CINEMATelugu Cinema

తెలుగు తెరపై నవ్వుల పువ్వులు పూయించిన దర్శకులు.. ఇ.వి.వి. సత్యనారాయణ.

నవ్వు గురించి తెలిసిన మహానుభావులు “నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం” అన్నారు. మనిషి తనకు తాను తయారుచేసుకునే అద్భుత సౌందర్య సాధనం నవ్వు. నవ్వుకు మరే ఇతర సౌందర్య సాధనమూ సాటి రాలేదు, సాటి రాదు కూడనూ. అలాంటి ఒక నవ్వును తెప్పించే వినోద సాధనం సినిమా. ప్రేక్షకుడు మానసిక ఒత్తిళ్ల నుండి కొంత ఉపశమనం పొందడం కోసం సినిమాకు వెళతాడు. సినిమా కూడా హాస్య ప్రధానంగా సాగితే, సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు సమ్మోహనపరుడై బాధలను, ఒత్తిళ్లను మరచిపోయి ఆనందంగా బయటకు వస్తాడు. 

హాస్య ప్రధానమైన చిత్రాలు తీయగలిగే దర్శకులు చాలా మందే ఉన్నా కూడా వారిలో ప్రముఖంగా జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, రేలంగి నరసింహారావు, జి. నాగేశ్వర్ రెడ్డి పేర్లు మనకు వినిపిస్తాయి. కేవలం ఒకే ఒక్క నెల తేడాతో 1981 లో ఇద్దరు దర్శకులు తెలుగు చిత్రపరిశ్రమకు తమ తమ సినిమాలతో అరంగేట్రం చేశారు. “నేను మా ఆవిడ” అనే సినిమాతో ఆగస్ట్‌ నెలలో రేలంగి నరసింహారావు దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయితే, “ముద్ద మందారం” అనే చిత్రంతో సెప్టెంబరు నెలలో దర్శకులు జంధ్యాల పరిచయమయ్యారు. తరువాత కాలంలో వీరిద్దరూ దర్శకులు తెలుగు సినిమా పరిశ్రమకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిపోయారు. అలా తెలుగు సినిమా మరొక ఆణిముత్యాన్ని తన అక్కున చేర్చుకుంది. ఆయనే ఇ.వి.వి. సత్యనారాయణ.

హాస్య ప్ర‌ధాన చిత్రాలు తెరకెక్కించడంలో ప్రావీణ్యాన్ని సంపాదించిన ద‌ర్శ‌కులు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి వద్ద సహాయ దర్శకుడిగా చేరిన ఇ.వి.వి. సత్యనారాయణ సుమారు 8 సంవ‌త్స‌రాల్లో 22 సినిమాల‌కు ప‌నిచేశారు. “నాలుగు స్తంభాలాట‌”, “అహ‌నా పెళ్ళంట‌”, “రెండు రెళ్లు ఆరు”, “రెండు జెళ్ల సీత” మొదలైన సినిమాలకు దర్శకత్వం చేసిన జంధ్యాల వద్ద శిష్యరిఖం చేసి, డి. రామానాయుడు ఇచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకుని “చెవిలో పువ్వు” తో దర్శకుడిగా వెండితెర అరంగేట్రం చేసి, “ప్రేమఖైదీ” సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న ఇ.వి.వి. సత్యనారాయణ తన సినిమాలన్ని కూడా ఆద్యంతం నవ్వులు పూయించే సినిమాలుగా తీర్చిదిద్ది, హాస్యప్రియుల అభిమానాన్ని చూరగొన్నారు.

