
కొత్త సిప్ స్కీంను తీసుకొచ్చిన ఎస్బీఐ.. 250లతో ఎస్ బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్త సిప్ స్కీంను ఇటీవల ప్రారంభించింది. సాధారణ, మధ్యతరగతి వారిని లక్ష్యంగా చేసుకొని తీసుకువచ్చిన ఈ పథకంలో సులభంగా సిప్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ ను మరింత మందికి అందుబాటులోకి తెచ్చేలా చేసిన ఎస్బీఐ వినూత్న ప్రయత్నమే.. మ్యూచువల్ ఫండ్ కొత్త సిప్ స్కీం. జన్ నివేశ్ పేరిట క్రమానుగత పెట్టుబడి విధానం (SIP) ద్వారా సిప్ చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది.
మొదటిసారి మదుపు చేసేవారు, చిన్న మదుపర్లు, సెమీ అర్బన్ లో ఉండేవారే లక్ష్యంగా ఈ స్కీంను ఎస్బీఐ ప్రారంభించింది. సెబీ చీఫ్ మాధవీపురి బచ్ సమక్షంలో ఈ స్కీంను ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు.
సాధారణంగా చూసుకుంటే ఎస్బీఐ లో ఇప్పటివరకు రూ.500తో సిప్ చేసే వెసులుబాటు ఉంది. దీన్ని మరింతమందికి చేరువ చేసేందుకు రూ.250కే సిప్ ను అందుబాటులోకి తెచ్చారు. రోజూ, వారం, నెలవారీ.. ఇలా స్థోమతను బట్టి సిప్ విధానంలో మదుపు చేయవచ్చు.
ఎస్బీఐ యోనో యాప్ తో పాటు పేటీఎం, గ్రో వంటి ప్లాట్ ఫామ్స్ లలో ఈ పథకం అందుబాటులో ఉంటుంది. వందలాది కుటుంబాల సంపదను వృద్ధి చేయడంలో ఈ తరహా చిన్న సిప్ స్కీమ్ లు కీలక భూమిక పోషిస్తాయి.
ఈ SIP ద్వారా ఎంత ప్రయోజనం కలుగుతుంది అంటే.. ఉదాహరణకు.. మీరు నెలకి కేవలం రూ. 250 చొప్పున పెట్టుబడిని 25 సంవత్సరాల పాటు కొనసాగిస్తే, ఆ క్రమంలో మీకు సగటు 12% రాబడి వస్తే గనుక మీకు వచ్చే మొత్తం రూ.4,74,409 అవుతుంది. ఆ క్రమంలో మీ పెట్టుబడి రూ.75,000 మాత్రమే ఉంటుంది. కానీ మీకు వచ్చిన మొత్తం రాబడి మాత్రం రూ. 4 లక్షలకుపైగా అవుతుంది. ఆ క్రమంలో మీరు వడ్డీ రూపంలోనే దాదాపు 4 లక్షల రూపాయలు పొందుతారు అన్నమాట.
వెనుకబడిన వర్గాలు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఏ మేరకు ప్రయోజనం పొందుతారో చెప్పేందుకు ఇది మంచి అవకాశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత 20 సంవత్సరాలలో మ్యూచువల్ ఫండ్స్ 15 నుంచి 20 రెట్లు ఎక్కువ రాబడినిచ్చాయి. ఇదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్ (FD), పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ (PPF) లాంటి సంప్రదాయ పెట్టుబడి ఎంపికలు కేవలం 4 నుంచి 5 రెట్లు మాత్రమే లాభాలను అందించాయి.
మరోవైపు భారత స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న గందరగోళం వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు బ్యాంకింగ్ సేవలు చేరువయ్యేలా చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక స్కీమ్స్ ప్రవేశపెడుతూ వస్తోంది. బ్యాంకింగ్ సేవలతో పాటు లోన్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ వంటి ఆప్షన్స్తో ప్రజలు భాగస్వాములయ్యేలా పలు చర్యలు చేపడుతోంది.
తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్త సిప్ స్కీమ్.. జన్ నివేశ్ పేరిట సిప్ (Systematic Investment Plan) ద్వారా కేవలం రూ.250తో సిప్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం విశేషం!