
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాల్లో తెలుగుదేశం పూర్వ వైభవాన్ని పొందేందుకు.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(వైఎస్ఆర్సిపి)ని సవాలు చేయడానికి, పూర్తిగా గద్దె దించడానికి చంద్రబాబు నాయుడు వేసిన వ్యూహాత్మక ఎత్తుగడే.. తాజాగా ప్రకటించిన మేనిఫెస్టో…
2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 23 స్థానాలు, 25 లోక్సభ స్థానాలకుగానూ మూడు స్థానాలు మాత్రమే గెలుచుకుని టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం విదితమే..
అయితే టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్.. యువగళం పేరుతో రాష్టంలోని ప్రతి చోటుకు వెళ్తూ, వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు.
తాజాగా మహానాడు కార్యక్రమంలో భాగంగా తెదేపా భవిష్యత్ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేయడం విశేషం. ఇది పూర్తిగా ప్రజాకర్షక పథక లక్ష్యంగానే ఉంది.
అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి సంక్షేమ పథకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. వైఎస్సార్సీపీ అవినీతి, దుర్వినియోగం, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని, హామీలను నెరవేర్చడంలో పూర్తి స్థాయిలో విఫలమైందని టీడీపీ తీవ్రంగా ఆరోపించింది. టీడీపీ మేనిఫెస్టో రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగానే ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెపుతున్నాయి. మరీ ఈ నేపథ్యంలో ఈ మేనిఫెస్టో వల్ల తెదేపాకు ప్రయోజనం కలగనుందో లేదో ఇకపై చూడాల్సిఉంది.
తాజాగా తెదేపా ప్రకటించిన మేనిఫొస్టోలోని ఆరు ప్రత్యేక అంశాలు/పథకాలు ఏంటంటే…
*మహిళా మహా శక్తి పథకం… ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన మహిళలకు “స్త్రీనిధి” కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేలా కార్యాచరణ. (వైసీపీ హయాంలో మహిళా స్వయం సహాయక బృందాలకు సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చేవారు).
*తల్లికి వందనం… ఈ పథకం కింద ఇంట్లో పిల్లల చదువు కోసం, ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేల సాయం…(జగనన్న అమ్మఒడి.. ప్రభుత్వ/ ప్రభుత్వేతర, ప్రైవేటు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి చదివే విద్యార్థుల తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి రూ.15వేల సాయం అందుతుంది.)
*60 ఏళ్లు దాటిన వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్లు, డప్పు కళాకారులు, హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులు, కుష్ఠు వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారికి నెలవారీ పెన్షన్లు అందించేందుకు ఈ పథకం తీసుకొచ్చారు. కేటగిరిల వారీగా రూ.2,250 నుంచి రూ.10వేల వరకూ పెన్షన్ ఇస్తారు.
*దీపం… ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు.
*స్థానిక బస్సుల్లో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం… (వైసీపీ హయాంలో కుటుంబానికి మూడు గ్యాసు సిలెండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటివి అమలు కావటంలేదు)
*యువగళం నిధి… ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు 20 లక్షల వరకు ఉద్యోగాలు అందివ్వనుంది.
ప్రతి నిరుద్యోగికి ‘యువగళం నిధి’ కింద నెలకు రూ. మూడు వేల ఆర్థిక సాయం అందివ్వడమే ఈ పథకం ఉద్దేశం. (గతంలో టీడీపీ హయాంలో అమలులో ఉన్నప్పటి నిరుద్యోగ భృతిని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. 2లక్షల 30వేల ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పిన వైకాపా అధికారంలోకి వచ్చింది. కానీ ప్రభుత్వఉద్యోగాలు రాలేదు.
దానితోపాటు ఇక్కడకు రావలసిన పరిశ్రమలన్నీ తరలిపోవటంతో ప్రైవేటు ఉద్యోగాలు కూడా లేవు.
వేలమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అమరావతి నిర్మాణం ద్వారా 15 లక్షల ఉద్యోగాలకు తెలుగుదేశం శ్రీకారం చుడితే, దానిని జగన్ ప్రభుత్వం నేలకూల్చింది.)
*ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం, ఇంటింటికి మంచినీరు పథకం కింద ఉచితంగా నల్లా కనెక్షన్.
*మేము(తెలుగుదేశం పార్టీ) అధికారంలోకి వస్తే, జగన్, వైసీపీ నేతలు ఇప్పటివరకు దోచుకున్న డబ్బును జప్తు చేస్తాం. అలా జప్తు చేసిన సొమ్మును తిరిగి పేదలకు పంచుతాం.
అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం. జగన్ అసమర్థతతో రాష్ట్రం ఈపాటికే అప్పులపాలైంది. జగన్ చేతకానితనం వల్ల పారిశ్రామికవేత్తలు సైతం రాష్ట్రం నుంచి పారిపోతున్నారు.
రాష్ట్రంలో ఎటుచూసినా డ్రగ్స్, గంజాయి, మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగాయి.
వీటన్నిటిని రూపుమాపి పేదరికంలేని రాష్ట్రంగా ఏపీని మారుస్తాం. జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలని ప్రజలు నమ్ముతున్నారు.
మళ్లీ టీడీపీ అవసరం ఎంతైనా ఈ రాష్ట్రానికి ఉందని ప్రజల అనాసక్తి వల్ల తెలుస్తోంది.
తెలుగుజాతి భవిష్యత్ అభివృద్ది కోసం నిరంతరం పని చేస్తాం, గాడి తప్పిన రాష్ట్రాన్ని పునర్మించే బాధ్యత పూర్తిగా టీడీపీ తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇక మున్ముందు ఏం జరగనుందో వేచి చూడాల్సిందే!