
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడింది. అమెరికా-జపాన్ సంయుక్త భాగస్వామ్య సంస్థ అయిన ‘ప్రొటీరియల్’ (Proterial), తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో తన ప్రతిష్టాత్మక ఎలక్ట్రికల్ స్టీల్ సిటీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ‘మెట్గ్లాస్ ఇండియా’ (Metglas India) పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ ప్లాంట్, ప్రధానంగా విద్యుత్ రంగంలో అత్యంత కీలకమైన ‘అల్లాయ్ రిబ్బన్’ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు తొలి దశలో సంస్థ సుమారు 77 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 640 కోట్లు) భారీ పెట్టుబడిని పెట్టనుంది. పారిశ్రామికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ స్టీల్ సిటీ ఏర్పాటుతో ఏపీలోని తయారీ రంగానికి కొత్త ఊపు రానుంది.
ఈ కర్మాగారం ద్వారా సుమారు 200 మంది స్థానిక యువతకు నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా.. ఎంపికైన అభ్యర్థులకు జపాన్లోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ సీఈవో శాన్స్టాక్ వెల్లడించారు. జపాన్ టెక్నాలజీతో పనిచేసే ఈ ప్లాంట్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తి సాగనుంది. 2026 అక్టోబర్ నుంచి ఈ సంస్థ తన కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. స్థానిక యువతకు ప్రాధాన్యతనిస్తూ.. వారిని గ్లోబల్ టెక్నీషియన్లుగా తీర్చిదిద్దేలా శిక్షణ కార్యక్రమాలను రూపొందించడం ఈ ప్రాజెక్టులో విశేషం.
తొలి దశలో ఈ ప్లాంట్ ఏడాదికి 30 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయనుంది. విద్యుత్ పరికరాల తయారీలో.. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచే అల్లాయ్ రిబ్బన్ల ఉత్పత్తిలో ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. శ్రీసిటీలో ఈ యూనిట్ ఏర్పాటు కావడం వల్ల సమీపంలోని ఇతర విద్యుత్ పరికరాల తయారీ సంస్థలకు ముడిసరుకు లభ్యత సులభతరం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, శ్రీసిటీలో ఉన్న మౌలిక సదుపాయాలు తమను ఆకర్షించాయని ప్రొటీరియల్ ప్రతినిధులు పేర్కొన్నారు. భవిష్యత్తులో డిమాండ్ను బట్టి పెట్టుబడులను, ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.






