
ఒకప్పుడు ఆడపిల్లకు చదివేందుకు అనేవాళ్ళు.. కానీ అదే ఆడవాళ్ళకు విద్య అనే అయుధమిస్తే ఎన్ని అద్భుతాలు, రికార్డులు సృష్టిస్తారో నిరూపించారు…
విద్య, వైద్య, న్యాయ, శాస్త్ర, సాంకేతిక రంగాలే కాక పలు రంగాల్లో తమ ముద్ర వేస్తూ వస్తున్నారు.
ఇంటాబయటా ఆంక్షలు.. సవాళ్ళను ఎదుర్కొని ప్రపంచస్థాయి ఖ్యాతి పొందిన మహిళామణుల జాబితాలో మన భారతీయ స్త్రీలు ఉన్నారు…
పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న సమాజంలో…
తమ ప్యాషన్ కోసం ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అందరికీ స్ఫూర్తిదాయకంగా మారిన ఈ తొలి మహిళామణుల గురుంచి… అంతర్జాతీయ మహిళా దినోత్సవ(ఈ నెల 8న) సందర్భంగా ప్రత్యేకంగా తెలుసుకుందాం:
తొలి రైలు డ్రైవర్.. సురేఖా యాదవ్…
ఆసియాలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ను, అత్యధిక ఉద్యోగులను కలిగిన రవాణా వ్యవస్థ మన భారతీయ రైల్వేదే. ఈ వ్యవస్థలో పురుషులతో పాటు ధీటుగా ఎందరో మహిళలు రాణిస్తున్నారు. అందుకు తొలిగా అడుగు వేసింది మాత్రం సురేఖా యాదవ్.. అసిస్టెంట్ ట్రెయిన్ డ్రైవర్ గా ఆమె అప్పట్లో బాధ్యతలు నిర్వర్తించారు.
2000 సంవత్సరంలో సెంట్రల్ రైల్వేస్ కు చెందిన లోకల్ ట్రెయిన్ కు సైతం సురేఖా ట్రెయిన్ అసిస్టెంట్ డ్రైవర్ గా పనిచేశారు. ఇక 2011లో.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, పుణె నుంచి ముంబై మీదుగా ప్రయాణించే డెక్కన్ క్వీన్ ఎక్స్ ప్రెస్ కు లోకో పైలట్గా నియమింపబడింది. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని నేడు దేశవ్యాప్తంగా 50మందికి పైగా లోకో పైలట్లు విధుల్లో ఉన్నారంటే, గొప్ప విషయమే కదా!
తొలి మహిళా ఒలింపియన్.. కరణం మల్లీశ్వరీ.. కరణం మల్లీశ్వరి.. వెయిట్ లిఫ్టింగ్లో దేశం గర్వపడే స్థాయిలో ఒలింపిక్ మెడల్ ను సాధించి చరిత్ర సృష్టించింది. అత్యున్నత ఒలింపిక్స్లో వ్యక్తిగత పోటీల్లో పతకం సాధించిన తొలి మహిళ కరణం మల్లీశ్వరియే.. పదేళ్ల వయసుకే 11 బంగారు, మూడు రజత పతకాలు తన ఖాతాలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. పురుషులు మాత్రమే రాణించగలరు అన్న క్రీడల్లో తన ప్రస్థానం.. కొత్త రికార్డును సృష్టించేలా చేసింది.
తొలి ఐపీఎస్ అధికారిణి.. కిరణ్ బేడీ…
భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి, సామజిక కార్యకర్త, రాజకీయవేత్త, రచయిత్రి… ఇలా బహుముఖ ప్రతిభతో.. ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన మహిళ.. మాజీ ఐపీఎస్ అయిన కిరణ్ బేడీ.
