CINEMATelugu Cinema

విలనిజానికి విశిష్టతను తెచ్చిన విలక్షణ నటులు.. రావు గోపాల రావు..

రావు గోపాల రావు (14 జనవరి 1937 – 13 ఆగష్టు 1994)

అబ్బా సెగట్రీ! ఎప్పుడూ పనులు, ఎదవ బిగినెస్సేనా. పరిగడుపున ఇంత పచ్చిగాలి పీల్చి, ఆ పెత్తెక్షనారాయణ సేవచేసుకోవద్దూ. కళ్లెట్టుకు సూడు. పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ ఆకాశంలో. సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ. మడిసన్నాక కాసంత కళాపోసనుండాలయ్యా. ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏముంటది? ముత్యాల ముగ్గు (1975) బాపు దర్శకత్వం లో ప్రతినాయకుని విలనిజానికి నిలువెత్తు నిదర్శనం…

“ఈస్టు స్టువర్టుపురం స్టేషనుమాస్టరు గారి ఫస్టు సన్‌ వెస్ట్‌కెళ్లి తనకిష్టమైన అతి కష్టమైన బారిష్టరు టెస్టులో ఫస్టు క్లాసులో బెస్టుగా పాసయ్యాడని తన నెక్స్ట్‌ ఇంటాయాన్ని ఫీస్టుకని గెస్టుగా పిలిస్తే ఆయన టేస్టీగా ఉన్న చికెను రోస్టుతో బెస్టు బెస్టు అంటూ తినేసి హోస్టుకు కూడా మిగల్చకుండా ఒక్కముక్క కూడా వేస్టు చేయకుండా సుష్ఠుగా భోంచేసి పేస్టు పెట్టి పళ్లు తోముకుని మరీ రెస్టు తీసుకున్నాడట ఏ రొస్టు లేకుండా”. చాలా, ఇంకా వదలమంటావా భాషా బరాటాలు మాటల తూటాలు యతిప్రాసల పరోటాలు…

ఈ సంభాషణలు పలకాలంటే భాష పై ఎంత పట్టుండాలి. ఇంత విలనిజం పండించాలంటే నటనపై ఎంత వ్యామోహం ఉండాలి. ఇది రావు గోపాల రావు గారికి మాత్రమే సాధ్యం..

సినిమాల్లో కథనాయకులు మాత్రమే కాదు. వారికి ధీటుగా ప్రతినాయకుడు ఉంటేనే ఆ సినిమాలో హీరోకి పవర్ పెరుగుతుంది. అలా సినిమాకి విలన్ కూడా ముఖ్యం. ప్రతినాయకుడు పాత్రంటే పలు రకాల విశిష్ట గుణాలు ఉండాలి. ఇప్పట్లో అయితే చాలామంది అగ్ర కథనాయకులు విలన్ పాత్రలు చేస్తున్నారు. కానీ అప్పట్లో విలన్ అంటే మాత్రం ముగ్గురు నలుగురే గుర్తొస్తారు. వారిలో రావు గోపాల రావు గారు తప్పకుండా వుంటారు.

“వేటగాడు” చిత్రంలో దివాన్‌జీ అయిన రావు గోపాలరావు గారికి విలువైన హారం కావాలి. దానిని మెడలో వేసుకొని మారువేషంలో ఎన్‌.టి.ఆర్‌ గారు వస్తారు. “మా గురువు కల్లు కొండయ్య గారు” అని నగేష్‌ ఎన్‌.టి.ఆర్‌ గురించి బిల్డప్‌ ఇస్తాడు. ఎన్‌.టి.ఆర్‌ ఊరికే ఉంటాడా? “ఏరా కుయ్యా” అని రావు గోపాలరావు గారిని తిడతాడు. తిడితే పర్వాలేదు. “ఏవన్నాను” అని తనను తిరిగి చెప్పమంటాడు. అప్పుడు రావుగోపాలరావు గారు “ఏదో కుయ్యా అని చిన్న సౌండ్‌ ఇచ్చారండీ” అంటారు. ప్రేక్షకులు ఎంత నవ్వుతారో…

రావు గోపాల రావు గారు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో విలన్ గా నటించారు. అప్పట్లో స్టార్ హీరో చిత్రమంటే విలన్ గా రావు గోపాల రావు గారు ఉండాల్సిందే. విలన్ గా ఈయనది మరో ప్రస్థానం అనే చెప్పాలి. జిత్తులమారి, కుతంత్ర తెలివిగల,  మోసపూరితమైన నటనలో తన నటన మహా అద్భుత, అజరామరం..

