ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి… నందమూరి తారకరామారావు.

నందమూరి తారకరామారావు (28 మే 1923 – 18 జనవరి 1996)…
తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు ఎన్టీఆర్. తెలుగు వారు తలుచుకోకుండా ఉండలేని పేరు ఎన్టీఆర్. దేవుడు ఎలా ఉంటాడో తెలియని తెలుగు ప్రజలు, భగవంతుడికి మానవ రూపంగా చూసుకునే పేరు ఎన్టీఆర్. 101 యేండ్ల క్రిందట తెలుగు జాతిలో పుట్టిన తెలుగు ప్రేక్షకాభిమానుల వెండితెర రూపం ఎన్టీఆర్. తెలుగు వారి రాముడు ఎన్టీఆర్. తెలుగు వారి కృష్ణుడు ఎన్టీఆర్. తెలుగు జాతి యుగపురుషులు ఎన్టీఆర్. ఆంధ్రుల అన్న ఎన్టీఆర్. ఆంధ్రుల ఆపద్బాంధవుడు ఎన్టీఆర్. జీవితమంతా రారాజు వ్యక్తిత్వంతో తిరుగులేని కళామూర్తిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ గా సుపరిచితులైన నందమూరి తారకరామారావు 28 మే 1923 నాడు సాయంత్రం 4:32 నిముషాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. ఆ మహానుభావుడికి తల్లి మొదటగా పెట్టాలనుకున్న పేరు కృష్ణ. కానీ మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. అది కాస్తా కాలక్రమేణా తారక రామారావుగా మారింది.
రెండు మూడు జీవితకాలాల్లో సాధించగల అపూర్వ విజయాలని, ఇటు కళా రంగానికి – దానితో ఏ మాత్రమూ పొంతన లేని రాజకీయ రంగానికి అనూహ్యమైన వారధిని నిర్మించి సవ్యసాచి అనిపించుకున్నారు ఎన్టీఆర్. తన సంకల్పబలంతో మృత్యువుని చాలాసార్లు జయించిన వ్యక్తి నందమూరి తారకరామారావు. సినిమా చిత్రీకరణలో ఒక్కసారి తనను పాము కరిస్తే సదరు చిత్ర నిర్మాత భయభ్రాంతుడయి స్పృహ తప్పి పడిపోయాడు, కానీ ఆయనను పరామర్శించడానికి వెళ్లిన వారిని నవ్వుతూ పలకరించి, నిర్ఘాంతపోయేట్లు చేశారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా కచ్చితంగా ఉండేవారు. రోజుకి 18 నుండి 20 గంటలు పనిచేసేవారు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచ్ లో అభ్యాసం చేసేవారు. ఎన్టీఆర్ ను దగ్గరుండి చూసిన వారు, కెమెరా ముందు ఆయన తడబడిన దాఖలాలు లేవని చెబుతూంటారు ఎందుకంటే అతను సంభాషణ లను ముందుగానే కంఠతా పట్టేసేవారు. సినిమా ఆయన బలం, సినిమా ఆయన బలహీనత. ఎన్టీఆర్ తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో 13 చారిత్రకాలు, 55 జానపదాలు, 186 సాంఘికాలు, 44 పౌరాణిక చిత్రాలలో నటించారు.
