
2025 జూలైలో డెట్రాయిట్లో జరిగే 24వ తానా మహాసభకు ముందు, ఛార్లెట్ నగరంలో నిర్వహించిన “ధీమ్ తానా” పోటీలకు తెలుగువారి నుండి విశేష స్పందన లభించింది. మొత్తం 255 మంది పాల్గొన్న ఈ సాంస్కృతిక కార్యక్రమం 14 గంటల పాటు కొనసాగింది. మిస్ టీన్ తానా, సోలో సింగింగ్, గ్రూప్ డ్యాన్స్, మిస్ తానా, మిసెస్ తానా, చిలక-గోరింక వంటి విభాగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు 1200 మంది హాజరయ్యారు. విజేతలు తానా మహాసభలో జరగబోయే ఫైనల్స్కు ఎంపికయ్యారు. 60 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఫాదర్స్ డే వేడుకతో ఘనంగా ముగిసిన సంబరాలు
ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఫాదర్స్ డే వేడుకలతో కలిపి జరిపారు. తాతలు, తండ్రులు, మనవళ్లు కలిసి వేదికపై కేక్ కట్ చేయడం హైలైట్గా నిలిచింది. యాంకర్ ఝాన్సీ అబ్బూరి చక్కగా నిర్వహణ చేయగా, మిస్ యూనివర్స్ ఇండియా USA 2024 అమెలియా మల్లారెడ్డి, నర్తకి మౌనిక సజ్జ్య, ఇతర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫేస్ పెయింటింగ్, హెన్నా, షాపింగ్ స్టాల్స్, రిటర్న్ గిఫ్ట్స్ వంటి ఆకర్షణలతో సందడి వాతావరణం నెలకొంది. తానా తరఫున చైర్ భాస్కర్ రెడ్డి చిల్లకూరు, కో కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, ఇతర సభ్యులు ఎంతో ఘనంగా కార్యక్రమాన్ని నడిపించారు. ఇది తానా 2025కు ఒక జోష్ఫుల్ ఆరంభంగా నిలిచింది.