
అప్పటివరకు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలకే పరిమితమైన తెలుగు పరిశ్రమకు.. కౌబాయ్, గూఢచారి వంటి సినిమాలను పరిచయం చేసి.. నటుడిగానే కాక నిర్మాతగా, దర్శకత్వ ప్రతిభతో 17 చిత్రాలకు స్వీయదర్శకత్వం వహించారు. సతీమణి విజయ నిర్మలతో కలిసి దాదాపు 48 చిత్రాల్లో జోడీగా నటించి విశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
ఆయన కెరీర్లో మైలురాయిగా చెప్పుకునే ‘అల్లూరి సీతారామరాజు’తో ఉత్తమ నటుడిగా గుర్తింపు పొంది, నిత్య ప్రయోగాలతో సాధన చేసే సహవాసిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. దాదాపు ఐదు దశాబ్దాలపాటు నిర్విరామంగా సాగిన ఆయన నటప్రస్థానం తిరుగులేనిది. మొత్తం 350 చిత్రాలతో సినీప్రరిశ్రమను సుదీర్ఘకాలంలపాటు ఏలిన రారాజు… ఘంటమనేని కృష్ణ..
నేడు ఆయన జయంతి(మే 31) సందర్భంగా ఆయన వ్యక్తిగత, సినీ జీవిత విశేషాలను ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం..
నేపథ్యం..
1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలిలోని బుర్రిపాలెంలో ఘట్టమనేని రాఘవయ్యచౌదరి, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు కృష్ణ. ఆయన అసలు పేరు శివరామకృష్ణమూర్తి. ఐదుగురిలో పెద్దవాడు కృష్ణే. తెనాలి హైస్కూల్లో పదోతరగతి వరకు చదువుకున్నారు. తరువాత ఏలూరులో సి.ఆర్.రెడ్డి కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు.
చదువు తర్వాత ఇక సినిమాల్లోకి వెళ్లాలని నిశ్చయించుకుని తెనాలికి చెందిన నటుడు జగ్గయ్య, నిర్మాత చక్రపాణి తన తండ్రికి కాస్త పరిచయస్తులు కావడంతో వారి మీద భరోసాతో మద్రాస్ నగరంలో అడుగుపెట్టారు.అలా ఆయన నటప్రస్థానం మొదలైంది.
అదే టైంలో ‘తేనె మనసులు’ కోసం కొత్త నటీనటులు కావాలని పత్రికా ప్రకటన రావడంతో.. ఆ ప్రకటన చూసి ఫొటోలు పంపించారు. అలా పంపిన వారం రోజుల్లోనే మద్రాస్ రమ్మని పిలుపు వచ్చింది. అప్పటికే కృష్ణకు వివాహమై, రమేష్ పుట్టాడు. భార్య, కుమారుడ్ని ఇంటి దగ్గరే వదిలిపెట్టి మద్రాసుకు బయలుదేరారు. అలా హైదరాబాద్ సారథి స్టూడియోలో ‘తేనె మనసులు’ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు ఆయన పారితోషికం రెండు వేలు. 1965 మార్చి 31న విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది.
తొలి చిత్రంలో కృష్ణ నటన మెచ్చిన నిర్మాత డూండీ తాను తీయబోతున్న ‘గూఢచారి 116’లో కృష్ణకు అవకాశమిచ్చారు. 1966లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించి, ఆపై కృష్ణ కెరీర్ను ఒక మలుపు తిప్పింది. తెలుగులో తొలి జేమ్స్బాండ్ చిత్రమిదే. ‘పానిక్ ఇన్ బ్యాంకాక్’ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా తెరకెక్కించగా.. ఈ సినిమా ఆయనకు స్టార్ ఇమేజ్ను తీసుకొచ్చింది. ఆరోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు మాత్రమే బీ, సీ సెంటర్లలో ఆడేవి. అలాంటిది మూడో సినిమాతోనే భారీ సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకున్నారు కృష్ణ. అందరూ ‘ఆంధ్రా జేమ్స్బాండ్’గా పిలిచేవారు. ఆ తర్వాత 20 సినిమాల్లో హీరోగా సెలెక్ట్ చేసుకోవడం విశేషం. ఇలా ఏడాదికి కనీసం 8 నుంచి 10 చిత్రాల్లో నటించడమే కాక ద్విపాత్ర, త్రిపాత్రాభినయం చేసి అన్ని వర్గాల ప్రజల్ని మెప్పించారు. 2016లో విడుదలైన ‘శ్రీశ్రీ’ సినిమా కృష్ణ నటించిన చివరి చిత్రం.