44 ఏళ్ళ తన సినీ జీవితంలో ఎన్టీఆర్ కి ఎంతో పేరు ప్రతిష్టలు, ఎన్నో పురస్కారాలు. తనను ఎంతగానో అభిమానించిన అఖిలాంద్ర ప్రేక్షకులకు, తెలుగు అభిమానులకు సేవ చేయాలనుకున్నారు. పలు సందర్భాలలో విలేకరుల సమావేశం లో కొత్త పార్టీ పెడుతున్నట్లు సాంకేతాలిచ్చారు. కేవలం పదిమంది పత్రికా విలేకరుల మధ్యన 29 మార్చి 1982 నాడు హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో “తెలుగు దేశం” పార్టీని స్థాపిస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు. “ఈ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటలో నుండి వచ్చింది. కార్మికుడి కరిగిన కండాలల్లోనుండి వచ్చింది. రైతు కూలీల రక్తంలో నుండి వచ్చింది. నిరుపేదల కన్నీటిలో నుండి.. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం ఆశీర్వదించండి” అంటూ తెలుగు ప్రజలకు తన రాజకీయ ప్రస్థానాన్ని, తన రాజకీయ రంగ ప్రవేశాన్ని తెలియపరిచారు. “తెలుగు వాడి ఆత్మగౌరవ నినాదం” అనే బ్రహ్మాస్త్రం ప్రజలలో విపరీతమైన రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చింది. ప్రజల్లోకి వెళ్లి చిన్నా, పెద్దా, ధనిక, పేద అనే బేధభావమూ లేకుండా పేదలు, బడుగు ప్రజల భుజాలపై చేయివేసి “నీ బాధ తీర్చేందుకే అన్నీ వదులుకుని వచ్చాను” అన్న ఎన్టీఆర్ ను తెలుగు వారు తమ గుండెల్లో పెట్టుకున్నారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలలోనే అధికారం లోకి వచ్చిన ఎన్టీఆర్ 1983 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అయ్యారు.
@ రాజకీయ రంగ ప్రవేశం…
దాసరి నారాయణరావు దర్శకత్వంలో శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బ్యానర్లో క్రాంతి కుమార్ నిర్మించగా నందమూరి తారక రామారావు, శ్రీదేవి, శారద ముఖ్య తారాగణంగా సర్దార్ పాపారాయుడు (1980) సినిమా తెరకెక్కగా 30 అక్టోబరు 1980 నాడు ఆ చిత్రం విడుదలై అద్భుతమైన విజయం సాధించింది. అప్పటికే మనదేశం సినిమాతో 1949 లో మొదలైన తన సినీ ప్రస్థానంతో 1980 వరకు సుమారు 265 చిత్రాలలో అనేక వైవిధ్యభరితమైన పాత్రలతో అశేష జనాభిమానాన్ని సంపాదించుకున్న నందమూరి తారకరామారావు 60 సంవత్సరాల వయస్సుకు దగ్గరలో ఉన్నారు. తనను అభిమానించిన అఖిలాంధ్ర ప్రేక్షకులకు, తెలుగు ప్రజలకు సేవ చేయాలనే ఒక ధృఢ సంకల్పం తనలో పురుడుపోసుకుంది. తన రాజకీయ అరంగేట్రానికి సమయం దగ్గర పడుతున్న ఆ సమయంలో ఉన్నట్టుండి ఒక విలేఖరి అడిగిన ప్రశ్ననే తన రాజకీయ ప్రస్థానానికి తెరతీసింది.
1981 వ సంవత్సరంలో ఒక సినిమా చిత్రీకరణ కోసం ఊటీలో ఉన్న నందమూరి తారకరామారావును చిత్రీకరణ విరామ సమయంలో “మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా! మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా”? అని ఒక విలేఖరి అడిగాడు. దానికి జవాబుగా “నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజునుంచి నా వంతుగా ప్రతీనెలలో 15 రోజులు తెలుగు ప్రజల సేవకోసం కేటాయిస్తాను” అని చెప్పారు. తాను చేయబోయే రాజకీయ ప్రయాణానికి తొలి సంకేతాన్ని తెలుగు ప్రజలకు తెలియజేశారు.
ఆ తరువాత ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలను త్వరత్వరగా పూర్తి చేసారు. 29 మార్చి 1982 నాడు సాయంత్రము 2:30 నిముషాలకు తాను తెలుగుదేశం అనే కొత్త పార్టీని పెడుతున్నట్లుగా ప్రకటించారు. పార్టీ ప్రచారానికి, ప్రసంగాలు చేయడానికి తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి, కదిలే వేదికగా దానిని తయారు చేయించారు. దానిపై నుండే తాను ప్రచారాలు చేసేవారు. దానిని “చైతన్యరథం” అని పిలుస్తూ, ఆ రథంపై “తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!” అనే నినాదం వ్రాయించారు. ఆ తరువాత కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ ఎన్టీఆర్ రూపొందించిన చైతన్యరథమే స్ఫూర్తి.