@ జీవిత విశేషాలు…

జన్మ నామం :   రావు గోపాలరావు

ఇతర పేర్లు  :    కళాప్రపూర్ణ 

జననం    :   14 జనవరి 1937 

స్వస్థలం   :     కాకినాడ సమీపంలోని గంగనపల్లి

తండ్రి       :    రావు సత్యనారాయణ రావు ,  

తల్లి       :      సీతాయమ్మ 

వృత్తి      :    సినీ నటుడు, రాజకీయ నాయకుడు

భార్య     :    రావు కమలకుమారి

పిల్లలు    :    ఇద్దరు కుమారులు ( రావు రమేష్, రావు క్రాంతి ), ఒక కుమార్తె

రాజకీయం   :   రాజ్యసభ సభ్యులు (1986 – 1992)

బిరుదులు    :   నటవిరాట్ 

మరణ కారణం  :   మధుమేహ వ్యాధి తీవ్రమై, కిడ్నీలు చెడిపోయి

మరణం    :  13 ఆగష్టు 1994, హైదరాబాద్

@ జననం…

రావు గోపాల రావు గారు కాకినాడ సమీపంలోని గంగనపల్లి లో 14 జనవరి 1937లో సంక్రాంతి పర్వదినాన జన్మించారు. రావు సత్యనారాయణరావు, సీతాయమ్మ గార్లు తన తల్లిదండ్రులు. గోదావరి గ్రామీణ మాండలికంలో మారుమోగిపోయే సంభాషణలు చెప్పే రావు గోపాల రావు గారు సంఘానికి, సమాజానికి ఏమి చేయని జీవితం వ్యర్థం అనుకుని తన 11 వ యేటనే ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు. నాటకరంగంలో పేరు సంపాదించి సినిమారంగంలోకి వెళ్ళినవాళ్ళు తొందరలోనే రాణిస్తారు అనేందుకు రావు గోపాలరావు గారు ప్రత్యక్ష ఉదాహరణ.

@ నాటక రంగం…

సంఘానికి, సమాజానికి ఏమి చేయని జీవితం వ్యర్థం అనుకొని తన 11వ ఏటే ఇల్లు వదిలి వెళ్ళిపోయిన వ్యక్తి రావు గోపాల రావు గారు. నాయకులు అంతా కష్టపడి స్వతంత్ర్యాన్ని తెచ్చారు. కానీ ఆ స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎవ్వరికీ రావట్లేదని ఆవేదన చెంది వారు తన భావాలను వ్యక్తపరచడానికి నాటకమే సరియైన సాధనమని భావించారు. నిజానికి రావు గోపాల రావు గారికి మొదటినుంచి నాటకాలంటే విపరీతమైన మక్కువ. తన ప్రతిభా పాఠవాలు బాగా ఎరిగిన తన మిత్రులు తనను మిక్కిలి ప్రోత్సహించేవారు. తాను నటించిన “ధన్యజీవులు” అనే నాటకం గోపాలరావుకు మంచి పేరు తెచ్చి పెట్టడంతో తాను నాటకాల వైపు మొగ్గు చూపారు.

దాంతో “అసోసియేటెడ్ అమెచ్యుర్ డ్రామా కంపెనీ” అనే నాటక సంస్థను నెలకొల్పి ఎన్నో సాంఘిక నాటకాలను అనేకచోట్ల ప్రదర్శించారు. మూఢాచారాలను, అంధ విశ్వాసాలను తుర్పారాబట్టి వాటిపై అనేక నాటకాలను రచించారు. నాటకాలకు దర్శకత్వం వహించారు. నాటకాలలో నటించారు. ఎన్నో చోట్ల నాటక అకాడమీలు స్థాపించారు. తనకు వెయ్యి మందికి పైగా శిష్యులు ఉండేవారు. వారందరినీ తన సొంత మనుషుల్లా చూసేవారు. ఆరోజుల్లో కోస్తా జిల్లాలలో పండగలకు, పబ్బాలకు పరిషత్ నాటక పోటీలు విస్తృతంగా జరిపేవారు. రావు గోపాల రావు గారు పరిషత్ నాటకాలకు వస్తే తనకే ఉత్తమ నటుడిగా బహుమతి దక్కేది.

