
భారతదేశంలో వ్యవసాయం కేవలం ఒక ఆర్థిక కార్యకలాపం కాదు. అది ఈ నేల గుండెచప్పుడు, దేశ సంస్కృతిలో అంతర్లీనంగా పెనవేసుకున్న జీవన విధానం. కోట్ల మంది భారతీయులకు అన్నం పెడుతూ, సగం మందికి పైగా జనాభాకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బతుకుదెరువునిస్తుంది. ఇది దేశంలోనే అతిపెద్ద ఉపాధి కల్పన రంగం, లక్షలాది శ్రామికులకు అండగా నిలుస్తూ, దేశ స్థూల విలువ జోడింపుకి గణనీయమైన వాటాను అందిస్తుంది. ఒకప్పుడు ఆహార కొరతతో అల్లాడిన మన దేశం, నేడు అనేక వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం, హరిత విప్లవం, తదనంతర విధానాల విజయాన్ని చాటుతుంది. విశాలమైన, నిరంతరం పెరుగుతున్న మన జనాభాకు ఆహార భద్రత కల్పించడంలో ఈ మార్పు కీలక పాత్ర పోషించింది, తద్వారా భారతదేశం ప్రపంచ వ్యవసాయ దిగ్గజాలలో ఒకటిగా నిలిచింది.
భారత వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న అడ్డంకులు- సవాళ్లు:
వ్యవసాయ రంగం ఎంత కీలకమైనదైనా, అది అనేక లోతైన, నిర్మాణాత్మక సవాళ్లతో సతమతమవుతోంది. ఈ సమస్యలు దాని పూర్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, కోట్లాది మంది రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని కూడా కదిలిస్తున్నాయి. అత్యంత తీవ్రమైన సమస్యలలో ఒకటి భూకమతాల విపరీతమైన విభజన, చిన్న కమతాలుగా మారిపోయి ఆర్థికంగా లాభదాయకం కాని పరిమాణాలకు కుంచించుకుపోతున్నాయి. దీనికి కారణం తరతరాలుగా పూర్వీకుల భూమి వారసుల మధ్య పంచుకుంటూ పోవడం. ఈ విభజన వల్ల యాంత్రీకరణ కష్టమై, ఖరీదైపోతుంది. నీరు, ఎరువులు వంటి వనరుల సరైన వినియోగం జరగదు. పైగా రైతులు పెద్ద ఎత్తున సాగు చేయలేకపోతారు. నాబార్డ్ సర్వే ప్రకారం దేశంలో సగటు భూకమతాల పరిమాణం 2016-17లో 1.08 హెక్టార్ల నుంచి 2021-22 నాటికి కేవలం 0.74 హెక్టార్లకు తగ్గిపోయింది.
ఇది దాదాపు మూడింట ఒక వంతు తగ్గుదల. రుతుపవనాలపై ప్రమాదకరమైన ఆధారపడటం ఒక బలహీనతగా మిగిలిపోయింది. సాగునీటి సౌకర్యాలు పెరిగినప్పటికీ, దేశంలో దాదాపు 50 నుండి 51 శాతం నికర సాగు విస్తీర్ణం ఇంకా వర్షాధారంగానే ఉంది. ఇది వాతావరణ మార్పులు, అస్తవ్యస్తమైన వర్షపాతం, కరువులు, వరదలు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులకు వ్యవసాయాన్ని గురిచేస్తుంది. ఈ అధిక ఆధారపడటం వల్ల వ్యవసాయ ఉత్పత్తిలో భారీ హెచ్చుతగ్గులు ఏర్పడి, లక్షలాది మంది రైతుల ఆర్థిక పరిస్థితిని అగమ్యగోచరంగా మారుస్తుంది. సమయానికి, సరసమైన ధరలకు అప్పులు అందకపోవడం చిన్న, సన్నకారు రైతుల కష్టాలను మరింత పెంచుతోంది.
అధికారిక రుణ సంస్థలు విస్తరించినప్పటికీ, చాలా మంది రైతులు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారు లేదా తగిన పూచీకత్తు లేనివారు, ఇంకా అనధికార వడ్డీ వ్యాపారులపై ఆధారపడవలసి వస్తుంది. ఈ వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ రేట్లను వసూలు చేసి, రైతులను అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కొంతవరకు ఆదుకున్నప్పటికీ, డిసెంబర్ 31, 2024 నాటికి 7.72 కోట్ల మంది రైతులకు ₹10.05 లక్షల కోట్ల రుణ పరిమితితో ఇది ప్రయోజనం చేకూర్చింది. కౌలుదారులు, భూమి పత్రాలు లేని వారికి సమాన ప్రాతిపదికన రుణాలు అందడంలో ఇంకా సవాళ్లున్నాయి. పంట బీమా ప్రవేశం కూడా మెరుగుపడినప్పటికీ, వాతావరణ షాక్ల నుండి రైతులకు మరింత బలమైన రక్షణ కల్పించడానికి గణనీయంగా బలోపేతం కావాలి.
