CINEMATelugu Cinema

తమిళ చలనచిత్ర పితామహుడు. ఆర్. నటరాజ మొదలియార్..

ప్రపంచంలో సంఖ్యా పరంగా అత్యధిక చిత్రాలు నిర్మించే చిత్ర పరిశ్రమ “భారతీయ చలన చిత్ర పరిశ్రమ”. భారతదేశంలో ఉండే దాదాపు అన్ని ప్రధాన భాషలలోను సినిమాలను నిర్మిస్తున్నారు. మిగిలిన భాషలకంటే తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, బెంగాలీ, మరాఠి భాషలలో సినిమా నిర్మాణం గణనీయంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో యేటా దాదాపుగా 1000 కి పైగా చిత్రాలు విడుదలవుతున్నట్టు అంచనా. మన దేశంలో నిర్మితమైన సినిమాలు కేవలం భారతదేశం లోనే కాక దక్షిణాసియా, రష్యా, అరబ్బు, ఆగ్నేయాసియా దేశాలలో కూడా ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. అయితే భారతదేశంలో సినిమా ప్రాణం పోసుకోవడానికి ప్రధానంగా ఒక అంకిత స్వభావుడి అరుదైన కృషి, జిజ్ఞాసల ఫలితంగా నూట పన్నెండు సంవత్సరాల క్రిందట భారతదేశంలో చలన చిత్ర రంగం ఆవిష్కారమైంది. ఆయనే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. భారతీయ మొట్టమొదటి చలనచిత్రం “రాజా హరిశ్చంద్ర” అనే మూకీ చిత్రాన్ని నిర్మించి 13 మే 1913 నాడు విడుదల చేసి “కార్పొరేషన్ సినిమా” ధియేటర్ లో వరుసగా 23 రోజులు ప్రదర్శించి రికార్డు నెలకొల్పారు. అంతటి ఘనత సాధించిన అతడు భారతీయ చలనచిత్ర పితామహుడుగా పిలువబడిన “దాదా సాహెబ్ ఫాల్కే” గా గణుతికెక్కారు. ఆ మూకీ చిత్రం నిర్మించే సమయానికి ఆయన వయస్సు 43 సంవత్సరాలు.

1912 వ సంవత్సరంలో మద్రాసులో “గెయిటీ” అనే శాశ్వత సినిమా థియేటర్ (చిత్ర ప్రదర్శన శాల) ను నిర్మించి, వాటితో బాటు “క్రౌన్”, “గ్లోబ్” సినిమా థియేటర్లను కూడా నిర్మించి, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ “Star of the East” ను స్థాపించి, 1921లో “భీష్మప్రతిజ్ఞ” అనే మూగ చిత్రాన్ని నిర్మించిన తెలుగు వారు “రఘుపతి వెంకయ్య నాయుడు”. ఈయనను తెలుగు చలనచిత్ర పితామహులు అని పిలుస్తారు. ఈయన ప్రసిద్ధ సంఘసంస్కర్త దివాన్ బహద్దూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు సోదరులు. “భీష్మప్రతిజ్ఞ” అనే మూగ చిత్రాన్ని నిర్మించే సమయానికి “రఘుపతి వెంకయ్య నాయుడు” వయస్సు 42 సంవత్సరాలు. అలాగే దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి మూకీ చిత్రం “కీచక వధ” (1918) నిర్మించినది “రంగస్వామి నటరాజ ముదలియార్”. తమిళ సినిమా పితామహుడిగా ప్రసిద్ధి చెందిన ఆయన నిశ్శబ్ద చలన చిత్రాల నిర్మాణంలో మార్గదర్శకులు. దక్షిణాన తొలి మూకీ సినిమా “కీచక వధ” నిర్మించే సమయానికి “నటరాజ ముదలియార్” వయస్సు కేవలం 33 సంవత్సరాలు మాత్రమే. అంతకుముందు ఆయనకు సినిమా రంగంలో ఏ మాత్రం పరిచయం లేదు. ఆటోమొబైల్ విడిభాగాల వ్యాపారిగా తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించి, మద్రాసులో “ఇండియన్ ఫిల్మ్ కంపెనీ లిమిటెడ్”ను ప్రారంభించారు.

