
“బిచ్చగాడికి అయినా కోటీశ్వరుడికైనా అమ్మ ప్రేమ ఒకేలా ఉంటుంది. దేశానికి, దేవుడికి కూడా బిచ్చగాడు, కోటీశ్వరుడు అనే తేడా ఉండకూడదు. సరస్వతీ దేవీ తలవంచుకోకుండా ఉండేలా సినిమా తీయాలని ప్రతిసారి ప్రయత్నిస్తుంటాను, కానీ ఈ సారి మాత్రం సరస్వతి దేవీ తల ఎత్తుకుని చూసే సినిమా తీశాను. గర్వంతో కాదు నిజాయితీతో ఈ మాటలు చెబుతున్నాను” ఇవి “కుబేర” సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో శేఖర్ కమ్ముల అన్న మాటలు. వాటిని అక్షరాలా నిజం చేసి చూపాడని కుబేర చిత్రాన్ని చూసిన ప్రతీ ప్రేక్షకుడికి అనిపిస్తుంది.
ప్రస్తుతం మానవ సమాజములో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వస్తువు డబ్బు. దాని మోజులో పడ్డ మనిషి దేనికైనా తెగించగలడు. ఆ డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడు. డబ్బే మనిషిని భూమి నుండి ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోగలదు, అదే డబ్బు భూమి నుండి పాతాళానికి తోసేయగలదు. ఇత్యాది విషయాన్ని కళ్ళకు కట్టినట్టు “కుబేర” సినిమాలో చూపించాడు శేఖర్ కమ్ముల. దేశాన్ని నడిపించేది డబ్బు, పలుకుబడి మాత్రమే. ఇక్కడ నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం వీటికి చోటే లేదు అనుకునే సగటు పౌరుడిలో నెలకొని ఉన్న ఆవేదనకి ఈ సినిమా అద్దం పడుతుంది.
బిలియనీర్ అనే ముసుగులు వేసుకొని, బిజినెస్మ్యన్ అని రంగులు అద్దుతూ, దేశాన్ని, దేశ సంపదను దోచుకునే బడా కార్పొరేట్ లని గుడి మెట్లపై అడుక్కునే ఒక సాదాసీదా బిచ్చగాడు ఎలా ఢీ కొట్టాడనే ఒక అద్భుతమైన కథతో, కుబేర అనే సినిమా కథనాన్ని నడిపించిన తీరు హర్షనీయం. తాను నమ్మిన కథని ఎంత నిజాయితీగా చూపిస్తే, ప్రేక్షకులకు అంత బాగా నచ్చుతుంది అన్న దానికి కట్టుబడి తెరకెక్కించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. అలానే బిచ్చగాళ్లు కూడా మాములు మనుషులే అని, వాళ్లని అంటరానివాళ్లలా చూడాల్సిన అవసరం లేదని, వాళ్ల వల్ల ఎలాంటి నష్టం లేదనే దృగ్విషయాన్ని ప్రేక్షకుల గుండెల్లోకి సూటిగా దించేయడంలో శేఖర్ కమ్ముల సఫలీకృతం అయ్యారు.
కథ…
కేంద్రమంత్రి అవినీతిని బయటపెట్టడంతో అన్యాయంగా జైలు పాలు అవుతాడు సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున). అవినీతికి తలొగ్గని దీపక్, కోర్టుకు వెళ్లినా కూడా న్యాయం జరుగకుండా ఏడేళ్లు జైలుశిక్ష పడుతుంది. శక్తివంతమైన మరియు ప్రతిష్టాత్మక వ్యాపారవేత్తగా పేరున్న నీరజ్ మిత్రా ( జిమ్ సర్భ్ ) బంగాళాఖాతంలో దాగి ఉన్న అరుదైన చమురు నిల్వల మీద ఆశపడుతాడు, కన్నేస్తాడు. ఆ సంపదను ఎలాగైనా ఛేజిక్కించుకోవాలనే, దురాశతో అగ్ర నాయకుల మద్దతుతో ఒక రహస్య మిషన్ను ప్రణాళిక చేస్తాడు. అందుకు సహాయపడవలసిందిగా ఒకప్పుడు నిజాయితీపరుడు, అవినీతికి తలొగ్గడానికి నిరాకరించినందుకు జైలులో ఉన్న సీబీఐ అధికారి దీపక్ ను కోరతాడు. తన భార్య బిడ్డల యోగక్షేమాల కోసం తప్పనిసరియై నీరజ్ మిత్రాకు సహాయం చేయడానికి దీపక్ అంగీకరిస్తాడు. నిజానికి నీరజ్ దురాశలో అతనికి భాగస్వామ్యం లేకపోయినా కొన్ని విపత్కర పరిస్థితులు అతన్ని ఆ ప్రణాళికలోకి నెట్టివేస్తాయి. లక్ష కోట్ల నల్లధనాన్ని కేంద్రమంత్రుల బినామీ ఖాతాల్లోకి బదిలీ చేయాలి. అందులో 50 కోట్లను తెల్లధనంగా, మరో 50 కోట్లను నల్లధనంగా బదిలీచేయాలి.
