CINEMATelugu Cinema

తెలుగు చిత్రసీమలో కరుడుగట్టిన గయ్యాళి పాత్రలకు ప్రసిద్ధి.. ఛాయాదేవి.

చలనచిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను సమ్మోహనపరిచే నటనను కనబరిచే నటీనటులు చాలామందే ఉంటారు. కానీ ప్రతినాయక పాత్రలను, క్రూరమైన, క్షుద్రమైన, దుష్ట పాత్రలను పోషించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గయ్యాళి పాత్రలను పోషిస్తూ కళ్ల ద్వారా గడుసుదనాన్ని ప్రదర్శిస్తూ, అతిశయాన్ని, దురహంకారాన్ని, గయ్యాళితనాన్ని తన చేతలతో చూపుతూ, ఆడంబరాన్ని, అతి ప్రేమని తన నడవడికలో అద్భుతంగా అభినయంచే అతి కొద్దిమంది నటీనటులను వేళ్ళ మీద లెక్కించవచ్చు. అలాంటి వారికి ఉదాహరణగా సూర్యకాంతం, తాడంకి శేషమాంబ మొదలగు వారిని చెప్పుకోవచ్చు. ఆ కోవకు చెందినవారే నటి ఛాయాదేవి. ఆమె పేరు చెప్పగానే మనకు గుర్తుకువచ్చేది పెద్ద పెద్ద కళ్లు, గుండ్రటి ముఖం, బొద్దుగా వుండే శరీరం. తన పెద్ద పెద్ద కళ్లతో, గుండ్రటి ముఖంతో, బొద్దుగా వుండే శరీరం కలిగి, తన పెదవుల కదలికతోనూ చక్కని అభినయం ప్రదర్శించడంలో దిట్ట నటి ఛాయాదేవి.

చిన్నతనం నుండే నాట్యంలో శిక్షణ పొందిన ఛాయాదేవి చలనచిత్ర నటి కావాలనే ఆలోచనతో మద్రాసుకు చేరుకుని మొదటగా “దీనబంధు” (1942) సినిమాలో నటించారు. ఆ తరువాత కొన్నాళ్ళకు “పిచ్చి పుల్లయ్య” (1953) సినిమాలో ఆమె నటనకు ఆమెకు అందిన ప్రశంసలతో పాటు, ఆమెకు అవకాశాలు క్రమక్రమంగా పెరగడంతో ఆమె వెనుతిరిగి చూసుకునే అవకాశమే లేకుండా పోయింది. భర్తను వెర్రి వెంగళప్పలా భావిస్తూ తన చెప్పు చేతల్లోనే ఉంచుకుని మాటకు ఎదురు చెప్పకుండా ఉండేలా వ్యవహరించే గయ్యాళి పాత్రలలో, మారుతల్లి పాత్రలలో నటిస్తూ మారు కూతురుని ఇక్కట్లు పాలు చేసే సవితి తల్లి పాత్రలలో, సొంత కూతురుని ఏడు మల్లెల ఎత్తుగా భావించే కరుణరస ప్రధానమైన తల్లి పాత్రల్లోనే, సాత్విక భూమికల్లో చక్కని అభినయం ప్రదర్శిస్తూ మురిపించేవారు ఛాయాదేవి. వేశ్యమాత పాత్రలలో, హాస్య పాత్రలలో, గడుసుదనం చూసే భార్య పాత్రలో, నమ్మించి ఎదుటి వారిని మాయచేసి మెప్పిచించి, బురిడీ కొట్టించి మోసం చేసే మోసపూరిత పాత్రలో, స్వంత కూతురుపై అతిప్రేమతో వ్యవహారిస్తూ వివిధ భావాల వ్యక్తీకరణలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు ఛాయాదేవి.

