Telugu News

సమాజం విద్య, ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి:మహాత్మ జ్యోతిరావుఫూలే!

కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు, వివక్షకు గురైన బడుగు, బలహీన వర్గాల్లో ఆత్మస్థైర్యం నింపి.. వారి హక్కుల కోసం, సాధికారత కోసం.. కృషి చేసిన మహనీయుడు.. జ్యోతిరావు ఫూలే.

సాంఘిక సమానత్వం, సామాజిక న్యాయం చేకూరేలా దళిత, బలహీన వర్గాలను జాగృతం చేశారు. 

బాలికా విద్యావ్యాప్తికి పాఠశాలలను కట్టించాడు. సత్యశోధక్ సమాజ్ స్థాపన చేసి.. ‘దీనబంధు’ పత్రిక ద్వారా బడుగుజీవుల ఆశాజ్యోతిగా మారాడు. 

నేడు జ్యోతిరావు బా ఫూలే 198వ జయంతి (ఏప్రిల్ 11).. సందర్భంగా ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాం:

బాల్యం..

1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో  జన్మించారు ఫూలే. తండ్రి గోవిందరావు. ఈయన పూల వ్యాపారం చేయడంవల్లే వారి ఇంటి పేరు ఫూలేగా మార్పు చెందిందని చెబుతారు. పాఠశాలకు వెళ్లింది తక్కువ రోజులే అయినా.. ఫూలేకి పుస్తకాలు చదవడమంటే ఇష్టం. జ్యోతిరావుకు చిన్ననాటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజీ, జార్జ్‌ వాషింగ్టన్‌ల జీవితచరిత్రలకు ప్రభావితుడయ్యాడు. అందువల్లే అతడిలో దేశభక్తి, నాయకత్వ ల‌క్ష‌ణాలు పెరిగాయి. 

జ్యోతిరావు ఫూలే తల్లి తన చిన్నతనంలోనే చనిపోయారు. అనంతరం క్రిస్టియన్ పాఠశాలలో చదువుకున్నారు. 13వ ఏటా సావిత్రిబాయితో వివాహం జరిగింది. 

జ్యోతిరావు తన మిత్రుడు పెళ్ళి ఊరేగింపులో పాల్గొన్నప్పుడు జరిగిన అవమానం.. తన జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. అది అలానే సమాజంలోనీ కుల వివక్షపై సొంత అభిప్రాయాలను కలిగి..   ఉన్నతులం అన్న భావన కలిగిన వారిని వ్యతిరేకించే స్థాయికి పెరిగింది. శూద్రులు, అతిశూద్రులు కలిసి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని జ్యోతిరావు ఫూలే ఆశించారు.

అది మొదలు.. 

*1848లో కుల వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా పోరాటాన్ని ప్రారంభించాడు. 

*వితంతు పునర్వివాహం గురించి ప్రజల్లో చైతన్యం కలిగించాడు. 

*1848లో పుణేలో బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపించాడు. 

1851లో మరో రెండు పాఠశాలలతో పాటు,  1855లో రాత్రి బడులను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి విశేషంగా కృషి జరిపాడు. 

*లింగ వివక్షను సైతం బాపూలే వ్యతిరేకించారు.

*1864 గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించి..  వితంత గర్భిణీల‌కు అండగా నిలిచారు. ఇటువంటి కేంద్రం స్థాపించడం దేశంలోనే మొదటిది కావడం విశేషం! 

స్వాతంత్య్ర కాంక్ష, పోరాటం తనను ప్రభావితం చేయడమే కాకుండా స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపజేసేలా చేశాయి.

ఈ క్రమంలో నూతన సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు ‘సత్యశోధక్ సమాజ్’ అనే సంస్థను జ్యోతిబాపూలే స్థాపించారు. 

*భగవంతుడు, భక్తుడికి మధ్య దళారీలుగా పురోహితులు ఉండవద్దని పిలుపునిచ్చాడు.

ఆ కాలంలోనే మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికై, ప్రజాప్రతినిధిగా కూడా సేవలందించారు.

*కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ‘గులాంగిరి’ లాంటి ఎన్నో పుస్తకాలు రాశాడు. 

*‘దీనబంధు’ అనే పత్రికను స్థాపించి పేదలు, కార్మికుల సమస్యలను సమాజానికి తెలిసేలా చేశారు.

*భారత రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్‌ అంబేద్కర్..‌ జ్యోతిరావు పూలే తన గురువుగా భావించి చెప్పుకోవడం అంటే.. ఆయన గొప్పదనం ఏపాటిదో చూడండి.

*కొన్నాళ్లపాటు దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతూ 1890 నవంబరు 28న కన్నుమూశారు.

దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం.. రక్తనాళాల లాంటి వారని చాటిచెప్పాడు. 

హిందూ సమాజంలో అగ్రకులాల వారికింద బానిసలుగా బతుకుతున్న నిమ్నకులాల మనసుల్లో మేము బానిసలమనే భావనను పోగొట్టేలా బానిసత్వం పట్ల సరికొత్త చైతన్యం రగిలించిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే! విద్య వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానతలను నిర్మూలించేందుకు ఆయన ఎంతో పాటుపడ్డారు. కుల, మతరహిత సమాజ నిర్మాణానికి ఎనలేని కృషి చేసి, బడుగుజీవుల ఆశాజ్యోతిగా నిలిచాడు.

Show More
Back to top button