తమిళనాడుకు చెందిన రంగస్వామి నటరాజ ముదలియార్ మద్రాసులో మూకీ సినిమా తీయాలనే సంకల్పంతో పూణే వెళ్లి చిత్ర నిర్మాణంలో ప్రాథమిక పాఠాలు నేర్చుకొని, ఆ రంగంలోకి ధైర్యంగా దూకారు. భారతీయులను బ్రిటిష్ వారు బానిసలుగా చూస్తున్న వంద సంవత్సరాల క్రిందట తన రెండో మూకీ చిత్రం “ద్రౌపది వస్త్రాపహరణం” చిత్రానికి “వైలెట్ బేరి” అనే పేరు గల ఒక బ్రిటిష్ వనితను ద్రౌపది పాత్రకి ఎంపిక చేసి వలువలు ఊడదీసే చిత్రాన్ని తెరకెక్కించారంటే, ఆ రోజుల్లో అతనికి ఎంతటి ధైర్యం ఉండాలో ఆలోచించాల్సిందే. అలాంటి ధైర్యశాలి “నటరాజ మొదలియార్”. 1918 నుండి 1928 వరకు పది సంవత్సరాలు, ఆరు మూకీ చలనచిత్రాలు చిత్రాలు “కీచక వధం”, “ద్రౌపది వస్త్రాపహరణం”, “మహి రావణుడు”, “లవ కుశ”, “రుక్మిణి – సత్యభామ”, “మార్కండేయ”. అంతే ఆ తరువాత భాగస్వాములతో విబేధాలు, స్టూడియో అగ్ని ప్రమాదం, కుమారుడి మరణం వెరసి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ముగిసిన తన ప్రస్థానం. 

మొట్టమొదటి దక్షిణ భారత తొలి మూకీ చిత్రాన్ని నిర్మించి పది సంవత్సరాలు చిత్ర రంగంలో కొనసాగిన నటరాజ మొదలియార్, ఆ తరువాత 40 సంవత్సరాలు చిత్ర పరిశ్రమతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నారు. ఆయన మరణించే సమయానికి కోటి రూపాయలు వసూళ్లు ఉన్న సినిమాలు వచ్చాయి. కానీ అవన్నీ చూస్తూ ఆయన మౌనంగా ఉండి పోయారు. దక్షిణ భారత సినిమా రంగానికి పునాదులు వేసి, పది సంవత్సరాలకు మించి ఆ రంగంలో కొనసాగ లేకపోవడం, ఆయన వేసిన బాటలో ఆయన ఎక్కువ కాలం నడవలేకపోవడం, తాను వేసిన పునాదుల మీద రమ్య భవంతులు పైకి లేస్తున్న తాను పక్కన ఉండిపోయి కేవలం ఒక ప్రేక్షకుడిలా మిగిలిపోవడం అదొక విచిత్రం, నటరాజ మొదలియార్ జీవితంలో విషాదం.

జీవిత విశేషాలు…

జన్మనామం  :   నటరాజ మొదలియార్ 

ఇతర పేర్లు   :    రంగస్వామి నటరాజ మొదలియార్

జననం   :     26 జనవరి 1885

స్వస్థలం :    వెల్లూరు , మద్రాస్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా

