
భారతదేశంలో సినిమా చరిత్ర “చలనచిత్ర యుగం” ప్రారంభం వరకు విస్తరించి ఉంది. 1896లో లండన్లో లూమియర్ మరియు రాబర్ట్ పాల్ మూవింగ్ పిక్చర్స్ ప్రదర్శించబడిన తరువాత వాణిజ్య చలనచిత్ర ఛాయాగ్రహణం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే సంవత్సరం ఈ సినిమాలు బొంబాయిలో ప్రదర్శించబడ్డాయి. విదేశాల నుండి దిగుమతి చేసుకున్న విదేశీ చలనచిత్రాలే కాకుండా మనదేశంలో దాదాసాహెబ్ ఫాల్కే 1913 వ సంవత్సరంలో తెరకెక్కించిన పూర్తినిడివి గల మొదటి మూగ సినిమా “రాజా హరిశ్చంద్ర” మొదలుకొని 1931 వరకు భారతదేశంలో నిర్మించిన అన్ని సినిమాలు నిశ్శబ్ద చిత్రాలే. వాటికి మాటలు లేవు, పాటలు లేవు, వాటికి అస్సలు శబ్దమే లేదు. మొదటి భారతీయ ధ్వని చిత్రం అర్దేషిర్ ఇరానీ నిర్మించి, తెరకెక్కించిన “ఆలం ఆరా” (1931) తరువాత సినిమాకు మాటలు రావడం మొదలయ్యాయి. భారతీయ సినిమాకు ధ్వని రాకతో “ఇంద్రసభ” మరియు “దేవి దేవయాని” వంటి సంగీత నాటకాలు ప్రారంభమయ్యాయి. ఇవి భారతీయ చలన చిత్రాలలో నృత్యాలకు, మరియు పాటలకు నాంది పలికింది.
తెలుగు మొదటి శబ్ద సినిమా “భక్త ప్రహ్లాద” (1932) చిత్రాన్ని అప్పట్లో “ధర్మవరం రామకృష్ణమాచార్యులు” రచించిన “భక్త ప్రహ్లాద” నాటకాన్ని ప్రదర్శించే “సురభి నాటక సమాజం” వారిని బొంబాయి పిలిపించి, వారితో చర్చించి, సినిమా ప్రణాళిక సిద్ధం చేసి అదే పేరుతో ఈ చిత్రాన్ని బొంబాయిలోని కృష్ణామూవీటోన్ స్టూడియోలో తీశారు. ఇందులో తొలి పాటగా “పరితాప భారంబు భరియింప తరమా” అంటూ తొలి గేయ రచయిత “చందాల కేశవదాసు” రచించగా, ఆ గేయాన్ని సురభి కమలాబాయి ఆలపించారు. అలా తెలుగు సినిమా పాట పుట్టినప్పటి నుంచి ఎందరో గొప్ప గొప్ప కవులు ఎన్నో అద్భుతమైన పాటల రూపంలో మంచి సాహిత్యాన్ని అందిస్తూ, ప్రేక్షకులను రంజింప చేస్తూ వచ్చారు.
చలన చిత్ర సాహిత్యం అంటే సామాన్య ప్రజలు అనుకునేంత సులభం కాదు. తెలుగు సాహిత్యాన్ని బాగా కృషి చేసిన పండితులే సినిమా రంగంలోకి వెళ్లి తమ రచనలతో, రచయితలుగా తమ ప్రతిభను చాటుకున్నారు. కేవలం రచయితలే కాదు మిగతా రంగాలలో తమ నైపుణ్యం ప్రదర్శించిన వారందరూ బయట అనుభవం సంపాదించాకే సినిమాలలోకి వెళ్లారు. రంగస్థలంపై అనుభవం ఉన్నవాళ్లు, పాండిత్యం మీద అనుభవం ఉన్నవాళ్లే సినిమాలలోకి వెళ్లి ఆయా సాంకేతిక రంగాలలో స్థిరపడ్డారు. చక్కటి సినిమా పాటలను, సినీ ప్రేక్షకులకు అందించారు.
