HISTORY CULTURE AND LITERATURE

నాగోబా ఆలయానికి వెళ్దాం పదండి

గిరిజనులు అమాయక ప్రజలు, వారు దేన్నీ అంతగా నమ్మరు, కానీ ఒక్కసారి నమ్మారు అంటే వారిని జీవితాంతం కాపాడుకుంటారు.అయితే గిరిజనుల ఆచార వ్యవహారాలు, పండగలు, సంప్రదాయానికి చాలా విలువ ఇస్తారు. తమ పరిధిలో గిరి తీసుకుని సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తారు. ఎవరైనా దానికి అడ్డుకున్నా, పరిధి దాటినా క్షమించరు. వారు వేసే శిక్షలు కూడా దారుణంగా ఉంటాయి. వారి తెగలలోని వారిని పెళ్ళిళ్ళు చేసుకుంటారు తప్ప, అన్యులను అనుమతించరు.

వారు నమ్మిన దేవత వన దేవతను కొందరు నమ్మితే, మరికొందరు నాగ దేవతను నమ్ముతారు.అందులో భాగమే మనమిప్పుడు తెలుసుకునే నాగోబా జాతర, దీని కోసం వారు నెలల తరబడి నడుస్తూ, కటిక ఉపవాసం చేస్తూ , దీక్షగా జాతర చేసుకుంటారు.

అలాంటి జాతరకు ఒక్కసారి వెళ్ళినా మన జన్మ ధన్యమే.అయితే కొందరు వెళ్ళలేని స్థితిలో ఉంటారు, కాబట్టే వారికీ ఈ నాగోబా జాతర విశేషాలు..

నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవుడు.

నాగోబా దేవాలయం ఆదిలాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌ దగ్గర కెస్లాపూర్‌ గ్రామంలో ఉంది. కెస్లాపూర్‌లో జరిగే ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కెస్లాపూర్‌ జనాభా 400కు మించదు. కాని పండగనాడు లక్షలాది మందితో అది జనారణ్యంగా మారుతుంది. జనవరి 25 నుంచి 29 వరకు నాలుగు రోజులపాటు గిరిజనులు ఈ పండుగ జరుపుకుంటారు. యేటా పుష్యమాసము అమావాస్య రోజున జాతర ప్రారంభ మవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటు మాయమ వుతాయని గిరిజనుల నమ్మకం.

పూర్వగాథ

నాగోబా చరిత్రను గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని, ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్పరూపంలోని నాగేంద్రునికి తల్లి అంటే రాణి తన తమ్ముడి కూతురు గౌరీతో వివాహం జరిపించింది.

అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి ప్రయాణం కాగా, ఒకచోట పాము ఉడుం రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడుంపూరైంది. ఆ తరువాత గౌరి ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని, అయితే పేరు ప్రతిష్ఠలు కావాలో, సంప్రదాయం కావాలో తేల్చుకోమనగా గౌరి సంప్రదాయాలను లెక్కచేయక పోవడంతో తిరిగి పాముగా మారాడని కథ.

ఆ తరువాత ఉడుంపూర్‌ నుంచి గరిమెల వరకు అతనికోసం వెతికిన గౌరి గోదావరిలోనే సత్యవసి గుండంలో కలిసిపోయిందని, నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం. ఆ తరువాత పెళ్ళి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని (పేథికొరి యాక్‌) చెప్పి నాగేంద్రుడు కెస్లాపూర్‌ గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెప్తుంటారు.

అదే కెస్లాపూర్‌ గ్రామంగా మారి పోయింది. నాగేంద్రుడు వెళ్లిన గుట్ట వద్ద నాగోబా దేవాలయాన్ని నిర్మిం చారు. ప్రతిఏటా పుష్ట మాసం అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని గిరిజనుల నమ్మకం. నాగోబా దేవతకు పూజలు మేస్రం వంశీయులే నిర్వహిస్తారు. మేస్రం వంశం కింద 22 తెగలు వస్తాయి. ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మేస్రం వంశీయుల కిందికి వస్తారు. మడావి, మర్సకోల, పుర్క, మేస్రం, వెడ్మ, పంద్రా, పుర్వెత ఇంటి పేర్లు గలవారంతా మేస్రం వంశంలో వస్తారు.