@ సినీ నేపథ్యం…

నిజానికి రావు గోపాల రావు గారు ఇష్టంతో సినిమాలలోకి రాలేదు. నటులు ఎస్వీ రంగారావు, దర్శకుడు రామినీడు గార్లకు సన్మానం చేయాలని సంకల్పించారు. ఆ రోజున “కీర్తిశేషులు” నాటకాన్ని ప్రదర్శిస్తే రావు గోపాల రావు గారి ప్రతిభను చూసి ముగ్దులైపోయారు వాళ్ళు. గుత్తా రామినీడు గారి దర్శకత్వంలో వచ్చిన భక్తపోతన (1966) సినిమాలో యస్వీ రంగారావు గారు శ్రీనాథుని పాత్ర పోషించారు. అందులో శృంగార నైషధాన్ని రాజుకు అంకితమిచ్చే ఘట్టంలో శ్రీనాథుడు రాజు కాళ్ళకు దణ్ణం పెట్టే సన్నివేషం ఉంది. ఎవరికంటే వాళ్ళకు దణ్ణం పెట్టడానికి ఇష్టపడని రంగారావు గారు, రావు గోపాలరావు గారిని మద్రాసుకు పిలిపించి, రామినీడు గారికి పరిచయంచేసి అతనిచేత రాజా మామిడి శింగనామాత్యుని పాత్ర పోషింపజేసి, అతని కాళ్ళకు దణ్ణం పెట్టించారు.

గోపాలరావు గారిలో ఉన్న ప్రతిభను గమనించిన రామినీడు గారు ఆ చిత్రానికి అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పెట్టుకున్నారు. అలా రామినీడు గారి వద్ద బంగారు సంకెళ్ళు, మూగప్రేమ చిత్రాలకు సహాయ దర్శకుడుగా పనిచేసారు రావు గారు. ప్రతాప్ ఆర్ట్స్ సంస్థ నిర్మాత కె. రాఘవ గారు, కీర్తిశేషులు నాటకం చూసి రావు గోపాలరావు గారికి జగత్ కిలాడీలు (1969) సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ చిత్రానికి తన కంఠస్వరం నచ్చక వేరొకరితో డబ్బింగ్‌ చెప్పించారు నిర్మాతలు. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించిన గండర గండడు (1969) సినిమాలో గోపాలరావు గారు తన సొంత కంఠంతోనే పాత్రను పోషించి మెప్పించారు.

బాపు-రమణల ముత్యాలముగ్గు (1975) సినిమాలో గోపాలరావు గారు విలక్షణ విలన్ అవతారమెత్తడమే కాకుండా గోదావరి యాసలో తను పలికే సంభాషణలతోనే సినిమా విజయంలో పాలుపంచుకున్నారు. వేటగాడు సినిమాలో ప్రాసతో కూడిన పెద్దపెద్ద డైలాగులు, వింతైన విలనీతో ఆ సినిమాకే ఒక ప్రత్యేకత కట్టబెట్టారు. ఆరోజుల్లో మిమిక్రీ కళాకారులు రావు గోపాలరావు గారి డిక్షన్ ను అనుసరిస్తూ ఎన్నో పేరడీలు వల్లించి ఆదరణ పొందేవారు. బాపు దర్శకత్వంలో రూపొందిన “భక్త కన్నప్ప”, “గోరంత దీపం”, “మనవూరి పాండవులు”, “కలియుగ రావణాసురుడు”, “త్యాగయ్య”, “జాకీ”, “బుల్లెట్‌”, చిత్రాలు, ఆ చిత్రాల్లోని సంభాషణలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తిండిపోతాయి.

