
ఆయన స్వరమే వరం.. పాటే మంత్రం.. కాలాలు మారినా, తరాలు మరలినా,
ఆ గొంతు ప్రతి మదిలో మధురమై నిలిచిపోతుంది.
‘లాలిజో లాలిజో ఊరుకో పాపాయి.. పారిపోనికుండా పట్టుకో నా చెయ్యి’ అంటూ చంటిపిల్లలను ఊరడించే పాటయ్యావ్.
‘మాటేరాని చిన్నదాని కళ్ళు తెలిపే ఊసులు’ అని బైటపడని ప్రేయసి భావాల్ని తెలుపుతూనే, ‘మాటరాని మౌనమిది మౌనవీన గానమిది’ అని ప్రేమికుడి మౌనాన్ని పలికించే గానమయ్యావ్.
‘నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి’ అనే పాటతో పలకని మనసునుద్దేశించిన ప్రేమికుడివయ్యావ్.
“శ్రీరస్తు శుభమస్తు.. శ్రీకారం చుట్టుకుంది.. పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం..
శ్రీరస్తు శుభమస్తు” అంటూ పెళ్లి పరమార్థాన్ని పాడి, ప్రతి కల్యాణ మండపంలో వినిపించే మంత్రమయ్యావ్.
“సింగారాల పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి” అని పంటలు చేతికొచ్చే సంక్రాంతి సందర్భంలో స్వచ్ఛమైన స్నేహాగీతమయ్యావ్.
“ఒక్కడై రావడం ఒక్కడై పోవడం.. నడుమ ఈ నాటకం విధిలీలా” అంటూ తప్పని చావును పాటతో సాగనంపావ్.
‘అంతర్యామి అలసితి.. సొలసితి.. ఇంతట నీ శరణిదే జొచ్చితిని.. అంటూ విన్న ప్రతిసారి మదిలో ప్రశాంతతకు నిలయమయ్యావ్.
శ్రోతల మదిలో.. ప్రతి తెలుగు లోగిలిలో.. మన ‘బాలు’గా స్థిరపడిపోయిన
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంగారి 79వ జయంతి (జూన్ 4న) సందర్భంగా ఆయన గురుంచి..
నేపథ్యం..
1946 జూన్ 4న శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శంకుతలమ్మ దంపతులకు నెల్లూరు జిల్లాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జన్మించారు. నాన్న హరికథాగానం చేసేవారు. చిన్ననాటినుంచే పక్కింట్లో రేడియోలో వచ్చే పాటల్ని వింటూ స్వీయ సాధన చేస్తుండేవారు. 7వ తరగతి వరకు నెల్లూరులో, 8,9వ తరగతి నగరిలో చదివారు. శ్రీకాళహస్తిలో ఎస్ఎస్ఎల్ సి చదివారు. ఆయన ఎక్కువగా సినిమా పాటలు బాగా పాడేవారట. తిరుపతిలో పీయూసీ కాలేజీలో విద్య ఐపోయాక. అనంతపురంలో ఇంజనీరింగ్ సీట్ రావడంతో అక్కడ చేరారు. ఆర్కెస్ట్రా బృందంతో కలిసి అప్పుడప్పుడు నాటకాలు వేశారు. అనంతరం మద్రాస్ వెళ్లి ఎఐఎం చదువుతానన్నారు. అక్కడ్నుంచి సినిమాలో గాయకుడిగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో..
‘సోషల్ కలచర్డ్ క్లబ్’ వాళ్ళు పెద్ద స్థాయిలో పాటల పోటీ నిర్వహిస్తున్న విషయం తెలుసుకొని.. బాలుగారి స్నేహితుడైన మురళి ఈ పోటీలో పాల్గొనమని చెప్పారట. కానీ ఆ పోటీ నిబంధన ప్రకారం సినిమా పాటలు కాకుండా సొంతంగా ఏదైనా పాట రాసుకొని పాడాలి. దీంతో బాలు అప్పటికప్పుడు స్వయంగా పాట రాసుకొని పాడటమే కాక మొదటి బహుమతి పొందారు. దీంతో ఆయనలో ఆత్మవిశ్వాసం పెరిగి ఆ తర్వాత నుంచి సినీ ప్రయత్నాలు గట్టిగానే చేశారు.
అనంతరం ఎస్పి కొందండరాం గారి నుంచి మొదటగా ఒక అవకాశం వచ్చింది. అది 1966లో
వచ్చిన ‘శ్రీశ్రీ మర్యాద రామన్న’ సినిమాకు పాటలు పాడారు. తర్వాత ఎంఎస్ విశ్వనాథన్ గారు బాలుగారితో పాట పాడించుకొని విని.. బాగుంది. కానీ తమిళంలో పాట పాడగలవా? తమిళం నేర్చుకొని వస్తే అవకాశమిస్తానని అన్నారట. అలా డబ్బింగ్ చిత్రాలకు పాడే అవకాశమూ వచ్చింది.