చక్కని, చిక్కని కవిత్వాన్ని, పది కాలాలపాటు నిలిచిపోయే అర్థాన్ని, అంతరార్థాన్ని, పరమార్థాన్ని, పద సౌందర్యాన్ని పొదగగలిగిన వాళ్లని సినీ కవి అనవచ్చు. సరళమైన తెలుగులో బరువైన భావం గల పాటలను వ్రాసి హృదయాలను కలిగించగల రచయితలు ఎందరో ఉన్నారు. వారిలో సముద్రాల రామానుజాచార్య ఒకరు. ఈయనకు తెలుగు సినీ సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈయన తండ్రి సముద్రాల రాఘవాచార్య తెలుగు సినిమా పరిశ్రమలో సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకులు మరియు నేపథ్యగాయకులు. “పండిత పుత్రః పరమశుంఠః” అనేది ఒక తెలుగు సామెతను తలక్రిందులు చేస్తూ అన్ని సందర్భాలలో అది నిజం కాదు అని నిరూపించారు రచయిత సముద్రాల రామానుజాచార్య. విత్తు ఒకటైతే చెట్టు మరొకటి కాదు అని నిరూపించిన ప్రతిభాశాలి ఆయన. “అందమే ఆనందం అనదంమె జివిత మకరదం” అంటూ “బ్రతుకు దెరువు” (1953) సినిమాతో పాటల రచయితగా తన ప్రస్థానం మొదలుపెట్టి ఎన్నో చిత్రాలకు అద్భుతమైన పాటలను వ్రాశారు జూనియర్ సముద్రాల.
జీవిత విశేషాలు…
- జన్మనామం : సముద్రాల రామానుజాచార్య
- ఇతర పేర్లు : జూనియర్ సముద్రాల
- జననం : 15 ఏప్రిల్ 1923
- స్వస్థలం : పెదపులివర్రు (భట్టిప్రోలు), గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
- వృత్తి : తెలుగు సినిమా రచయిత
- జీవిత భాగస్వామి : ఆండాళమ్మ
- తండ్రి : సముద్రాల రాఘవాచార్య
- తల్లి : రత్నమ్మ
- మరణ కారణం : అనారోగ్యం
- మరణం : 31 మే 1985
నేపథ్యం…
సముద్రాల జూనియర్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా రచయిత సముద్రాల రామానుజాచార్య 15 ఏప్రిల్ 1923 నాడు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పెదపులివర్రు (భట్టిప్రోలు) గ్రామంలో సముద్రాల రాఘవాచార్య, రత్నమ్మ దంపతులకు జన్మించారు. ఈయన తండ్రి సముద్రాల రాఘవాచార్య కూడా ప్రఖ్యాత సినీ రచయిత, తెలుగు సినిమా పరిశ్రమలో సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకులు, నేపథ్యగాయకులు. వీరిది పండిత వంశం. రామానుజాచార్య తండ్రి సముద్రాల రాఘవాచార్యకు మద్రాసు లోని “ప్రజామిత్ర” పత్రికలో “సబ్ ఎడిటర్” ఉద్యోగం రావడంతో కుటుంబంతో సహా మకాం మద్రాసుకు మార్చారు.
రాఘవాచార్యులుగారు ‘ప్రజామిత్ర’ పత్రికలో పనిచెయ్యడానికి మద్రాసుకి మకాం మార్చడంతో, రామానుజా చార్య కూడా మద్రాసు లోని జార్జ్టవున్ లోని ఉన్నత పాఠశాలలో చదివారు. ఉన్నత పాఠశాల చదువులో వుండగానే, అతను “సముద్రుడు” పేరుతో బోల్డంత సాహిత్యాన్ని వండారు. ఆయన వ్రాసిన పద్యాలు, గేయాలూ సముద్రుడు పేరుతో “భారతి”, “ప్రజాబంధు” పత్రికల్లో అచ్చయ్యాయి. అభ్యాసం, అధ్యయనం రెండూ సవ్యసాచిలా నిర్వహిస్తూ రామానుజం బి.ఎస్సి.కి వచ్చారు. పేరుకు సామాన్య శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారే, కానీ ఆయనకు సాహిత్యమంటేనే వల్లమాలిన అభిమానం.