కృష్ణ, విజయనిర్మల హిట్ పెయిర్..
వీరిది ప్రేమ వివాహం. బాపు దర్శకత్వంలో రూపొందిన ‘సాక్షి’ చిత్రం కృష్ణ, విజయనిర్మల కెరీర్కు మైలురాయిగా నిలిచింది. కృష్ణ వ్యక్తిత్వాన్ని చూసి ఆయన్ను ఆరాధించారు విజయ నిర్మల. క్రమంగా వీరి స్నేహం బలపడింది. కానీ అప్పటికే, కృష్ణకు ఇందిరాదేవితో పెళ్లి జరిగింది. విజయ నిర్మలకు సైతం పెళ్లైంది. కాకపోతే ఆవిడ సినిమాల్లోకి రావడం భర్తకు ఇష్టం లేకపోవడంతో.. ఇద్దరూ దూరంగా ఉంటూ వచ్చారు. ‘సాక్షి’ సినిమా పెద్ద విజయాన్ని అందుకోవడంతో కృష్ణ-విజయ నిర్మలతో కలిసి సినిమాలు చేయడానికి నిర్మాతలు సైతం ముందుకొచ్చారు. ఇద్దరూ కలిసి రెండు, మూడు సినిమాలు చేశాక మరింత దగ్గరైపోయారు. కృష్ణకు అత్యంత సన్నిహితుడైన చంద్రమోహన్ మధ్యలో ఉండి వారి పెళ్లిని రహస్యంగా జరిపించారట.
ఓ హీరో, హీరోయిన్ కలిసి నాలుగైదు సినిమాల్లో కనిపిస్తే చాలు, అది సూపర్ హిట్ జోడి అవుతుంది. అలాంటిది.. ఒకే హీరోయిన్తో 50 సినిమాలంటే అది అరుదైన రికార్డనే చెప్పాలి. నిజజీవితంలోనే కాదు, వెండి తెరపైనా అరుదైన జంటగా గుర్తింపు పొందారు కృష్ణ-విజయ నిర్మల.
స్వీయ నిర్మాణ సంస్థ..
తన అభిరుచి మేరకు సినిమాలు తీయాలనే ఆశతో 1970లో స్వీయనిర్మాణ సంస్థగా పద్మాలయా స్టూడియోస్ అనే సంస్థను స్థాపించారు కృష్ణ. ‘మోసగాళ్లకు మోసగాడు’(1971) తొలి చిత్రం పద్మాలయా సంస్థకు మంచి విజయాన్ని అందించింది. దీన్ని హిందీ, తమిళం, ఇంగ్లీష్లో డబ్బింగ్ చేశారు. అప్పట్లోనే అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని కృష్ణ చేసిన జేమ్స్బాండ్ సినిమాలు తెలుగు సినీపరిశ్రమలో కొత్త ఒరవడిని సృష్టించాయి.
పాడిపంటలు, అగ్నిపర్వతం, వజ్రాయుధం, సింహగర్జన, రక్తసంబంధం, ఇద్దరు దొంగలు, అడవి సింహాలు, కొడుకు దిద్దిన కాపురం, అన్నదమ్ముల సవాల్, ఏజెంట్ గోపి, మండిన గుండెలు, వియ్యాలవారి కయ్యాలు, హేమాహేమీలు, కొత్త అల్లుడు, బుర్రిపాలెం బుల్లోడు, ఈనాడు, ముందడుగు, కిరాయి కోటిగాడు, అడవి సింహాలు, వంటి అనేక చిత్రాలు కృష్ణ కెరీర్లో బ్లాక్బస్టర్ హిట్స్గా నిలిచాయి.
తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్ హీరోగా కృష్ణ పేరు తెచ్చుకున్నాడనడంలో అతిశయోక్తి లేదు.
దర్శకుడిగా కృష్ణ తొలి చిత్రం ‘సింహాసనం’ (1984) అపూర్వ విజయాన్ని సాధించింది. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో తనదైన అభినయంతో మెప్పించారు సూపర్ స్టార్.
గుర్తింపు..
1974లో ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం.
