
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రంగా మారుతుండటంతో, అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను కాపాడేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధు’ అనే ప్రత్యేక మిషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కింద, ఉత్తర ఇరాన్లో ఉన్న 110 మంది భారతీయ విద్యార్థులను జూన్ 17న ఆర్మేనియాలోని యెరవాన్కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో భారతదేశానికి పంపిస్తున్నారు. జూన్ 19న తెల్లవారు జామున వారు న్యూఢిల్లీకి చేరుకోనున్నారు.
ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు కేంద్రం చాలా ప్రాముఖ్యత ఇస్తుందన్నారు. టెహ్రాన్ నగరంపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అక్కడి భారతీయులకు భారత ఎంబసీ ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. టెహ్రాన్ నగరం వీడి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ సూచనలు ఇచ్చింది. ఎవరైనా భారతీయులు ఎంబసీని సంప్రదించకుండా ఉంటే వెంటనే కనెక్ట్ కావాలంటూ సూచించింది.
తెలంగాణ ప్రభుత్వం హెల్ప్లైన్ ఏర్పాటు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ప్రభావాల దృష్ట్యా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా దిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ లేదా చుట్టుపక్కల దేశాల్లో ఉంటున్న తెలంగాణవాసులకు ఏవైనా ఇబ్బందులు వస్తే, వెంటనే సహాయం అందించేందుకు ఈ సదుపాయం అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం రాష్ట్ర వాసులెవ్వరూ ప్రభావితులుకాదన్నా, భవిష్యత్ అవసరాల కోసం ఈ ఏర్పాట్లు చేశారు.
హెల్ప్లైన్ నంబర్లు ఇవే
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం అందించిన కాంటాక్ట్ నంబర్లు:
వందన (రెసిడెంట్ కమిషనర్ పీఎస్): +91 9871999044
జి. రక్షిత్ నాయక్ (లైజన్ ఆఫీసర్): +91 9643723157
జావేద్ హుస్సేన్ (లైజన్ ఆఫీసర్): +91 9910014749
సీహెచ్. చక్రవర్తి (పౌర సంబంధాల అధికారి): +91 9949351270