దేవాలయ నిర్మాణం

మెస్రం వంశీయులు తొలినాళ్ళలో నాగోబా దేవత వెలిసిన పుణ్యస్థలం (పుట్ట)ను మాత్రమే పూజించేవారు. 1956లో గడ్డి పరకలతో చిన్న గుడిసెను, 1995లో సిమెంట్‌, ఇటుకలతో చిన్న మందిరాన్ని నిర్మించి పూజలు చేశారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ సహకారంతో గుడిని నిర్మించారు. 2022 లో శిలలతో నూతన దేవాలయాన్ని నిర్మించారు.

విగ్రహ ప్రతిష్టాపన

మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో పునరుద్ధరించిన నాగోబా దేవాలయాన్ని ప్రారంభం, విగ్రహ పునఃప్రతిష్ఠాపనోత్సవ కార్యక్రమం 2022 డిసెంబర్ 19న వైభవంగా  జరిగింది. ఆదివాసీ గిరిజన పురోహితుల మంత్రోచ్ఛారణల నడుమ మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి నూతనంగా నిర్మించిన దేవాలయంలో గర్భగుడిలో నాగోబా విగ్రహాన్ని, సతీక్‌దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి ధ్వజస్తంభానికి పూజలు చేశారు. దేవాలయ శిఖరాలపై కలశాలను ఏర్పాటుచేశారు.

గిరిజన తెగలు

వందలాది ఏళ్ల చరిత్ర ఉన్న నాగోబా జాతర ఆచార, వ్యవహారాలు చిత్రంగా ఉంటాయి. వందల ఏళ్ల క్రి తం గిరిజనుల మూల పురుషులు కేవలం ఏడుగురు మాత్రమే ఉండేవారు. మూల పురుషులు నాలుగు శాఖలుగా విడిపోయి ఈ నాలుగు శాఖలలోని మొదటి శాఖలో మడావి, మర్సకోలా, కుడ్మేల్, పూరు, పెందూర్, వెడ్మ, మోస్త్రం అనే ఏడుగురు సోదరులుండేవారు.

ఈ ఏడుగురి వల్ల కాలానుగుణంగా అభివృద్ధి చెందిన గిరిజన సంతతికి పై ఏడుగురు అన్నదమ్ముల పేర్లే ఇంటి పేర్లుగా మారాయి. ఏడు ఇళ్ల పేర్లు గల గిరిజనులకు ఆరాధ్య దైవం ఆదిశేషుడు కావడం వల్ల అనాధిగా కేస్లాపూర్ గ్రామంలో వెలిసిన వారి కులదైవం నాగోబా పూజ ఇత్యాది కార్యక్రమాల నిర్వహణ బాధ్యత మోస్త్రానికి అప్పగించారు. కాగా పెద్దవాడన్న గౌరవంతో పుష్యమాస అమావాస్య రోజు జరిగే పూజను మడావికి అప్పగించారు.

అయితే కాలానుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహించే మోస్త్రం వంశం రెండుగా చీలిపోయింది. వాటిలో ఒకటి నాగ్‌భిడే మోస్త్రం, రెండవది భూయ్యాడే మోస్త్రం. ఈ రెండు శాఖల వారి వృత్తుల ఆధారంగా 17శాఖలుగా చీలిపోయినారు. అయినా పూజలు నిర్వహించేది మాత్రం అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మోస్త్రం వంశస్థులకే దక్కింది.

పండుగ చేసుకునే పద్దతి

వృత్తుల ఆధారంగా 17 శాఖలుగా చీలిన మోస్త్రం వంశస్థులలోని కటోడా దివాకర్ గారికి, ఘాడియా సంకేపాయిలర్ వాడే శాఖల వారు కేస్లాపూర్ జాతరకు 16 రోజుల ముందు పుష్యమాస పౌర్ణమికి ఒక రోజు ముందు తమ కులదైవాన్ని పుష్య అమావాస్య రోజున అభిషేకించడానికి పవిత్ర గోదావరి జలం తేవడానికి కాలినడకన బయలుదేరి వెళతారు.

