
చిత్రసీమను విచిత్రసీమ అంటుంటారు. దానికి గల కారణాలు అనేకం ఉంటాయి. ఎవరు ఎప్పుడైనా అగ్రస్థాయికి వెళ్ళవచ్చు, ఎవరు ఎప్పుడైనా అధఃపాతాళనికి పడిపోవచ్చు. ఏ ఒక్కరూ కూడా ఏ కష్టమూ, బాధా పడకుండా అగ్రస్థాయికి వెళ్ళలేరు. కష్టానికి అదృష్టం తోడైతే కారులో తిరుగుతారు, కాలం వెక్కిరిస్తే కారులో తిరిగిన రోడ్డుపైనే కాలి నడకను కూడా సాగిస్తారు. చిత్తూరు వి. నాగయ్య, కస్తూరి శివరావు ఇలా ఎంతోమంది అగ్రహోదాను అనుభవించి చతికిలపడ్డవారే. అదే కోవకు చెందినవారు నటి టి. కనకం. ఆమె అలనాటి ప్రముఖ తెలుగు చలచిత్ర హాస్యనటి, గాయని. ఆవిడ తెలుగు చలనచిత్రాలలో నటించక ముందు రంగస్థల నటి. సినిమాలలో నటించి అవకాశాలు తగ్గిన తరువాత కూడా ఆమె రాష్ట్రమంతటా తిరిగి రంగస్థలం నాటక ప్రదర్శనలిచ్చారు. పురుషులే స్త్రీ పాత్రలను రంగస్థలం మీద అభినయించే ఆనాటి కాలంలో ప్రముఖ రంగస్థలం నటులు బళ్లారి రాఘవ లాంటి మహానటులిచ్చిన ప్రోత్సాహంతో పురుషులతో సమానంగా పాటలూ, పద్యాలూ పాడి నిలిచిన కొద్దిమంది నటీనటులలో కనకం ఒకరు.
1946 వ సంవత్సరంలో ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన “గృహప్రవేశం” సినిమాతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసిన టి.కనకం ఆ తరువాత రెండు దశబ్దాల పాటు అనేక సినిమాలలో విభిన్న పాత్రలను పోషించారు. కీలుగుర్రం (1949) లో రాక్షసి గా, గుణసుందరి కథ (1949) లో రెండో యక్షిణి మకరకన్య గా, షావుకారు (1950) లో చాకలిరామి అనే పాత్రలో, చంద్రవంక (1951) చిత్రంలో రామయ్యమ్మ గా పలు చిత్రాలలో వైవిధ్యభరితమైన నటనతో ప్రేక్షకులను రంజిపజేశారు. “గృహప్రవేశం” సినిమాలో మకరకన్య పాత్రలో వేశ్య వేషం వేయడం, ఆ తరువాత రక్షరేఖ (1949) లో కూడా కస్తూరి శివరావు సరసన కూడా సెక్సీ పాత్ర చేసే అవకాశం వచ్చింది. షావుకారు చిత్రంలో చాకలి రామి పాత్రను ధరించి, చీర మోకాళ్ళ పైకి ఎగకట్టి పైటచెంగు జారవిడుస్తూ అమాయకంగా నోటిలో గడ్డిపరకను కొరుకుతూ, వోరకంటితో వయ్యారపు చూపులతో తన నటనతో శృంగారతార ను తలపింపజేసింది. రౌడీ రంగడు సినిమాలో తళుకు బెళుకుల శృంగార పాత్రలో ఆమె చేష్టలకు, అభినయానికి ప్రజలందరూ ముగ్ధులైపోయారు. ఆమెకు వరుసగా అలాంటి పాత్రలే వచ్చాయి. అలా ఆమెకు సెక్సీ తారగా ముద్ర పడిపోయింది. సెక్సీ స్టార్ గా పేరు తెచ్చుకుని కస్తూరి శివరాంకు సరైన జోడిగా పేరు సంపాదించుకున్నారు.