1997లో ఫిలింఫేర్ జీవనసాఫల్య పురస్కారం. 2003లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్,
2009లో పద్మ భూషణ్ వరించింది.
*మొదట్లో కృష్ణను నటశేఖర, డేరింగ్ అండ్ డాషింగ్ అని పిలుచుకునేవాళ్ళు. అయితే ప్రముఖ సినీ పత్రిక శివరంజని ఓ సందర్భంలో తెలుగు సినిమాల్లో సూపర్ స్టార్ అనే బిరుదు ఎవరికి ఇస్తారని ఓటింగ్ నిర్వహించగా.. ఆ ఓటింగ్లో కృష్ణకు తిరుగులేని మెజార్టీ వచ్చింది. ఇక అప్పటినుంచి ఆయనను టాలీవుడ్ ప్రేక్షకులు సూపర్ స్టార్ అంటూ పిలుస్తున్నారు. ఆయనకొక్కరికే 2,500 అభిమాన సంఘాలున్నాయి.
పిల్లలు..
చిన్నకొడుకు మహేష్ బాబు అంటే కృష్ణకు ఎంతో ఇష్టం. వేసవి సెలవుల్లో ఊటీలో షూటింగ్స్ చేయడం కృష్ణకు అలవాటు. అలా ఏ సినిమా దర్శకులైనా అక్కడికే వచ్చి చిత్రీకరణలు జరిపేవారు. అప్పుడు మహేష్ స్కూల్ సెలవుల్లో తనతో పాటు తీసుకెళ్లి, సినిమాల్లో నటింపజేసేవారు. ఇలా కృష్ణ నటించిన ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘అన్న తమ్ముడు’, ‘పోరాటం’, ‘ముగ్గురు కొడుకులు’, ‘శంఖారావం’ వంటి అనేక చిత్రాల్లో మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు. మహేష్ నటన, డాన్సులు చూసి తెగ మురిసిపోయేవారు కృష్ణ.
అలా మహేష్ బాబు పూర్తిస్థాయిలో హీరోగా చేసిన తొలి సినిమా ‘రాజకుమారుడు’ను చూసి కొన్ని దశాబ్దాల పాటు తన కుమారుడు స్టార్గా వెలుగుతాడని సంబరపడ్డారట. మహేష్ నటించిన ప్రతి సినిమా విడుదలైన రోజున ఫస్ట్ షో చూడటం కృష్ణకు అలవాటు. మహేష్ బాబు కొడుకు గౌతమ్, కూతురు సితారను గారాబంగా చూసుకునేవారు కృష్ణ. మహేష్ కూడా తండ్రిని అంతే గొప్పగా ఆరాధిస్తాడు. తనకు నిత్యస్ఫూర్తి నాన్నేనని పలు సందర్భాల్లో చెప్పారు.
కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్బాబు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, హీరోగా 15కు పైగా సినిమాల్లో నటించి, ఆ తర్వాత నిర్మాతగా మారారు. నిర్మాతగా తొలి సినిమా అమితాబ్బచ్చన్తో ‘సూర్యవంశం’ హిందీ రీమేక్ తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నటించిన అర్జున్, అతిథి, దూకుడు, ఆగడు వంటి సినిమాలను నిర్మించాడు.
కృష్ణ పెద్ద కూతురు పద్మావతి సినిమాలకు దూరంగా ఉంది. కృష్ణ రెండవ కూతురు మంజుల సినీరంగంలో కొనసాగుతుంది. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా పలు విభాగాల్లో పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె భర్త సంజయ్ స్వరూప్ కూడా నటుడిగా కొనసాగుతున్నారు.
కృష్ణ చిన్న కుమార్తె ప్రియదర్శిని. ఈమె ప్రముఖ హీరో సుధీర్బాబుకు భార్య.
కృష్ణ, ఇందిరాదేవిని పెళ్లి చేసుకున్న ఏడేళ్ళకు తన సహనటి విజయ నిర్మలను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే విజయ నిర్మలకు కృష్ణ మూర్తితో పెళ్లై, నరేష్ పుట్టాడు. కాగా ఈమె 2019 జూన్ 27న అనారోగ్యంతో మరణించింది.
ఏఎన్నార్, ఎన్టీరామారావు, కృష్ణంరాజు లాంటి అలనాటి స్టార్ హీరోల సరసన ఓ వెలుగు వెలిగిన కృష్ణ 2022 నవంబర్ 15న కన్నుమూశారు.