Telugu News

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక. ఎన్టీఆర్.!

తెలుగుజాతి చరిత్రను తిరగరాసిన ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర భావితరాలకు మార్గదర్శకమవుతుంది. ఆయన వ్యక్తి కాదు.. ఒక సంచలనం. 

ఒక ప్రభంజనం. సినీవినీలాకాశంలో ఒక వెలుగు వెలిగిన  విశ్వరూపం. 

సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా.. ప్రజాభిమానమే ఊపిరిగా.. ప్రజలకు మేలు చేసే పరమావధిగా..

ప్రజాహృదయ నేతగా.. బతికి చూపిన ధీరోధాతుడు.. నందమూరి తారకరామారావుగారు..  

ఆయన 102వ జయంతి ఉత్సవాలను తెలుగువారంతా అంగరంగ వైభవంగా జరుపుకోవడం విశేషం!

కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో వెంకట్రావమ్మ, లక్ష్మయ్య చౌదరి దంపతులకు 1923 మే 28న జన్మించారు. రాజకీయాల్లో మహానాయకుడిగా, వెండితెరపై రారాజుగా వెలుగొంది తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారు. మహానటుడిగా తెలుగు ప్రజల నీరాజనాలు అందుకున్నారు. 

సినీనటుడిగా ఎన్టీఆర్‌ ప్రస్థానం మొదలై ఈ ఏడాదికి 75 వసంతాలు పూర్తయ్యాయి. నాలుగు దశాబ్దాలకుపైగా సినీరంగాన ఓ ధ్రువతారగా నిలిచి.. అద్భుత కళావైభవ పాటవాలను ఆవిష్కరించారు. 

పుంఖానుపుంఖాను డైలాగులను.. అవలీలగా చెప్పగల కూర్పు..

పాత్ర ఏదైనా.. నూటికి నూరుపాళ్లు న్యాయం చేయగల నేర్పు..

అచ్చెరువొందే రూపం..  అలరించే గళం.. ఆయన సొంతం.

అందుకే దశాబ్దాలు గడిచినా ప్రేక్షకుల మనసుల్లో ఆయన రూపు చెరిగిపోలేదు. తెలుగు తెరపై అందాల రాముడైనా, కొంటె కృష్ణుడైనా.. ఏడుకొండలవాడైనా, రాక్షస రావణ అయినా.. దాన వీర శూర కర్ణ..

ఇలా ఏ పాత్రనైనా ఎన్టీఆర్‌ చేస్తేనే ఆ పాత్రలకు అసలుసిసలు నిండుదనం వస్తుంది. 

కేవలం పౌరాణిక పాత్రలకే పరిమితం కాలేదు.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలు ఏవైనా ఆయన నటిస్తే ఆ పాత్రకు పరిపూర్ణత, సినిమాకు సార్థకత చేకూరుతుంది.

సినిమాలను కేవలం వ్యాపారాత్మకంగా చూడకుండా కళాత్మకంగా, సందేశాత్మకంగా, సంఘర్షణాత్మకంగా మలిచిన తీరు.. ప్రేక్షకులను ఆలోచింపజేసి ఆచరణకు పురిగొల్పేటట్లు చేసేవి. 

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సినీరంగాన్ని వీడలేదు. తన సినీ జీవితంలో 13 చారిత్రక, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణాక చిత్రాల్లో నటించి తెలుగుతెరపై చెరగని ముద్ర వేశారు.

నాలుగు దశాబ్దాల పాటు తనను ఆరాధించిన ప్రజలకు ఏదైనా చేయాలనే తపనతో రాజకీయ అరంగేట్రం చేశారు. 

ఆనాటివరకు ఉన్నటువంటి సాంప్రదాయ రాజకీయాలను విడనాడి నూతన రాజకీయ వ్యవస్థకు, సంస్కృతికి ఆయన శ్రీకారం చుట్టారు. 

సినిమాల్లో ఉంటూనే చైనా దురాక్రమణ జరిగిన సమయంలో అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవడం కోసం.. దివిసీమ ఉప్పెన సమయంలోనూ.. జోలెపట్టి ఊరూరా తిరిగి ఆ బాధితులను ఆదుకున్నారు.

ఎన్టీఆర్‌ రాజకీయ ప్రవేశం చేసే నాటికి రాష్ట్రంలో రాజకీయ శూన్యత, అస్థిరత్వం నెలకొని ఉంది. ఆనాటి కాంగ్రెస్‌ పెద్దలు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా తీసుకునే చర్యల నేపథ్యంలో.. తెలుగుదేశం ఆవిర్భావం చారిత్రక అవసరంగా మారింది. ప్రజలు సైతం ఇందుకు సంపూర్ణ మద్దతు తెలిపారు.