నాయకురాలు అనే నాటకం ద్వారా రంగస్థల ప్రవేశం చేసిన టి.కనకం తనలోని నటనను నిరూపించుకున్నారు. పల్నాటి యుద్ధంలో నాయకురాలు నాగమ్మగానూ , కురుక్షేత్రం నాటకాల్లో శ్రీకృష్ణునిగానూ ఆమె ప్రసిద్ధి చెందారు. ఆమె శ్రీరామ, చింతామణి ఇలా నాటకాలలో ఎన్నో పాత్రలను పోషించారు. నాటకాలలో నటిస్తూనే సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ఱ వంటి గొప్ప నటులతో నటించారు. ఒక ప్రక్క చలనచిత్రాలలో నటిస్తూనే, మరోపక్క రంగస్థలంపై నాటకాలలో కూడా పాత్రలు పోషించారు. నాటకాలు ఆడుతూ రాష్ట్రమంతా పర్యటించారు.
ఆమె పీసపాటి నరసింహమూర్తి , షణ్ముఖి ఆంజనేయరాజు, కళ్యాణం రఘురామయ్య , రేలంగి , మాధవపెద్ది సత్యం మొదలైన వారికి సమకాలీనురాలు. అన్నింటికీ మంచి ఆమె గాయని మరియు హాస్యనటి. కనకం పేరు చెబితే ఒకప్పుడు సినిమా సెట్ లో అందరూ ఉత్సాహంతో ఉండేవారు. ఆమె తన ఇంటివద్ద నుండి అందరికి మంచి భోజనం, తినుబండారాలు, పట్టుకొచ్చేవారు. అందరితోనూ కలివిడిగా, కలుపుగోలుగా ఉండేవారు. నాటకాల నుండి సినిమాలకు, ఆ తరువాత మళ్లీ నాటకాలకు సుదీర్ఘ ప్రస్తానం చేసిన టి. కనకం మేడలు, మిద్దెలు సంపాదించుకున్నారు. కానీ అవేమీ తనకు మిగలకుండా సినిమా నిర్మాణం చేసి, చేతులు కాల్చుకుని, ఆర్థికంగా చితికిపోయి, ఆస్తులన్నీ అమ్ముకుని విజయవాడలో నిరాడంబర జీవితాన్ని గడిపారు టి. కనకం.
జీవిత విశేషాలు…
జన్మనామం : తెలుగు కనకం
ఇతర పేర్లు : టి. కనకం
జననం : 1927
స్వస్థలం : ఖరగ్ పూర్, ఒరిస్సా
వృత్తి : నటి, గాయని
తండ్రి : అప్పారావు
తల్లి : సోళాపురమ్మ
మరణ కారణం : అనారోగ్యం
మరణం : 2015, విజయవాడ
నేపథ్యం…
టి. కనకం అసలు పేరు తెలుగు కనకదుర్గమ్మ. ఈమె 1927 వ సంవత్సరంలో అప్పలస్వామి, షోలాపూరమ్మ (“ఖరగ్ పూర్” దేవత పేరు) దంపతులకు జన్మించారు. నాన్న ఒరిస్సాలోని “ఖరగ్ పూర్” లో రైల్వే ఉద్యోగం చేసేవారు. దాంతో వారు “ఖరగ్ పూర్” లోనే నివాసం ఉండేవారు. రైల్వే ఉద్యోగంలో తరుచూ బదిలీలు అవుతుండడంతో ఊరూరు తిరుగుతూ విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. కనకం కు తోడబుట్టిన అక్కచెల్లెళ్లు ఐదుగురు, ఒక తమ్ముడు. ఆమె బాల్యం విజయవాడ లోనే గడపడంతో విద్యాభ్యాసం కూడా బెజవాడ లోనే సాగింది. ఆమె విద్యాభ్యాసం అంతా ఇంగ్లీష్ కాన్వెంట్ లోనే కొనసాగినా, ఆమెకు తెలుగు భాషపై మంచి పట్టు సాధించారు. రాయలసీమ నాటకాల ట్రూపులకు హార్మోనియం వాయించే యం. దుర్గారావు ఈమెకు బావ గారు.