నేపథ్యం…

నటి ఛాయాదేవి 1928 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు పట్టణంలో జన్మించారు. దురదృష్టావశాత్తు తన కుటుంబంలో సఖ్యత లేకపోవడంతో తన జీవితం తాను చూసుకోవాల్సి వచ్చింది. అది కూడా ఆమెకు ఒకరకంగా అదృష్టమే. ఛాయాదేవికి చిన్నప్పటినుంచి నాటకాల మీద, నృత్యాల మీద అభిరుచి ఉండేది. ఆ అభిరుచితోనే పొట్ట గడవాలంటే ఏదో ఒక పని చెయ్యాలని సంకల్పించుకుని, తనకు తెలిసిన నాటకాలు, నృత్యంను నమ్ముకుని తనకు బాగా పరిచయం ఉన్న ఓ సన్నితుడితో కలిసి విజయవాడ చేరుకున్నారు. విజయవాడ లోనే రంగస్థల నాటకాలు వేయడం, రంగస్థలం వేదిక మీద నృత్యాలు చేయడం ప్రారంభించారు. అక్కడే ఆమె చలనచిత్ర నటనకు బీజం పడింది. రంగస్థలంపై నటనకు గాను ఆమె తన 14 ఏళ్ల వయస్సులోనే వెండితెర మీద నృత్యం చేసే అవకాశం 1942 వ సంవత్సరం “దీనబంధు” సినిమాతో వచ్చింది. రూపవాణి పిక్చర్స్ నిర్మాణంలో, దర్శకుడు ఎం.ఎల్.టాండన్ తెరకెక్కించిన “దీనబంధు” ఆమెకు తొలిచిత్రం. ఓ చారిత్రాత్మక సందర్భంతో ముడిపడి ఉన్న ఈ చిత్రం ఆమె సినీ ప్రస్థానానికి అంతగా ఉపయోగపడకపోయినా, నటిగా చలనచిత్రసీమలో తొలి అడుగు పడేలా చేసింది.

“పిచ్చి పుల్లయ్య” (1953) తో తిరుగులేని నటిగా…

దీనబంధు (1942) సినిమాలో నటించిన ఛాయాదేవికి తాను నటించిన మొదటి సినిమా అంతగా తృప్తి ఇవ్వకపోయినా తన అసంతృప్తి పడలేదు. ఆ తరువాత చంద్రలేఖ (1948) లో కూడా తనకు నృత్యం చేసే పాత్ర లభించింది. అడపాదడపా వచ్చే అవకాశాలను వదులుకోకుండా, వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడానికి కారణం వాటి పారితోషికంతో వచ్చిన సంపాదన ఆధారంతో తన జీవితం గడుస్తుందనే ఆశ. అలా ఒక్కో సినిమా నటిస్తున్న ఛాయాదేవికి నందమూరి తారకరామారావు తన సొంత నిర్మాణం నేషనల్ ఆర్ట్స్ పతాకంపై తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో తెరకెక్కిన “పిచ్చి పుల్లయ్య” (1953) చిత్రంలో ఛాయాదేవి జమీందారిణి పాత్ర పోషించారు. ఈ పాత్రతో ప్రేక్షకులను మెప్పించడంతో ఛాయాదేవి నటనా జీవితం మలుపు తిరిగింది. 1953 లో విడుదలైన “పిచ్చి పుల్లయ్య” సినిమా వాణిజ్యపరంగా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనా కూడా సందేశాత్మకమైనది కావడంతో విమర్శకుల ప్రశంసలు లభించాయి. అప్పటినుండి ఆమెకు పొగరు కలగలిసిన పాత్రలు రావడం మొదలయ్యాయి. కరుణ లేని గయ్యాళి పాత్రలు ఎక్కువగా రావడం ప్రారంభించాయి.