హాస్య సినిమాలకు ఒక బ్రాండ్‌ అంబాసిడర్ గా మారిపోయిన ఇ.వి.వి. సత్యనారాయణ హాస్యమే ప్రధానంగా తీసుకుని సినిమాలు తీసి విజయాలు దక్కించుకున్నారు. ఆ క్రమంలో ఇ.వి.వి. సత్యనారాయణ వరుసగా “ప్రేమఖైదీ” సినిమాతో మొదలుపెట్టి “హలో బ్రదర్” వరకు సుమారు 11 చిత్రాలకు వరుస విజయాలు అందుకున్నారు. జంధ్యాల ఒరవడిలో హస్యప్రధాన చిత్రాలు నిర్మించారు. జంధ్యాల కంటే కొంతఘాటైన హస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు. ఆయన తెలుగు చిత్రాలలో మొత్తం 51 చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా అనేక మంది నటులను తెలుగు సినిమాకు పరిచయం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అందరి అగ్రనటులతో సినిమాలు తీసిన ఇ.వి.వి సత్యనారాయణ తన కుమారులు ఇద్దరినీ తెలుగు వెండితెరకు పరిచయం చేశారు. 50 పైచిలుకు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇ.వి.వి సత్యనారాయణ తక్కువ సమయంలో తన 54 సంవత్సరాల వయస్సులో మరణించారు.

జీవిత విశేషాలు…

జన్మనామం  :   ఈదర వీర వెంకట సత్యనారాయణ

ఇతర పేర్లు   :    ఇ.వి.వి. సత్యనారాయణ

జననం   :     10 జూన్ 1958

స్వస్థలం :    కోరుమామిడి, ఆంధ్రప్రదేశ్, ఇండియా

వృత్తి   :       సినిమా దర్శకుడు, నిర్మాత

జీవిత భాగస్వామి     :      సరస్వతి కుమారి

తండ్రి         :       వెంకటరావు

తల్లి          :       వెంకటరత్నం

మరణ కారణం   :    గుండెపోటు

మరణం      :     21 జనవరి 2011

నేపథ్యం…

ఈదర వీర వెంకట సత్యనారాయణ (ఇ.వి.వి. సత్యనారాయణ) 10 జూన్ 1956 నాడు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా దొమ్మేరు గ్రామంలో జన్మించారు. ఆయన తల్లి వెంకటరత్నం, తండ్రి వెంకట్రావు. వారిది వ్యవసాయ కుటుంబం. వారికి 70 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. అప్పట్లోనే వాళ్ళకు ఒక ట్రాక్టరు ఉండేది. సత్యనారాయణ కు పదమూడు ఏళ్ల వయస్సులోనే బుల్లెట్ బండి ఉండేది. తన బాల్యం అంతా కూడా దొమ్మేరు లోనే సాగింది. పదవ తరగతి వరకు దొమ్మేరులోనే చదువుకున్న సత్యనారాయణ ఇంటర్మీడియట్ నిడదవోలు లో చదువుకున్నారు. 

నిడదవోలులో ఐదు చిత్ర ప్రదర్శనశాలలు (సినిమా హాలులు) ఉండేవి. నిడదవోలులో ఇంటర్మీడియట్ లో చేరిన సత్యనారాయణ రోజుకు రెండు, మూడు సినిమాలు చూస్తుండేవారు. ఆయనకు ఎన్టీఆర్, అమితాబచ్చన్ ఆయనకు అభిమాన నటులు. కళాశాల ఎగ్గొట్టి సినిమాలు చూడడం వలన హాజరు శాతం తక్కువ కావడంతో ఇంటర్మీడియట్ పరీక్షలు వ్రాయడానికి వీలు లేకపోయింది. దాంతో చదువు అక్కడితో ఆపేసి వ్యవసాయం చూసుకోవడం మొదలుపెట్టారు. తనకు 19 సంవత్సరాల వయస్సులో నవంబరు 1976 లో సరస్వతీ కుమారితో సత్యనారాయణ పెళ్లి జరిపించారు. జీవితం పట్ల ఎలాంటి అవగాహన, ప్రణాళిక లేని సమయంలో ఆయనకు పెళ్లి జరిపించారు. పెళ్ళైన మరుసటి సంవత్సరం ఆర్యన్ రాజేష్, ఆ తరువాత సంవత్సరం అల్లరి నరేష్ జన్మించారు.