వృత్తి   :         సినిమా దర్శకుడు, సినిమా నిర్మాత, రచయిత, ఛాయాగ్రాహకుడు

తండ్రి          :      రంగస్వామి మొదలియార్

మరణ కారణం   :    వృద్ధాప్యం

మరణం      :     02 మే 1971, మద్రాసు

నేపథ్యం…

రంగస్వామి నటరాజన్ మొదలియార్ అప్పటి బ్రిటిష్ ఇండియాకు చెందిన మద్రాస్ ప్రెసిడెన్సీ, వెల్లూరు (తమిళనాడు) లో 26 జనవరి 1885 నాడు జన్మించారు. ఆయన తండ్రి ప్రముఖ పారిశ్రామిక వేత్త. నటరాజ మొదలియార్ పాఠశాల చదువు మాత్రమే చదువుకున్నారు. పాఠశాల చదువు అనంతరం తాను మద్రాసులో ఉండే తన మేనమామ ఎం.ఆర్. గురుస్వామి మొదలియార్ దగ్గరకు వచ్చేశారు. మేనమామ గురుస్వామి మొదలియార్ ప్రసిద్ధమైన వైద్యులు. ఆయన కుమారుడు ఎస్.ఎం. ధర్మలింగ మొదలియార్ తో కలిసి నటరాజ మొదలియార్ “వాట్సన్ అండ్ కంపెనీ” పేరుతో సైకిల్ వ్యాపారం మొదలుపెట్టారు. అందులో భాగంగా కొన్ని సైకిళ్లను విదేశాల నుండి దిగుమతి చేసుకునేవారు. అలాగే మరికొన్ని సైకిళ్లను భారతదేశంలోనే కొని వాటిని అమ్ముతూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ వచ్చారు. సైకిల్ ఉండటం అంటే విలాసవంతంగా భావించే ఆ రోజులలో (1910 ప్రాంతంలో) సైకిల్ ఖరీదు 25 రూపాయలు ఉండేది. “వాట్సన్ అండ్ కంపెనీ” పేరున ఉన్న ఎస్.ఎం. ధర్మలింగ మొదలియార్, నటరాజ మొదలియార్ ల భాగస్వామ్య వ్యాపారంలో డబ్బులు బాగా సంపాదించారు. 1911 వ సంవత్సరానికి వచ్చేటప్పటికి నటరాజ మొదలియార్ ధనవంతుడయ్యారు.

కార్ల వ్యాపారం చేసిన తొలి భారతీయుడు…

నటరాజ మొదలియార్ ధనవంతుడయ్యేటప్పటికి ఆయన వయస్సు 25 సంవత్సరాలు. వారి భాగస్వామ్యం అలా కొనసాగుతూనే బామ్మర్దులు ఇద్దరు కలిసి “రోమన్ అండ్ డాన్”  అనే కంపెనీ పేరున్న ఒక పరిశ్రమను కొన్నారు. దాని ద్వారా విదేశీ కార్లను దిగుమతి చేసుకుని, కార్ల యొక్క విడిభాగాలు అమ్మే వ్యాపారం మొదలుపెట్టారు. అప్పటివరకు భారతీయులు ఎవ్వరూ కూడా కార్ల వ్యాపారం చేయలేదు. ఆ విధంగా నటరాజ మొదలియార్ మొట్టమొదటగా విదేశీ కార్లు అమ్మిన భారతీయుడయ్యారు. అప్పటికి “ఎడిసన్” అనే ఒక విదేశీ కంపెనీ మాత్రమే కార్లు అమ్ముతూ ఉండేది. అలాంటి ఆ రోజులలో ఒక భారతీయుడు ఒక కంపెనీని స్థాపించి దాని ద్వారా దిగుమతి చేసుకున్న కార్లు అమ్మడం అనేది ఒక విశేషం అయిపోయింది. అలా కొనసాగిన వారి వ్యాపారం సుమారు ఐదు సంవత్సరాలు గడిచింది. అప్పుడప్పుడే మూకీ చిత్రాలు మొదలవుతున్న ఆ సమయంలో నటరాజ మొదలియార్ మనస్సు మూకీ చిత్రాల వైపు మళ్ళింది.

