
ఈ ఆషాఢ మాసంలో ఎన్నో పర్వదినాలు, ఎన్నో విశేషాలు, ఆధ్యాత్మిక సాధకులకు ఇది పవిత్రమైన మాసం. తెలంగాణా రాష్ట్రంలో ఆషాఢ మాసంలో నెలంతా బోనాలతో ఊరు వాడా, పిల్లా పాప సందడిగా ఉంటుంది. ఈ నెలరోజులు గ్రామదేవతలకు పొంగళ్ళు పెట్టడం, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడంతో ఊరు ఊరంతా కళకళలాడుతూ ఉంటుంది. బోనాలు సందర్భంగా మహిళలు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి పసుపుకుంకుమ, చీరె, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
ఎండాకాలం పూర్తయి వర్షాకాలం మొదలయ్యే సమయంలో వచ్చే ఈ ఆషాఢ మాసాన్ని సంధిమాసం అని కూడా అంటారు. ఈ మాసంలో శుభకార్యాలు జరగవు కాబట్టి శూన్యమాసం అని కూడా అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం పూర్వాషాడ ఉత్తరాషాడ నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు సంచరించే సమయమే ఆషాడ మాసం. ఈ ఆషాడ మాసాల్లో శుభకార్యాలు పూర్తిగా నిషిద్ధం. గృహప్రవేశాలు, వివాహాలు, ఉపనయనాల వంటి కార్యక్రమాలను నిలిపివేస్తారు అయితే ఆధ్యాత్మిక పరంగా దేవునికి సంబంధించిన కార్యక్రమాలకు మాత్రం ఆషాడమాసం ప్రాముఖ్యమైనదిగా చెప్పవచ్చు. అంతేకాదు వర్షాకాలం ఆరంభ సమయంలో వాతావరణంలో వచ్చేమార్పుల కారణంగా అంటు వ్యాధులు విజృంభిస్తాయి. చర్మవ్యాధులు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ నెలలో చర్మ సంరక్షణ కోసం గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం కూడా వచ్చింది.
ఆషాడ మాసంలో ఆధ్యాత్మికతకు సంబంధించిన ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయి. ఈ మాసం అంతా దైవ నామస్మరణతో నిండి ఉంటుంది. మరి ఆ ముఖ్యమైన పర్వదినాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పూరి జగన్నాథుని రథయాత్ర…
ఆషాడ మాసంలో ముందుగా ప్రారంభమయ్యేది సప్తమోక్షపురి క్షేత్రాలలో ఒకటైన పూరీ జగన్నాధుని రథయాత్ర. ఆషాడ మాసంలోనే ప్రత్యేకంగా జరిపే ఈ రథయాత్ర ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్రగా ఈ ఉత్సవం ప్రసిద్ధి చెందింది. ఈ రథయాత్రలో ఒక్కసారి పాల్గొంటే జన్మ ధన్యమైపోతుందని పురాణ గాథలు చెబుతున్నాయి.
1174 వ సంవత్సరంలో కళింగ రాజు అనంగ భీమదేవుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి ఎన్నో తుపానులు, ఉపద్రవాలు ముంచుకొచ్చిన పూరి పట్టణం, ఈ ఆలయం మాత్రం చెక్కుచెదరలేదు. ఈ రథయాత్రలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నీలచక్రం. ఆ జగన్నాధుని ఆలయ శిఖరంపై కనిపించే సుదర్శన చక్రాన్ని నీల చక్రం అని అంటారు. అష్ట ధాతువులతో నిర్మితమైన ఈ నీల చక్రం ఎత్తు 11 అడుగులు. జగన్నాధుని గోపురంపై ఉన్న ఈ నీల చక్రానికి అనుసంధానంగా పతాకాన్ని ఎగరవేస్తారు. ఆలయ శిఖరంపై ఎగరవేసే ఈ పతాకం గాలికి వ్యతిరేకంగా రెపరెపలాడడం ఆశ్చర్యకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఆషాడమాసంలో నిర్వహించే ఈ రథయాత్రకు మన భారతదేశంలోని ప్రజలు మాత్రమే కాకుండా ఇతర దేశాల నుండి కూడా ప్రజలు తరలివస్తారు. అత్యంత ప్రముఖమైనది ఈ రథయాత్ర.