ఓడలు బండ్లయ్యి, 70 ఎకరాలు అమ్మేసి… 

పెళ్లి తరువాత సత్యనారాయణ పూర్తిగా వ్యవసాయంలోకి వచ్చేశారు. పరిస్థితి తారు మారైంది. వ్యవసాయంలో వరుసగా మూడు సంవత్సరాలు విపరీతమైన నష్టాలు వచ్చాయి. భార్య, ఇద్దరు పిల్లలు, అమ్మ, నాన్న, ఇద్దరు తమ్ముళ్లు, చెల్లెలు  ఇలా సత్యనారాయణతో కలిపి తొమ్మిది మంది సభ్యులు ఉన్న తన కుటుంబం వీధిన పడ్డ పరిస్థితి అయ్యింది. ఉన్న 70 ఎకరాల పొలం అమ్మేసి అప్పులు కట్టేశారు. అప్పటివరకు గౌరవంగా బ్రతికిన రైతు కుటుంబం కాస్త రైతు కూలీలుగా మారిన దుస్థితి ఏర్పడింది. ఆర్థికంగా ఏ కొరతా లేకుండా వైభవంగా బ్రతికిన కుటుంబం, ఒక్కసారిగా కష్టాల పాలవ్వడంతో దిక్కు తోచని స్థితి ఎదురైంది. సత్యనారాయణ కుటుంబం పూటకు గడవలేని స్థితికి వచ్చింది.

ఇంటికి పెద్ద కొడుకు తనే అయినందున ఏదో ఒకటి చేసి కుటుంబ భారాన్ని మోయాలి తప్పదు. కానీ తాను చదువిన చదువులకు గొప్ప ఉద్యోగాలు రావు. కానీ గొప్పగా బ్రతకాలి ఎలా అని ఆలోచించడం మొదలుపెట్టారు సత్యనారాయణ. తాను ఊహించిన గొప్ప జీవితం దక్కాలంటే సినిమా రంగమే సరైనదని తన మిత్రులు ఎవరో చెప్పారు. కానీ సినిమాల లోకి ప్రవేశించడం ఎలా అని ఆలోచిస్తుండగా, తనకు బాగా ఆప్త మిత్రుడైన సుబ్బరాజుకు చిత్ర పరిశ్రమలో ఉన్న కొద్దిపాటి పరిచయాల దృష్ట్యా సుబ్బరాజు మేనమామ నవత ఫిలిమ్స్ అధినేత అయిన “నవత కృష్ణంరాజు” కు ఒక సిఫారసు లేఖ పంపించారు సుబ్బరాజు. ఏదో పండగకు తన ఆవిడని పుట్టింటికి పంపించి, తాను కూడా అత్తగారింటికి వెళుతున్నానని ఇంట్లో చెప్పిన సత్యనారాయణ తన జేబులో 85 వేసుకొని, మిత్రుడు సుబ్బరాజు ఇచ్చిన సిఫారసు లేఖను తీసుకొని మద్రాస్ మెయిల్ ఎక్కారు.

చిత్ర రంగ ప్రవేశం…

ఎట్టకేలకు మద్రాసు సెంట్రల్ బస్సుప్రాంగణంలో దిగారు సత్యనారాయణ. అప్పటికే కుండపోత వర్షం కురుస్తుంది. తాను తెచ్చుకున్న డబ్బులు తక్కువే. వాటిని పొదుపుగా వాడుకోవాలని నిర్ణయించుకున్న సత్యనారాయణ సెంట్రల్ బస్సు స్టేషన్ నుండి టీ. నగర్ వరకు కురుస్తున్న వర్షంలో తడుచుకుంటూ “నవతా కృష్ణంరాజు” ను కలిసి సుబ్బరాజు పంపించిన సిఫారసు లేఖను ఆయనకు చూపించారు. ఆ లేఖను చదివిన నవతా కృష్ణంరాజు “నా దగ్గర ప్రస్తుతం అవకాశం ఏమీ లేదు. ఏదైనా ఉంటే తరువాత చెబుతాను. ఎలాగో వచ్చావు కదా! రెండు రోజులు ఉండి ఊరు చూసి వెళ్ళిపో” అని చెప్పి వెళ్ళిపోయారు.

