Telugu Featured News

సత్వర న్యాయం అందించనున్నభారతీయ న్యాయ సంహిత…

ఇప్పటివరకు భారత రాజ్యాంగంలో ఉన్న

ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ), కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌పీసీ), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌) దేశవ్యాప్తంగా ఈ నెల (జులై 1) నుంచి అమల్లోకి వచ్చాయి. రాజ్యాంగ ఆదర్శాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సమాజంలో నేరాలను త్వరగా పరిష్కరించేందుకు ఈ మార్పులు కీలకం కానున్నాయి.

భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు. ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది.

భారతదేశ నేర న్యాయ వ్యవస్థ, నేరాల దర్యాప్తు, విచారణ ప్రక్రియలో ఈ కొత్త చట్టాలు వేగం తీసుకురానున్నాయి. అవి ఏయే వాటిల్లో అంటే,

కొత్త చట్టాల్లో వర్తించే నిబంధనలు..

  • ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెక్స్‌ యాక్ట్‌కు చెల్లు,
  • ఎలక్ట్రానిక్‌ మాధ్యమంలో సమన్లు జారీ,
  • హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్‌ సీన్లకు తప్పనిసరిగా వీడియోగ్రఫీ,
  • కేసు విచారణలో జాప్యం, ఆలస్యానికి కోర్టులో రెండు వాయిదాలకే అవకాశం,
  • విచారణ పూర్తయిన తర్వాత 45 రోజుల్లోగా తీర్పు వంటి కొత్త చట్టాల్లో కీలక నిబంధనల వర్తింపు.

ఏయే అంశాల్లో అంటే

➤ నకిలీ నోట్ల తయారీ, వాటి స్మగ్లింగ్‌, విదేశాల్లో మన ఆస్తుల ధ్వంసం, డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్‌ చేయడం వంటివి ఉగ్రవాదం కిందకి వస్తాయి.

➤ కులం, మతం వంటి కారణాలతో సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే ఐపీసీ ప్రకారం ఏడేళ్ల శిక్ష పడుతుంది. దీన్నిప్పుడు యావజ్జీవంగా మార్చారు.

➤ ఆర్థిక సంబంధ నేరాల్లో నిందితుల ఆస్తులు, నేరం ద్వారా సంక్రమించిన సొమ్ముతో వారు కొన్న స్థిర, చరాస్తులనూ జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది.

  • జీరో ఎఫ్ఐఆర్‌ విధానంతో ఒక వ్యక్తి పోలీసుస్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్‌లో అయినా సరే ఫిర్యాదు చేయవచ్చు. దీని ద్వారా ఏదైనా ఘటనను రిపోర్టు చేయడంలో లేదా చట్టపరమైన చర్యలు ప్రారంభించడంలో ఆలస్యాన్ని నివారించొచ్చు అన్నమాట.
  • ఏదైనా ఘటనను ఒక వ్యక్తి ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ ద్వారా ఫిర్యాదు చేసేందుకు వీలుంది. పోలీసుస్టేషన్‌కు వ్యక్తిగతంగా వెళ్లాల్సిన అవసరం లేదు. దీనిద్వారా వేగవంతమైన ఫిర్యాదు తీసుకోవడంతో పాటు పోలీసులు తగిన చర్యలు తీసుకొనే వెసులుబాటు ఉంటుంది.
  • ఎలక్ట్రానిక్‌ రూపంలో సమన్లు జారీ చేయవచ్చు. దీని ద్వారా చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేయడంలోనూ, పేపర్‌ వర్క్‌ను తగ్గిస్తుంది.
  • ఏదైనా కేసులో నిందితులు, బాధితులు 14 రోజుల్లోగా ఎఫ్ఐఆర్‌, పోలీసు రిపోర్టు, చార్జిషీట్‌, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్ల కాపీలను పొందే వీలుంది.
  • క్రిమినల్‌ కేసుల్లో విచారణ పూర్తయిన తర్వాత 45 రోజుల్లోగా తీర్పు ఇవ్వాలి. విచారణ ప్రారంభమైన 60 రోజుల్లోగా అభియోగాలు నమోదు చేయాలి.
  • కేసు విచారణలో అనవసర జాప్యాలను నివారించేందుకు, సకాలంలో న్యాయం అందించేందుకు న్యాయస్థానాలు కూడా గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే ఇకపై మంజూరు చేస్తాయి.
  • సాక్షుల భద్రతను, వారి సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి.
  • అరెస్టు సందర్భాల్లో బాధితులు తమ పరిస్థితి గురించి సమాచారాన్ని బంధువులు లేదా స్నేహితులకు తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా అరెస్టయిన వ్యక్తి తక్షణ సాయం పొందే వీలుంటుంది.
  • దర్యాప్తును బలోపేతం చేయడంలో భాగంగా తీవ్రమైన నేరాల విషయంలో ఫోరెన్సిక్‌ నిపుణులు తప్పనిసరిగా ఘటనాస్థలికి వెళ్లి ఆధారాలు సేకరించాలి.

చిన్నారులు, మహిళలకు ప్రత్యేకం

  • మైనర్‌పై సామూహిక లైంగిక దాడికి పాల్పడితే మరణ శిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన. 
  • లైంగిక దాడి బాధితురాలి స్టేట్‌మెంట్‌ను ఆమె సంరక్షకురాలు లేదా బంధువు సమక్షంలోనే ఒక మహిళా పోలీసు అధికారి రికార్డు చేయాలి. వారం రోజుల్లోగా వైద్య నివేదిక రావాలి.
  • మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి.. బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్‌ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. వారు లేనిపక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచాలి.
  • పెళ్లి పేరుతో మోసం చేయడం, మైనర్లపై సామూహిక లైంగిక దాడికి పాల్పడటం, మూక హత్యలు, చైన్‌ దొంగతనాలు వంటి ఘటనలకు పాల్పడితే, వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి.
  • మహిళలపై నేరాల కేసుల్లో బాధితులు తమ కేసు పురోగతిపై 90 రోజుల్లోపు ఎప్పటికప్పుడు సమాచారం పొందేందుకు అర్హులవుతారు.
  • మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో బాధితులకు అన్ని దవాఖానల్లో ఉచితంగా ప్రథమ చికిత్స లేదా వైద్య చికిత్స అందిస్తారు.
  • మరింత భద్రత కల్పించడం, దర్యాప్తులో పారదర్శకతను అమలు చేయడంలో భాగంగా లైంగిక దాడి కేసుల్లో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి.
  • మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, 15 ఏళ్లలోపు పిల్లలు లేదా 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు పోలీసుస్టేషన్‌కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది. వారు ఉంటున్న చోటే పోలీసుల సాయం పొందొచ్చు.


భారతీయ శిక్షాస్మృతిలోని 511 సెక్షన్ల స్థానంలో ఇప్పుడు 358 సెక్షన్లు మాత్రమే ఉంటాయి. అంటే, 18 సెక్షన్లు ఇప్పటికే రద్దు చేశారు. 

ఈ కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తైన 45 రోజుల్లోపు తీర్పు ఇవ్వాలి. మొదటి విచారణ నుంచి 60 రోజులలోపు అభియోగాలు నమోదు చేయాలి.  క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లను అనుసంధానం చేయడం వల్ల సాక్ష్యాలను ఆన్‌లైన్‌ ద్వారా పంపడం వల్ల ఆధారాలు మాయం చేయడం సాధ్యం కాదు. క్రిమినల్‌ కేసుల విచారణలో ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి వంటి కీలక మార్పుల ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందుతుంది.

Show More
Back to top button