ఇదే వంశంలోని మిగితా శాఖల వారు వారి వెంట వెళతారు. కాని మిగితా ఏడు శాఖల వారు క్రమం తప్పకుండా వెళ్లాలన్నది నియమం. పై ఏడు శాఖలు ముందుగా నాగోబా ఆలయం చేరుకుని కలశం తీసుకొని గోదావరి నదికి బయలుదేరుతారు. వారికి ముందుగా పరధాన తెగ, వాయిద్య గోండ్రు వాయిస్తూ ఉంటే వెనక నుంచి గిరిజనులు వెళుతుంటారు. కేస్లాపూర్‌కు సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న కలమడుగు మండలం సమీపాన ఉన్న గోదావరి నదిలో అస్తమడుగు వరకు అరణ్యం గుండా నడచి వెళ్లి గోదావరి జలం కలశంతో తీసుకుంటారు.

ఈ అస్తమడుగులో గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత ప్రత్యక్షమయి దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్ర జలంగా గిరిజనులు భావిస్తుంటారు.

పుష్యమాసంలో వచ్చే పౌర్ణమినాడు మేస్రం వంశీయులు 20 మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరుతారు. దీంతో జాతర ప్రారంభమైనట్టే. ఆ జలాన్ని తీసుకురావడానికి కెస్లాపూర్‌ నుంచి గోదావరి దాకా కాలినడకన 80 కిలోమీటర్లు వెళ్తారు. కెస్లాపూర్‌ చేరుకొని జాతర ప్రాంగణంలోని గిరిజనులు చెప్పుకునే ప్రాశస్త్యం గల మర్రి చెట్టు కింద విడిదిచేసి అమావాస్యరోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. తరువాతే క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు. 3 సంవత్స రాలకొకసారి పూజారిని మార్చడం ఆనవాయితీ.ఈ నీటిని ఏ పక్షి లేదా జంతువులు ముట్టని నీరు మాత్రమే వీరు తెస్తారు,దాని కోసం వీరు నది అంతటా బాగా వెతుకుతారు. ఏ జంతువులు, పక్షులు ఎంగిలి చేయని నీటిని మాత్రమే కొత్త కుండల్లో తేవడం ఆనవాయితి.

22 పొయ్యిలు మాత్రమే పెడతారు

జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల, గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు (దుగుడు) ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయుల వంతుల వారిగా వంటలు చేసుకుంటారు. మిగితా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు.

సిరికుండలు

ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిల్ల వంశీయులు మాత్రమే నాగోబా కోసం కుండలు తయారుచేయడం ఆచారంగా వస్తోంది. గుగ్గిల్ల వంశీయులకు మెస్రం వంశీయులమధ్య తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి! పుష్యమాసంలో నెలవంక కనిపించిన తరువాత మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లలో సిరికొండకు వస్తారు. అక్కడి గుగ్గిల్ల వంశస్థుడైన కుమ్మరి గుగ్గిల్ల పెద్ద రాజన్న ఇంటికి చేరుకొని కుండలు తయారు చేయాలని కోరుతారు.

వంటల కోసం రెండు పెద్ద కుండలు, (కాగులు), వాటిపై కప్పిపెట్టేందుకు పాత్ర (చిప్పలు), దీపాంతలు, నీటికుండలు కలిపి సుమారు 130కి పైగా కుండల తయారీకి ఆర్డర్ ఇస్తారు. మేస్రం వంశీయులు ఈ కుండల్లోనే గంగా జలాన్ని తీసుకురావడమే కాకుండా, వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు.

పూజా విధానం

జలంతో నిండిన కలశాన్ని ‘పూసిగూడ’ గ్రామానికి లేదా ప్రధాన పూజారి ఉండే నార్నూర్ మండలం గురిజాల గ్రామానికి తెచ్చి అక్కడ ఒక్క రోజు ఉన్న తరువాత కలశం అదే గ్రామంలో ఉంచి గిరిజనులంతా తమ ఇండ్లకు తరలి ఒక దినమంతా పండుగ జరిపి తిరిగి కలశం ఉన్న స్థలానికి చేరుకుంటారు.