చలనచిత్ర రంగం…

అప్పటికే మన దేశపు తొలి చలనచిత్ర నిర్మాత “హరిశ్చంద్రా  భట్ వాడేకర్” 1899 లో బొంబాయిలో రెండు మూకీ చిత్రాలు నిర్మించాడు. దాదాసాహెబ్ ఫాల్కే తీసిన అత్యంత నిడివి గల మొట్టమొదటి భారతదేశపు చలనచిత్రం మరియు మూకీ చిత్రం “రాజా హరిశ్చంద్ర” 17 మే 1913 నాడు విడుదలయ్యింది. అది సుమారు రెండు మైళ్ళ పొడవుంటుంది. మూకీ చిత్రాలపై మనసు మళ్ళిన నటరాజ మొదలియార్ తాను కూడా సినిమా నిర్మాణం చేపట్టాలని అనుకున్నారు. దానిని ఎలా మొదలుపెట్టాలి? మూకీ చిత్రాన్ని ఎలా చిత్రీకరించాలి? అనే పలు అంశాలపై ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకున్నారు. అప్పటికి తన వయస్సు 30 సంవత్సరాలు. ఢిల్లీలో వైస్రాయ్ గా ఉండే బ్రిటీషు పాలకులు దర్బారులో జరిగే కార్యక్రమాలను చిత్రీకరించి డాక్యుమెంటరీగా మలిచి, వాటిని విదేశాలకు పంపించేసే స్టువార్ట్ అనే వ్యక్తి పూణేలో ఉండేవారు. ఆయన చిరునామా తెలుసుకొని, అతని వద్దకు వెళ్లి పరిచయం చేసుకుని ఆయన దగ్గర ఉన్న ల్యాబ్ లో ఛాయాగ్రహణం, ఫోటో ప్రాసెసింగ్, ఛాయా చిత్రాలు ముద్రించడం వంటివి నేర్చుకున్నారు నటరాజన్ మొదలియార్.

పూణేలో ఉన్నప్పుడు తానే స్వయంగా కొన్ని చిత్రాలు చిత్రీకరించి ప్రాసెసింగ్ చేసి, ప్రింటింగ్ చేసి స్టువార్ట్ కి చూపించి దాంట్లో ఉన్న తప్పొప్పులు తెలుసుకొని, వాటిని మెరుగుపరుచుకొంటూ ఉండేవారు. ఇలా కొంతకాలం ఆయన వద్ద శిష్యరికం చేశాక తిరిగి 1915 వ సంవత్సరంలో తిరిగి వెనక్కి మద్రాసుకు వచ్చేసి 1917లో “ఇండియన్ ఫిలిం కంపెనీ” అనే ఒక సంస్థను స్థాపించారు. దక్షిణ భారతదేశంలో అప్పటివరకు ఎవ్వరికీ కూడా సినిమా ఎలా తీయాలనే అవగాహన గానీ, ఆలోచన గానీ లేదు. తిరువయ్యాయూర్ లో ఒక షావుకారు వద్ద “విలియమ్సన్ మూకీ కెమెరా”, మరియు “ప్రింటర్” ఉండేది. ఆ షావుకారు లండన్ వెళ్లినప్పుడు కొనుగోలు చేశారు. కానీ వాటితో ఏం చేయాలో తెలియక, వాటిని ఇంట్లోనే జాగ్రత్తగా ఒక మూలన పెట్టేశారు. అది తెలిసిన నటరాజ మొదలియార్ ఆ వస్తువులను పద్దెనిమిది వందల రూపాయలు పెట్టి ఆ షావుకారు వద్ద కొనుగోలు చేశారు.

తొలి మూకీ సినిమా “కీచక వధ” (1918)…

నటరాజ మొదలియార్ కు మూకీ చిత్రీకరణలో సహాయకుడిగా జగన్నాథ చారి అనే వ్యక్తిని తీసుకున్నారు. తనను కూడా పూణే పంపించి స్టువార్ట్ దగ్గర ఛాయాగ్రహణం, ఫిల్మ్ డెవలప్ మెంట్ లాంటివి నేర్పించారు. ఒక సంవత్సరం నేర్చుకుని తిరిగి వచ్చిన జగన్నాథ చారితో కలిసి సినిమా నిర్మాణం ప్రారంభించారు నటరాజ మొదలియార్. ఇప్పట్లో సినిమా నిర్మాణం జరగాలంటే ఎన్ని రకాల శాఖలు, వాటిలో అనేకమంది కష్టపడితే గానీ సినిమా నిర్మాణం పూర్తి కాదు. కానీ అప్పుడప్పుడే సినిమా నిర్మాణం మొదలైన ఆ రోజులలో నిర్మాణానికి సహాయం చేసేవారు కూడా లేరు. నటరాజ మొదలియార్ సినిమా తీయాలంటే ఒక స్టూడియో అవసరం. అందుకోసం మద్రాసు మిల్లర్స్ రోడ్డులో ఒక బంగాళాను అద్దెకు తీసుకుని అందులో ఒక షెడ్డు నిర్మించారు.

