ఎందుకు ఐఏఎస్ రాదో చెప్పండి’ అని అడిగారట. 

అప్పుడు వాళ్లు తేజకు.. ఐఏఎస్‌లో 2000 ప్ల‌స్ మార్కుల‌కు Written exam ఉంటుంది. నీ Hand writing అంత‌బాగోదు కాబ‌ట్టి అది నీ మొద‌టి కార‌ణం. నీవు ప‌రీక్ష‌లో పాయింట్ వైజ్ రాస్తావు… ఒక Flow ఉండ‌దు అన్నారట. ఇది రెండో కార‌ణం. మూడో కార‌ణం ఏమిటంటే… నీవు అడిగిన‌ దానికే స‌మాధానం చెప్పి… సైలెంట్‌గా ఉంటావన్నారట. వీళ్లు చెప్పిన మూడు లోపాలు నిజ‌మే అన్పించిందట. వీళ్లు చెప్పిన ఈ మూడు స‌మాధానాల వ‌ల్ల‌ చాలా సంతోషంగా అనిపించి చివరికి ఆ మూడింటిపైన మాత్రమే దృష్టి పెట్టి సివిల్స్‌లో ఆల్ ఇండియా 66వ ర్యాంక్ సొంతం చేసుకున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.

కాగా, ఈయన IAS అయిన తర్వాత ఎంతో మంది పేదలకు, సహాయపడడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు కృషి చేశారు. ఇది చూసిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా సేవలో సలహాలు ఇవ్వడానికి కృష్ణతేజని పిలిపించుకున్నట్లు తెలుస్తోంది.

Show More
Back to top button