వారాహి గుప్త నవరాత్రులు…
ఈ ఆషాడ మాసంలో నిర్వహించే పవిత్రమైన పర్వదినాల్లో ఒకటి వారాహి గుప్త నవరాత్రులు. ఈ పర్వదినం ఎంతో ప్రధానమైనది. ఈ నవరాత్రులు తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. వారాహి అమ్మవారికి విశిష్టంగా పూజలు నిర్వహిస్తారు. ఈ ఆషాడ మాసంలో నిర్వహించే వారాహి గుప్త నవరాత్రుల వల్ల నరగోష, మానసిక వ్యాధులు, దృష్టి దోషాలు, పిశాచ పీడలకు సంబంధించిన భయాందోళనలు, దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే వారాహి అమ్మవారిని పూజించడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయట. లలితా దేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని అభివర్ణిస్తారు. ఈ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ధైర్యం, స్థర్యం కలుగుతాయి. అంతేకాదు జ్ఞానం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చౌరాసి, వారణాసి, మైలాపూర్ లో ఉన్న వారాహి అమ్మవారి ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రసిద్ధి చెందినవిగా చెప్పవచ్చు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ఆషాడమాసంలోనే నిర్వహించడం ఆధ్యాత్మికపరమైన అంశంగా చెప్పవచ్చు.
స్కంద షష్టి వ్రతం…
ఈ స్కంద షష్టి వ్రతాన్ని ఆషాడమాసంలో షష్టి తిధినాడు నిర్వహిస్తారు. వేకువ జామునే లేచి భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఉపవాస వ్రతాన్ని పాటిస్తారు. స్కంద షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని కూడా అంటారు. ఆషాడ మాసంలోని శుద్ధ షష్టి రోజున స్కంద షష్టి జరుపుకుంటారు. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం తారకాసుడనే రాక్షసుడు పరమేశ్వరుడి నుంచి వరాలను పొంది అపారమైన శక్తిని పొందుతాడు. భూలోకంలో విధ్వంసం సృష్టించడం ప్రారంభిస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్యస్వామి శివుని ఆజ్ఞ ప్రకారం దేవగణాలతో కలిసి ఆరు రోజులపాటు యుద్ధం చేసి రాక్షసుడిని ఓడిస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించిన రోజు శుక్లపక్ష షష్టి తిధి కావడంతో ఆనాటి నుంచి ఈ స్కంద షష్టి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. స్కంద షష్టి రోజున సుబ్రహ్మణ్య స్వామితో పాటు శివపార్వతులను కూడా పూజించాలి. అష్టోత్తర శతనామాలతో పూజను ముగించి నైవేద్యం సమర్పించాలి. సాయంత్రం తిరిగి స్నానం చేసి పూజా కార్యక్రమం నిర్వహించి నక్షత్ర దర్శనం చేసిన అనంతరం ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ స్కంద షష్టిని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది.
తొలి ఏకాదశి…
ఆషాడమాసం ప్రారంభంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయనైకా ఏకాదశి, దేవశయని ఏకాదశి అంటారు. ఈ తొలి ఏకాదశి పర్వదినం నుంచే హిందూ పండుగలు ప్రారంభమవుతాయి. వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఆషాడ మాసంలో నిర్వహించే ఈ తొలి ఏకాదశి పండుగకు విశేషమైన స్థానం ఉంది. ఏకాదశి అంటే 11 అని అర్థం. మానవులకు ఉండే ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు వీటన్నిటిని కలిపి పని చేయించే మనసు అంతర్వేంద్రియo. ఈ 11 ఇంద్రియాలు ఏకోన్ముఖంగా శ్రద్ధతో మహావిష్ణువును స్మరించే సమయమే ఏకాదశి పండుగ. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేష తల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. అనంతరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తిరిగి మేల్కొంటాడట. మహావిష్ణువు నిద్రించే ఈ నాలుగు నెలలు చాతుర్మాసాలుగా అభివర్ణిస్తారు. తొలి ఏకాదశి నుంచి ఈ నాలుగు నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ సమయంలో గమనిస్తే ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు తొలి ఏకాదశి రోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు. దానినే దక్షిణాయన ప్రారంభం అని అంటారు. ఈ మాసంలో చతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది.
