
వర్షాకాలం ప్రారంభమైంది. నాలుగు నెలల పాటు కొనసాగే ఈ వర్షాకాలంలో జోరు వానలు కురవడం వల్ల నదులు చెరువులు కుంటలు పిల్ల కాలువలు జలకళను సంతరించుకుంటాయి. పుడమంతా పచ్చదనం తివాచీ పరిచినట్టు ప్రకృతి రమణీయత కన్నులకు ఇంపుగా కనిపిస్తుంది. అన్ని కాలాలలోకెల్లా వర్షాకాలం అంటేనే పుడమ తల్లికి ప్రకృతి మాతకు మరింత అందాన్ని తీసుకువవచ్చే కాలం. ఈ కాలంలో రైతులు కోటి ఆశలతో పంటలను ప్రారంభిస్తారు. సమస్త జీవనాధారం నీటిపైనే ఆధారపడి ఉంది. ఈ వర్షాకాలంలో నీరు సమృద్ధిగా ఉండడంతో పంటలు బాగా పండి రైతులు సంతోషంతో జీవిస్తారు. ఒక రైతులకు మాత్రమే కాదు ప్రకృతి ప్రేమికులకు ఈ వర్షాకాలం ఎంతో ప్రియప్రదమైనది. ఎక్కడ చూసినా పచ్చదనంతో జలకళతో ప్రకృతి నిండి ఉంటుంది.
జోరుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలన్నీ నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఈ వర్షాకాల సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని జలపాతాలను తప్పకుండా సందర్శించాల్సిందే. చుట్టూ పచ్చని ప్రకృతి, మధ్యలో కొండల నడుమ నుంచి జాలువారే జలపాతాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ప్రకృతి రమణీయతతో ఉట్టిపడే, మంత్ర ముగ్దులను చేసే అద్భుతమైన జలపాతాలు తెలంగాణలో చాలానే ఉన్నాయి. ఆ అద్భుతమైన జలపాతాల గురించి తెలుసుకందాం.
కుంటాల జలపాతం…
కుంటాల జలపాతం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. నేరడిగొండ గ్రామము నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జలపాతం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. కడెం నదిపై సహ్యాద్రి పర్వత శ్రేణి మధ్యలో ఉంటుంది ఈ జలపాతం. కడెం ప్రాజెక్టు నుంచి 45 మీటర్ల లోతుతో ప్రవహించి, అరణ్యంలోకి కలుస్తాయి. రాష్ట్రంలోనే ఇది అతి ఎత్తైన జలపాతం. ఈ అద్బుతమైన జలపాతం విస్తృతంగా ప్రవహించేటపుడు జలదారలు చూడడం ఒక అద్భుతం. వర్షాకాలం, శీతాకాలంలో ఈ జలపాతం చూడడానికి అనువైన సమయం. ఇక్కడ సోమేశ్వర స్వామి అని పిలువబడే శివలింగం ఈ జలపాతం దగ్గరలో ఉంది. మహా శివరాత్రి పర్వాదినాన ఇక్కడ అనేక మంది భక్తులు సందర్శించి శివ దర్శనం చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలోని జలపాతాలలో ముందుగా గుర్తు వచ్చేది కుంటాల జలపాతం.
పొచ్చెర జలపాతం…
తెలంగాణ రాష్ట్రంలోని సహజ సౌందర్యాలలో దాగి ఉన్న మరో గొప్ప జలపాతం పొచ్చేర జలపాతం. ప్రకృతి, ప్రశాంతమైన విహారయాత్ర కోరుకునే వారికి ప్రశాంతతలను కలిగించే ప్రదేశం ఇది. తెలంగాణ రాష్ట్రంలోని లోతైన జలపాతాలలో ఇది ఒకటి. నిర్మల్ పట్టణ కేంద్రం 37 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పచ్చని అడవుల మధ్యలో ఉన్న ఈ జలపాతం ఆదిలాబాద్ పట్టణం నుండి 50 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతాన్ని ఫ్లంజ్ వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. రోడ్డు మార్గం ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. సందర్శకులు జలపాతం వద్దకు చేరుకోడానికి టాక్సీ లేదా ప్రైవేట్ వాహనం తీసుకోవాలి. పొచ్చేర జలపాతం దాదాపు 20 మీటర్లు ఎత్తు నుండి కిందకు పడే అద్భుతమైన జలపాతం. ఈ జలపాతం చుట్టు పచ్చని అడవులు నిర్మలమైన వాతావరణం ఉంటుంది
