
భారతదేశ ప్రజలకు, రుణగ్రహీతలకు ఆర్బీఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) తీపి కబురు చెప్పింది. ప్రస్తుత ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిరేటు అంచనాలు, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాల దృష్ట్యా వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆమోదం తెలిపి, కీలకమైన రెపో రేటును గణనీయంగా తగ్గించేందుకు సుముఖత చూపింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి రెండు నెలలకోసారి ఈ సమావేశం జరగగా.. జూన్ 4న ప్రారంభమైన మూడు రోజుల ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశాల అనంతరం, RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా జూన్ 6న వడ్డీ రేట్లపై తగ్గింపును ప్రకటించారు.
రెపో రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో కొత్త రెపో రేటు 5.5%కి చేరింది. వరుసగా మూడోసారి కూడా రెపో రేటును తగ్గించడం విశేషం!
ఇకపోతే భారత ఆర్థిక వ్యవస్థ బలంగా, స్థిరంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఆత్యయిక పరిస్థితులు నెలకొన్నా భారత్ వేగంగా వృద్ధి చెందుతోంది. కాబట్టి పెట్టుబడిదారులకు భారత్ లో మంచి అవకాశాలుండనున్నాయి.
2025- 26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5%గా, ద్రవ్యోల్బణం అంచనాలు 4% నుంచి 3.7%కి తగ్గే అవకాశం ఉంది.
దీంతో బ్యాంకుల వద్ద నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది.
రెపో రేటు అంటే.. రెపో రేటు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాణిజ్య బ్యాంకులకిచ్చే తాత్కాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటుగా చెప్పవచ్చు.
రెపో అనే పదం ‘రిపర్చేజ్ అగ్రిమెంట్’ లేదా ‘రిపర్చేజింగ్ అప్షన్’ అనే పూర్తి రూపాన్ని సూచిస్తుంది.
*ఈ ఒప్పందంలో భాగంగా వాణిజ్య బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను తాత్కాలికంగా RBIకి అమ్ముతుంది. అవసరమైన నిధులను పొందుతాయి. నిర్ణీత గడువు తర్వాత ఆ సెక్యూరిటీలను తిరిగి కొనుగోలు చేస్తాయి.
ఈ విధానాన్ని ఉపయోగించి RBI దేశీయ మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించగలదు.
*అయితే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో RBI రెపో రేటును పెంచుతుంది. ఇలా వడ్డీ రేటు పెరిగితే, బ్యాంకులకు RBI నుంచి రుణాలు తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఫలితంగా మార్కెట్లో డబ్బు ప్రవాహం తగ్గుతుంది.
*మరోవైపు రెపో రేటును తగ్గిస్తే బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు పొందగలవు. దాంతో సాధారణ ప్రజలకు, వ్యాపార సంస్థలకు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు అనేవి తగ్గిపోతాయి. ఇది రిటైల్, కార్పొరేట్ రుణగ్రహీతలకు ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే వారి నెలవారీ ఈఎంఐ భారం క్రమంగా తగ్గుతుంది.
గృహ రుణాల భారం తగ్గుతుంది..
*ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇల్లు కొనాలనుకునే మధ్యతరగతి వారికి పెద్ద ఊరట, ఉపశమనం అవుతుంది.
రెపో రేటు తగ్గడం వల్ల బ్యాంకులు తాము ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఫలితంగా దీర్ఘకాలిక రుణాలు ముఖ్యంగా హోమ్ లోన్స్ తీసుకున్నవారికి ఈఎంఐల భారం తగ్గే అవకాశముంది. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై నెల నెల కట్టే ఈఎంఐలు క్రమంగా తగ్గుతాయి.
ఇది వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచి, దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమవుతుంది.
వాస్తవానికి గతంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందన్న కారణంగా వడ్డీ రేట్లను పెంచారు. దాంతో హోమ్ లోన్స్ వంటి వడ్డీ రేట్లు 9 నుంచి 10%కి చేరుకున్నాయి. ఇవి మరింత భారంగా మారడంతో మార్కెట్ పడిపోయింది. ఇంకేముంది.. హోమ్ లోన్లు తీసుకుని, ఇళ్లు కొనేవారి సంఖ్య తగ్గిపోయింది. తర్వాత ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చిన అనంతరం వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చింది.
ప్రస్తుతం హోమ్ లోన్స్ ను 8% వడ్డీ రేటుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ రేటు ఇంకా తగ్గనుండటం విశేషం!
ఇప్పటికే ఉన్న రుణాలపై వడ్డీ రేట్లు ప్రధానంగా హోమ్ లోన్స్ వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గిస్తూ వస్తున్న విషయం మనకు తెలిసిందే.. ఇప్పుడు అవి మరింతగా తగ్గనున్నాయి. రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరిగేందుకు ఈ తగ్గింపు బాగా ఉపయోగపడుతుంది.
2025 చివరికి మొత్తం వడ్డీ రేటు తగ్గింపు 100 బేసిక్ పాయింట్ల వరకు ఉండొచ్చని ఎస్బీఐ అంచనా వేసింది. గతంలోనూ ఆర్బీఐ 25 బేసిక్ పాయింట్లు తగ్గించి లిక్విడిటీని పెంచింది. ఇప్పుడు మళ్లీ వడ్డీ రేటును తగ్గించే అవకాశముందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎస్బీఐ చీఫ్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ ప్రకారం, ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో మిగులు లిక్విడిటీ ఉంది. కారణం, బ్యాంకులు తమ వద్ద ఉన్న సేవింగ్స్ ఖాతాల వడ్డీ రేటును 2.70%కి తగ్గించాయి.
2025 ఫిబ్రవరి నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 30 నుంచి 70 బేసిక్ పాయింట్లు తగ్గాయి. దీంతో బ్యాంకులకు డబ్బు ఎక్కువగా లభ్యమవుతోంది.
ఇది వడ్డీ రేటును తగ్గించి, అప్పులు ఇవ్వడానికి అనుకూల సమయంగా అభిప్రాయపడుతోంది.