గోదాదేవి ఆవిర్భావం…
ఆషాడ పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశి రోజే భూలక్ష్మి అంశతో గోదాదేవి ఆవిర్భవించింది. గోదాదేవిని ఆండాళ్ అని కూడా పిలుస్తారు శ్రీ రంగనాథుడిని భర్తగా పొందడానికి ధనుర్మాసంలో మార్గళీ వ్రతాన్ని ఆచరించిన సందర్భంలో వటపత్ర సాయిని కీర్తిస్తూ గోదాదేవి పాడిన పాశురాలు తిరుప్పావైగా నాళాయిరా ప్రబంధంలో నిబంధనయ్యాయి. శ్రీమహావిష్ణు ఆజ్ఞ మేరకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించింది. శ్రీ విష్ణు చిత్తుల ముద్దుబిడ్డగా పెరిగి ఆండాలుగా అందరి హృదయాలను దోచుకుంది. ఆ శ్రీమన్నారాయణని గోదాదేవి ఆరాధించింది. తమిళంలో కోదై అనగా తులసిమాల అని అర్థం. తండ్రి ఆమెను కోదా అని పిలిచేవారు.
క్రమేపి ఆ పేరు గోదాగా మారింది. విష్ణు చితుల వారికి శ్రీ రంగనాథులు కలలో కనిపించి నీ కుమార్తెను తనకిచ్చివాహం చేయడానికి చింతించవద్దని ఆమె ఎవరో కాదు భూదేవని చెబుతాడు. శ్రీరంగం లోని దేవాలయ పెద్దలకు కూడా స్వప్నలో కనిపించి తన వివాహానికై శ్రీవల్లి పుత్తూరు నుంచి గోదా ని పల్లకిలో తెమ్మని చెప్తారు. తద్వారా రాజు వల్లభ దేవునితో పాటు అందరూ కలిసి గోదాదేవిని రంగనాథుని వద్దకు తీసుకువచ్చి వివాహమాడి సన్నిధిలో కలిసిపోయినది. ఆల్వార్లు పాడిన నాలాయిరా ప్రబంధంలో అంటే 4000 పాశురాలలో గోదాదేవి పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. ఈ ఆషాడ మాసంలో తిరుప్పావై లో ఉన్న మొత్తం 30 పాశురాలను రోజుకొకటి చొప్పున పారాయణం చేస్తారు.
గురు పౌర్ణమి…
మహాభారత గ్రంథకర్త వ్యాస మహర్షి ఆషాడ పౌర్ణమి నాడు జన్మిస్తాడు. ఈ వ్యాస మహర్షి పరాశర ముని వలన సత్యవతి దేవికి జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఈ రోజును వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అని కూడా అంటారు. ఆషాడ మాసంలో వచ్చే ఈ గురు పౌర్ణమి ఎంతో విశిష్టమైనది. వ్యాసుడు మానవ కల్యాణం కోసం ఏకరూపమైన వేదాన్ని విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే నాలుగు శాఖలను ఏర్పరిచాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణ వ్యాసుడుగా అవతరిస్తాడు. అందుకే ఈ రోజు విష్ణుమూర్తిని దత్తాత్రేయుని పూజిస్తారు. వాళ్లను మాత్రమే కాకుండా గురువులను పూజించడం కూడా ఆనవాయితీగా వస్తోంది. వ్యాసుడు వేధాలను విభజించి వాటితో పాటు భాగవతం, భారతం, బ్రహ్మ సూత్రాలను కూడా లిఖించాడు. వాటిని రచించకపోతే హిందూ ధర్మశాస్త్రాల అనేవి ఉండేవి కాదట. అయితే ఇన్ని పనులు ఒక్కరే చేయడం సాధ్యం కాదు కదా. అందుకే వ్యాసుడు అనే పేరు ఒక వ్యక్తి నామం కాదని వ్యాసుడు అనేది ఓ బిరుదని పండితులు చెబుతారు. అలా మన జ్ఞానాన్ని రక్షించే గురువులు జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్న వారు సాక్షాత్తు వ్యాసుడి రూపాలే. అందుకే ప్రతి వ్యాస పౌర్ణమి నాడు మన కళ్ళ ముందున్న గురువులను, పెద్దవారిని దైవ సమానులుగా భావించి పూజిస్తారు.
