
ఎండలు ముదురుతుండటంతో దాహాన్ని తీర్చుకోవడానికి మనలో చాలామంది రంగురంగుల కూల్డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతారు. ఆ క్షణానికి అవి చల్లగా, హాయిగా అనిపించినప్పటికీ, అవి మన శరీరానికి తియ్యని విషంలా పనిచేస్తాయి. ఒక బాటిల్ కూల్డ్రింక్లో సుమారు 10 నుండి 12 చెంచాల చక్కెర ఉంటుంది. మనం వీటిని తాగిన వెంటనే రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. దీనిని నియంత్రించడానికి కాలేయం ఆ చక్కెరను కొవ్వుగా మారుస్తుంది. ఇది కాలక్రమేణా ‘ఫ్యాటీ లివర్’ సమస్యకు, ఊబకాయానికి దారితీస్తుంది.
వీటిలో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ దంతాల పైపొర అయిన ఎనామిల్ను వేగంగా కరిగించేస్తుంది. అంతేకాకుండా, ఇది శరీరంలోని కాల్షియం శోషణను అడ్డుకుంటుంది. దీనివల్ల ఎముకలు సాంద్రతను కోల్పోయి పెళుసుగా మారుతాయి. వీటిలో ఉండే కెఫిన్ మెదడును ఉత్తేజితం చేసి తాత్కాలికంగా ఉత్సాహాన్ని ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా కిడ్నీలపై ఇవి తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి; కూల్డ్రింక్స్లోని రసాయనాలు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి.
డయాబెటిస్, గుండెపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఇవి ప్రధాన కారకాలుగా మారుతున్నాయి. పిల్లలలో ఇవి జ్ఞాపకశక్తిని తగ్గించడమే కాకుండా, వారి శారీరక ఎదుగుదలను దెబ్బతీస్తాయి. కాబట్టి కృత్రిమ రంగులు, రసాయనాలతో కూడిన ఈ పానీయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. వాటికి బదులుగా మన ప్రకృతి ప్రసాదించిన అమృత తుల్యమైన కొబ్బరి నీళ్లు, చల్లని మజ్జిగ, రాగి జావ లేదా తాజా పండ్ల రసాలను తీసుకోవడం వల్ల శరీరానికి శక్తితో పాటు రోగనిరోధక శక్తి కూడా లభిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఈ వేసవిలో కూల్డ్రింక్స్ను పూర్తిగా విస్మరిద్దాం.
మరిన్ని ఆరోగ్య సూచనలు:
ఏసీ’చిల్’.. ఆరోగ్యం’నిల్’!: తక్కువ డిగ్రీల వల్ల వచ్చే ముప్పు ఇదే!