ఆ షెడ్డు పై ఒక తెల్లని గుడ్డను కప్పారు. అలా చేయడం వలన చిత్రీకరణకు అవసరమైన సూర్యకాంతి అందులో నుండి వస్తుంది. సాధారణ కాంతి కోసం, సూర్యకాంతిని మాత్రమే వాడుతూ ఉండేవారు. అలా ఒక స్టూడియో నిర్మాణం పూర్తయ్యింది. అలా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి స్టూడియో ఏర్పడింది. స్టూడియో, కెమెరా, దానిని ఉపయోగించడానికి నటరాజ మొదలియార్ తో బాటు, మిత్రుడు జగన్నాథ చారి కూడా ఉన్నాడు. కాకపోతే సినిమా తీయడానికి కథ కావాలి. ఆ కథ కోసం అన్వేషిస్తున్న క్రమంలో నాటకాలకు దర్శకత్వం వహిస్తున్న “పెమ్మల్ సంబంధం మొదలియార్” అనే వ్యక్తి దగ్గర “కీచక వధ” అనే కథను తీసుకున్నారు. పౌరాణిక కథలు బాగా ప్రాచుర్యం ఉన్న ఆ రోజులలో అప్పటికే “కీచక వధ” అనే కథ విజయవంతం అవుతుంది. అందువలన దానిని సినిమాగా తీయమని సలహా ఇచ్చారు నటరాజ మొదలియార్ కు సలహా ఇచ్చారు పెమ్మల్ సంబంధం మొదలియార్.

తొలి మూకీ నిర్మాణం 35 వేల రూపాయలు…

“కీచక వధ” కథను సినిమా తీసే క్రమంలో దానికి కావలసిన స్క్రిప్టును ప్రముఖ న్యాయవాది రంగ వడివేలు, మరియు ఆయన సహాయకులు తిరు వెంకటస్వామిని కలిసి స్క్రిప్టు వ్రాయడానికి ఒప్పుకున్నారు. నిజానికి అది మూకీ సినిమా. టాకీ సినిమాకి మాత్రమే స్క్రిప్టు ఉంటుంది అనుకుంటారు. మాటలు లేని సినిమా కూడా స్క్రిప్టు కావాలి. ఏ దృశ్యం తరువాత ఏ దృశ్యం చిత్రీకరణ చేయాలి. ఎవరు ఏ ప్రక్కన నిల్చోవాలి? ఎలాంటి హావాభావాలు పలికించాలి? ఇలాంటి స్క్రిప్టు రంగ వడివేలు, తిరు వెంకటస్వామి కలిసి వ్రాశారు. కీచకుడి పాత్రకు రాజ మొదలియార్ ను తీసుకున్నారు. జీవరత్నం అనే నటిమణిని సైరంథ్రి పాత్రకు తీసుకున్నారు. సినిమాకు తగిన కథ తయారయ్యింది. చిత్రీకరణకు కావలసిన కెమెరా అందుబాటులో ఉంది. దానికి ఉపయోగించడానికి సహాయకుడు జగన్నాథ చారి ఉన్నాడు. చిత్రీకరణకు కావలసిన స్టూడియో లాంటి షెడ్డు ఉంది. సినిమాకు కావలసిన నటీనటులు ఉన్నారు. వారికి నటనలో శిక్షణ ఇవ్వడానికి రంగవడివేలు సహాయం చేశారు. 

సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. “కీచక వధ” సినిమాను ఎక్కువగా అవుట్ డోర్ లోనే చిత్రీకరణ చేశారు. రవి వర్మ వేసిన బొమ్మలను చూసి అలాగే నటీనటులకు మేకప్ వేయడం చేశారు. షణ్ముగం అనే వ్యక్తి సినిమా సెట్టింగ్స్ ఎలా వేయాలో చూపించారు. దర్శకుడు, నిర్మాత, ప్రింటింగ్, ఛాయాగ్రహణం అన్నీ కూడా నటరాజ మొదలియార్ చూసుకున్నారు. ఆ విధంగా అన్నీ సిద్ధమయ్యాక ముప్పై ఐదు రోజులలో “ఫీచర్ ఫిలిమ్” ను పూర్తి చేశారు. అప్పటికే మూడు, నాలుగు నిమిషాలు నిడివి గల మూకీలు అప్పటికే వచ్చాయి. కానీ మొట్టమొదటిసారిగా అత్యధిక నిడివి గల “ఫీచర్ ఫిల్మ్” ను నటరాజ మొదలియార్ తెరకెక్కించారు. వాటికి సబ్ టైటిల్స్ తమిళంలో మేనమామ “గురుస్వామి మొదలియార్”, హిందీలో మహాత్మా గాంధీ కొడుకు దేవదాసు గాంధీలు వ్రాశారు. ఐదు నెలల సమయం, 35 వేల రూపాయలు ఖర్చతో ఈ సినిమాను పూర్తి చేసి, 1918 వ సంవత్సరంలో మద్రాసులోని  ఎలిఫింగ్ స్టన్ థియేటర్ లో ఈ సినిమాను విడుదల చేశారు.

ద్రౌపది పాత్రలో బ్రిటీషు యువతి “వైలెట్ బేరీ”…

“కీచక వధ” సినిమా విడుదలయ్యింది. బొమ్మలు కదులుతుంటే ప్రేక్షకులకు ఆశ్చర్యం వేసింది. రోజుకు రెండు ఆటలు, శనివారం, ఆదివారం మ్యాట్నీ కలిపి రెండు వారాలు సినిమా ప్రదర్శింపబడింది. ఈ సినిమా మద్రాసు నగరంలోనే కాకుండా రంగూన్, కరాచీ లాంటి నగరాలలో కూడా ప్రదర్శించారు. నటరాజ మొదలియార్ ఖర్చు చేసిన 35 వేల రూపాయల పెట్టుబడికి 50 వేల రూపాయలు వచ్చాయి. లాభం వచ్చిన ఉత్సాహంతో నటరాజ మొదలియార్ రెండవ సినిమాగా “ద్రౌపదీ వస్త్రాపహరణం” అనే మూకీ సినిమాను మొదలుపెట్టారు. ఇందులో చీరలాగే సన్నివేశం ఉండడంతో అందులో నటించడానికి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. దానితో  “వైలెట్ బేరీ” అనే బ్రిటిష్ వనితను ఒప్పించారు. ఆమెకు తమిళం రాదు. నటించవలసిన దుశ్శాసన పాత్రధారికి ఆంగ్లం రాదు. చివరకు ఇంగ్లీషు తెలిసిన దొరస్వామి పిళ్లై ఇద్దరు నటీనటులకు సినిమాలో ఎలా నటించాలో వివరించారు. మొదటి సినిమా కంటే తక్కువ ఖర్చు లోనే ఈ సినిమాను పూర్తి చేయగలిగారు. “ద్రౌపదీ వస్త్రాపహరణం” మూకీ సినిమాను 1919 వ సంవత్సరంలో విడుదల చేశారు. ఈ సినిమాకు 75 వేల రూపాయలు వసూళ్లు వచ్చాయి. 