స్కూలింగ్ విద్య అమృత్సర్ లోనే పూర్తిచేసింది. 1968-70లో పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీఘర్ నుంచి రాజనీతి శాస్త్రంలో ఎం.ఏ పట్టా పొందింది. ఉద్యోగంలో చేరిన తరువాత 1988లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా తీసుకుంది. 1993లో ఢిల్లీ ఐ.ఐ.టి.. పీహెచ్ డిను ప్రధానం చేసింది. కిరణ్ బేడీ చిన్న వయస్సు నుంచే మంచి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 1972 జూలైలో, మొట్టమొదటి ఐపీఎస్ గా ఎన్నికై చరిత్ర సృష్టించింది.
ముస్సోరిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ పొందింది. 80మంది పురుషులున్న బ్యాచ్లో తనొక్కతే మహిళ కావడం విశేషం. 1975లో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో కవాతుకు సారథ్యం వహించడం విశేషం.
ఢిల్లీలో జరిగిన అకాలీ- నిరంకారీ అల్లర్ల అణచివేతలో కిరణ్ పాత్ర కీలకం.
ఇక ప్రజలకు పోలీసులకు మధ్య సంబంధాలను మెరుగుపరచడంలోనూ ఆమె విజయం సాధించారు. తీహార్ జైలు ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ)గా పనిచేశారు. ఇక్కడ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చారు. ఈమెకు 1994లో రామన్ మెగసెసె అవార్డు లభించింది.
2007 డిసెంబర్ లో, బ్యూరో అఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ, డిసెంబర్ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసింది.
తొలి ఫైర్ ఫైటర్.. హర్షిణీ కన్హేకార్…
అత్యంత క్లిష్టమైన ఫైర్ సర్వీసెస్ విభాగంలోనూ మహిళలు అడుగుపెట్టగలరని.. తామేమి తక్కువ కాదని నిరూపించారు హర్షిణి. దేశపు తొలి మహిళా అగ్నిమాపక దళఅధికారిగా ఆమె చరిత్ర లిఖించారు. ఫైర్ సర్వీసెస్ విభాగంలో తొలి మహిళగా హర్షిణీ కన్హేకార్ అడుగుపెట్టారు. 2005లో ఓఎన్జీసీ కార్పొరేషన్ లో సెక్యురిటీ ఆఫీసర్గా జాయిన్ అయి, చరిత్ర సృష్టించారు. చాలామంది ఈ ఫీల్డ్ వద్దని హెచ్చరించినా… ధైర్యం చేసి తొలి అడుగు వేసింది.
శిక్షణ సమయంలో మగవాళ్ళకు ధీటుగా మాక్ డ్రిల్స్ చేసింది. ఎన్నో ఫైర్ ఆక్సిడెంట్ లను చాకచక్యంగా పరిష్కరించింది. ఇది మగవాళ్ళ పని.. ఇది ఆడవాళ్ళ పని అంటూ చేసే పనికి వ్యత్యాసం ఉండదు.. ఆసక్తి, అంకితభావమే పనికి గీటురాయి అని నిరూపించారామె.
తొలి మహిళా న్యాయమూర్తి అన్నా చాందీ…
కేరళ నుంచి న్యాయ పట్టా పొందిన మొదటి మహిళ.. అన్నా చాందీ.
కేరళలోని త్రివేండ్రంలో జన్మించిన అన్నా చాందీ.. 1926లో స్థానిక ప్రభుత్వ లా కాలేజీ నుంచి న్యాయ పట్టా పొందారు. 1929 నుంచి లా ప్రాక్టీస్ ను ప్రారంభించారు. అదే సమయంలో, ‘మిసెస్’ అనే పత్రికను ప్రారంభించి.. మహిళల స్వేచ్ఛ, వితంతు వివాహం, మహిళలకు సంబంధించిన సమస్యలపై కథనాలు రాయడం ప్రారంభించింది.
1937లో మున్సిఫ్గా నియమితులయ్యారు. దీంతో ఆమె దేశానికి తొలి మహిళా న్యాయమూర్తిగా చరిత్రలో నిలిచారు.
1948లో జిల్లా న్యాయమూర్తిగా పని చేశారు.