ఇక్కడకు వచ్చిన సందర్శకులు ట్రెక్కింగ్ వంటి సహజ కార్యకలాపాలలో కూడా పాల్గొంటారు. శిక్షణ పొందిన నిపుణులు మార్గదర్శకత్వంలో ఈ జలపాతం సమీపంలోని రాపేల్లింగ్ నిర్వహిస్తారు. అయితే వర్షాకాలంలో ఈ జలపాతం వద్ద నీటిమట్టాలు ప్రమాదకరంగా ఉంటాయి. కాబట్టి ఈ జలపాతాన్ని శీతాకాలంలో సందర్శించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గాయత్రీ జలపాతం…
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో గల గోదావరి నదికి ఉపనది అయిన కడెం నది పచ్చదనం మధ్య ఉన్న ఈ సహజ జలపాతమే గాయత్రీ జలపాతం. ఈ జలపాతం చూడడానికి ఎంతో ప్రశాంతమైనదిగా ఉంటుంది అందువల్ల దేవి గాయత్రి మాత పేరు ఈ జలపాతానికి పెట్టారు. సుమారు 100 అడుగుల ఎత్తు నుండి నీరు కిందికి జాలువారుతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ జలపాతం వద్ద అద్భుతమైన వృక్షజాలం, జంతుజాలం రంగురంగుల సీతాకోకచిలుకలు అనేక రకాలైన పక్షులను చూడవచ్చు. ఫోటోగ్రఫీకి అనువైన ప్రదేశం. గాయత్రి జలపాతం వద్ద స్వర్గధామంగా కనిపిస్తోంది. ఇక్కడ నీటి శబ్దం ప్రశాంతమైన చెట్ల నుండి వీచే సున్నితమైన గాలి మిస్మయానికి గురిచేస్తుంది. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం ఈ గాయత్రి జలపాతం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ పురాతన మల్లికార్జున స్వామి ఆలయం ప్రధాన పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు. గాయత్రి జలపాతాన్ని సందర్శించిన అనేకమంది శ్రీశైలం పరమేశ్వరుని దర్శించుకుంటారు.
కనకై ఈ జలపాతం…
ఈ జలపాతం అదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతానికి 35 కిలోమీటర్ల దూరంలో నిర్మల్ జిల్లా నుంచి 54 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. కడెం నదిపై ఉన్న అందమైన జలపాతాలలో ఇది ఒకటి. ఈ జలపాతానికి మరొక పేరు కనకదుర్గ జలపాతం. గిర్నూర్ అనే చిన్న గ్రామానికి సమీపంలో ఈ జలపాతం ఉంది. ఇక్కడ ఉండే కనకదుర్గ దేవాలయానికి పండగల సమయంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ జలపాతం చుట్టూ ప్రాంతం దట్టమైన అటవితో కూడుకొని ఉంటుంది. జలపాతం 30 అడుగుల ఎత్తు నుండి కిందకు జాలు వారుతూ ఉంటుంది. జలపాతం దిగువన ఓ పెద్దకొలను సందర్శకులను ఆకర్షిస్తుంది. జలపాతం పైకెక్కినప్పుడు జలపాతం చుట్టుపక్కల ప్రాంతాల యొక్క విస్తృత దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. బండ్రేవ్, చీకటి గుండం, కనకై ఈ మూడు జలపాతాలు కలిసి ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తాయి. ఒక వర్షాకాలంలో మాత్రమే ఈ జలపాతం లో నీరు ఉండడం వల్ల ప్రకృతి ప్రేమికులు ఈ కాలంలోనే వస్తారు. ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉండవు కాబట్టి జలపాతాన్ని చూడ్డానికి వచ్చే సందర్శకులు తమ వెంట ఆహారం, వాటర్ బాటిల్ తప్పనిసరిగా తెచ్చుకోవాల్సి ఉంటుంది.
బొగతా జలపాతం…
తెలంగాణ రాష్ట్రంలో అందమైన జలపాతాలలో బొగత జలపాతం ఒకటి. ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో ఈ జలపాతం ఉంది. ఈ బొగతా జరపాతాన్ని తెలంగాణ నయాగరాగా పిలుస్తారు. ఇక్కడ నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది తక్కువ ఎత్తునుండే వాటర్ జాలువారుతూ ఉంటాయి. అయినప్పటికీ పెద్ద నదిని తలపించేలా ఈ జలపాతం కనిపిస్తోంది. ఈ జలపాతం వద్ద ఫోటోలు సెల్ఫీలు తీసుకోవడానికి అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ అడవిలో స్నేహితులతో, బంధువులతో కలిసి ట్రావెల్ చేయడం ఓ అద్భుతం అని చెప్పాలి.
