Telugu News

పూరీ జగన్నాథ్ రథయాత్ర నేడే..!

జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు.. తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత క్షేత్రం.. చార్‌ధామ్‌ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాథుని ఆలయం.. ఏటా ఆషాఢ మాసంలోనే ఈ జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తారు. ఈసారి జూన్ 27న అంటే ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రారంభం కానుంది. ఈ క్రతువులో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలకొద్దీ భక్తులు రావడం విశేషం. కావున ఈ సందర్భంగా ఆ జగన్నాథుడి విశేషాలను తెలుసుకుందాం:

నేపథ్యం..

ఏటా ఆషాఢశు ద్ధ విదియనాడు జగన్నాథుడి రథయాత్ర అనేది ప్రారంభమవుతుంది. జ్యేష్టమాసంలో వచ్చే పౌర్ణమినాడు స్నానయాత్ర పేరుతో ఈ ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఈరోజున 108బిందెల నీరుతో దేవతామూర్తుల్ని విశేషంగా అభిషేకించడం జరుగుతుంది. ఆ తరువాత స్వామికి జ్వరం వచ్చిందని చెప్పి, విశ్రాంతి పేరుతో రహస్య మందిరానికి తరలిస్తారు. అలా తరలించిన స్వామి

రహస్యమందిరం నుంచి బయటకు వచ్చిన రోజునే ఈ రథయాత్ర మొదలవుతుంది. జగన్నాథుడి రథయాత్రలో సాక్షాత్తు పూరి జగన్నాథుడే 

గర్భగుడి దాటి బయటకు వచ్చి భక్తులను అనుగ్రహిస్తాడని ప్రతీతి. అలా వచ్చే స్వామితోపాటు సోదరసోదరిమణులైన సుభద్ర, బలభద్రులు.. ఈ ముగ్గురి కోసం మూడు రథాలను తయారుచేయడం విశేషం. జగన్నాథుడి రథాన్ని ‘నందిఘోష’గా పిలుస్తారు. ఈ రథానికి మొత్తం 16 చక్రాలుంటాయి. రథయాత్రకు సరిగ్గా రెండు నెలల (అరవై రోజులు) ముందు అంటే, వైశాఖ బహుళ విదియనాడు.. ఈ పనులు సాగుతాయి. అప్పటికే గుర్తించిన కొన్ని చెట్ల దగ్గరకు బ్రాహ్మణులు చేరుకుని తగిన శాంతులు నిర్వహించిన తర్వాత వాటిని 1072 ముక్కలుగా చేసి పూరీకి తరలిస్తారు. ఒక ప్రధాన పూజారీ, ఆయనతోపాటు తొమ్మిదిమంది ముఖ్య శిల్పులూ, వారి ఆధ్వర్యంలో పనిచేసే 125మంది పనివారు మూడు బృందాలుగా విడిపోతారు. 

తిరిగి అక్షయ తృతీయనాడు ఈ రథాల నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. అలా తయారయ్యే రథాల మీదే దేవతామూర్తులను అధిరోహిస్తారు. ఆపై మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గుండీచా ఆలయం వరకూ ఊరేగిస్తారు. ఈ ఆలయం పేరు సైతం ఆనాటి మహారాజు భార్య అయిన గుండీచా పేరు మీదనే పెట్టడం జరిగింది. ఈమె అప్పట్లో జగన్నాథుడూ, సుభద్ర, బలభద్రుడికోసం ప్రధాన ఆలయానికి దగ్గరగా ఒక మందిరాన్ని నిర్మించింది. అందువల్లే స్వామి అక్కడ ఆతిథ్యం స్వీకరించేందుకు వెళ్తాడని పూర్వం నుంచి అంటుంటారు. మళ్లీ దశమినాడు తిరుగు ప్రయాణం కావడంతో ఈ యాత్ర ముగుస్తుంది.  

ఆలయ ప్రాశస్త్యం…

పూరీ జగన్నాథ క్షేత్రంలోని ప్రధాన ఆలయ గోపురం ఎత్తు దాదాపు నలభైఐదు అంతస్తుల భవనమంత పెద్దగా ఉంటుంది. దానిపైన జెండాను ప్రతినిత్యం మార్చడం ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయం. అదే ఆనవాయితీగా మారింది. మరో విశేషమేంటంటే, ప్రతి రోజూ కూడా ఓ పూజారి ఏ సాయం లేకుండానే అంత ఎత్తున ఉండే గోపురంపైకి ఎక్కి ఆ జెండాను మారుస్తాడట. ఆలయం నిర్మించినప్పటి నుంచే ఈ సంప్రదాయం మొదలైంది. ఒకవేళ ఎప్పుడైనా జెండాను మార్చకపోయినా, మార్చడం వీలు కాకపోయినా ఆలయాన్ని సుమారు 18 సంవత్సరాలపాటు మూసేయాలనేది ఓ నియమమట. ఆ జెండా కూడా వీచే గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంటుంది.

దీంతోపాటు మనకు ఆలయం నీడ అనేది అస్సలు కనిపించదు. అలాగే ఇక్కడి ప్రధాన గోపురం పైన, చుట్టుపక్కల కానీ పక్షులు తిరిగిన దాఖలాలు లేవట. అంతేకాదు.. ఇక్కడి ప్రధాన ఆలయ గోపురంపైన ఉండే ఓ సుదర్శన చక్రం.. పూరీ పట్టణమంతా కనిపిస్తుందనీ, అది ఎక్కడినుంచి చూసినా.. భక్తులకు అభిముఖంగానే కనిపిస్తుందని పూరీవాసులు చెబుతుంటారు.