అండాళమ్మ తో వివాహం…
సముద్రాల రాఘవాచార్య కడుపున పుట్టిన మరో సముద్రమే ఈ రామానుజాచార్య. కాబట్టి మొదటి ఫారంలోనే పద్యాలు, సాహిత్యాలు అద్భుతంగా వ్రాసేశారు. అప్పటికే సముద్రాల రాఘవాచార్య (సీనియర్ సముద్రాల) చిత్రసీమలో అరంగేట్రం చేసి వున్నారు. తనలాగా తన కుమారుడు చిత్రసీమ వైపు రాకూడదని, రామానుజం పెద్ద ఇంజనీరు కావాలని ఆయన కోరుకునేవారు. కానీ రామానుజం మాత్రం తండ్రి బాటలోనే సాగాలని, సినీరంగంలో స్థిరపడాలని చిన్ననాటి నుండే కలలు కనేవారు. రామానుజం సాహిత్యాభిలాషను గమనించిన కొంత మంది ప్రముఖులు చిత్రరంగంలో రచయితగా చేరమన్నారు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే అక్కినేని నాగేశ్వరరావు చిన్న పాత్ర పోషించిన “మాయాలోకం” (1945) అనే సినిమాలో “సముద్రుడు” పేరుతో ఓ పాట వ్రాశారు. ఈ చిత్రం 1944 వ సంవత్సరంలో చిత్రీకరణ జరుపుకోగా, అదే సంవత్సరం రామానుజానికి, అండాళమ్మతో పెళ్లి జరిగింది. తండ్రీ కొడుకులు (రాఘవాచార్య, రామానుజం) లు వ్రాసిన సంకలనం “కడలిపొంగు” పుస్తకావిష్కరణ జరిగింది. తండ్రి రాఘవాచార్య సూచన మేరకు రామానుజం 1944 వ సంవత్సరంలో సౌండ్ ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. రెండేళ్ల తరువాత రేడియో సర్వీసింగ్ మెయింటెన్స్లో డిప్లమో సాధించారు.
చిత్ర రంగ ప్రవేశం…
సముద్రాల రామానుజాచార్య 1949 వ సంవత్సరంలో “వాహినీ స్టూడియో” లో “శబ్ద గ్రహణ శాఖ”లో చేరారు. అదే స్టూడియోలో శబ్దగ్రాహక సహాయక ఇంజనీర్గా పనిచేస్తున్న ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ కూడా తనకు మిత్రుడైపోయారు. అక్కడ మూడేళ్లపాటు ప్రముఖ శబ్దగ్రాహక ఇంజనీరు కృష్ణయ్యర్, శ్రీనివాస రాఘవన్ ల దగ్గర రామానుజం సహయకులుగా పనిచేశారు. ఆయన ఒకవైపు శబ్దగ్రాహక ఇంజనీరింగ్ శాఖలో సహాయకునిగా పనిచేస్తూనే మరోవైపు తండ్రి రాఘవాచార్యకు సినీ రచనలో సహకరిస్తుండేవారు. తనను దగ్గరగా పరిశీలిస్తున్న కృష్ణయ్యర్ “సినీ రచనలోనే నీవు రాణిస్తావు” అని ఆయనను ప్రోత్సాహించారు.
