Telugu Special Stories

‘అట్ల తద్దో’య్..ఆరట్లోయ్..!

అట్లతద్ది నోము అనేది ఓ సంప్రదాయ పండుగ. సౌభాగ్యం కోసం, గౌరీదేవి ఆశీర్వాదం కోసం వివాహిత స్త్రీలు ఈ పండుగను జరుపుకుంటారు. అలాగే పెళ్లికాని వారు మంచి భర్త రావాలని కోరుతూ చేసుకుంటారు. ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి తర్వాత మూడవ రోజున వస్తుంది. అలా ఈ యేడు అక్టోబరు 19న వచ్చింది.

ఆశ్వయుజ బహుళ తదియ రోజున వచ్చే ఈ రోజునే గోరింటాకు పండుగ, ఉయ్యాల పండుగ అనీ అంటారు. ఈ రోజున ఆడపిల్లలు, ముత్తయిదువులు గోరింటాకు పెట్టుకుంటారు. వేకువ జామునే లేచి అన్నం తింటారు. ‘అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌..’ అంటూ పాడుతూ.. ఇరుగు పొరుగున వారితో కలిసి ఆటలు ఆడతారు. 11 తాంబూలాలు వేసుకుంటారు, 11 ఉయ్యాలలూగుతారు, 11 రకాల ఫలాలు తింటారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గౌరీ దేవికి, చంద్రుడికి పూజ చేసి 11 అట్ల చొప్పున నైవేద్యం పెట్టి.. మరో పది అట్లు ముత్తైదువుకు వాయనంగా ఇస్తారు.

త్రిలోక సంచారి అయిన నారదుని సూచన మేరకు ఆ పరమేశ్వరుడిని భర్తగా పొందేందుకు గౌరీదేవి మొదటిసారిగా చేసిన వ్రతమే ఈ అట్లతద్ది. ముఖ్యంగా స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల ఆయన అనుగ్రహంతో స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి.

అట్లతద్ది రోజున 11 అట్లను వేసి నైవేద్యంగా గౌరమ్మకు సమర్పిస్తారు. ఇలా చేయడానికి కారణం.. నవగ్రహాల్లోని కుజుడికి అట్లు అంటే మహా ఇష్టమట. అందుకు నైవేద్యంగా అట్లను పెట్టడం వల్ల కుజుడి అనుగ్రహం కలిగి, వివాహం కానీ యువతికి మంచి భర్త లభిస్తాడని విశ్వాసం. అంతేకాదు పెళ్లైన దంపతుల్లో సంసారంలో ఎటువంటి అడ్డంకులు రావని విశ్వాసం. గర్భధారణలోనూ సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.

మరీ ఈ అట్లను మినుములు, బియ్యం కలిపి వేస్తారు.. మినుములు రాహువుకి .. బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు. కనుక అట్లను దానం ఇవ్వడం వల్ల గర్భదోషాలు సైతం తొలగిపోతాయని విశ్వాసం. ఈ అట్లను గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించడం వల్ల నవగ్రహాలు శాంతించి, మహిళలు సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వాసం.

ప్రాచుర్యంలో ఉన్న కథ

పూర్వం ఒక రాజు కుమార్తె, మంత్రి కుమార్తె, సేనాపతి కుమార్తె, పురోహితుని కుమార్తె నలుగురూ కూడా ఎంతో స్నేహంగా ఉండేవారు. అట్ల తదియ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత పూజ చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈలోగా రాజుగారి కుమార్తె ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. చెల్లెలి అవస్థ చూసి తల్లడిల్లిపోయిన రాకుమారులు అద్దంలో ఓ తెల్లని వస్తువు చూపించి అదే చంద్రుని దర్శనంగా భావించి చంద్రోదయం అయిందని భావించేలా చేశారు. దీంతో ఆమెకు నువ్వు కొంచెం తినేశాక పూజ చేసుకో అని చెప్పారు. అన్నయ్యల మాటలు నమ్మి, ఆమె తినేసింది.

కొద్దిసేపటికీ నలుగురు స్నేహితులు పెళ్లిళ్లు చేసుకున్నారు. అందరకీ వయసుకి తగిన భర్త లభించగా..రాకుమార్తెకు మాత్రం వయసు మళ్లిన భర్త దొరికాడు. వ్రతం చేసినా తనకు మాత్రం ఎందుకిలా జరిగిందని బాధపడుతుండగా.. అప్పుడు మిగిలిన వారంతా జరిగిన విషయం చెప్పారు. తప్పు తెలుసుకున్న రాకుమార్తె ఆ మర్నాడే అట్ల తదియ కావడంతో నియమంగా నోము నోచుకుంది. ఆ అక్షతలు భర్త మీద చల్లగానే ఆయనకు శాప విమోచనం కలిగి… యువకుడిలా మారిపోయాడు. అందుకే కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే ఉత్తముడైన భర్త లభిస్తాడని, వివాహితులు చేస్తే సౌభాగ్యంతో తులతూగుతారని పురాణాలు చెబుతున్నాయి.

ఈ కాలంలో విరివిగా లభించే ఉసిరి, గోంగూర తినడం ద్వారా కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చేతులకు పెట్టుకునే గోరింటాకు వల్ల.. శరీరంలో వేడి తగ్గుతుంది. రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో ఆడిపాడితే ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లౌతుంది. ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. స్త్రీలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందించడమే అట్లతదియ ముఖ్య ఉద్దేశంగా కొందరు భావిస్తారు.

Show More
Back to top button