దాంతో చేసేది లేక ఆఫీసులో పనిచేసే కుర్రాడు శంకర్ రూములో 60 రూపాయల అద్దెలో తాను కూడా 15 రూపాయలు ఇచ్చి కొన్నరోజులు ఉండిపోయారు సత్యనారాయణ. రాత్రి పూట ఆ అద్దె గదిలో పడుకోవడం, ఉదయం నవతా కార్యాలయానికి వెళ్లి కృష్ణంరాజుకు కనిపించడం చేసేవారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 7 గంటలకు ఇలా రోజుకు నాలుగు సార్లు చొప్పున ప్రతీ రోజు ఆయనకు సత్యనారాయణ కనిపించేవారు. అలా పాతిక రోజుల్లో ఆయనను వందసార్లు కలిసారు. 26వ రోజున సత్యనారాయణను పిలిచిన కృష్ణంరాజు, ఆయన దేవదాసు కనకాల దర్శకత్వంలో నిర్మించే ఒక సినిమాకి సహాయ దర్శకుడిగా తీసుకుంటానని చెప్పి, దానికి ఇంకా నెల రోజులు సమయం ఉన్నందున ఈ లోపు ఊరెళ్ళి వచ్చేయ్ అన్నారు.

సహాయ దర్శకుడిగా “ఓ ఇంటి భాగవతం” (1980)..

నవతా కృష్ణంరాజు చెప్పినట్లుగానే దేవదాసు కనకాల దర్శకత్వంలో “ఓ ఇంటి భాగవతం” చిత్రానికి సత్యనారాయణ సహాయకులుగా చేరారు. అవకాశం వచ్చిందే అదృష్టంగా భావించిన సత్యనారాయణ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు చూసుకుంటూనే ఎడిటింగ్ రిపోర్ట్ వ్రాసుకునేవారు. తొలి షెడ్యూలు పూర్తిచేసుకునేసరికి సత్యనారాయణ పనితనం చూసి దర్శకులు దేవదాసు కనకాల ప్రశంసించేవారు. మంచి సహాయకుడిని నాకు మీరు ఇచ్చారండి అని నవతా కృష్ణంరాజుతో అనేవారు దేవదాసు కనకాల. నిజానికి సహాయకుడికి పారితోషికం ఇచ్చే పద్ధతి లేదు. కానీ సత్యనారాయణ పని తీరు విపరీతంగా నచ్చిన నవతా కృష్ణంరాజు సహాయకుడిగా ఉన్న సత్యనారాయణకు పారితోషికంగా ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు. నవతా ఫిలిమ్స్ సంస్థలో “ఓ ఇంటి భాగవతం” చిత్రం పూర్తయిన తరువాత దర్శకులు దేవదాసు కనకాల తనతోబాటే సత్యనారాయణను తీసుకెళ్లారు. ఆయన దర్శకత్వంలో వాసిరాజు ప్రకాశం నిర్మాతగా రోజులు మారాలి (1980) చిత్రాన్ని తెరకెక్కించగా దానికి కూడా సత్యనారాయణను సహాయకుడిగా తీసుకున్నారు. ఆ చిత్రానికి సహాయకుడిగా ఉన్న సత్యనారాయణకు నెలకు 300 రూపాయలు పారితోషికం ఇచ్చేవారు. దాంతో ఎలాగోలా సర్దుకుని ఆయన తన భార్య పిల్లలను మద్రాసుకు తీసుకువచ్చారు.

జంధ్యాల వద్ద సహాయకుడిగా..

“ఓ ఇంటి భాగవతం” (1980) సినిమా తరువాత “పుణ్య భూమి కళ్ళు తెరిచింది” (1982), “నాగవల్లి” సినిమాలకు దేవదాస్ కనకాల వద్ద సహాయకుడిగా పనిచేశారు. సినిమాలు వాణిజ్యపరంగా నష్టాలు తెచ్చిపెట్టడంతో దర్శకుడిగా దేవదాసు కనకాలకు సినిమాలు లేకుండా పోయాయి. దాంతో సత్యనారాయణకు అవకాశాలు లేవు. అందువలన ఆయన డైలామాలో పడ్డారు. ఆ తరువాత అవకాశాల కోసం ఎంతో మంది దర్శకులను కలిశారు. ఎవ్వరూ అవకాశాలు ఇచ్చేవారు కాదు. చివరికి దాసరి నారాయణ రావుని కలిశారు. కానీ ఆయన వద్ద 40 మందికి పైగా సహాయ దర్శకులు ఉండేవారు. దాసరి నారాయణ రావు స్వగ్రామం పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా) కావడంతో సత్యనారాయణతో (ఈయనది కూడా పశ్చిమ గోదావరి జిల్లా) ఆప్యాయంగా మాట్లాడారు, అవకాశం ఉంటే చెబుతాను అన్నారు. చేసేది లేక మళ్ళీ నవతా కృష్ణంరాజును కలిసిన సత్యనారాయణ పరిస్థితిని వివరించారు. అప్పటికే ఆయనంటే మంచి అభిప్రాయం ఉన్న నవతా కృష్ణంరాజు తాను నిర్మిస్తున్న తరువాత చిత్రం “నాలుగు స్థంభాలాట” కు సహాయకుడిగా పెట్టుకోమని దర్శకులు జంధ్యాలకు చెప్పారు. అప్పటికే ఆయన వద్ద నలుగురు సహాయకులు ఉన్నారు. అయినా కూడా నిర్మాత చెప్పడంతో తప్పనిసరై ఒప్పుకున్నారు.