ఒక తెలంగాణ నుండే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతాలైన చత్తీస్గడ్, ఒరిస్సా నుండి కూడా అధిక సంఖ్యలో ఈ బోగత జలపాతానికి చూడడానికి సందర్శకులు వస్తూ ఉంటారు. జలపాతం వద్ద ఎత్తైన కొండమీద లక్ష్మీనరసింహస్వామి స్వయంభుగా వెలసిన దేవాలయం ఉంటుంది. భక్తులు ముందుగా స్వామిని దర్శించుకుని జలపాతం వద్దకు వెళ్తారు. ఈ జలపాతం వద్ద ఎటువంటి ఆహార పదార్థాలు లభించవు. ఎటునాగారం కేంద్రంగా ఉంటుంది. అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. ప్రకృతి కొండల నడుమ అపురూపంగా కనిపించే ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తుంది. తెలంగాణలోని కుంటల జలపాతం తర్వాత అత్యంత ప్రసిద్ధి చెందిన జలపాతం ఈ బొగత జలపాతం.
భీముని పాదం జలపాతం…
ఈ భీముని పాదం జలపాతం మహబూబాబాద్ జిల్లాలో ఉంది. వర్షాకాలంలో కొండలు, గుట్టల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతూ ఉండడంతో ఈ జలపాతం జలకళ సంతరించుకుంటుంది. జిల్లాలోని గూడూరు మండలంలోని సీతానగరం గ్రామంలో ఈ జలపాతం ఉంది. గూడూరు బస్టాండు నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సుందరమైన జలపాతం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే సూర్యుడు ఉదయించినప్పుడు, అస్తమించినప్పుడు నీరు ఇంద్రధనస్సు రంగులలో ప్రకాశిస్తుంది. సుమారు 70 అడుగుల ఎత్తు నుండి ఈ జలపాతం నీరు క్రిందకు జాలువారుతో ఉంటుంది. భీమసేనుడు అడుగుపెట్టడంతో ఈ జలపాతం ఏర్పడింది అని పురాణ కథలు చెబుతున్నాయి. ఈ జలపాతం నీరు దిగువ బాగాన ఉన్న పంటలకు సాగునీరుగా కూడా ఉపయోగపడుతుందని అక్కడి రైతులు చెబుతున్నారు. ఈ జలపాతం వద్ద శివుడు, నాగదేవత ఆలయాలు ఉన్నాయి.
మల్లెల తీర్థం జలపాతం…
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అడవి ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. ఈ జలపాతంలోని నీరు దట్టమైన అడవి గుండా ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది. ఈ జలపాతం ఎత్తు దాదాపు 150 అడుగుల ఎత్తు నుండి నీరు చాలు మారుతుంటే చూడడానికి అద్భుతంగా కనిపిస్తుంది. పచ్చని ప్రకృతిని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ అడవిలో నడవడం ఒక ఉత్తేశకరమైన అనుభవం కలిగిస్తుంది. ఈ జలపాతాన్ని అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో సందర్శించడానికి ఉత్తమ సమయం. వేసవికాలంలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటం, వర్షాకాలంలో ఈ మార్గం బురదమయంగా ఉండడం వల్ల ఈ రెండు కాలాల్లో తప్ప శీతాకాలం మాత్రమే ఈ ప్రదేశాన్ని సందర్శించడం కుదురుతుంది. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పటికీ ఈ మల్లెల తీర్థం జలపాతం ఆదరణకు నోచుకోలేదు. మరింతగా అభివృద్ధి చేస్తే పర్యటకుల సంఖ్య పెరుగుతుంది. కానీ అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణంలో ఈ మల్లెల తీర్థం జలపాతం ఉండడం వల్ల ప్రకృతి ప్రేమికులు కష్టమైన సరే సందర్శనకు వస్తున్నారు.
సహస్త్ర కుండ్ జలపాతం…
సహస్రకుండ్ జలపాతం నిర్మల పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. సహస్ర అంటే వెయ్యి, కుండ్ అంటే చెరువు లేదా జలాశమని అర్థం. ఈ పేరు జలపాతం చుట్టూ అనేక చిన్న నీటి కొలనులను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ మంత్రముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలు ఎన్నో కనిపిస్తాయి. ఈ జలపాతం చుట్టూ ప్రాంతం జీవవైవిద్యంతో సమృద్ధిగా ఉంటుంది. దట్టమైన అడవులు, వృక్షజాతులతో సహా వివిధ రకాల వృక్షజాలాలు, అనేక రకాల పక్షి జాతులు ఉన్నాయి. పెనుగంగ నదిపై ఉన్న ఈ సహస్త్ర కుండ్ జలపాతం ఉప్పొంగే జలాలు సుందరమైన పరిసరాలకు ప్రసిద్ధి చెందింది. 50 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు జాలువారుతూ ఉంటాయి. తెలంగాణలోని సుందర జలపాతాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా ఎన్నో పురాణ గాధలతో సంబంధించినదిగా ఈ జలపాతం గురించి పురాణాలు ఉన్నాయి.