@ చైతన్య రథ సారథిగా హరికృష్ణ…
పార్టీ పేరు తెలుగుదేశం అని ఖరారైంది. ఉరూరా తిరిగి ప్రచారాలు, అక్కడక్కడా బహిరంగ సభలు పెట్టాలి. కనుక తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి బహిరంగ సభను 1982 ఏప్రిల్ 10, 11 తేదీలలో హైదరాబాద్ లోని నిజాం కళాశాల మైదానంలో ప్రారంభించారు. అలాగే తిరుపతిలోని త్యాగరాయ మండపంలో 1982 మే 27, 28 వ తేదీలలో మహానాడు తరహా సభలు నిర్వహించారు. అవి యావద్భారతావని దృష్టిని ఆకర్షించాయి. తన పాత చెవ్రొలెట్ వ్యానును రిపేరు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించి “చైతన్య రథం” అని నామకరణం చేసిన ఎన్టీఆర్ 14 జూన్ 1982 నాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా ప్రజలను చైతన్య పరచడానికి తొలి ప్రచార యాత్రను ప్రారంభించారు.
ఎన్టీఆర్ చైతన్య రథానికి చోడకుడు, సారథి అన్నీ నందమూరి హరికృష్ణే. అప్పటివరకు సినిమాలలో రంగురంగుల ఫ్యాషన్ దుస్తులు ధరించిన ఎన్టీఆర్, పార్టీ ప్రకటించిన నాటి నుండి ఒక శ్రామికుడిలా ఖాకీ దుస్తులు ధరిస్తూ, నిరంతరం రాష్ట్రమంతటా ప్రయాణిస్తూ, రాష్ట్రము లోని ఏదో ఒక ప్రాంతంలో తన ఉపన్యాసాలతో ప్రజల హృదయాలను దోచుకుంటూ ఉంటే ఆ వాహనాన్ని నడిపిస్తూ ఉన్న కొడుకు హరికృష్ణ తన తండ్రి ఆశయాలకు చేదోడుగా నిలిచాడు.
1978 లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలయ్యింది. ముఖ్యమంత్రులు తరచూ మారుతూ ఉండేవారు. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి, రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులచేత నామకార్థం ఎన్నిక చేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలైంది. “ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ ఢిల్లీలో తాకట్టు పెట్టారనే” ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ఎన్టీఆర్ ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేశారు. కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసిన ప్రచార ప్రభంజనమది.
@ ఉద్వేగభరితమైన ప్రసంగాలతో…
నటుడిగా తాను సంపాదించిన ఐశ్వర్యం, కీర్తి, వైభవం అన్నిటినీ ప్రక్కన పెట్టి రాత్రి, పగలు అనే తేడా లేకుండా సామాన్యుడి కోసం నడిరోడ్డుపై నిలబడ్డారు ఎన్టీఆర్. ఆ రోడ్డే తనకు ఇల్లయ్యింది. ఆ రోడ్డే ఆయనకు తల్లి అయ్యింది. రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టు నీడే తనకు పడకగది అయిపోయింది. రాష్ట్రములో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల నిర్ణయం ప్రకారమే తరచూ మార్చడం, శాసనసభ్యుల మాటకు విలువ లేకపోవడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని ఎన్టీఆర్ తన ప్రసంగాలను మలచుకున్నారు.
