![The fan whirls due to the impact of the bicycle..!](/wp-content/uploads/2024/06/Telugu-Desam-Party-the-BJP-and-the-Jana-Sena-1-780x470.jpg)
కొన్నిసార్లు రావడం లేటు అవ్వొచ్చేమో గానీ, రావడం మాత్రం పక్కా అని పవన్ కల్యాణ్ అన్నట్టుగా.. ఆయన రాజకీయాల్లో త్వరగానే వచ్చారు. కానీ, అధ్యక్షా అని పిలవడానికి పదేళ్లు రాజకీయ క్షేత్రంలో యుద్ధమే చేశారని చెప్పుకోవచ్చు. ఒకపక్క చంద్రబాబును అరెస్టు చేయించడం.. మరోపక్క పవన్ను వ్యక్తిగత విమర్శలతో ఆయన హృదయాన్ని ముక్కలుగా కోయాలనుకున్నారు. దత్తపుత్రుడనే మాటలతో దాడి చేశారు.
ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ ప్రతిఒక్కరూ మేకుల్లాంటి మాటలతో మానసికంగా కుంగదీయాలనుకున్నారు. కానీ, చంద్రబాబు, పవన్ ఉక్కు సంకల్పం ముందు అవన్నీ కొట్టుకుని పోయాయి. జనమే ప్రభంజనమై కూటమిని గెలిపించారు.
వైనాట్ 175 ఫ్లాప్..
ఎన్నికల ప్రచారంలో వైనాట్ 175 అంటూ ప్రచారం చేసిన వైసీపీ.. ప్రస్తుత ఫలితాల సరళి చూస్తుంటే పూర్తిగా చతికిలపడిపోయింది. కనీసం డిపాజిట్లు కూడా గెలవలేని పరిస్థితిలో వైసీపీ చేరిపోయింది. జగన్ మంత్రివర్గంలో కీలక మంత్రులు కూడా ఓడిపోయారు. ఆర్కే రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్ వంటి మంత్రులు ఓటమి పాలయ్యారు.
అభివృద్ధి అజెండాకు ఓట్లు పడ్డాయి..
ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి అజెండాకు ఓట్లు వేసినట్లు స్పష్టమవుతోంది. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కనిపించకపోవడంతో సామాన్య ఓటరు తెలుగుదేశం పార్టీ కూటమి వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. సంక్షేమ కార్యక్రమాలను నమ్ముకున్న జగన్… ప్రజల విశ్వాసం పొందడంలో వైఫల్యం చెందినట్లు తెలుస్తోంది. అతి విశ్వాసమే జగన్ కొంపముంచినట్లు తెలుస్తోంది. మీ ఇంట్లో మంచి జరిగిందని భావిస్తే వైసీపీకి ఓట్లు వేయాలని జగన్ కోరగా.. తమ ఇంట్లో మంచి జరగలేదని ప్రజలు తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది.
రాజధాని అంశం..
ఏపీలో మూడు రాజధానులపై ప్రజలు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లపాటు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండటంపై ఓటరు కోపంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు విశాఖను రాజధాని చేస్తామన్న వైసీపీకి అక్కడి ప్రజలు ఓట్లు వేయలేన్నట్లు తెలుస్తోంది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని టీడీపీ కూటమి చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించినట్లు తెలుస్తోంది. అందుచేతనే టీడీపీని భారీ మోజార్టీతో గెలిపించినట్లు కనబడుతోంది.