ఇందుకోసం సీబీఐ అధికారి దీపక్ దేశవ్యాప్తంగా ఉన్న బిచ్చగాళ్లను వెదికి అందులో నలుగురిని ఎంపిక చేసి, వాళ్ళ పేరు మీద ఒక్కొక్కరి ఖాతాలో 10 వేల కోట్ల రూపాయలు జమ చేస్తాడు. ఒక్కొక్కరిని తీసుకెళ్లి ఆ డబ్బును బినామీ ఖాతాకు మళ్ళించిన వెంటనే ఆ బిచ్చగాడిని నీరజ్ మిత్రా మనుషులు చంపేస్తుంటారు. ఆ నలుగురు బిచ్చగాళ్లలో ఒకరు దేవా (ధనుష్). అతను నిజాయితీ, దయ కలిగిన అమాయక వ్యక్తి. అతని ఖాతాలో కూడా డబ్బు జమచేసి బినామీ ఖాతాకి మళ్ళిస్తున్న క్రమంలో తనను చంపబోతున్నారనే విషయం తెలుసుకుని అతను తప్పించుకుంటాడు. అలా తప్పించుకుని పారిపోతున్న క్రమంలో దేవా కు సమీరా (రష్మిక మందన్న) కలుస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? అసలు దేవా ఎందుకు పరుగెత్తాడు? ఎందుకు తప్పించుకున్నాడు? దేవా ను వెతుకుతున్న క్రమంలో పోలీసు అధికారి అశోక్ గాడ్బోలే (సాయాజీ షిండే) ని దీపక్ ఎందుకు చంపాల్సి వచ్చింది? నీరజ్ మిత్రా కేంద్ర మంత్రులకు లక్ష కోట్లు ఎందుకు ఇవ్వాలనుకున్నాడు? దేవాను పట్టుకోవడానికి నీరజ్ మిత్రా బృందం చేసిన ప్రయత్నం ఫలించిందా? బిచ్చగాడైన దేవా, ధనవంతుడైన నీరజ్ చోప్రా కు చెప్పిన గుణపాఠం ఏమిటి? బడా వ్యాపారవేత్త నీరజ్ చోప్రా ఏవిధంగా పతనం అయ్యాడు? ఇదంతా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
తారాగణం…
నీతిని, న్యాయాన్ని నమ్మిన సీబీఐ అధికారి ప్రస్తుత వ్యవస్థలో చేతిలో ఓడిపోయి, మంచికీ చెడుకూ మధ్య ఊగిసలాడి, అంతిమంగా మంచివైపు నిలబడి తన ప్రాణాలను వదులుకోవడానికి వెనుకాడని సగటు తండ్రి పాత్రలో నాగార్జున..
చిన్నతనం లోనే తల్లిని తండ్రిని పోగొట్టుకుని, సమాజంపై అవగాహన లేని, వ్యవస్థ గురించి తెలియని, ఏమీ ఆశించని, ఒక బిచ్చగాడి పాత్రలో ధనుష్..
రాజు అనే వ్యక్తిని ప్రేమించి మోసపోయిన ప్రేమికురాలిగా, అమాయకత్వంగా ఉంటూనే జరుగుతున్న పరిణామాల నుండి బాధ్యతలు తెలుసుకున్న సగటు చదువుకున్న అమ్మాయి పాత్రలో రష్మిక..
డబ్బు, అధికారం ఉంటే దేనినైనా శాసించవచ్చు అనే గర్వంతో, ఈ సృష్టిలో అన్నీ తనకే కావాలనుకుని, డబ్బుతో ప్రపంచాన్ని తన ఆధీనంలో నడవాలని, డబ్బు కోసం ఈ విశ్వాన్ని సైతం మింగేయాలనుకునే అపర కోటీశ్వరుడి పాత్రలో జిమ్ సర్బ్..
వీరితో బాటుగా నీరజ్ తండ్రిగా దలీప్ తాహిల్, ఎస్ఐ అశోక్ గాడ్బోలే పాత్రలో సాయాజీ షిండే,
దీపక్ భార్య శిల్పగా సునైన, దివ్య డేకటే, కౌశిక్ మహాత, సౌరవ్ ఖురానా, కల్నల్ రవి శర్మ, హరీష్ పేరడి తదితరులు ప్రతీ ఒక్కరూ ఈ చిత్రంలో నూటికి నూరుపాళ్ళు తమ పాత్రలకు న్యాయం చేశారు.