రాష్ట్ర కాంగ్రెసు నాయకులు కుక్కమూతి పిందెలనీ, కొజ్జాలనీ, దగాకోరులనీ, దగుల్బాజీలని, అధిష్టానం చేతిలో కీలుబొమ్మలనీ తీవ్రపదజాలంతో ఎన్టీఆర్ విమర్శించారు. కాంగ్రెసు పార్టీ కారణంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదనీ, దానిని ఢిల్లీలో తాకట్టు పెట్టారనీ విమర్శిస్తూ, కోల్పోయిన ఆంధ్రుల ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కాంగ్రెసు నిర్వాకానికి అప్పటికే విసుగు చెందిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్టీఆర్ నినాదం పట్ల ఆకర్షితులయ్యారు. “తెలుగుదేశం పిలుస్తోంది రా! కదలిరా!!” అన్న ఎన్టీఆర్ నినాదం ప్రతీ తెలుగు హృదయాన్ని తట్టి లేపింది. ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా, ఉద్రేకపూరితంగా ఉండి, ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
@ 75,000 కిలోమీటర్లు పైగా ప్రయాణం…
03 అక్టోబరు 1982 నాడు ప్రారంభమై ఎన్టీఆర్ రెండవ ప్రచార యాత్ర 26 నవంబరు 1982 వరకూ 55 రోజుల పాటు నిరంతరంగా 25 వేల కిలోమీటర్లు కొనసాగిందంటే ఎన్టీఆర్ ప్రచారం తెలుగుజాతిని ఎంతగా ప్రభావితం చేసిందో వేరే చెప్పక్కర్లేదు. నిర్విరామమైన ఆ యాత్ర నభూతో – నభవిష్యతి. “చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా” అంటూ చైతన్య రథం కదిలి వస్తుంటే జనం పులకరించి పూనకమెత్తారు. ప్రజలు సాగర తరంగాలై పోటెత్తారు. 16 డిసెంబరు 1982 నాడు సాగిన మూడవ ప్రచార యాత్రలో ఎన్టీఆర్ 72 గంటల పాటు నిద్రాహారాలు మాని నిర్విరామంగా ప్రచారం సాగించి చరిత్ర సృష్టించారు.
“ప్రపంచంలో ఇంతవరకూ ఎవ్వరూ ఇంత తక్కువ సమయంలో ఇన్ని చోట్ల, ఇన్ని లక్షల ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించ లేదు” అంటూ 21 డిసెంబరు 1982 రాత్రి ఎన్టీఆర్ గురించి “బీబీసీ” తన వార్తాప్రసారంలో గొప్పగా చెప్పింది. తెలుగు జాతి గురించి ప్రపంచానికి గొప్పగా వినిపించిన రోజు అది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా అన్ని జిల్లాలను పర్యటించారు. తన కుమారుడు నందమూరి హరికృష్ణ వ్యాన్ను నడుపుతూ ఉండగా 75,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. పసుపు పార్టీ జెండాలు మరియు బ్యానర్లతో వాహనం పై కూర్చున్న ఎన్టీఆర్ తెలుగు జనాన్ని అభినందిస్తూ ఉండటం ఒక విలక్షణమైన దృశ్యం. తెలుగు ప్రజల గౌరవాన్ని పునరుద్ధరించడానికి ఆయన ప్రచారం చేశారు. ప్రభుత్వం మరియు సామాన్య ప్రజల మధ్య సన్నిహిత బంధాన్ని ఏర్పరచాలని తాను వాదించారు. “తెలుగు వారి ఆత్మ గౌరవం” అనే నినాదంతో ఎన్నికలలోకి వెళ్లారు.
@ 1983 ఎన్నికలలో ఎన్టీఆర్ చారిత్రాత్మక విజయం..
29 మార్చి 1982 నాడు హైదరాబాద్లో రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ (టిడిపి) లో ప్రముఖ రాజకీయ నాయకులు నాదెండ్ల భాస్కరరావు చేరారు. 1956 లో ఆంధ్రప్రదేశ్ అనే తెలుగు రాష్ట్రాన్ని ఏర్పరచినప్పటి నుండి, రాష్ట్రాన్ని పరిపాలించిన భారత జాతీయ కాంగ్రెస్ అవినీతి మరియు అసమర్థ పాలన నుండి ఆంధ్రప్రదేశ్ను విముక్తి చేయాలనే చారిత్రాత్మక అవసరం ఆధారంగా నాదెండ్ల భాస్కరరావు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు. 1983 ఎన్నికలలో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ, సంజయ విచార మంచ్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. అభ్యర్థులుగా నిజాయితీ పరులను తీసుకోదలచి, సమాజంలో మంచి పేరున్న వారిని మరియు అవినీతికి పాల్పడని విద్యావంతులైన అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ నిర్ణయించుకుంది. తెలుగుదేశం పార్టీ స్థాపన సమయంలో ఎన్టీఆర్ యొక్క వినూత్న రాజకీయ భావన ఇది.