ఆమె మరొక బావ నల్లంచి అప్పారావు “కనకదుర్గ నాట్యమండలి” అనే ఒక నాటక కంపెనీని స్థాపించి, నాటకాలులో వేషాలకు తగిన తర్ఫీదు ఇచ్చి నాటకాలకు ఒక కొత్త ధోరణిని నేర్పారు. ఇంట్లోనే కళాకారులు ఉండడంతో టి. కనకం ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సంగీతం నేర్చుకున్నారు. కనకం తన పన్నెండేళ్ల వయస్సులో గుంటూరు కళాశాల ప్రధానాచార్యులు కె.వి.గోపాలస్వామి ఆధ్వర్యంలో “ప్రతిమ” అనే నాటకంలో నటించారు. అది ఆమె మొదటి నాటకం. అందులో ఆమె “ప్రతిమ సుందరి” పాత్ర పోషించారు. వేసేది ఆమె మొదటి నాటకమే అయినా ఏమాత్రం బెదరకుండా, చలాకీగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కడినుండి లోహితాస్యుడు, ప్రహ్లాదుడు, బాలకృష్ణుడు ఇలా వరుసగా అన్నీ బాల పాత్రలే. ఆమె నాటకాలలో నటిస్తే చదువుకు ఇబ్బంది అవుతుందని వాళ్ళ ఇంట్లో ఆమెను ఏమి అనేవారు కాదు. ఎందుకనగా నాటకాలు వేసే క్రమంలో వచ్చే ఆదాయమే వారి కుటుంబానికి ఆసరా అయ్యింది.
ఆల్ ఇండియా రేడియో లో…
ఒకవైపు చదువుకుంటూ నాటకాలలో పాత్రలు పోషిస్తున్న టి.కనకం కు పెళ్లి వయస్సు వచ్చిందని, ఆమెకు పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు మహారాష్ట్రకు చెందిన ఓ వైద్యుడితో ఆమెకు వివాహం నిశ్చయించారు. అప్పటికే అతనికి అది రెండవ వివాహం. కనకం కు ఆ పెళ్లి ఇష్టం లేదు. ఎలాగైనా ఆ పెళ్లిని తప్పించుకోవాలనే నెపంతో అక్కడినుండి తప్పించుకుని మద్రాసు వెళ్లే రైలెక్కేశారు. విజయవాడ గాంధీనగర్ లో ఉన్న “లలిత ఆమెచ్యూర్స్” అనే నాటక కంపెనీలో తాపీ ధర్మారావు నాయుడు (ఆంధ్ర విశారద) ఉండేవారు. ఆయన కనకం కు బాగా పరిచయం. నాటకాలు బాగా వేసే ఆమెను మద్రాసుకు రమ్మని ఆయన పలుమార్లు కోరారు. కానీ ఆమె వెళ్లలేదు. కానీ ఇప్పుడు వెళ్ళవలసి వచ్చింది. అందుకు కారణం ఆమె కోసం ఇంట్లో వాళ్ళు జరిపే పెళ్లి ప్రయత్నాలు. మద్రాసులో ఉండడానికి సరిపడా దబ్బులు, బట్టలు తీసుకొని ధైర్యంగా మద్రాసుకు బయలుదేరి వెళ్లి తాపీ ధర్మారావు నాయుడును కలిశారు. ఆయన కనకం కు జవ్వాది గంగారత్నం ఇంటిలో బస ఏర్పాటు చేశారు. తాపీ ధర్మారావు నాయుడు ఆమెను ఆల్ ఇండియా రేడియోకు పరిచయం చేశారు. అక్కడ బి.ఏ రామారావు ఆధ్వర్యంలో గేయాలు ఆలపించే ఆమె అక్కడ ఎక్కువగా జానపద గీతాలు పాడుతుండేవారు.
చిత్ర రంగ ప్రవేశం…
కనకం ఆహార్యం చాలా చిత్రంగా ఉండేది. రింగుల జుట్టుతో, తెల్ల చీర కట్టి, మోచేతుల వరకు జాకెట్ ధరించి అందంగా ఉండే ఆవిడ ఎక్కువగా ఒరిస్సా స్త్రీల ఆహార్యాన్ని కనబరిచేవారు. ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడు ఆమెకు ప్రముఖ రచయిత “త్రిపురనేని గోపీచంద్” మరియు బి.యన్. రెడ్డి పరిచయమయ్యారు. ప్రముఖ దర్శకులు, నిర్మాత బి.యన్. రెడ్డి తనే స్వయంగా ఆమెను ఎల్.వి.ప్రసాద్ కు పరిచయం చేశారు. ఎల్.వి.ప్రసాద్ ఆమెకు తొలిసారి సినిమా అవకాశం ఇచ్చారు. త్రిపురనేని గోపీచంద్ రచన చేసిన సారధీ ఫిల్మ్స్ వారి “గృహప్రవేశం” (1946) సినిమాలో బాల వితంతువుగా పాత్ర పోషించారు టి. కనకం. ఇదే ఆమె చిత్రరంగ ప్రవేశం చేసిన మొట్టమొదటి సినిమా. ఇందులో ఆమె రెండు పాత్రలు పోషించారు. “గృహప్రవేశమిదే మహా గృహప్రవేశమిదే మేలుకో” అన్న పాటకు నటి పి.భానుమతితో కలిసి నృత్యం చేశారు.
అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, జి. వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం ప్రధాన పాత్రల్లో శోభనాచల పిక్చర్స్ అధినేత మీర్జాపురం రాజా దర్శకత్వంలో “కీలుగుర్రం” సినిమా నిర్మించ తలపెట్టి అందులో నటీనటుల కోసం అన్వేషణ మొదలుపెట్టి రాజావారు తన దివాణంలో పనిచేస్తున్న కొండయ్య అనే వ్యక్తిని ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కు పంపించారు. రచయిత త్రిపురనేని గోపీచంద్, రేడియోలో పనిచేస్తున్న టి. కనకం గురించి కొండయ్య కు చెప్పారు. దాంతో ఆయన కీలుగుఱ్ఱం సినిమా లోని కీలకమైన పాత్రపోషించిన అంజలీదేవి కి చెల్లెలు కీకిని పాత్రకు ఎంపిక చేసుకున్నారు. ఆ చిత్రంలో గోవిందుడు పాత్ర పోషించిన రేలంగికి జంటగా ఆమె నటించారు. ఇందులో ప్రధాన పాత్రధారిణి అయిన అంజలీదేవి మరియు చెల్లెలు పాత్ర పోషించిన కనకం ఇద్దరూ కూడా రాక్షస స్త్రీలుగా నటించారు. ఆ చిత్రం వాణిజ్యపరంగా ఘనవిజయం సాధించింది.
శృంగార తార (సెక్సీ స్టార్) గా ముద్ర…
కీలుగుఱ్ఱం సినిమా తరువాత టి.కనకం కథానాయికగా కొనసాగాలని ప్రయత్నించారు. కానీ కుదరలేదు. వాహిని స్టూడియోస్ నిర్మాణంలో, కె.వి. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన గుణసుందరి కథ (1949) లో కనకం ను “మకరకన్య” పాత్రకు తీసుకున్నారు. పరిపూర్ణతావాది అయిన కె.వి. రెడ్డి “మకరకన్య” పాత్రను అద్భుతంగా మలిచారు. నిజానికి ఆ పాత్ర వేశ్య ఛాయలున్న పాత్ర. ఇదే విషయాన్ని పత్రికలన్నీ అభ్యంతరం తెలుపుతూ ప్రతికులంగా వ్రాశాయి. అయినా దర్శకులు కె.వి. రెడ్డి వాటిని ఖాతరు చేయలేదు. ఆ చిత్రంతో ఆమెకు శృంగార తార (సెక్సీ స్టార్) గా పేరు పడిపోయింది. అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి రామకృష్ణ, అంజలీదేవి తారాగణంతో ఆర్. పద్మనాభన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఆర్. పద్మనాభన్ తెరకెక్కించిన “రక్షా రేఖ” (1949) అనే చిత్రంలో యాషినిగా కనకం నటించగా, దూరదర్శి పాత్ర కస్తూరి శివరావు పోషించారు. శివరావుకు జోడీగా ఆమె “చేయి చేయి కలుపుకోరా” అనే పాట బాగా ప్రసిద్ధి పొందింది. అప్పటినుంచి శివరావు, కనకం జంట అనగానే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం ఏర్పడింది. అలాగే “సీతారాం – కనకం”, “నల్ల రామమూర్తి – కనకం” జంటలు కూడా ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు.
నటనే కాకుండా, పాటలు కూడా పాడుతూ…
విజయ ప్రొడక్షన్స్ వారి తొలిచిత్రం షావుకారు (1950) సినిమాలో చాకలి రామి పాత్రలో నటించారు టి. కనకం. ఈ చిత్రం తరువాత ఆమె నటిగా నిలదొక్కున్నారు. ఒకవైపు నటిస్తూనే, మరోవైపు పాటలు కూడా పాడుతూ వచ్చారు కనకం. “ప్రియురాలు” (1953) సినిమాలో వేశ్యమాత పాత్ర (లక్ష్మీకాంత తల్లి) పోషించడమే కాకుండా “సరసుడా నీవే నాకు పతి వెనుక ముందు” అనే పాటను పాడారు. బాలనాగమ్మ సినిమాలో లచ్చి పాత్రను పోషించారు. అదేవిధంగా ఆమె “దాసి” సినిమాలో వేసిన వేషం గుర్తుంచుకొన్న “కృష్ణన్ – పంజు” ద్వయం ఏ.వి.యం వారి “లేత మనసులు” (1966) లో వేశ్యమాత పాత్రను ఆమెకు ఇచ్చారు. చిత్రపు నారాయణమూర్తి సిఫారసుతో ఏ.వీ.ఎం వారికి వరుసగా “భక్త ప్రహ్లాద”, “అవేకళ్ళు” (1967) చిత్రాలు చేశారు కనకం. భక్త ప్రహ్లాద సినిమాలో “పాములోళ్ళ మండి మా ప్రజ్ఞ చూడండి” అనే పాటను పాడారు. డాక్టర్ డి. రామానాయుడు నిర్మించిన ద్రోహి (1970) ఆమెకు చివరి చిత్రం. ఆ తరువాత ఆమె ఇంకో చిత్రం చేయలేదు.
నిర్మాతగా విఫలమై…
చాలా మంది తారలు నటిగా విజయవంతం అయ్యాక, వచ్చిన డబ్బులతో నిర్మాతగా కూడా ఓ ప్రయత్నం చేసి చూడాలని అనుకుని అందులో విజయవంతం అయిన వారున్నారు. అలాగే నిర్మాతగా పరాజయం పాలైనవారున్నారు. అందరిలాగే కనకం కూడా తన జీవితంలో సినిమా నిర్మాణం వైపు అడుగువేసి తప్పు చేశారానే చెప్పాలి. మంత్రవాది శ్రీరామమూర్తి, పద్మిని నాయకా, నాయికలుగా 1956 వ సంవత్సరంలో “దేశదిమ్మరి” అనే చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. ఆ చిత్రానికి ఆరుద్ర, శ్రీ శ్రీ లు సంభాషణలు వ్రాయగా, పెండ్యాల నాగేశ్వరావు సంగీత దర్శకత్వంలో జిక్కి, రావు బాల సరస్వతి, ఘంటసాలలు నేపథ్య గానం చేశారు. వీటిని శ్యామల స్టూడియోస్ పెళ్లై రికార్డు చేశారు.
ఆ పాటలు విన్న ప్రతీ ఒక్కరు కూడా ఆ సినిమా సంగీతం పరంగా విజయవంతం అవుతుందని అనుకున్నారు. కానీ ఆమె నమ్మిన వాళ్ళు మోసం చేయడంతో ఆ సినిమా ఆగిపోయింది. నిజానికి చిత్ర పరిశ్రమలో ఎవరైనా సొంతంగా సినిమా నిర్మాణం ప్రారంభిస్తే, వారికి సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. కనకం విషయంలో కూడా జరిగిందదే. ఒకవైపు సినిమా నిర్మాణంలో పరాజయం పాలై, మరోపక్క వేషాలు కూడా తగ్గుతూ వచ్చాయి. దాంతో ఆమె దగ్గర ఉన్న డబ్బు కాస్త కరిగిపోయింది. అయినా దిగులు చెందని కనకం, సినిమా రంగం వదిలేసి నాటక రంగంలో చేరిపోయింది. ఆమెకు ముందు నుండి నాటకాలలో అనుభవం ఉంది. పాటలు కూడా పాడగలదు. కనుక పూర్తిగా నాటకాలకే అంకితం అయిపోయింది. నాటకాల కోసం ఆమె సినిమాలను వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
ఖర్చులకు కరిగిపోయిన 150 సవర్ల బంగారం…