కొడుకు ఇంజనీరింగ్ కావాలని కలలుగన్న తండ్రి రాఘవాచార్య “నీ రాత ఎలా వుంటే అలా జరుగుతుంది, నీ ఇష్టం” అంటూ కొడుకును సినిమారంగంలో రచన విభాగంలో కొనసాగించారు. 1952 వ సంవత్సరంలో వినోదా పిక్చర్స్ నిర్మాణం లో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తెరకెక్కిన “శాంతి” అనే చిత్రంలో పాటలు వ్రాసే అవకాశం లభించింది. అందులో పాటలన్నీ సముద్రాల రామానుజాచార్యనే వ్రాశారు. ఆ తరువాత అమ్మలక్కలు (1953) సినిమాలో పాటలన్నీ సముద్రాల జూనియర్ వ్రాశారు. అందులో “చిన్నారి ప్రేమ కన్నీరయేనా బ్రతుకే”, మారాడవేల మారాము చిలుకా మామీద నీకలుకా” లాంటి పాటలు ఉన్నాయి.
అందమే ఆనందం పాట (బ్రతుకు తెరువు)..
భాస్కరా ప్రొడక్షన్స్ పతాకం పై పి.ఎస్. రామకృష్ణారావు దర్శకత్వంలో తెరకెక్కించిన చలన చిత్రం “బ్రతుకు తెరువు” (1953). ఈ చిత్రంలో ప్రసిద్ధి చెందిన పాట “అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం” అనే పాటను జూనియర్ సముద్రాల వ్రాశారు.
“అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం పడమటి సంధ్యా రాగం కుడి ఎడమల కుసుమ పరాగం
ఒడిలో చెలి మోహన రాగం జీవితమే మధురాను రాగం”…
అనే పాటకు ఘంటశాల సంగీతం అందించగా అక్కినేని నటించిన ఈ పాట అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో వేరే చెప్పక్కర్లేదు. 1953 వ సంవత్సరంలో వచ్చిన “బ్రతుకు తెరువు” సినిమా నిజంగానే సముద్రాల జూనియర్కు “బ్రతుకు తెరువు” ఇచ్చింది. ఇందులోని ఆ పాట ఆయన అదృష్టాన్ని అందలం ఎక్కించింది. ఘంటసాల ఇచ్చిన ట్యూన్కు ముందుగా “అందమె ఆనందం” అన్న వాక్యం వ్రాశారు. తరువాత ఆలోచించి ఆలోచించి “కీట్స్ ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫరెవర్” స్ఫూర్తిగా తీసుకుని “అందం ఉన్న వస్తువు ఎప్పటికీ ఆనందాన్నిస్తుంది” గనుక “ఆనందమే జీవిత మకరందం” అని వ్రాశారు.
ఇక చరణాలు వ్రాయడానికి కలం ముందుకు సాగడం లేదు. దాంతో రామానుజం ఉద్విగ్నత చూసి, అతడి ఒత్తిడిని తప్పించడానికి ఆయనను బీచ్కు తీసుకెళ్లారు ఘంటసాల మాష్టారు. అక్కడ రామానుజం దృష్టి అస్తమిస్తున్న సూర్యుడిపై పడింది. దాంతో అస్తమిస్తున్న భాస్కరుడిని చూస్తూ పడమట సంధ్యారాగం అన్నారు. అక్కడే మల్లె పూలమ్ముతున్న ఆవిడను చూసి కుడి ఎడమల కుసుమ పరాగమన్నారు సముద్రాల జూనియర్. అలాగే అక్కడ ఉన్న ప్రేమ జంటలను చూస్తూ “ఒడిలో చెలి మోహనరాగం” అని పాడుతూ, అక్కడున్న దృశ్యాలను చూస్తూ చూస్తూ “జీవితం మధురానురాగం” అంటూ వ్రాశారు సముద్రాల జూనియర్. ఆయన వ్రాసింది చూసిన “మల్లాది రామకృష్ణ శాస్త్రి” కల్పించుకుని రామానుజం వ్రాసిన పాట చాలా సహజంగానే ఉందని సమర్థించారు. ఈ పాట పూర్తయిన తరువాత దర్శకులు పి.యస్.రామకృష్ణ మెచ్చుకొని ఆ పాటను పి.లీలతో పాడించి సావిత్రి పై చిత్రీకరించారు.