గుడివాడ మరియు తిరుపతి అనే రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని ఎన్టీఆర్ తానే స్వయంగా నిర్ణయించుకున్నారు. 05 జనవరి 1983 నాడు వెలువరించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది. 1983 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీలోని 294 సీట్లలో తెలుగుదేశం పార్టీ 202 సీట్లను గెలుచుకుని సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఎన్టీఆర్ తాను పోటీ చేసిన రెండు చోట్లా గెలుపొందారు. సంజయ విచార మంచ్ తో పొత్తు పనిచేసింది. ఆ పొత్తు 202 సీట్లను గెలుకునేలా చేసింది. 09 జనవరి 1983 నాడు పది మంది క్యాబినెట్ మంత్రులు మరియు ఐదుగురు రాష్ట్ర మంత్రులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 వ ముఖ్యమంత్రిగా మరియు మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలోనే ప్రప్రథమంగా తనను ఎన్నుకున్న ప్రజల మధ్య ప్రజానేత ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా బహిరంగ ప్రమాణ స్వీకారం చేశారు.
@ మంత్రి పదవి నుండి నాదెండ్ల ను తొలగించిన ఎన్టీఆర్…
1983 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం ప్రభుత్వం యేర్పాటు చేయగా 09 జనవరి 1983 నాడు నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, నాదెండ్ల భాస్కరరావుతో ఎన్టీఆర్ మంత్రి వర్గములో కేబినెట్ హోదా కలిగిన ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన 19 నెలలలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అధికారం చేపట్టిన తరువాత, ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ తగ్గింపు ప్రధానమైంది.
ఇలాంటి నిర్ణయాల కారణంగా ఆయన అతి వేగంగా ప్రజాభిమానం కోల్పోసాగారు. గుండెకు జబ్బు కారణంగా శస్త్రచికిత్స నిమిత్తం టెక్సాస్ వెళ్లిన ఎన్టీఆర్ గుండెకు ట్రిపుల్ బైపాస్ శస్త్రచికిత్స చేయించుకొని 14 ఆగస్టు 1984 నాడు రాష్ట్రానికి వచ్చారు. హైదరాబాదు విమానాశ్రయంలో ఎన్టీఆర్ ను ఆహ్వానించడానికి ఆర్థిక మంత్రి హోదాలో వెళ్లిన నాదెండ్ల భాస్కరరావును అదే రోజు సాయంత్రం గవర్నర్ రాంలాల్, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సూచన మేరకు మంత్రి పదవి నుండి తొలగించారు. దాంతో మాజీ కాంగ్రెస్ సభ్యులైన నాదెండ్ల భాస్కర రావు ఇట్టి విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు.
@ ముఖ్యమంత్రి గా “నాదెండ్ల భాస్కరరావు”…
ఉద్వాసన పలికిన ఆర్థిక మంత్రి, నాదెండ్ల భాస్కరరావు, గవర్నరు ఠాకూర్ రామ్ లాల్ ను కలిసి తనకు ముఖ్యమంత్రినయ్యే మద్దతు ఉందని, తెలుగుదేశం అసమ్మతి సభ్యులు, కాంగ్రేస్ పార్టీ సభ్యుల మద్దతు తనకుందని, మంత్రివర్గము ఏర్పాటు చేసే అవకాశమివ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వము నుండి టెలిఫోన్ సందేశము అందుకొన్న గవర్నరు ఠాకూర్ రామ్ లాల్ ఎన్టీఆర్ ను బల నిరూపణ కోరగా, ప్రతిస్పందించిన ఎన్టీఆర్ సభలో తన మద్దతును నిరూపించుకోవడానికి శాసనసభను ఆగస్టు 18 నాడు సమావేశపరచవల్సిందిగా కోరారు. ఇంతలో ఎన్.టీ.రామారావు కు మద్దతునిస్తున్న 163 మంది సభ్యుల జాబితాను, తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష కార్యదర్శి గవర్నరుకు పంపాడు.