రుక్మిణీ పాత్రలో బ్రాహ్మణ యువతి “జానకి”…

దీని తరువాత “లవకుశ” అనే మూకీ సినిమాను తెరకెక్కించారు. నాలుగవ సినిమాగా “రుక్మిణీ – సత్యభామ” అనే సినిమాను నిర్మించారు నటరాజ మొదలియార్. ఇందులో “జానకి” అనే ఒక బ్రాహ్మణ యువతితో రుక్మిణీ పాత్రలో నటింపజేశారు. సినిమా లంటే చిన్నచూపు చూస్తూ, మహిళలను ఇంట్లో నుండి బయటకు అడుగుపెట్టనివ్వని ఆ రోజులలో ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన మహిళా సినిమాలలో నటించడం కూడా ఒక విశేషమే. ఐదవ మూకీ సినిమాగా “మార్కండేయ”, ఆరవ చిత్రంగా “మైరావణ” అనే సినిమాను తెరకెక్కించారు. పది సంవత్సరాలు ఆరు మూకీ సినిమాలు, అన్నీ పౌరాణికాలే తెరకెక్కించారు నటరాజ మొదలియార్. సగటున మూకీ చిత్రాల పొడవు ఏడు వేల అడుగులు. ఒక్కొక్క సినిమాకు సగటున 15 వేల రూపాయలు ఖర్చు అయ్యేవి. రెండు సినిమాలు వెంటవెంటనే తీసినప్పుడు ఒకే సెట్ ని మార్పు చేసి సినిమాకు తగ్గట్టుగా మార్పులు చేసి దర్శకులు చిత్రీకరిస్తుండేవారు. ఇలా 1918 లో మొదలైన చిత్ర నిర్మాణం 1928 – 29 వరకు కొనసాగింది.

మరణం…

సినిమాలో పనిచేసిన వారికి 50 రూపాయలకి తగ్గకుండా, 150 రూపాయలకి మించకుండా నెల జీతాలు ఇచ్చేవారు. ఆ రోజులలో నటీనటులు రిక్షాలో వస్తూ ఉండేవారు. నటీనటులకు పూర్తిగా అభ్యాసం ఇచ్చాక మాత్రమే సినిమా తీసేవారు. మాటలు లేకుండా హావాభావాలు పలికించడం కష్టం కాబట్టి టాకీ సినిమాల కంటే, మూకీ సినిమాలు తీయడం చాలా కష్టం అని నటరాజ మొదలియార్ అనేవారు. చిత్ర సీమలో 1929 వరకు సాఫీగానే సాగిన నటరాజ మొదలియార్ సినీ ప్రయాణంలో అప్పటివరకు ఆయనతో భాగస్వామిగా ఉన్న వ్యాపారవేత్తలు ఆయనను విభేదించి వెళ్లిపోయారు. ఆయన ఇష్టంతో కట్టుకున్న స్టూడియో అగ్ని ప్రమాదానికి లోనైంది. ఇదిలా ఉండగానే తన కుమారుడి మరణం కూడా నటరాజ మొదలియార్ ను దెబ్బతీసింది. ఆయన మానసికంగా కృంగిపోయారు.

1929 తరువాత ఆయన పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఆయన చిట్టచివరి మూకీ చిత్రం “మైరావణ” తీసే సమయానికి ఇంకా భారతీయ చలనచిత్ర సీమలో టాకీ సినిమాలు మొదలవ్వలేదు. 1932 వ సంవత్సరంలో విడుదల అయిన తొలి మాటలు నేర్చిన టాకీ సినిమా “ఆలం ఆరా” (1932) సినిమా విడుదలకు మూడు సంవత్సరాల ముందే  1929 వ సంవత్సరంలో సినిమా రంగం నుండి విరమించారు నటరాజ మొదలియార్. ఆ తరువాత 1971 వరకు సుమారు 42 సంవత్సరాలు జీవించే ఉన్నారు. దక్షిణ భారతదేశంలో సినిమాలకు ఆద్యుడుగా, సినిమా రంగానికి పునాది వేసిన నటరాజ మొదలియార్ 02 మే 1971 నాడు ఈ లోకం నుండి అస్తమించారు.

Show More
Back to top button