జంద్యాల దగ్గర సహాయకుడిగా 22 సినిమాలు…

కొత్తగా చేరిన సహాయకులను పైనున్న వారు, పైనున్న వారిని ఆపైనున్న వారు తొక్కడానికి ప్రయత్నిస్తూ ఉండడం సినిమా పరిశ్రమలో సర్వసాధారణం. జంధ్యాల దగ్గర నాలుగు స్తంభాలాట (1982) సినిమాకు సహాయకుడిగా చేరిన సత్యనారాయణకు అక్కడ పనిచేస్తున్న సీనియర్ సహాయకుల నుండి ఇబ్బంది ఎదురయ్యేది. ఏ రంగంలో అయినా ఎదగాలంటే కష్టపడడం ఒక్కటే మార్గం, ఎవరేమన్నా, ఎవరేమనుకున్నా పట్టించుకోకూడదు అని నిర్ణయించుకున్నారు. సహాయక దర్శకత్వ పనులే కాకుండా చిత్రీకరణలో ఉన్న అన్ని పనులు చూసుకునేవారు సత్యనారాయణ. 

అలా ఆయన జంధ్యాల దృష్టిని ఆకర్షించారు. ప్రతీ పనికి ఆయననే పురమాయించేవారు. ఇట్టి విషయాన్ని సీనియర్ సహాయకులు జీర్ణించుకోలేకపోయేవారు. మంది సహాయకులను ఇచ్చారని నవతా కృష్ణంరాజు కు కితాబిచ్చారు జంధ్యాల. అంతే కాకుండా “నాలుగు స్థంభాలాట” సినిమా టైటిల్స్ లో అసోసియేట్ దర్శకుడు ఇ.వి.వి సత్యనారాయణ అని పేరు వేయడమే కాకుండా ఆ రోజుల్లో 5000 రూపాయలు పారితోషికం కూడా ఇచ్చారు. “నాలుగు స్తంభాలాట” విడుదలై సిల్వర్ జూబ్లీ విజయం సాధించడంతో జంధ్యాల వద్దనే కొనసాగారు. ఆయన దర్శకత్వంలో వరుసగా “మూడు ముళ్ళు”, “మొగుడు పెళ్ళాలు”, “రెండు రెళ్ళు ఆరు”, “ఆనంద భైరవి” ఇలా సుమారు ఎనిమిది సంవత్సరాలలో సుమారు 22 సినిమాలకు పనిచేశారు.