అలా గుర్తుండి పోయే సంభాషణలని, నటనని “మగధీరుడు”, “కొండవీటి సింహం”, “కొండవీటి రాజా”, “కిరాయి రౌడీలు”, “ఖైదీ”, “కటకటాల రుద్రయ్య”, “జస్టిస్ చౌదరి”, “గోపాలరావుగారి అమ్మాయి”, “ఘరానా మొగుడు”, “దేవాలయం”, “చండశాసనుడు”, “బొబ్బిలిపులి”, “బొబ్బిలి బ్రహ్మన్న”, “అనుగ్రహం”, “అల్లరి ప్రియుడు”, “అభిలాష”, “యమగోల” తదితర చిత్రాల్లోనూ ప్రదర్శించారు. కేవలం ప్రతినాయకుడిగానే కాకుండా కొన్ని సినిమాల్లో హాస్యాన్ని కూడా గోపాలరావు గారు పండించారు. “రావు – గోపాలరావు” సినిమాలో నత్తి ప్రొఫెసర్ గా, “పట్నం వచ్చిన పతివ్రతలు”, “మల్లెపువ్వు” సినిమాల్లో మాలిష్ మారాజుగా, “మావూర్లో మహా శివుడు” సినిమాలో శివుడుగా, “స్టేషన్ మాస్టర్” సినిమాలో స్టేషన్ మాస్టర్ గా రాణించారు.

ముత్యాల ముగ్గులో పాత్రకు భిన్నంగా “ఇంటిదొంగ” సినిమాలో కంటనీరు పెట్టించే పాత్రను పోషించి మెప్పించారు రావు గోపాల రావు గారు. తన వాచకానికి ప్రేక్షకులు జేజేలు కొట్టారు. దక్షిణ ఆసియాలో సినిమా సంభాషణలు, సౌండ్ ట్రాక్ తో విడుదలైన తొలి లాంగ్ ప్లే రికార్డు ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాలరావు గారిది కావడం ఒక రికార్డు. రావు గోపాలరావు గారి అభినయానికి నాటకరంగంలో ఎన్నెన్నో ఒన్స్ మోర్ లు. వెండితెరపై సైతం ఆయన నటనావిన్యాసాలకు ప్రేక్షకుల చేతులు నొప్పిపుట్టేలా చప్పట్లు కొట్టించాయి. ఏ పాత్రలోకైనా ఇట్టే పరకాయప్రవేశం చేసి ఆకట్టుకోవడం రావు గారి శైలి.

వాచకంతోనే ఆకట్టుకుంటూ వందలాది పాత్రలకు జీవం పోసి మెప్పించారు రావు గోపాలరావు గారు. రావు గోపాలరావు అభినయానికి ముఖ్యంగా ఆయన వాచకానికి జనం జేజేలు పలికారు. అయితే అదే వాయిస్ ఆయనకు ఆరంభంలో శాపమయింది. కొన్ని చిత్రాల్లో రావు గోపాలరావు గారి గొంతు బాగుండదని, ఇతరుల చేత డబ్బింగ్ చెప్పించిన సందర్భాలూ ఉన్నాయి. బాపు-రమణ లు రావు గారి వాచకంలోని విలక్షణాన్ని గ్రహించి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో రావు గోపాలరావు గారిని నటింప చేశారు. రావు గోపాలరావు గారు సాంఘికాల్లోనే కాదు, పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనూ తనదైన బాణీ పలికించారు.

@ నిర్మాత గా…

నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా గోపాలరావు గారు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. “స్టేషన్ మాస్టర్”, “లారీ డ్రైవర్”,  “భార్గవరాముడు”, “వింతదొంగలు” వంటి చిత్రాలు నిర్మించి విజయం సాధించారు. రావు గోపాలరావు గారి కళారాధనకు గుర్తుగా ఆంధ్రవిశ్వ విద్యాలయం వారు తనకు 1990లో కళాప్రపూర్ణ (డాక్టరేట్) ప్రదానం చేశారు. పలు రకాల నాటక సంస్థలు రావు గోపాల రావు గారికి “నటవిరాట్” అనే బిరుదును ప్రదానం చేశాయి. “ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కమిటీ సభ్యునిగా రావు గోపాల రావు గారు వ్యవహరించారు.