సందేశాత్మక, ఆవేశపూరిత ప్రసంగాలతో ఎన్టీఆర్‌ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ప్రజావ్యతిరేక విధానాలపై 9 నెలలు అవిశ్రాంతంగా పర్యటించి, ప్రజలను తన ఉపన్యాసాల ద్వారా చైతన్యపరిచి వారిలో ఎనలేని భరోసా నింపారు. 

ఇందుకు ప్రజలను ఎక్కడికో తరలించాల్సిన పనిలేదు. 

స్వచ్ఛందంగా మైళ్లకు మైళ్లు నడుచుకుంటూ పగలు, రాత్రిళ్లు అనే తేడా తెలియకుండా ఎన్టీఆర్‌ను ఒక్కసారైనా చూడాలని, ఆయన ప్రసంగం చెవులారా వినాలని లక్షల సంఖ్యలో ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయేవారు.

తెలుగుదేశం పిలుస్తోంది.. రా కదలిరా అంటూ పిలుపునిచ్చారు. 

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లంటూ నినదించారు.

ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని అతి సామాన్యులను, యువకులను, విద్యావంతులను ఎన్నికల కురుక్షేత్రంలో యోధుల్లా నిలిపారు. 

ఆయన చేసిన సాహసోపేతమైన ప్రయోగం రాజకీయరంగాన్ని ఓ కుదుపు కుదిపింది. 

ఆనాడు 294 స్థానాలు గల శాసనసభలో 202 మెజారిటీ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు.  1983 జనవరి 9న ఎన్టీఆర్‌ తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. నేడు దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటికీ ఆయనే ఆద్యులు!

కిలో రూ.2కే బియ్యం, పేదలకు పక్కాగృహాలు, జనతావస్త్రాలు లాంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు, పథకాల అమలుకు పూనుకున్నారు.

రూ.50కే హార్స్‌ పవర్‌ విద్యుత్‌, వృద్ధాప్య పెన్షన్‌ లాంటి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి విద్యా, వైద్య సంస్కరణలను చేపట్టారు.

మహిళా సాధికారత, సమాన హక్కులు, రిజర్వేషన్ల పట్ల చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రతి అడుగు ప్రజల కోసం, వారి ప్రగతి కోసం తపిస్తూ అనేక పాలనా సంస్కరణలను తీసుకువచ్చారు.

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని ఆనాటి కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని పెద్దలు ఓర్వలేక కూలగొట్టడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో నిరసన జ్వాలలు చెలరేగాయి. ఒక ముఖ్యమంత్రి కోసం ఆనాడు యావత్‌ దేశం స్పందించడం విశేషం! 

ఆయన నెలరోజుల్లోనే తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో ఎన్టీఆర్‌కు చంద్రబాబునాయుడు బాసటగా నిలిచారు. 

ఇందిరాగాంధీ హత్యతో దేశమంతా కాంగ్రెస్ పట్ల సానుభూతి వర్షం కురిపించినా.. 35 పార్లమెంట్‌ స్థానాలను గెలుచుకుని తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ కు ప్రత్యామ్నాయంగా నేషనల్‌ ఫ్రంట్‌ ను ఏర్పాటు చేశారు. దానికి ఆయనే చైర్మన్‌. 

కాలక్రమంలో ఎన్టీఆర్‌ వారసత్వాన్ని.. జాతీయస్థాయిలో చంద్రబాబు కొనసాగించారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఎన్టీఆర్‌ ఆత్మగౌరవానికి ప్రతీకైతే.. చంద్రబాబు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచారు.

ఇరువురి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, వారి బాటలోనే సాగుతూ యువనేత నారా లోకేష్‌ కోటిమంది సభ్యులతో తెలుగుదేశం పార్టీని మరో అద్వితీయశక్తిగా మలిచారు. ఈ ముగ్గురు కలిసి ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ దృక్పథాన్ని తీసుకొచ్చారు.

తెలుగుజాతి చరిత్రను సుసంపన్నం చేసి తెలుగు ప్రజలకు గమనాన్ని, గమ్యాన్ని నిర్దేశించారు. 

ఆయన స్థానం ప్రతి తెలుగువారి గుండెల్లో సుస్థిరం, ఆయన కీర్తి ప్రతి చోటా అజరామరం. 

తెలుగుజాతి ఉన్నంత వరకు జనహృదయాల్లో ఎప్పటికీ ఎన్టీఆర్‌ చిరస్మరణీయులే అవుతారు.

Show More
Back to top button