దర్శకుడిగా తొలి సినిమా “చెవిలో పువ్వు” (1990)…

డి. రామానాయుడు నిర్మాణంలో జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఆహా నా పెళ్లంట”. చిత్ర నిర్మాణంలో ప్రతీ విషయాన్ని స్వయంగా పర్యవేక్షించే గొప్ప లక్షణం ఉండటం వలన రామానాయుడు ప్రతీ ఒక్కరినీ గమనిస్తూ ఉండేవారు. మరుసటి రోజు తీయబోయే సన్నివేశాలు, ఏమిటి? అందుకు కావాల్సిన వసతుల గురించి సత్యనారాయణతో చర్చించేవారు. ఈయన క్రమశిక్షణ, పనితనం మెచ్చిన రామానాయుడు ఆయనను పిలిచి ఓ మంచి కథ తెచ్చుకో, దర్శకుడిగా నీకు అవకాశం ఇస్తాను అన్నారు. “ఆహా నా పెళ్లంట” సినిమా ఘన విజయం సాధించడంతో ఇక తరువాత తన దర్శకత్వంలో “చెవులో పువ్వు” సినిమా అనుకుని కథ తయారుచేసుకున్నారు. కానీ రామానాయుడికి కమలహాసన్ డేట్లు దొరికేసరికి “ఇంద్రుడు చంద్రుడు” అనే సినిమా చేశారు. అది పూర్తయిన తరువాత సత్యనారాయణ దర్శకత్వంలో సినిమా చేద్దాం అనుకుంటే ఈసారి అనిల్ కపూర్ కాల్షీట్లు ఇవ్వడంతో హిందీలో మరో సినిమా మొదలుపెట్టారు. దాంతో నిర్మాత రామానాయుడు మేనల్లుడు అయిన అశోక్ కుమార్ నిర్మాణంలో 1989 వ సంవత్సరంలో రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా  “చెవిలో పువ్వు”  సినిమా తెరకెక్కించారు. ఇది సత్యనారాయణకు దర్శకుడిగా తొలి సినిమా. చిత్రీకరణ మొదలైన 45 రోజులలో పూర్తిచేయాలని ఒత్తిడి పెట్టడం వలన తొందరగా నిర్మాణం ముగించారు. 1990 లో విడుదలైన ఈ సినిమా పరాజయం పాలైంది.

తొలి విజయం “ప్రేమ ఖైదీ” (1990)…

సత్యనారాయణ తొలి సినిమా చెవిలో పువ్వు (1990) నిర్మాణంలో ఉండగా తనను కలిసిన 11 మంది నిర్మాతలలో చెవిలో పువ్వు సినిమా పరాజయం తరువాత ఒక్కరు కూడా కనిపించలేదు. మరో సినిమా నిర్మాణానికి నిర్మాత లేడు. తిరిగి సహాయ దర్శకుడిగా వెళదామంటే కుదిరేలా లేదు. చేసేది లేక సీరియల్ తెరకెక్కించడానికి పూనుకున్నారు. అంతలోనే రామానాయుడు పిలిచి తన వద్ద ఉన్న కథను చదివి దానికి స్క్రిప్టు తయారుచేయమని చెప్పారు. దాంతో ఆ కథకు సుమారు 17 రకాల స్క్రిప్టు లను వ్రాసుకుని వచ్చారు సత్యనారాయణ. అందులో ఆఖరు స్క్రిప్టు రామానాయుడుకు నచ్చింది.

వెంటనే సత్యనారాయణ దర్శకత్వంలో రామానాయుడు సినిమా మొదలుపెట్టారు. కొంత భాగం చిత్రీకరణ జరిపిన తరువాత దానిని యువ దర్శకులు బి.గోపాల్ మరియు మురళీమోహన్ రావు లకు చూపించారు. ఆ సినిమా అద్భుతంగా వస్తుందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హరీష్, మాలాశ్రీ జంటగా సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన “ప్రేమ ఖైదీ” (1990) సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. అంతకుముందు తీసిన సినిమా పరాజయం తాలూకు జ్ఞాపకాలు మదిలో మెదులుతూనే, అప్పటివరకు ప్రేక్షకుల సమీక్ష కోసం ఎదురుచూస్తున్న సత్యనారాయణ ప్రేమ ఖైదీ సినిమాతో తొలి విజయం రుచి చూశారు.

వరుసగా 11 విజయాలు…

ప్రేమ ఖైదీ (1990) తో మొదలైన విజయ ప్రస్థానం అప్రతిహతంగా 11 సినిమాల వరకు కొనసాగింది. చెవిలో పువ్వు (1990) పరాజయం తరువాత ప్రేమఖైదీ (1990), 420 (1992), “ఆ ఒక్కటి అడక్కు (1992)”, “అప్పుల అప్పారావు” (1991), “సీతారత్నం గారి అబ్బాయి” (1992), “జంబలకడిపంబ” (1992),  “ఏవండీ ఆవిడ వచ్చింది” (1993), “వారసుడు” (1993), “అబ్బాయిగారు” (1993), “ఆలీబాబా అరడజను దొంగలు” 1994), “హలో బ్రదర్” (1994) ఇలా వరుసగా 11 విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఇలాంటి రికార్డు గతంలో దాసరి నారాయణరావు పేరు మీద ఉండేది. ఆయన సినిమాలు వరుసగా 12 విజయం సాధించాయి. సత్యనారాయణ “హలో బ్రదర్” (1994) తరువాత మగరాయుడు (1994) పరాజయం పాలైంది.

ఆ తరువాత ఆమె (1994), అల్లుడా మజాకా (1995), ఆయనకి ఇద్దరు (1995) విజయం సాధించగా, తరువాత నాలుగు చిత్రాలు తెలుగువీర లేవరా (1995), అదిరింది అల్లుడు (1996), చిలక్కొట్టుడు (1996)

వీడెవడండీ బాబూ (1997) పరాజయం పాలవ్వగా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996), అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996), నేను ప్రేమిస్తున్నాను (1997), తాళి (1997), మా నాన్నకి పెళ్ళి (1997), ఆవిడా మా ఆవిడే (1998), మావిడాకులు (1998), కన్యాదానం (1998) సినిమాలు విజయం సాధించాయి. ఆ తరువాత నేటి గాంధీ (1999) పరాజయం పాలవ్వగా, సూర్యవంశం (1999) ఓ మాదిరిగా విజయం సాధించింది. ఆపై పిల్ల నచ్చింది (1999) ప్రేక్షకులకు నచ్చలేదు.

చాలా బాగుంది (2000) సినిమా మంచిగానే ఆడింది. తరువాత గొప్పింటి అల్లుడు (2000) పరాజయం పాలవ్వగా, అమ్మో ఒకటోతారీఖు (2000), మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది (2001) చిత్రాలు విజయం సాధించాయి. వీడెక్కడి మొగుడండి (2001), ధాంక్యూ సుబ్బారావ్ (2001), హాయ్ (2002) చిత్రాలు పరాజయం పాలయ్యాయి. తొట్టిగ్యాంగ్ (2002), ఆడంతే అదోటైపు (2003), మా అల్లుడు వెరీగుడ్ (2003), ఆరుగురు పతివ్రతలు (2004), ఎవడి గోల వాడిది (2005), కితకితలు విజయం సాధించగా నువ్వంటే నాకిష్టం (2005) పరాజయం పాలయ్యింది.

మరణం…

ఇ.వి.వి. సత్యనారాయణ ఇద్దరు కుమారులలో ఆర్యన్ రాజేశ్ ను కథనాయకుడిగానూ, అల్లరి నరేశ్ ను సినిమా దర్శకుడి గానూ చూడాలనుకున్నారు. “హాయ్” చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన ఆర్యన్ రాజేశ్ హీరోగా అంతగా అలరించలేకపోయాడు. అయితే “అల్లరి” చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయిన నరేశ్, ఆ తరువాత అల్లరి చేస్తూనే తన ప్రస్థానానికి విజయబాట వేసుకుంటూ ముందుకు సాగిపోయాడు. ఇ.వి.వి. సత్యనారాయణ తన తనయులిద్దరినీ హీరోలుగా పెట్టి “నువ్వంటే నాకిష్టం” సినిమా తీశారు. కానీ అది అలరించలేకపోయింది. అల్లరి నరేశ్ తో కొన్ని నవ్వుల సినిమాలు తెరకెక్కించినా అవి తన పాత సినిమాల స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో తీసిన 45 చిత్రాలలో 28 విజయవంతం అవ్వగా, పన్నెండు చిత్రాలు పరాజయం పాలవ్వగా, అయిదు చిత్రాలు ఓ మాదిరిగా విజయం సాధించాయి. హాస్య చిత్రాలతోనే తన ప్రస్థానానికి పునాదులు వేసుకుని, తన ప్రస్థానంలో విజయం సాధించి తెలుగు తెర‌పై చెర‌ని ముద్ర వేసిన ఇ.వి.వి. సత్యనారాయణ, తన 54 ఏళ్ళ వయస్సులో 21 జనవరి 2011 నాడు క్యాన్సర్ తో బాధపడుతూ మరణించారు.

Show More
Back to top button