1959లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1967 ఏప్రిల్ 5 వరకు ఈ పదవిలోనే కొనసాగారు. పదవీ విరమణ చేసినప్పటికీ, భారతదేశ లా కమిషన్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. 1996 జూలై 20న, ఆమె 91వ ఏటా మరణించారు.
సుచేతా కేడథాన్కర్…
సాహస క్రీడల్లోనూ మహిళలు పురుషులతో సమానంగా రాణించారు. అందుకు గొప్ప ఉదాహరణ.. సుచేతా కేడథాన్కర్..
తను ఏకంగా మంగోలియాలోని అత్యంత క్లిష్టమైన, ప్రతికూల వాతావరణం కలిగినటువంటి గోబీ ఎడారిని నడుచుకుంటూ దాటి, రికార్డు సృష్టించింది. సుమారు 1600 కిలోమీటర్ల ప్రయాణాన్ని కాలినడకన ముగించి, అత్యంత సాహసవంతుల జాబితాలో చేరిపోయింది. సుమారు తొమ్మిది దేశాలకు చెందిన 13మంది సభ్యులు పాల్గొన్నారు. వీరిలో కేవలం ముగ్గురు మాత్రమే మహిళలు పాల్గొనగా అందులో సుచేతా ఒకరు.. భారత్కు చెందినవారు కావడం విశేషం. 2008లో సుచేతా ఎవరెస్ట్ పర్వతాన్ని సైతం అధిరోహించారు.
మరికొంతమంది…
*చంద్రముఖి బసు, కదాంబిని గంగూలీ
బ్రిటీష్ సంస్థానంలోని మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్లుగా ఇద్దరు చరిత్రలో నిలిచారు. చంద్రముఖి కలకత్తా యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ విభాగంలో 1883లో పట్టా పొందగా, అదే ఏడాది కదాంబినీ కలకత్తా మెడికల్ కాలేజీ నుంచి యూరోపియన్ మెడిసిన్లో పట్టా తీసుకుంది. చంద్రముఖి బసు బేతూన్ కాలేజీలో లెక్చరర్గా కెరీర్ ప్రారంభించి, అదే కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యారు. అంతేకాక దక్షిణాసియాలో అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీ స్థాపించిన మొదటి మహిళగానూ చరిత్రకెక్కారు.
ఆసిమా ఛటర్జీ…
సైన్స్ రంగంలో డాక్టరేట్ సాధించిన మొదటి భారతీయ మహిళ. పైటోమెడిసిన్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈమె ప్రవీణురాలు. మూర్చ నిరోధక మాత్రలు, మలేరియా మందులను సైతం అభివృద్ధి చేశారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ విభాగంలో ప్రతిష్టాత్మక ‘ఖైరా ప్రొఫెసర్షిప్’ పొందారు. ఆమె సేవలకు గుర్తింపుగా కలకత్తా యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ప్రత్యేక హోదానిచ్చింది. 1960లో జాతీయ సైన్స్ అకాడమీ ఫెలోషిఫ్కు ఎంపిక కాగా, 1961లో రసాయన శాస్త్రంలో చేసిన కృషికి గుర్తింపుగా ‘శాంతి స్వరూప్ భట్నాగర్’ అవార్డు పొందడం విశేషం.
కల్పనా చావ్లా…
అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి ఇండో- అమెరికన్ వ్యోమగామిగా చరిత్రలో నిలిచారీమె. 1995లో నాసా ఆస్ట్రోనాట్ కార్ప్స్ బృందంలో చేరి, 252సార్లు భూమిని చుట్టి సుమారు
10.4 మిలియన్ కి.మీ. దూరంమేర ప్రయాణించారు. అంతరిక్షనౌక ‘కొలంబియా’లో చంద్రగ్రహ యాత్రకు వెళ్లిన సమయంలో.. ఆరుగురు వ్యోమగాములున్న బృందం ప్రమాదవశాత్తు మరణించారు. ఆమె మరణానంతరం కాంగ్రెషనల్ స్సేస్ మెడల్, నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్, నాసా సర్వీస్ మెడల్ ను ఆమెకు అంకితం చేశారు.