“సితార” బహుమతి ని అందుకున్న రావు గారు వాటితో బాటుగా “నంది”, “చిత్తూరు నాగయ్య” పేరుతొ ఇచ్చే బహుమతులు కూడా రావు గోపాల రావు గారిని వరించాయి. తాను ఆఖరిసారిగా 1993 లో నాలుగు చిత్రాలలో నటించారు. అవి “ఆ ఒక్కటీ అడక్కు”, “అల్లరి ప్రియుడు”, “అల్లరి అల్లుడు” సినిమాలు. నాలుగవది “ప్రేమ అండ్ కో” సినిమా రావు గోపాల రావు గారి నిష్క్రమణ తరవాత విడుదలైంది. అదే రావు గోపాల రావు గారి ఆఖరి చిత్రం. తన సినీ ప్రస్థానం లో రావు గోపాలరావు సుమారు 125 సినిమాలకు పైగా నటించారు.

@ రాజకీయం…

రావు గోపాల రావు గారు నటుడుగా రాణిస్తూ, సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవారు. జయప్రకాష్ నారాయణ గారి స్పూర్తితో “సోషలిస్టు”పార్టీలో చేరి సామాజిక సేవ చేశారు. తాను ఎన్.టి.రామారావు గారికి అత్యంత సన్నిహిత మిత్రులు. ఎన్టీఆర్ గారి పరిపాలనా కాలం లో రావు గోపాల రావు గారు 1984-85 మధ్య ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా పనిచేశారు. తరవాత రావు గోపాల రావు గారిని తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు ఎంపిక చేసింది. 1986-92 మధ్య కాలంలో రావు గోపాలరావు గారు రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు సేవ చేశారు.

పదవులు, సంపద ఏవి కూడా రావు గోపాల రావు గారిని మార్చలేకపోయాయి. ఎంపీ అయినా రావుగారు రావుగారే. ఏ రోజు కూడా ప్రభుత్వ సొమ్మును ఆశించలేదు. ఫోన్ కనెక్షన్ దగ్గర నుండి, ఫ్లైట్ టికెట్ వరకు అంతా సొంత ఖర్చుతోనే. ప్రభుత్వం ఏదైనా సౌకర్యాలు కల్పిస్తే తన బదులు పేదవాళ్ళకి ఇవ్వమనే వారు. రామారావు గారు చాలా సార్లు అన్నారు, “మీకు పిల్లలు ఉన్నారు. ఏదైనా అవసరమైతే అడగండి” అని. నాకెందుకండీ, పేదవాళ్ళకి ఇవ్వండి అనేవారు. తనలా ఆ మాట అందరూ అనలేరు. కేవలం రావు గోపాల రావు గారు లాంటి కొందరే తప్ప.

@ వివాహం…

రావు గోపాల రావు గారు హరికథ కళాకారిణి అయిన రావు కమలకుమారిని 16 జనవరి 1966 నాడు వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. ఒకసారి కాకినాడలో ఆమె హరికథ చెబుతుండగా విని ముగ్ధులై ఆమెతో ప్రేమలో పడ్డారు. ఆ తరవాత రాజమహేంద్రవరం లలితా కళానికేతన్ వారు ఆహ్వానించిన ఉత్సవాలకు హాజరైనప్పుడు, ఆ సంస్థ సభ్యుల సమక్షంలోనే వీరివురు పెళ్ళి చేసుకున్నారు. రావు కమలకుమారి గారు తన 73 సంవత్సరాల వయస్సులో  6 ఏప్రిల్ 2018 న హైదరాబాదులో మరణించారు. రావు గోపాలరావు దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వాళ్లలో ఒక కుమారుడు రావు రమేశ్ గారు కూడా మంచి నటులుగా పేరు తెచ్చుకున్నాడు. మగధీర, కొత్త బంగారు లోకం, గమ్యం వంటి అనేక చిత్రాలతో నటించి మంచి గుర్తింపు పొందారు.

@ వ్యక్తిత్వం…

ప్రతినాయకుడిగా భయంకరమైన విలన్ పాత్రలో ఎన్నో సినిమాల్లో చేశారు రావు గారు. కానీ నిజజీవితంలో తాను విలన్ కాదు హీరో. చాలా మందికి రావు గోపాల రావు గారు ఒక విలక్షణ నటుడుగానే తెలుసు. కానీ తాను ఒక విశిష్ట వ్యక్తి కూడా అని చాలామందికి తెలియదు. తాను, తన భార్య పరస్పరం ఇష్టపడి ప్రేమించుకున్నారు. భార్యని ఎప్పుడూ ఏక వచనంతో సంబోధించని వ్యక్తిత్వం తనది. అవకాశం ఉన్నా పిల్లల కోసం ఏమి చేసుకోని నిస్వార్థ గుణం తనది. తన ఇంటికి ఎవరు వచ్చినా భోంచేసి వెళ్లాల్సిందే. లేదంటే ఊరుకునే వారు కాదు.