దక్షయజ్ఞం (1962) లో వేశ్య పాత్రలో…

పిచ్చి పుల్లయ్య (1953) సినిమా తరువాత అవకాశాలు క్రమక్రమంగా పెరిగాయి. భర్తను వెర్రి వెంగళప్పలను చేసి తన చెప్పు చేతల్లో పెట్టుకుని తన మాటకు ఎదురు చెప్పకుండా ఉండేలా వ్యవహరించే పరమ గయ్యాళి పాత్రల్లో, మారు తల్లిగా ఉంటూ, మారు కూతురుని ఇబ్బంది పెట్టే సవితి తల్లి పాత్రల్లో, కన్న కూతురుని పై కరుణరసం ప్రదర్శించే తల్లి పాత్రల్లో నటిస్తూనే, మరోవైపు సాత్విక పాత్రల్లో చక్కని అభినయం ప్రదర్శిస్తూ ప్రేక్షకులను మురిపించేవారు. సంపూర్ణ రామాయణం (1959) లో మంధరగా, ఎన్టీఆర్ 100 వ చిత్రం అయిన దక్షయజ్ఞం (1962) లో ఒక ప్రత్యేక పాత్రలో మనోరంజని అనే వేశ్యగా , శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) లో మిక్కిలినేని బలరాముడుగా నటించగా, ఆయనకు జోడీగా “రేవతి దేవి” పాత్రలో నటించారు ఛాయాదేవి. అలాగే ప్రమాలార్జునీయం (1965) లో ప్రమాల రాజ్యంలో సేనాని “రణచండి” లా, మోహినీ భస్మాసుర (1966) లో “శజీదేవి” గా , శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ (1966) లో నాగనిశింభ రాజుగా నటించిన ఎస్.వి.రంగారావు కు భార్య నాగనిశింభ రాణిగా, సుజాతగా నటించిన జమునకు తల్లిగా నటించి, తన కూతురుపై ప్రేమాభిమానాలు చూపే పాత్రలో ఆమె నటించారు. అదేవిధంగా కృష్ణావతారం (1967) లో శిశుపాలుడుగా నటించిన రాజనాలకు తల్లిగా , అలాగే ఉమాచండీ గౌరీశంకరుల కథ (1968) లో శేషయ్యమ్మగా అద్భుతమైన నటనను ఛాయదేవి ప్రదర్శించారు.

గుండమ్మ కథ (1962)…

గుండమ్మ కథ సినిమాలో ఛాయాదేవి నటించిన పాత్ర‌లో ముందుగా క‌న్నాంబ‌ను తీసుకుందామ‌ని ద‌ర్శ‌కులు కమలాకర కామేశ్వరరావు సిద్ధ‌మ‌య్యారు. కానీ క‌న్నాంబ ఆ స‌మ‌యానికి  తీరికలేకుండా ఉన్నారు. ఆమె కాల్ షీట్లు ఖాళీగా లేక‌పోవ‌డంతో ఆ పాత్రను తొలగించాలని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ కలుగజేసుకుని ఆ అవ‌కాశం ఛాయాదేవికి ఇవ్వాల‌ని సూచించారు. కథనాయకుల క‌న్నా ఎక్కువగా పారితోషికం తీసుకునే ఛాయాదేవిని ఆ పాత్రకు తీసుకోవడం నిర్మాతలు బి.నాగిరెడ్డి , చక్రపాణి లకు ఇష్టం లేదు. పాత్ర బాగున్న‌ప్పుడు ఎక్కువ పారితోషికం ఇస్తే త‌ప్పులేదులే అని ఎన్టీఆర్ ఒప్పించి మ‌రీ ఛాయాదేవికి అవ‌కాశం ఇప్పించారు. అలా మొదటిసారిగా సూర్యాకాంతం, ఛాయాదేవి ఎదురుదురుగా క‌లిసి న‌టించారు. దీంతో సన్నివేశాలు అద్భుతంగా పండాయి. దీనికంటే ముందుగానే వీరిద్దరూ “మాయాబ‌జార్” (1957) సినిమాలో న‌టించారు. కానీ అందులో ఇద్ద‌రు ఎదురుప‌డే సన్నివేశం గానీ, సంద‌ర్భం గానీ ఆ సినిమాలో లేదు. అందువలన ఎన్టీఆర్ ప‌ట్టుబ‌ట్టి గుండమ్మ కథ ఈ సినిమాలో ఛాయాదేవికి అవకాశం ఇప్పించారు. ఈ సినిమాలో ఈ ఇద్ద‌రు ఒకరినొకరు ఎదురు ప‌డే సంద‌ర్భాలు, వారిరువురు కొట్టుకోవ‌డాలు, తిట్టుకోవ‌డాలు ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆక‌ర్షించాయి. దాంతో ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించడం తెలిసిందే.

