పెట్టుబడుల స్పీడ్.. అభివృద్ధికి బ్రీడ్: గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు మార్క్..!
పెట్టుబడుల స్పీడ్.. అభివృద్ధికి బ్రీడ్: గూగుల్ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు మార్క్..! విశాఖపట్నం ఐటీ ముఖచిత్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తును పూర్తిగా మార్చివేసే ఒక చారిత్రాత్మక ఘట్టంగా సీఎం చంద్రబాబు నాయుడు గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపనను అభివర్ణించారు. విశాఖలోని తర్లవాడలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న ఈ భారీ డేటా సెంటర్ కేవలం ఏపీకే కాదు, మొత్తం దేశానికే ఒక ‘గ్రోత్ ఇంజిన్’గా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్గా ఎదుగుదల
ఏపీ ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు చిరునామాగా ఉంటుందని, టెక్నాలజీ హబ్గా భవిష్యత్తులో తర్లవాడ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుందని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక అంతర్జాతీయ డేటా గేట్వేగా మారుతుందని, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఏపీ టెక్నాలజీ రంగంలో సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుందని ఆయన పేర్కొన్నారు.
భారీ సామర్థ్యం – స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
ఈ ప్రాజెక్టు విశిష్టతను వివరిస్తూ.. ఇది ఒక గిగావాట్ సామర్థ్యంతో పని చేస్తుందని, ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానానికి ఇది నిదర్శనమని చంద్రబాబు చెప్పారు. అదానీ, ఎయిర్టెల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో కలిసి గూగుల్ వంటి గ్లోబల్ జెయింట్స్ విశాఖకు రావడం ఏపీ సాధించిన గొప్ప విజయంగా విశ్లేషించారు.
2028 సెప్టెంబర్ నాటికి ఈ డేటా సెంటర్ పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అంతకంటే రెండు మూడు నెలలు ముందుగానే పనులు పూర్తి చేసేలా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, ప్రాజెక్టులను వేగంగా ప్రారంభించడంలోనూ తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టి
రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోనున్నాయని, ముఖ్యంగా అనకాపల్లి జిల్లా మరో రంగారెడ్డి జిల్లాగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు అంచనా వేశారు. జూలైలో భోగాపురం ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయడం, జూన్ 1న దక్షిణ కోస్తా రైల్వేజోన్ పనులు ప్రారంభం కావడం వంటి అంశాలు విశాఖను గ్లోబల్ సిటీగా మారుస్తాయని వివరించారు.
ఇతర నగరాలతో పోలిస్తే విశాఖలో వ్యాపార నిర్వహణ ఖర్చు (Cost of doing business) చాలా తక్కువగా ఉండటం పెట్టుబడిదారులకు గొప్ప అవకాశం అని చెప్పారు. గూగుల్ రాక అనేది ఏపీ చరిత్రలో ఒక మరచిపోలేని రోజు అని, ఇది రాష్ట్ర అభివృద్ధి వేగాన్ని జెట్ స్పీడ్తో ముందుకు తీసుకెళ్తుందని ఆయన దృఢంగా విశ్వసించారు.
మరిన్ని వార్తలు:
ఉత్తరాంధ్రలో పారిశ్రామిక మహోదయం: ప్రగతి పథంలో ఉత్తమ ఆంధ్ర
వైజాగ్: భారతదేశ డేటా రాజధానిగా అవతరణ – రూ. 3.4 లక్షల కోట్లతో టెక్ దిగ్గజాల పెట్టుబడులు
Google AI Hub: రాష్ట్ర భవిష్యత్తుపై ప్రభావం..?