తనకు డబ్బు మీద వ్యామోహం లేదు. పదిమందికి భోజనం పెడితే పుణ్యం వస్తుందని అనుకునేవారు. వందమందికి పైగా వంట చేయించి భోజనం పెట్టించిన రోజులు ఉన్నాయి. అల్లు రామలింగయ్య గారితో, రావు గారి కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అల్లు రామలింగయ్య గారికి రైలులో పొరపాటున వేరే బోగిల్లో సీటు ఇస్తే టీ.సీ తో పోట్లాడి మరీ తానున్న బోగిలో కూర్చుండిపోయేవారు. రావు గోపాల రావు గారు తాను ఒక ముద్ద తింటే చుట్టుపక్కల వారికి పది ముద్దలు పెట్టడం తన నైజం. రాజకీయాల్లో వచ్చింది కూడా అందరికీ చేతనైన సాయం చేయాలని, దాని కోసమే తన సినిమా అవకాశాలు కూడా వదిలేసుకున్నారు.

@ శాశ్వత నిద్ర…

రావు గోపాల రావు గారు సినిమా చిత్రీకరణలో ఆలస్యం కారణంగా సమయానికి తిండి, నిద్ర ఉండేవి కావు. రాజకీయాల్లోకి వచ్చాక మరీ దారుణం. ఎప్పుడూ ప్రజాసేవ అంటూ వెళ్లిపోయేవారు. సరైన సమయానికి షుగర్ మందులు కూడా వేసుకునేవారు కాదు. దాంతో ఆరోగ్యం బాగా చెడిపోయి, మధుమేహం పెరిగిపోయి, కిడ్నీలు దెబ్బ తిన్నాయి. దానికి తోడు ధూమపానం కూడానూ. రాయిలా ఉండే తాను క్షీనించిపోయారు. ఓ రోజు ఉన్నట్టుండి జ్వరం వచ్చి సాయంత్రం ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించారు

రాత్రి అప్పటికే నిద్రపోయారు. ఉదయం ఐదు గంటలకు ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది. కదిపినా కదల్లేదు. డాక్టర్లు వచ్చి ఏదేదో చేశారు. కానీ రావు గోపాల రావు గారిని మాత్రం కాపాడలేకపోయారు. ఆ రోజుల్లోనే అందరి కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న రావుగోపాల రావు గారు  జీవిత మలిదశలో ఆర్థిక ఇబ్బందులు వచ్చి వైద్యానికి డబ్బులు లేని పరిస్థితులు నెలకొన్నాయి. అలా దావాఖానాలో చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి 13 ఆగస్టు 1994 లో రావు గోపాల రావు గారు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.

@ బహుళ ప్రజాదరణ పొందిన సంభాషణలు..

★ ముత్యాల ముగ్గు : –

“నారాయుడూ.. ఆ ఎగస్పార్టీ వాళ్లిచ్చే డబ్బు నువ్వే ఇవ్వరా మిగిలిపోతావు అంటే వినిపించుకున్నావా? కరుసైపోయావు. కారు ఎనకసీట్లో దర్జాగా రాజాలా కూసుని ఎల్లేటోడివి. ఇప్పుడు డిక్కీలో తొంగున్నావు. దర్జా తగ్గిపోలే”.

“చూడు గుర్నాధం. నీలాటోళ్ళు నన్ను బాగా పొగిడేసి బోర్లా కొట్టిన్చేస్తున్నారని భయమేసి ఈ బట్రాజు మేళం ఎట్టిచ్చాడు మా సెగట్రీ. ఎవరైనా సరే పొగిడారో… ఈళ్ళు బాజా కొట్టేస్తారు. నేను బరతం పట్టేస్తాను”.