సూర్యకాంతం – ఛాయాదేవి జంట అభినయం…

నిజానికి ఛాయాదేవి, సూర్యాకాంతం ఇద్ద‌రూ కూడా గ‌య్యాళి పాత్ర‌ల‌కు పెట్టింది పేరు. వీరిద్ద‌రూ కూడా ప్ర‌తినాయిక పాత్ర‌ల్లో ఇట్టే ఇమిడి పోవ‌డ‌మే కాకుండా, సినిమా చూస్తున్నంత సేపూ క‌న్ను తిప్పుకోకుండా న‌టించేవారు. వీరు ఎంత గ‌య్యాళిగా ఉన్నా కూడా వీరిద్ద‌రి కలయిక మాత్రం అద్భుతమైన విజయాలు సాధించిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. “ఇవి పిడకలు కొట్టిన చేతులే నాతో పెట్టుకోకు” అని ఛాయాదేవి పెడసరంగా సావిత్రితో “గుండమ్మ కథ” లో హెచ్చరించడం అందరికీ సుపరిచితమే.

అదే చిత్రంలో సూర్యకాంతాన్ని చూస్తూ “నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావే, మొగుడు చచ్చినా బర్మా ముడి వేసుకుని మహిళా మండలిలో తైతక్కలాడుతున్నావే” అని ఛాయాదేవి అనడం, ఆ తరువాత ఆమె సూర్యకాంతంతో కలిసి పోట్లాడడం, అవకాశం దొరకగానే ఆమెను కొట్టి గదిలో పెట్టి గొళ్లెం పెట్టడం, ఆ తరువాత ఎన్.టి.రామారావు రావడం,  గుండక్క పాత్రధారిణి అయిన సూర్యకాంతం, దుర్గమ్మ పాత్రలో ఉన్న ఛాయాదేవికి దానికి తగిన శాస్తి చేసే సన్నివేశాలలో చక్కగా అభినయించారు.

గుండమ్మ, చిట్టెమ్మ లను చితకబాది ఆ దొడ్లో పడేసా అని టెంపరితనం చూపించే ఛాయాదేవి, తన హాస్యంతో బాటు చూసే వారికి ఆమె మీద కోపమూ వస్తుంది. అలా దుర్గమ్మగా వివిధ సందర్భాలలో రెచ్చిపోయిన సన్నివేశాలు ఎప్పటికీ తాజాగానే వుంటాయి. సూర్యకాంతం – ఛాయాదేవిలు ఇద్ద‌రు క‌లిసి న‌టించిన సినిమాలు చాలా తక్కువే అయినా తొలిసారి మాత్రం గుండమ్మ కథ (1962) సినిమాలో ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. అలాగే “నవరాత్రి” చిత్రంలో సూర్యకాంతంతో కలిసి ఛాయాదేవి రాక్‌ఎన్‌రోల్ నృత్యం చేసిన విధానం ప్రేక్షకులకు వినోదాన్ని కలిగిస్తుంది.