జూనియర్ అని పిలిచిన కస్తూరి శివరావు…
వాహినీ స్టూడియోలో శబ్దగ్రాహక ఇంజనీరు విభాగంలో సహాయకుడిగా పనిచేస్తున్న సమయంలో నందమూరి తారకరామారావుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా పరిగణించడం వలన ఎన్టీఆర్ సొంత సంస్థ “నేషనల్ ఆర్ట్ థియేటర్” వారు 1954 వ సంవత్సరంలో నిర్మించిన “తోడు దొంగలు” చిత్రానికి తొలిసారిగా మాటలు మరియు పాటలు వ్రాసే అవకాశం రామానుజాచార్య కు లభించింది. ఎన్.టి.రామారావు, గుమ్మడి, పి.హేమలత ప్రధాన పాత్రధారులుగా నటించిన “తోడు దొంగలు” చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. దాంతో జూనియర్ సముద్రాల కలం ఉప్పొంగిపోయింది.
అలాగే నందమూరి తారక రామారావు, అంజలీదేవి, వహీదా రెహమాన్, గుమ్మడి వెంకటేశ్వరరావు, ఎస్.వి. రంగారావు, కాంతారావు మొదలగు తారాగణం నటించిన జయసింహా (1955) చిత్రం లో
“ఈనాటి ఈ హాయీ కల కాదోయి నిజమోయీ నీ ఊహతోనే పులకించిపోయే నీ మేను నీదోయి
నీ కోసమే ఈ అడిఆశలన్ని నా చెంత నా ఆశ నీవే కదా”
అనే పాటను ఎన్టీఆర్, అంజలీదేవిల మధ్య చిత్రీకరించారు. అలాగే అదే చిత్రం “జయసింహ” లోని మరో పాట వహీదా రెహమాన్ పై చిత్రీకరించిన…
“నడిరేయి గడిచినే చెలియా రాడాయెనే సామి, నా సామి రాడాయెనే సామి”..
అనే పాటలను కూడా జూనియర్ సముద్రాల నే వ్రాశారు. సముద్రాల రానుజాచార్య కు జూనియర్ అనే పేరు రావడానికి కారణం ప్రఖ్యాత హాస్యనటులు కస్తూరి శివరావు. ఆయన రామానుజాచార్య ను జూనియర్ అని తమాషాగా సంబోధిస్తూ ఉండేవారు. అదే అలవాటుగా ఆయన వ్యవహారిక నామధేయమైపోయింది.
70 పైగా చిత్రాలకు రచయితగా…
“శాంతి నివాసం” చిత్రం లో “రావే రాధా రాణీ రావే, రాధ నీవు కృష్ణుడ నేనే, రమ్యమైన శారద రాత్రి, రాసలీలా వేళ ఇదే” అనే పాటను, “నలదమయంతి” చిత్రంలోని “దెబ్బ మీద దెబ్బ దబు, దబ్బు నేనే సుబ్బీ ఓ, సుబ్బలాల ఉబ్బో నీ, దెబ్బ కదిరి దిబ్బే అదిరె నబ్బా” అనే తమాషా పాటలు వ్రాశారు జూనియర్ సముద్రాల. ఆడంబరం గానీ, కృత్రిమత్వం గానీ లేని సరళమైన శైలిలో రచన చేయగల చక్కటి రచయిత రామానుజం. మృదు మధురమైన కూర్పు ఆయన గీతాలలో ప్రముఖంగా కనిపిస్తుంది. “మంచి మనసుకు మంచి రోజులు” (1958) చిత్రం లోని “ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా” అనే పాటను రావు బాల సరస్వతీ దేవి మృదుమధురంగా పాడారు.