ముత్యం ధార జలపాతం…
ఈ జలపాతం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో గల వెంకటాపురం మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. దట్టమైన అడవి ప్రాంతంలో ఎత్తైన గుట్టల నుంచి ఆకాశగంగా దిగివస్తున్నట్టుగా ఉన్న ఈ జలపాతం చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ జలపాతాన్ని ముత్యంధర, గద్దల సిరి జలపాతం అని కూడా అంటారు. ఇక్కడి ప్రకృతి సౌందర్యం పర్యాటకులు మనసులను ఆకట్టుకుంటుంది. వెంకటాపురం మండలంలోని వీరభద్రపురం గ్రామం నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరం అటవీ మార్గంలో కాలినడకన ప్రయాణం చేస్తేనే ఈ జలపాతం వద్దకు చేరుకోగలం. దట్టమైన అడవులు కొండల నడుమ 700 అడుగుల ఎత్తు నుంచి జలపాతం జాలువారుతుంది. అచ్చంగా ముత్యాలు జాలువారినట్టే ఉండడం వల్ల ఈ జలపాతానికి ముత్యాల ధార జలపాతం అని పేరు. ఈ జలపాతం పైన కొండల మీద ఆదివాసి జాతికి చెందిన ఓ వింత తెగ ఉన్నట్టు ప్రచారంలో ఉంది. వారు ఒక చీకటి సమయంలో మాత్రమే కొండ కిందకు దిగుతారని అక్కడి గ్రామస్తులు చెబుతారు. ఈ జలపాతం చేరుకోవడానికి కష్టమైన పని అయినప్పటికీ ప్రకృతి ప్రేమికులు సాహసం చేసి మరి ఈ జలపాతం వద్దకు చేరుకుంటారు.
బుగ్గ జలపాతం…
బుగ్గ జలపాతం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని అజిలాపూర్ గ్రామంలో ఉంది. నిటారుగా ఉన్న రాతి కొండలపై నుండి ప్రవహించే నీటి దారా పర్యటకులను ఆకర్షిస్తుంది. ఈ సుందరమైన ప్రదేశం చాలా మందికి తెలియదు. ఈ జలపాతం చూడడానికి వచ్చిన పర్యాటకులు పైకి చేరుకోవడానికి కాలినడకన గంట సమయం పడుతుంది. ప్రయాణం కష్టతరంగా ఉన్నప్పటికీ ప్రకృతి అందాలు సాహసం చేసేలా చేస్తాయి. అత్యంత అందమైన దృశ్యాలతో ఆకట్టుకుంటుంది ఆ ప్రదేశం. వర్షాకాలం, శీతాకాలం ఈ ప్రదేశాన్ని చూడడానికి అనుకూలమైన సమయం.
వర్షాకాలంలో ఈ జలపాతం మరింత అందంగా మారుతుంది. స్వచ్ఛమైన నీరు కిందకి జాలు వారడం వల్ల సహజ కొలను ఏర్పడింది. అక్కడ పర్యాటకులు ఎంతో ఉత్సాహంగా ఈతల కొడుతూ స్నానాలు చేస్తారు. ఈ జలపాతానికి సమీపంలో బుగ్గ నరసింహ స్వామి ఆలయం ఉంది. జలపాతం సందర్శనకు వచ్చిన పర్యాటకులు స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ జలపాతం వద్ద రాళ్లు జారుడుగా ఉంటాయి. కాబట్టి బూట్లు ధరించి వెళ్లడం అనుకూలమైనది. ఇక్కడ ఎటువంటి ఆహార పదార్థాలు దొరకకపోవడం వల్ల నల్గొండ పట్టణంలోనే ముందుగా ప్రయాణికులు తమకు కావలసిన ఆహార పదార్థాలను తీసుకెళ్తారు.
చూశారు కదా తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖమైన, సుందరమైన జలపాతాలు. ఇంకెందుకు ఆలస్యం వర్షాకాలం ప్రారంభమైంది కదా ఏదో ఒక సమయంలో ఖాళీ చూసుకుని మీ కుటుంబ సభ్యులతోనో, బంధువులతో, స్నేహితులతో కలిసి ట్రిప్ వేయండి.