కథనం..
ఎడారిలాంటి తెలుగు చిత్రపరిశ్రమకు ఒయాసిస్సులు శేఖర్ కమ్ముల సినిమాలు. తెలుగు సినిమాకు “ఆనంద్” తో కొత్తదనాన్ని తీసుకువచ్చారు శేఖర్ కమ్ముల. ఆయన తెరకెక్కించిన సినిమాలు అందంగా బావుంటాయి, అప్పుడప్పుడూ ఆలోచించేలా చేస్తాయి, ప్రేమలో పడేలా కూడా చేస్తాయి. ఇక కుబేర సినిమా విషయానికి వస్తే మంచి అభిరుచి ఉన్న శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడికి నాగార్జున, ధనుష్ లాంటి మంచి కథానాయకులు తోడైతే సినిమా ఏవిధంగా ఉంటుందో చెప్పే సినిమా కుబేర. స్టార్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చిన నాగార్జున లాంటి అగ్ర కథానాయకులు తమకు ఒక సరైన కథ దొరికితే, ఎలాంటి పాత్రలు రూపుదిద్దుకొంటాయో తాను స్వయంగా నిరూపించారు. సీబీఐ అధికారి దీపక్ పాత్రలో చాలా బాగా నటించాడు.
ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిచ్చగాడు దేవ పాత్రలో జీవించాడు. ఇలాంటి పాత్రను ఒప్పుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. అందుకు ధనుష్ ను అభినందించాల్సిందే. ఏ ఒక్క సన్నివేశంలో కూడా తన పాత్ర నుంచి బయటకు రాలేదు. రష్మిక నటన కూడా చాలా బావుంటుంది. ఆరంభంలో హాస్యాస్పదంగా ఉన్న తన పాత్ర యొక్క ప్రాధాన్యత ఏమిటనేది సినిమా నడుస్తున్నా కొద్దీ తెలుస్తుంది. ప్రతినాయక పాత్రను పోషించిన జిమ్ సర్బ్ కూడా తన నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. వీరితో పాటు ప్రతీ ఒక్క నటులు తమవంతుగా చక్కగా నటించారు. నూటికి నూరు శాతం న్యాయం చేసేశారు. భూమి అనే రంగస్థలంపై మనిషిని ఏ పాత్ర కావాలంటే, ఆ రకమైన పాత్ర వేయించి, ఆ పాత్రలో ఆడించే శక్తి డబ్బుకి ఉంది. ఆ క్రమంలో మనిషి పడే ఆరాటాన్ని దర్శకుడు చాలా చక్కగా తెరకెక్కించాడు.
ముగింపు…
శేఖర్ కమ్ముల ఏ సినిమా కూడా ఇప్పటివరకు 100 కోట్ల రూపాయలు వసూలు చేయలేదు. తన సినిమాలో ఐటమ్ సాంగ్స్ ను జోడించి యువతను థియేటర్ కు రప్పించే ప్రయత్నం ఏనాడూ చేయలేదు. గతి తప్పిన హాస్య సన్నివేశాలు ఉండవు, శృతిమించిన శృంగార దృశ్యాలకు తన సినిమాలలో చోటుండదు. ఈ సినిమాలో కూడా అంతే. సినిమా తెరకెక్కించే క్రమంలో దర్శకుడు తాను చెబుతున్న విషయం, అంశం మీద నిజాయితీ ఉంటే ఏ కథ అయినా నిలబడుతుందని శేఖర్ కమ్ముల మరోసారి రుజువుచేశాడు.
ఈ సమాజంలో కేవలం బిచ్చగాడు మాత్రమే అడుక్కునే వాడు కాదు, ఉద్యోగాలు అడుక్కునే వాడు, పెట్టుబడులు అడుక్కునే వాడు, పదవులు, పొజిషన్స్ ఇలా సమాజంలో ఇవన్నీ అడుక్కునే వారే ఉన్నారు. కాకపోతే ఆడుకోవడం అనే పదం కేవలం బిచ్చగాడికి మాత్రమే వర్తిస్తుందన్నట్టు సమాజంలో రుద్దబడింది అనే అంశాన్ని బలంగా కథలో చొప్పించి అద్భుతంగా చిత్రాన్ని మలిచాడు. కథలో ఉన్న ప్రాణమే సినిమాలోని ప్రతీ సన్నివేశంలో, ప్రతీ పాత్రల్లో కనిపించింది. ప్రేక్షకుడు ఏ నమ్మకంతో అయితే థియేటర్ కు వస్తాడో, దానిని పరిపూర్ణంగా ఆస్వాదిస్తూ అంతే సంతృప్తిని పొంది బయటకు వస్తాడు.