1969లో ఘంటసాలతో ‘ఆలు మగలు’ సినిమాకు ఒక పాటను కలిసి పాడారు.
అది మొదలు.. ఏఎన్నార్, ఎన్టీరామారావు, శోభన్ బాబు, కృష్ణలాంటి సీనియర్ హీరోలేకాక ఆ తర్వాత వచ్చిన బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతోపాటు తర్వాత వచ్చిన యంగ్ హీరోలకు సైతం దాదాపు హీరోలందరికీ పాటలు పాడారు. ఆయన గొంతు అంతచక్కగా నప్పేది.
కొన్నాళ్లపాటు కమలహాసన్ రజనీకాంత్ లకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు.
ఇలా తెరముందు ఎందరు హీరోలున్నా..
తెర వెనుక ఉన్నది ఆయనొక్కడే?
హీరోలకే కాదు కమెడియన్లకి పాడారు. పలు రకాల గొంతుల్ని అచ్చు అలానే దింపేయగల ప్రతిభ ఆయన సొంతం.
*అలా 1976లో వచ్చిన ‘మన్మథలీల’ సినిమాకుగానూ తొలుత కమలహాసన్కు గొంతు అరువిచ్చారు బాలు. ఆ తర్వాత కమలహాసన్కు పర్మనెంట్ డబ్బింగ్ ఆర్టిస్టయ్యారు. ‘దశావతారం’ సినిమాలో కమల్ పది పాత్రలకు పది రకాలుగా డబ్బింగ్ చెప్పారు.
డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే కాక కొన్ని పాటలకు మ్యూజిక్ డైరెక్టర్ గా, సినిమాల్లో ఆర్టిస్ట్ గా, నిర్మాతగానూ వ్యవహారించారు.
తెలుగులోనే కాదు, బాలీవుడ్ లోనూ 700లకు పైగా హిందీపాటలు పాడారంటే అతిశయోక్తి కాదు. ఇవేకాక ప్రైవేటు ఆల్బమ్స్ అయిన భక్తి గీతాలతో కలిపి 16 భాషల్లో మొత్తంగా 37వేలకు పైగా పాటలు ఆలపించి అందరినీ అలరించారు. సంగీత లోకంలో చరిత్ర సృష్టించారు.
*బాలుగారు సావిత్రిగారిని వివాహమాడారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు ఎస్పీ చరణ్ గాయకుడు. కూతురు ఎస్పీ శైలజ. నేపథ్య గాయని, ఈమె నటుడు శుభలేఖ సుధాకర్ ను పెళ్లి చేసుకున్నారు.
*’పాడుతా తీయగా’ కార్యక్రమంలో బాలుగారు న్యాయనిర్ణేతగా చాన్నాళ్ళు వ్యవహారించారు. ఈ వేదిక ద్వారా ఎంతోమంది గాయనిగాయకులను ప్రోత్సహించి, యంగ్ టాలెంట్ ను పరిశ్రమకు అందించారు.
ఆయన ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కానీ, పాటను విశ్లేషిస్తున్నప్పుడు గాని గమనిస్తే.. ఆయన ప్రతి తెలుగు అక్షరాల్ని స్పష్టంగా ఉచ్చరిస్తారు.
ఇదే తీరు అచ్చతెలుగు పాటల్నే ఆలపించేలా చేశాయి. అర్థంపర్థం లేని పాటలను ఆయన చాలా సున్నితంగా తిరస్కరించేవారట.
స్నేహితులు, బంధువులు, ఇంట్లో వాళ్లంతా బాలుగారిని ‘మణి’ అని పిలిచేవారు.
కె. విశ్వనాథ్, చంద్రమోహన్ ఈయనకు దూరపు బంధువులు అవుతారని తర్వాత తెలిసిందట.
స్నేహమంటే ఆయనకు చాలా ఇష్టం. మొదట్నుంచీ ఆయనకు స్నేహితులుగా ఉన్నవాళ్లు ఆయన చివరివరకు తోడుగానే ఉన్నారని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
గుర్తింపు:
భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ, పద్మభూషన్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.
ఇంకా 6 జాతీయ అవార్డులు, 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు లభించాయి. ఉత్తమ గాయకుడిగా పలు విభాగాలకు కలిపి 26 నంది అవార్డులు వచ్చాయి.
*1999లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ తో పాటు 2016లో శతవసంత భారతచలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం వరించింది.
యాభై ఏళ్లలో.. 16 భాషల్లో..
37వేల పాటల్ని ఆలపించి ప్రపంచ రికార్డు సృష్టించిన ఏకైన గాయకుడు ఇతడే!
2020 ఆగస్టులో కరోనా సోకిన రెండు నెలల తర్వాత శ్వాసకోశ సమస్యలు ఎక్కువై, ఆరోగ్యం విషమించి.. అదే ఏడాది సెప్టెంబర్ 20న చెన్నైలోని ఎంజేఎం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.