పలు చిత్రాలలో భిన్నమైన పాత్రలతో…

“ఆడ పెత్తనం” (1958) లో మాచమ్మగా మారని రూపాయి అని అందరూ అంటుంటే ఉడుక్కునే పాత్రలో ఛాయాదేవి మెప్పించారు. అదృష్ట వంతులు (1969) చిత్రంలో పెసరట్ల పేరమ్మ (సూర్యకాంతం) వీధి హోటల్‌కి పోటీగా, పెసరెట్ల పేరమ్మ (ఛాయాదేవి) అవతారంలో తన నటనతో కనువిందు చేస్తారు. 1973 వ సంవత్సరంలో వచ్చిన “మీనా” చిత్రంలో గుమ్మడితో తనకు తప్పిపోయిన పెళ్లి తలుచుకుంటూ “రాత బాగుంటే ముత్తయిదువులా ఇలా వుండేదాన్ని” అని ఎగేస్తూ చేతిలోని బిందె ఢమాల్‌మని పడేసి మూతి విచిత్రంగా తిప్పుతూ కనిపిస్తుంటుంది. జ్యోతి (1976) చిత్రంలో గుమ్మడి, జయసుధ మాటలు వినడానికి , దొంగచాటుగా కిటికీ పక్కకు చేరి, వేడి కాఫీ మీద పడగానే కిటికీ అందంగా వుందని చూస్తూ నిలబడ్డాను అని వివరణ ఇస్తూ ఛాయాదేవి “నా ఉసురు పోసుకుంటావు” అని జయసుధని హెచ్చరించి చకచక వెళ్లి పోవడంలో తన తీరే వేరే అని తన నటనతో నిరూపించుకున్నారు. యమగోల (1977) చిత్రంలో జయప్రద ఇంట్లో వంట మనిషి సుబ్బమ్మగా వుంటూ సత్యనారాయణ మీద ఆసక్తి, అనురక్తి పెంచుకుంటూ, అల్లు రామలింగయ్యతో పెడసరంగా మాట్లాడి రక్తికట్టిస్తారు ఛాయాదేవి. “బుర్రిపాలెం బుల్లోడు” (1979) చిత్రంలో అల్లు రామలింగయ్య భార్యగా నటించిన ఛాయాదేవి అతడిని పక్కకు పిలిచి “మీ కేమైనా బుద్ధుందా? ఛీ నోర్ముయ్! ఏమిటా లేకి తిండి ఆయన ముందు. నీవాలకం చూస్తుంటే మనకు కోట్లు కాదు కదా తుండుగుడ్డ కూడా లేదని అర్థమైపోతుంది. అందంగా తిని హుందాగా మాట్లాడు అని హెచ్చరిస్తూనే సలహా ఇస్తారు.

మరణం…

పూజా ఫలం (1964) సినిమాలో నీలా నాగినిగా నటించిన ఎల్.విజయలక్ష్మి తల్లిగా వేశ్యమాత పాత్రలో, భలే అమ్మాయిలు (1957) లో జమిందారిణిగా, పెళ్లినాటి ప్రమాణాలు (1958) చిత్రంలో రమణా రెడ్డి కి సలహాలిస్తూ గడుసుదనం చూసే భార్య పాత్రలో, పాడిపంటలు (1976) సినిమాలో శేషమ్మగా ఛాయాదేవి అలరించారు.

సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960) లో రమణా రెడ్డి భార్యగా హాస్య పాత్రలో , పరమానందయ్య శిష్యులు కథ (1966) లో పరమానందయ్యగా నటించిన నాగయ్యకు భార్యగా, రాజకోట రహస్యం (1971) లో టెంకాయల వెంకమ్మగా,  అగ్గి దొర (1967) లో రత్నగిరి రాణిగా ధూళిపాళి సరసన మారుటి కూతురు భారతిని ఇక్కట్ల పాలు చేస్తూ, స్వంత కూతురు విజయలలితపై అతిప్రేమతో అగ్గి దొరపై ప్రేరేపిస్తూ, వివిధ భావాల వ్యక్తీకరణలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు ఛాయాదేవి.

చిట్టితమ్ముడు (1962), సంబరాల రాంబాబు (1970), అత్తలు కోడల్లు (1971),  దసరాబుల్లోడు (1971), అంతా మన మంచికే (1972), గంగ మంగ (1973) ఇలా పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రక మొదలగు 200 పైగా చిత్రాలలో నటించి ఏ తరహా పాత్రనైనా మెప్పించగలనని నిరూపించుకున్నారు. చక్కని విరుపుతో, సరైన సమయంలో సంభాషణని పలుకుతూ, పాత్రానుగుణంగా పెడసరాన్ని, గయ్యాళిదనాన్ని, శాంతాన్ని, కరుణని, హాస్యాన్ని సహజంగా వ్యక్తీకరించి చక్కని గుణచిత్ర నటిగా నిరూపించుకున్న ఛాయాదేవి మధుమేహ వ్యాధితో 1983 వ సంవత్సరంలో తన 55 వ యేట కన్నుమూశారు.

Show More
Back to top button