ఆలయంలోకి వెళ్లిన భక్తులకు జగన్నాథుడు.. ఆయన తోబుట్టువులైన సుభద్ర, బలభద్రుడితో కలిసే దర్శనమిస్తాడు. ఈ విగ్రహాలను ప్రతి ఎనిమిది, పదకొండు, పందొమ్మిది సంవత్సరాల  కాలవ్యవధిలో.. నవకళేబర ఉత్సవం పేరుతో తీసేసి.. కోయిలీ వైకుంఠం అనే చోట ఖననం చేస్తారు. మళ్లీ తిరిగి కొత్తవాటిని ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రక్రియ కూడా రహస్యంగానే సాగుతుందట. 

తిరిగి ఆషాఢ బహుళ చతుర్దశి నాడు అర్థరాత్రి దాటాక ప్రధానార్చకులు కొత్త విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అంటే.. పాత విగ్రహాల లోపలి భాగంలో కొంత భాగాన్ని కొత్త విగ్రహాల్లోకి మారుస్తారు. దాన్నే బ్రహ్మపదార్థంగా పిలుస్తారు. ఈ తంతు సైతం ఒక సేవాయత్‌.. తన కళ్లకు గంతలు కట్టుకుని, చేతులకు పవిత్ర వస్త్రాలను చుట్టుకుని ఆ పదార్థాన్ని కొత్త విగ్రహాల్లోకి మారుస్తాడట. వింటుంటే భలే విచిత్రంగా అనిపిస్తుంది కదూ. ఇప్పటివరకు దాన్ని కళ్ళతో చూసినవారు లేరంటే అతిశయోక్తికాదు. ఆఖరిసారి నవకళేబర ఉత్సవం 2015లో జరిగింది.

ప్రసాదం..

మనదేశంలోని ఆలయాల్లో ఉన్న అతిపెద్ద వంటిళ్లలోనే పూరీలోని రోసఘర ఒకటిగా చెప్పవచ్చు. ఇక్కడ ప్రతిరోజూ చేసే ప్రసాదాల్లో  వృథా కావడం, తక్కువ అవ్వడం వంటి సంఘటనలు జరగలేదట.

32 గదులూ, 250 పొయ్యిలతో కూడిన వంటింట్లో  ప్రసాదం వండేందుకు నిత్యం కొత్త కుండల్నే వినియోగిస్తారట. ఇక, ఈ ప్రసాదాల తయారీలో వెయ్యికిపైగా వంటవాళ్లు నిమగ్నమవుతారట.

ఆలయంలో రోజువారీ నైవేద్యాలే కాక అదనంగా ఛప్పన్‌భోగ్‌ అనే పేరుతో 56 రకాల ప్రసాదాలను స్వామివారికి నివేదించడం విశేషం. అలా వండిన వాటన్నింటినీ ఆలయ సమీపంలోని ఆనందబజార్‌లో ఉంచుతారు. అక్కడినుంచి భక్తులు విడిగా ప్రసాదాన్ని కొనుక్కోవచ్చు. ప్రతిరోజూ సుమారు పదివేలమంది కోసం చేసే ఈ ప్రసాదాలన్నీ సైతం ఏరోజు రుచిలో తేడా రాలేదట.

చివరగా.. 

*ప్రతి ఏటా రామకృష్ణ పరమహంస కోల్‌కతాలో బలరామ్‌ బోస్‌ అనే శిష్యుడి ఇంట్లో జగన్నాథ రథ యాత్రను నిర్వహించి, ప్రసాదాన్ని స్వీకరించేవారట.

గంగానది జలం, బృందావనంలోని మట్టి, జగన్నాథుడి ప్రసాదం- ఈ మూడూ పరమాత్మ స్వరూపాలు’గా భావిస్తారు. జగన్నాథుని దర్శిస్తే జన్మరాహిత్యం కలగడమే కాక, జనన మరణాలనే చక్రభ్రమణం నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు ఎక్కువగా నమ్ముతారు.

జగన్నాథ స్వామి కళ్ళు పెద్దవిగా ఎందుకు ఉంటాయనే సందేహం అందరికీ వచ్చి ఉండవచ్చు..

ఆ స్వామి పెద్ద కన్నులతో అందర్నీ పరిశీలిస్తూ, అందర్నీ రక్షిస్తూ ఉంటారని అర్థం. దీని వెనుక ఒక చిన్న గాథ కూడా ఉంది. పూర్వం ఒకరోజు మాతా రోహిణి శ్రీ కృష్ణుడు ద్వారకలో చేసిన లీలలను అందరిని కూర్చోబెట్టి వివరిస్తూ చెబుతున్నారు. ఇంతలోనే సుభద్ర తలుపు దగ్గర నిలబడే ఆ లీలలు వింటుంటే.. ఆమెతో పాటు శ్రీ కృష్ణుడు, బలరాముడు సైతం అక్కడే నిలబడతారు. లీలలు వింటూ ముగ్గురు ఆశ్చర్యంతో కళ్లను పెద్దవిగా తెరచి చూస్తారు. అదే రూపంలో భక్తులకు దర్శనమివ్వాలని కోరగా.. అప్పట్నుంచి ఆ విశాల కన్నులతో భక్తులకు దర్శనమిస్తున్నారు

Show More
Back to top button