బహుళ సప్తమి…
ఈ ఆషాడ మాసంలో వచ్చే బహుళ సప్తమినే భోగ సప్తమిగా చెబుతారు. ఈ సప్తమి నాడు హిందువులంతా చెట్టు చేమలను, రాళ్లను పుట్టలను దైవాలుగా భావించి పూజలు నిర్వహిస్తారు. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని సమాజం సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేస్తారు. పంట పొలాల్లో జాతరలో నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులు అంతా కలిసి చెట్టు చేమలను ఆరాధిస్తూ వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. వనదేవతలకు మొక్కులు చెల్లించిన అనంతరం అక్కడే విందు ఏర్పాటు చేసుకొని అంతా కలిసి భుజిస్తారు. ఏటా ఆషాడ మాసంలో వచ్చే ఈ బహుళ సప్తమి నాడు ప్రకృతి దేవతను ఆరాధిస్తూ పూజలను నిర్వహిస్తారు.
కామదా ఏకాదశి…
ఆషాడ మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే కామదా ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ పవిత్ర దినాన ఉపవాస దీక్షను ఆచరించి వ్రతాన్ని ఆచరిస్తే తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయట. కామదా ఏకాదశి రోజున సూర్యదాయానికి ముందే నిద్రలేచి పవిత్ర నది స్నానం చేసి ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. అనంతరం విష్ణు మూర్తి విగ్రహం లేదా ఫోటోను శ్రీయంత్రంతో శుభ్రం చేసి ప్రతిష్టించాలి. నేతి దీపం వెలిగించి శ్రీమహావిష్ణువుకు పండ్లు, పువ్వులు, పాలు, నువ్వులు, తులసి ఆకులను నైవేద్యాలుగా సమర్పించాలి. తులసి ఆకు లేకుండా పూజ పూర్తవ్వదు. అనంతరం శ్రీమహావిష్ణు స్తోత్రాలను, మంత్రాలు పటిస్తూ హారతి ఇచ్చి పూజ ముగించాలి. ఈ కామధ ఏకాదశి నాడు బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ వ్రతం చేసిన స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుంది. పురాణ గాథ ప్రకారం పూర్వకాలంలో పుండరీకుడు అనే రాజు దగ్గర పని చేసే గంధర్వుడు ఉండేవాడు.
తను పని పట్ల నిర్లక్ష్యంగా ఉండేవాడు. తనను రాక్షసుడుగా మారిపోవాలని ఆ రాజు శాపం విధిస్తాడు. దీంతో అప్పటినుంచి గంధర్వుడు రాక్షసుడుగా మారి ప్రజలను ఇబ్బంది పెడతాడు. ఆ గంధర్వుడి భార్య కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తుంది. ఆ వ్రత పుణ్యఫలం వల్ల గంధర్వుడు సాధారణ రూపాన్ని పొందుతాడు. అందుకే పవిత్రమైన ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుని ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. పసుపు రంగులో ఉన్న వస్తువులను శ్రీమహావిష్ణువు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంతేకాదు జాతకంలో గురుదోషం ఉంటే తొలిగిపోతుంది. పసుపు రంగులో ఉండే వస్తువులను స్వామివారికి సమర్పించాలి. ఆషాడ మాసంలో వచ్చే ఈ కామధ ఏకాదశి వ్రత పుణ్యఫలం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
తెలుసుకున్నారు కదా శుభకార్యాలకు అనువైన కాలం కాకపోయినా ఆషాడమాసంలో ఆధ్యాత్మికపరంగా ఎన్నో శుభదినాలు ఉన్నాయి. ఈ ఆషాడ మాసంలో నిర్వహించే ప్రతిరోజు శాస్త్రపరంగా ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది.