Telugu News

వారాహి అమ్మవారి నవరాత్రులు విశిష్టత..!

వారాహి నవరాత్రులు ఈ ఏడాది జూన్ 26 నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులను నిర్వహిస్తారు. ఈ ఏడాది జూన్ 26 నుంచి జులై 4 వరకు ఉండే ఈరోజుల్లో.. చాలామంది భక్తులు వారి కోరికలు నెరవేరాలని, కష్టాలు తొలగిపోవాలని నిష్ఠగా వారాహి అమ్మవారి నవరాత్రులు జరుపుతారు. 

మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు. వీరే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని విశ్వాసాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహినీ. మరికొన్ని సంప్రదాయాల్లో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది. దుష్టశిక్షణ కోసం భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారిలో ఒకరైన వారాహిమాతను ఆరాధించడం వల్ల సకల శుభాలు సిద్ధించి, ఆర్థిక బాధలు తొలగిపోతాయని నమ్మకం.

పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈ దేవి ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాల్లో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు చెబుతారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో… శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది.

తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత అని చెబుతారు. అందుకే ఈమెను రాత్రివేళల్లో మాత్రమే పూజిస్తారు. వారాహి మాతను ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రివేళల్లో, తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. 

మరో కథనం ప్రకారం, లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈ దేవి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. 

ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలినీ శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహి దేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయి.

9 రోజులు అమ్మవారిని పూజిస్తే నరఘోష పోతుంది. దృష్టి దోషాలు, మానసిక వ్యాధులు, భయాందోళనలు వంటివి తొలగిపోవడానికి వారాహి మాత పూజ చాలా విశేషమైందని పండితులు చెబుతున్నారు. 

Show More
Back to top button