“అయ్ బాబోయ్.. అదేటండి అలా సూసేత్తన్నారు. ఆవిడ ఎవరనుకున్నారు? పెద్ద ఆఫీసరు భార్య… ఇద్దరు పిల్లలు. దీన్సిగదరగ… ఆఫీసర్ల పెళ్ళాలు డాన్సు చెయ్యకూడదేటండి! కలాపోసన. పొద్దత్తమాను తిని తొంగుంటే ఇక గొడ్డుకీ, మడిసికీ తేడా ఏటుంటాది? అంచేతే డాన్సు కోసం సెపరేషనుగా ఓ డిపార్టుమెంటే పెట్టేశాను.” (కరడుగట్టిన కాంట్రాక్టరు పాత్రలో)

★ వేటగాడు :-

“గాజుగదీ గాజుగదీ అనాలని మోజుపడి ప్రతిరోజూ ఆ మాటనే పోజుగా స్క్రూ లూజుగా వాడితే మనబూజు దులిపేసి గ్రీజు పెట్టేస్తారురా నిరక్షర కుక్షి”.

“కొండయ్యగారు ఏదో ఆటకీ ఈపూట తేట తెలుగులో ఒక మాటన్నారని అలా చీటికీ మాటికీ అంటున్నారని నువ్వు సూటిగా కోపం తెచ్చుకుంటే తీట తీరిపోయి వీధిలో చాటలమ్ముకుంటూ, పాటలు పాడుకుంటూ పూటతిండి అడుక్కుని బతకాల్రా బేటా”.

★ మనవూరి పాండవులు :-

“కన్నప్పా! తాగి వాగుతున్నావు. ఇంటికెళ్ళి పడుకో. ఒకేళ పొద్దున్న బతికి బావుండి మేలుకున్నావనుకో.. దొరగార్ని తిట్టానని గుర్తొచ్చి మనసు పాడైపోయి సచ్చిపోతావు. పో.. ఆంజనేయ దండకం సదూకుంటూ పడుకో” (దొర మూడోకన్ను తెరుచుకొని కన్నప్ప మీద కత్తి దూస్తూ)

★ భక్త కన్నప్ప :-

“భక్తులారా నిన్న రాత్రి కూడా యధాప్రకారం కైలాసం వెళ్లి స్వామిని సేవించి వచ్చాను. మీ మీ కష్టసుఖాలూ, కోరికలూ వారికి మనవి చేశాను. నేను కైలాసం వెళ్ళకపోతే స్వామివారు బెంగపెట్టుకుంటారు. రా సుబ్బన్నా. నీ కష్టాల గురించి స్వామికే కాదు, అమ్మవారికి కూడా విన్నవించాను. తల్లీ.. ఇలా బతికి చితికిన కుటుంబం. వాళ్లకి మళ్ళీ దశెత్తుకోవాలంటే కరుణించక తప్పదు అని చెప్పగా వారు సరేనన్నారు.” (కైలాసనాథశాస్త్రి తన భక్తులతో)

★ గోరంత దీపం :-

“సర్లేవో. వేళకి తిండిలేక నీరసవొస్తే వేళాకోళమొకటి. మా సేటు నేనంటే ముచ్చటపడి చస్తాడు. రాజశేఖరం.. నువ్వారో ఘంటకి రాపోతే గడియారాలాగిపోతాయి. నా ఫ్యాక్టరీలు నడవవోయ్ అంటాడు. నువ్విలా నిలబడి ఖడేరావను.. చాలు.. వర్కర్లు ఝామ్మని పనిజేస్తారు. నువ్వింటికెల్తానంటే నాకు గుండె గాభరా అంటాడు.” (రాజశేఖరం తన భార్యతో గొప్పలు చెబుతూ)

★ త్యాగయ్య :-

“రాజదర్శనం త్రోసిరాజని, రాముడి పూజకోసం వచ్చేస్తావా? ఏం చూసుకొనిరా నీకా పొగరు? ఆ కండ కావరం! నాన్నగారికన్నా గొప్పవాడివా? కొత్తగా కొమ్ములు మొలిచాయా? ఆయనతో చిన్నప్పుడు రాజసభకు వెళ్ళలేదూ! అక్కడ రామాయణం చదవలేదూ” (సాత్వికత ఉట్టిపడేలా)

Show More
Back to top button