చివరగా పంట కోతానంతర నష్టాలు, అసమర్థమైన సరఫరా గొలుసులు వ్యవసాయ రంగానికి భారీ నష్టాన్ని చేకూరుస్తున్నాయి. తగినంత శీతల గిడ్డంగులు, ఆధునిక గోదాములు, పటిష్టమైన రవాణా వ్యవస్థలు లేకపోవడం వల్ల, చాలా వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్కు చేరకముందే లేదా ప్రాసెసింగ్ కాకముందే పాడైపోతున్నాయి. 2022లో నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ చేపట్టిన అధ్యయనం ప్రకారం ధాన్యం, ఇతర తృణధాన్యాలలో పంట కోతానంతర నష్టాలు 3.89% నుండి 5.92% మధ్య ఉండగా, పండ్లు, కూరగాయలలో 5% నుండి 15% వరకు నష్టాలు సంభవిస్తున్నాయి. ఇది రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగించడమే కాకుండా ఆహార ద్రవ్యోల్బణం, వనరుల వృథాకు దారితీస్తుంది. ప్రత్యక్ష మార్కెటింగ్ అనుసంధానాలు లేకపోవడం వల్ల రైతులు తరచుగా మధ్యవర్తుల ద్వారా విక్రయించాల్సి వస్తుంది, ఇది వారి లాభాలను మరింత తగ్గిస్తుంది.
శ్రేయస్సు దిశగా – వ్యవసాయ రంగానికి పరిష్కార మార్గాలు:
ఈ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడానికి సాంకేతిక పురోగతి, పటిష్టమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, లక్ష్యిత విధాన సంస్కరణలను సమగ్రంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా వ్యవసాయ రంగాన్ని నిజంగా బలంగా, లాభదాయకంగా మార్చవచ్చు.
భూ కమతాల విభజన వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి, రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ప్రోత్సహించడం, బలోపేతం చేయడం అత్యవసరం. ఈ సంఘాలు చిన్న, సన్నకారు రైతులను ఏకం చేయడం ద్వారా ఉత్పత్తిని పెద్ద ఎత్తున సేకరించడానికి, తక్కువ ధరకు ముడిసరుకులను కొనుగోలు చేయడానికి, యంత్రాలను పంచుకోవడానికి, మార్కెట్లో మెరుగైన ధరల కోసం సమిష్టిగా బేరం చేయడానికి వీలు కల్పిస్తాయి. 2028 నాటికి 10,000 కొత్త రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యం ఒక స్పష్టమైన వ్యూహాత్మక దిశను సూచిస్తుంది. వీటితోపాటు, భూ యజమానులు, కౌలుదారులు ఇద్దరికీ రక్షణ కల్పించే సరైన చట్టపరమైన నిబంధనలతో కంట్రాక్ట్ ఫార్మింగ్, భూమి కౌలు నమూనాలను ప్రోత్సహించడం కూడా కమతాల ఏకీకరణ లేకుండానే పెద్ద ఎత్తున సాగు చేయడానికి సహాయపడుతుంది. ‘ప్రతి బొట్టుకు అధిక పంట’ అనే నినాదంతో సాగునీటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం అత్యవసరం. పెద్ద సాగునీటి ప్రాజెక్టులు ముఖ్యమైనప్పటికీ, మైక్రో ఇరిగేషన్ పద్ధతులైన – డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థలను వేగవంతం చేయాలి. ఈ పద్ధతులు నీటిని సమర్థవంతంగా ఉపయోగించడమే కాకుండా, విభిన్న భూభాగాలకు కూడా అనుకూలంగా ఉంటాయి.