16 ఆగస్టు 1984 ఉదయం నాదెండ్ల భాస్కరరావు తన మద్దతుదారులతో 52 కార్ల పటాలముతో గవర్నరు కార్యాలయము చేరుకున్నారు. కాంగ్రేసు శాసనసభా పక్ష పార్టీ భాస్కరరావుకు మద్దతునిస్తున్న తీర్మానాన్ని గవర్నరుకు పంపింది. అదే సమయానికి ఎన్టీఆర్ తనకు మద్దతునిస్తున్న 163 సభ్యుల జాబితా పత్రికలకు విడుదల చేశారు. ఆ తరువాత వారిని గవర్నరు నివాసము ముందు ప్రవేశపెట్టారు. ఇరు పక్షాల మద్దతును ప్రత్యక్షముగా అంచనా వేయకుండా గవర్నరు ఠాకూర్ రామ్ లాల్ అప్పటివరకు ఉన్న ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ మద్దతు తనకే ఉన్నదని ప్రధానమంత్రి ఇందిరా గాంధీ లోపాయికారీ సహకారంతో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజులు గవర్నర్ గడువిచ్చారు.
@ రెండవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్…
నాదెండ్ల భాస్కరరావు దొడ్డిదారిన గద్దెనెక్కడంతో జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి వెళ్లి ఎలుగెత్తి చాటారు ఎన్టీఆర్. రాష్ట్రములో నిర్వహించబోయే ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి మిత్రపక్షాలు ఎన్టీఆర్ కు ఎంతో సహాయం చేసాయి. ఆయన తన చైతన్య రథం ప్రచారాన్ని తిరిగి ప్రారంభించారు. ఈసారి ప్రజల మద్దతును, జనతా పార్టీ (జెపి), భారతీయ జనతా పార్టీ (బిజెపి) మరియు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి)తో సహా దేశంలోని వివిధ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ పార్టీల మద్దతును సమీకరించడం ద్వారా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ప్రచారం చేశారు. ఒక నెల సంక్షోభ సమయంలో తన శాసనసభ్యులను ప్రతిపక్షం వారు కొనుగోలు చేయకుండా ఉండటానికి ఎన్టీఆర్ కు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలను కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే సహకారంతో రహస్య ప్రదేశంలో భద్రపరిచారు.
కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే సహాకారంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరినీ మైసూరు లోని బడ్జెట్ హోటల్, దాస్ ప్రకాష్కు తరలించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి క్రమం తప్పకుండా ఎమ్మెల్యేలను కొనడంలో ఆరితేరి ఉంది. అందువలన ఇలా శాసనసభ్యులను దాచి ఉంచడం అనివార్యమని భావించారు. భారత రాజకీయాల్లో ఎమ్మెల్యేలను ప్రత్యర్థి పార్టీల నుండి సురక్షితమైన ప్రదేశంలో రక్షించడం దేశంలో ఇదే మొదటిసారి. నెలరోజుల గడువులో ఎంతో డబ్బు ఖర్చుపెట్టినా, నాదెండ్ల భాస్కరరావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయారు.
ఫలితంగా 16 సెప్టెంబరు 1984 నాడు నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా వైదొలిగారు. కేంద్ర ప్రభుత్వం తిరిగి అదే రోజున నందమూరి తారకరామారావును రెండవసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించింది. అదేవిధంగా అనేక రాజకీయ పార్టీలు మరియు ప్రజల సమీకరణ మరియు పత్రికా ప్రకటన కారణంగా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తనకు ఇష్టం లేకున్నా కూడా గవర్నరు ఠాకూర్ రామ్ లాల్ ను తొలగించి, అనుభవజ్ఞుడైన కాంగ్రెస్ నాయకులు శంకర్ దయాళ్ శర్మను ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమించి, ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిగా పునరుద్ధరించడానికి మార్గం సుగమం చేశారు.