ఇక్కడి నుంచి బయలుదేరి కేస్లాపూర్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లిలో ఆగి అక్కడ వెలిసిన ఇంద్రాదేవికి సామూహికంగా పూజలు జరుపుతారు. ఇంద్రాదేవి వెలిసిన నాటి నుంచి ఈ గ్రామానికి ఇంద్ర పేరు వచ్చిందని గిరిజనులు భావిస్తుంటారు. ఇక్కడి నుంచి కేస్లాపూర్ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రిచెట్టు కింద నాలుగు రాత్రులు, ఒక పాకలో మూడు రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉ్న మర్రిచెట్టుపై పవిత్ర జలకలశం భద్రపరిచి, పది కిలోమీటర్ల దూరంలోని సిరికొండ చేరుకుంటారు.

సరిగ్గా పుష్య అమావాస్య రోజున కలశం భద్రపరిచిన మర్రిచెట్టు దగ్గర బావినీరు మట్టి కలిపి ఒక పుట్టను తయారుచేసి ఆలయం పక్కన ఉన్న పూల మందిరాన్ని ఆ మట్టితో అలికి అమావాస్య అర్థరాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగదేవతను అభిషేకిస్తారు.

గోదావరి నదినుంచి తీసుకొచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయాన్నంతా శుద్ధి చేస్తారు. బాజా భజంవూతీలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్షికమాలను నిర్వహిస్తారు. ప్రత్యేక పూజ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలను తెస్తారు. ఒక రాగి చెంబులో పాలను తీసుకుంటారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నిటికీ ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచుతారు.

పుట్టమీది రుమాలు ‘పైకెత్తినట్లు’ కనిపిస్తే పూజా కార్యక్షికమాన్ని ఆరంభిస్తారు. ఇప్పటికీ నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది. పూజా కార్యక్షికమంలో పాట్లాల్, గయిక్ వాడి, హవాల్ దార్ మొదలైన వారు పాల్గొంటారు.

భేటింగ్ కియ్ వాల్ లేదా వధూవరుల పరిచయ వేదిక

మెస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను తప్పక కేస్లాపూర్‌లో నాగోబా దేవుని వద్దకు తీసుకెళతారు. ఆమె చేత ఆ దేవునికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే ‘భేటింగ్ కీయ్‌వాల్’ అంటారు. ఎప్పటి వరకైతే మెస్రం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొనదో అప్పటి దాకా వారు నాగోబా దేవుణ్ని చూడడం, పూజించడం నిషిద్ధం. వధువులు ఇంటి నుంచి ఎడ్లబండి వెనుక వెదురు బుట్టలో పూజసామాక్షిగిని పట్టుకొని, కాలినడకన బయలుదేరతారు.

కేస్లాపూర్‌లోని నాగోబా గుడిని చేరుకుంటారు. పరిచయం చేయాల్సిన వధువులను ‘భేటి కొరియాడ్’ అని పిలుస్తారు. వధువులు ఇద్దరు చొప్పున జతలుగా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగు ధరిస్తారు. పూజా కార్యక్షికమానికి ముందు నాగోబా దేవుని దగ్గరకు వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు. అక్కడి నుంచి శ్యాంపూర్‌లోని (బోడుందేవ్) జాతర అయ్యాక ఎవరి గృహాలకు వాళ్లు వెళతారు.

దర్బార్

జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ఒక ప్రత్యేకత, చరిత్ర ఉన్నాయి. 63 ఏడేళ్ల క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు పరుగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరు వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించాడు. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమండాఫ్ను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు. ఆయన దృష్టి జాతరపై పడింది.

కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్‌ ఏర్పాటు చేయాలని అనుకున్నాడాయన. దీన్ని ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్ 1942లో మొదట నిర్వహించాడు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు  హాజరవుతూ ఉంటారు.

నాగోబా పూజల అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మేస్రం వంశీయుల అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు. అల్లుళ్లు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్లు ఆ మట్టితో పుట్టను మెత్తి (అలికి) మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్లు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరానా అందజేయడం సంప్రదాయం. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు.మరి మీరు కూడా వెళ్లి దర్శనం చేసుకోండి.

Show More
Back to top button