పంట కోతానంతర నష్టాలను గణనీయంగా తగ్గించడానికి, మార్కెట్ అనుసంధానాలను మెరుగుపరచడానికి, కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాలపై గణనీయమైన, నిరంతర పెట్టుబడి పెట్టడం అనివార్యం. ఇందులో ఆధునిక శీతల గిడ్డంగులు, శీతలీకరించిన రవాణా నెట్వర్క్లు, సమగ్ర లాజిస్టిక్స్ పరిష్కారాలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ కృషి
2016 నుండి 2024 డిసెంబర్ వరకు సుమారు 95 లక్షల హెక్టార్ల భూమిని మైక్రో-ఇరిగేషన్ కిందకు తీసుకువచ్చారు. అంతేకాకుండా, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, వాటర్షెడ్ అభివృద్ధి, సాంప్రదాయ నీటి వనరుల పునరుజ్జీవనం వంటి వాటిలో భారీ పెట్టుబడులు వర్షాధార ప్రాంతాల్లో నీటి లభ్యతను గణనీయంగా పెంచి, వాతావరణ మార్పులకు వ్యవసాయాన్ని మరింత తట్టుకునేలా చేస్తాయి. ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన పథకానికి నిరంతర ఆర్థిక మద్దతు, సమర్థవంతమైన అమలు అవసరం. రైతులకు ఆర్థిక సమగ్రతను, రుణ లభ్యతను పటిష్టం చేయడానికి, బ్యాంకింగ్ రంగం సాంప్రదాయ రుణ నమూనాలకు మించి కొత్త ఆవిష్కరణలు చేయాలి. ఆధార్,
యుపిఐ వంటి డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించడం వల్ల రుణాల పంపిణీ వేగవంతమవుతుంది, లావాదేవీల ఖర్చులు తగ్గుతాయి. రైతుల మధ్య ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం, వారి నిర్దిష్ట అవసరాలు, పంట చక్రాలకు అనుగుణంగా రుణ ఉత్పత్తులను రూపొందించడం వల్ల ప్రస్తుత లోపాలను పూడ్చవచ్చు. అంతేకాకుండా, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన వంటి పంట బీమా పథకాలను బలోపేతం చేయడం, క్లెయిమ్ ప్రక్రియలను సరళీకరించడం, అవగాహనను పెంచడం, సకాలంలో నష్టపరిహారం చెల్లించడం ద్వారా ఊహించని సంఘటనల నుండి రైతులకు నిజమైన రక్షణ కల్పించడం అత్యవసరం. ఈ పథకం ద్వారా 2025 ఫిబ్రవరి నాటికి గత తొమ్మిదేళ్లలో 23.22 కోట్ల మందికి పైగా రైతులకు ₹1.75 లక్షల కోట్ల క్లెయిమ్లను పంపిణీ చేసింది, 2023-24లో రైతు నమోదు 25% వృద్ధిని చూపింది. పిఎం కిసాన్ వంటి ప్రత్యక్ష ఆదాయ మద్దతు పథకాలు, 2024 జూలై నాటికి 11 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ₹3.24 లక్షల కోట్ల ప్రయోజనాలను అందించాయి.
ఇవి కీలకమైన ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తాయి. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, కోతానంతర నిర్వహణ మౌలిక సదుపాయాలు, సామూహిక వ్యవసాయ ఆస్తుల కోసం ఆర్థిక సహాయం అందించే ₹1 లక్ష కోట్ల పథకంలో, 2024 ఆగస్టు నాటికి ₹47,575 కోట్ల విలువైన 74,508 ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి, మొత్తం ₹78,596 కోట్ల పెట్టుబడిని సమీకరించింది. ఈ చొరవ గోదాములు వంటి కీలక ఆస్తులను సృష్టిస్తోంది. 2024 ఫిబ్రవరి నాటికి 11,284 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. అంతేకాకుండా గ్రామ స్థాయిలో వ్యవసాయ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం వల్ల పచ్చి వ్యవసాయ ఉత్పత్తులకు గణనీయమైన విలువను జోడించవచ్చు. వృథాను తగ్గించవచ్చు. అదనపు గ్రామీణ ఉపాధిని సృష్టించవచ్చు. రైతు మార్కెట్లు, ఆన్లైన్ ట్రేడింగ్ కోసం నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఇ-నామ్)లో 2024 అక్టోబర్ నాటికి 1.78 కోట్ల మంది రైతులు, 2.62 లక్షల మంది వ్యాపారులు నమోదు చేసుకున్నారు. రైతు-వినియోగదారుల డిజిటల్ ప్లాట్ఫారమ్ల వంటి ప్రత్యక్ష మార్కెటింగ్ మార్గాలను ప్రోత్సహించడం వల్ల మధ్యవర్తుల సంఖ్యను తగ్గించి, రైతులకు మెరుగైన ధరలను అందించవచ్చు.
వ్యూహాత్మక దృష్టి అవసరం:
అనేక రంగాలపై వ్యూహాత్మకంగా దృష్టి సారించడం ద్వారా, నిరంతర విధాన మద్దతు, తాజా సాంకేతిక పురోగతులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా, భారతదేశం తన వ్యవసాయ రంగంలోని అపారమైన సామర్థ్యాన్ని నిజంగా ఆవిష్కరించగలదు. తద్వారా 2025 తర్వాత కూడా ఆహార భద్రతతో పాటు స్థిరమైన వృద్ధి, పెరిగిన రైతు ఆదాయాలు, విస్తృత గ్రామీణ శ్రేయస్సును నిర్ధారించగలదు.