రిపబ్లిక్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణంలో డి.యోగానంద్ తెరకెక్కించిన “పెళ్ళి సందడి” (1959) చిత్రంలో “చమక్ చమక్ తార, ఝనక్ ఝనక్ సితార, నీ తారను మరిచి పోతారా?”, “బైటో బైటో పెళ్ళికొడుకా, ఆల్ రైటో రైటో పెళ్లికూతురా” అనే విజయవంతమైన లెక్కకు మిక్కిలి పాటలను రామానుజం వ్రాశారు. “పాండురంగ మహాత్మ్యం” (1957) నుండి “అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా – ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా”, “నీవని నేనని తలచితిరా నీవే నేనని తెలిసితిరా”, “వన్నెల చిన్నెల నెర, కన్నెల వేటల దొరా”, “హే కృష్ణా ముకుందా మురారీ జయకృష్ణా ముకుందా మురారీ జయగోవింద బృందా విహారీ” లాంటి పాటలను జూనియర్ సముద్రాల వ్రాశారు. అలాగే “ఆత్మ బంధువు” (1962), “ఉమ్మడి కుటుంబం” (1967), “స్త్రీ జన్మ” (1967), “తల్లా? పెళ్లామా?” (1970), “శ్రీ రామాంజనేయ యుద్ధం” (1975) లాంటి సుమారు 70 చిత్రాలకు పైగా రచనలు చేశారు జూనియర్ సముద్రాల.
మరణం…
సంభాషణ రచనలలో చెప్పదలుచుకున్నది సూటిగా ముక్తసరిగా, గుండెలకు తలిగేలా చెప్పడం, ఆత్మ పరిశీలన రేకెత్తించడం జూనియర్ సముద్రాల రచనలోని ప్రత్యేకతలు. ఎన్నో అద్భుతమైన పాటలను వ్రాసిన జూనియర్ సముద్రాల 31 మే 1985 లో తన 63 వ యేట కన్నుమూశారు.
★ జూనియర్ సముద్రాల పూర్తిగా సినిమాకు పాటలు వ్రాసిన చిత్రాలు..
శాంతి (1952), బ్రతుకుతెరువు (1953), అమ్మలక్కలు (1953), వేగుచుక్క (1957)
★ కొన్ని పాటలు మాత్రమే వ్రాసిన చిత్రాలు..
ఋణానుబంధం (7), సంతోషం (5), చెడపకురా చెడేవు (5), సిపాయి కూతురు (5), కులదైవం (5), అభిమానం (4), శభాష్ రాజా (3), వీరపాండ్య కట్టబ్రహ్మణ (3), దొంగల్లో దొర (1), టాక్సీ రాముడు (1)
★ సంభాషణలు మాత్రమే వ్రాసిన చిత్రాలు…
చెడపకురా చెడేవు (1955), సంతోషం (1955), అభిమానం (1960), సమాజం (1960), శభాష్ రాజా (1961), టాక్సీ రాముడు (1961), విప్లవ స్త్రీ (1961), స్త్రీ జీవితం (1962), దశావతారాలు (1962), ఆత్మబంధువు (1962), పరువు ప్రతిష్ట (1963)
★ సంభాషణలు – పాటలు వ్రాసిన చిత్రాలు..
తోడుదొంగలు (1954), విజయ గౌరీ (1955), చెడపకురా చెడేవు (1955), జయసింహ (1955), నలదమయంతి (1959), పాండురంగ మహత్యం (1957), స్వయంప్రభ (1957), సతీ అనసూయ (1957), భూలోక రంభ (1958), మంచి మనసుకు మంచి రోజులు (1958), పార్వతి కళ్యాణం (1958), బాలనాగమ్మ (1959), మహిషాసుర మర్దిని (1959), మనోరమ (1959), పెళ్లి సందడి (1959), రేచుక్క పగటి చుక్క (1959), వీర భాస్కరుడు (1959), మా బాబు (1960), శాంతి (1952), గులేబకావళి కథ (1962), టైగర్ రాముడు (1962), ఆశాజీవులు (1962), ఆప్తమిత్రులు (1963), సత్యనారాయణ మహత్యం (1964)..