ఆ రోజుల్లో ఆమెకు ఇష్టమైన ఒక శీతల పానీయం మద్రాసులో లభించేది కాదు. దానికోసం విమానంలో ఉదయం బెంగుళూరు వెళ్లి, ఆ కూల్ డ్రింక్ తీసుకుని మళ్ళీ సాయంత్రం విమానంలో మద్రాసు వచ్చేవారు. ఇలా నెలలో ఇరవై రోజులు చేసేవారు. అంత వైభోగం, వైభవం వెలగబెట్టిన కనకం నిర్మాతగా నష్టపోయి, ఆర్థికంగా చితికిపోయి, మద్రాసు మహానగరంలో ఉండలేకపోయారు. డబ్బు విలువ తెలియని ఆ రోజుల్లో ఆమె ఎన్నో గుప్త దానాలు చేశారు. ఎంత వైభవంగా బ్రతికారో అంతే స్థాయిలో పతనమయ్యారు కూడా. మద్రాసులో సాధుల్లా స్ట్రీట్ లో ఉన్న పెద్ద బంగాళకు, 3204 అనే కారు నెంబరు ఉన్న కారును ఆమె సొంతంగా నడుపుకుంటూ వెళ్లేవారు. అవన్నీ అమ్ముకుని మద్రాసు వదిలి 1974 వ సంవత్సరంలో కనకం శాశ్వతంగా విజయవాడకు చేరుకున్నారు. ఆమెకు అత్యంత సన్నిహితురాలు ఉన్న నటి ఛాయాదేవి, ఆరుద్ర, శ్రీశ్రీ లాంటి వారు ఆమె మద్రాసు విడిచి వెళుతుంటే ఎంతగానో బాధపడ్డారు. ఆమె ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా వారికి గుర్తుగా ఇచ్చారు కనకం. మద్రాసును విడిచి వచ్చిన బెంగ తీరలేదు ఆమెకు. ఆ ఆలోచన, దిగులుతోనే మేడ మీద నుండి జారి పడిపోయారు. కానీ ఎలాగోలా బ్రతికిపోయారు. అలాగే విజయవాడ వచ్చిన తరువాత ఆమె నాన్నగారి మరణం కూడా ఆమెను మానసికంగా, ఆర్థికంగా క్రుంగదీసాయి. 150 సవర్ల బంగారం ఆమె ఖర్చులకే కరిగిపోయింది.
మరణం…
తెనాలికి చెందిన దావినీడి పున్నయ్య, నీలం రాఘవయ్య గార్ల నిర్వహణలో “కురుక్షేత్రం” నాటకంలో శ్రీకృష్ణుడుగా నటిస్తూ ఎన్నో రాష్ట్రాలను కనకం పర్యటించారు. పీసపాటి షణ్ముఖి, ధూళిపాళ మొదలైన వారితో కలిసి కృష్ణుడు వేషం వేసేవారు. ఇలా ఎన్నో వందల ప్రదర్శనలు ఇచ్చారు కనకం. “శ్రీకృష్ణ రాయబారం” నాటకంలో తిరుపతి వెంకట కవుల పద్యాలను ఆరున్నర శృతిలో ఆమె పాడుతుంటే ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ పాడాలి అంటూ హోరెత్తిపోయేవారు. 1982 వరకు నాటకాలు వేస్తూ అప్పులు తీర్చుకొని విశ్రాంతి తీసుకుందామనుకున్న సమయంలో ఆమె తమ్ముడు మరణించారు. చేసేది లేక విజయవాడ వదిలి ఎక్కడికి వెళ్లలేకపోయారు.
అప్పుడప్పుడు గాయకులు మనో ఇంటికి, లేత మనసులు నాటి నుంచి ఆమెను అభిమానించే నటి జమున ఇంటికి వెళ్లి వస్తుండేవారు. 1999 లో తెలుగు అకాడమీ వారు ఇచ్చిన ఉగాది పురస్కారం, 2003 లో అజో – విభో నగదు పురస్కారం, 2003 లో “మా” పురస్కారం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి 2004 సంవత్సరానికి గాను నందమూరి తారక రామారావు రంగస్థల కళా పురస్కారం అందుకున్నారు. ఎంతో వైభవంగా నింగిలో మెరిసిన తార వలె విలాసవంతమైన జీవితం గడిపి, సినిమా నిర్మాణం అనే తప్పిదం కారణంగా ఆర్థికంగా చితికి, బ్రతికిన కనకం 2015 వ సంవత్సరంలో తన 88 ఏళ్ల వయస్సులో మరణించారు.