ఆనందిబాయి గోపాలరావు జోషి…
18వ శతాబ్దంలోనే వైద్య విద్యనభ్యసించిన తొలి మహిళా వైద్యురాలుగా ఈమె గుర్తింపు పొందారు. అంతేకాదు పాశ్చాత్య వైద్యశాస్త్రంలో శిక్షణ పొందిన తొలి మహిళ, అమెరికా వెళ్లిన మొట్టమొదటి భారతీయ స్త్రీ కూడా ఆనందిబాయి గోపాలరావు జోషినే.
బచేంద్రీ పాల్…
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ. 1984లో పద్మ శ్రీ పురస్కారం సైతం అందుకున్నారు. 1985లో ఇండో- నేపాలీ మహిళలతో కలిసి ఎవరెస్ట్ సాహస యాత్ర
చేపట్టి, ఏకంగా 7 ప్రపంచ రికార్డులను సృష్టించింది. భారత మహిళా సాహస యాత్రికులకు నిత్యమార్గదర్శకురాలిగా నిలిచారు. హరిద్వార్ నుంచి కలకత్తా వరకు 2,500 కి.మీ. మేర గంగా నదిలో యాత్ర సాగించిన రాఫ్టింగ్ బృందానికి ఈమె నాయకత్వం వహించారు.
అరుణిమా సిన్హా…
జాతీయస్థాయి వాలీబాల్ ప్లేయర్ గా పేరు సంపాదించింది. ఎన్నో విజయాలు సాధించిన ఆమె.. ప్రమాదవశాత్తు కదులుతున్న రైలులోంచి బయటకు తోసేసారు కొందరు దుండగులు. ఈ ప్రమాదంలో ఆమె కాలును పూర్తిగా తొలగించారు. అటువంటి పరిస్థితుల్లోనూ ఆమె అధైర్యపడలేదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఎవరెస్టును అధిరోహించిన ప్రపంచ తొలి మహిళా వికలాంగురాలుగా చరిత్ర సృష్టించింది.
రీటా ఫారియా పావెల్…
ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న ఆసియా తొలి మహిళ, తొలి భారతీయురాలు కూడా. బాహ్య సౌందర్యంతోపాటు అంతః సౌందర్యానికి కూడా ప్రాధాన్యమిచ్చే అందాల పోటీలో నిలిచి, గెలిచిన తొలి వైద్యురాలు ఈమె.
ఇందిరా గాంధీ…
భారత తొలి మహిళా ప్రధాని. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి ప్రవేశించి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు ఇందిరా గాంధీ. సుదీర్ఘ కాలంపాటు ప్రధానిగా(1966 నుంచి 1977
వరకూ) పనిచేసి, ‘ఉక్కుమహిళ’ గా పేరు గడించారు. 1971లో దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ను అందుకున్న తొలి మహిళగా రికార్డుకెక్కారు. 1999లో బీబీసీ నిర్వహించిన సర్వేలో ‘సహస్రాబ్ది మహిళ’గా నిలవడం విశేషం.
ప్రతిభా పాటిల్…
మన దేశ ప్రథమ పౌరుడు.. రాష్ట్రపతియే. ఆ పదవిని అలంకరించిన తొలి మహిళ.. ప్రతిభా పాటిల్. 2007 నుంచి 2012 వరకు ఐదేళ్లపాటు రాష్ట్రపతిగా కొనసాగారు. అంతకుముందు 2004 నుంచి 2007 వరకు రాజస్థాన్ గవర్నర్గా పనిచేశారు. సుఖోయ్– 30ఎమ్కేఐ యుద్ధవిమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా కూడా ఈమె విశేష గుర్తింపు పొందారు.
అంజలి గుప్తా…
చదివింది ఫిలాసఫి విద్య… ఏమాత్రం సంబంధంలేని త్రివిధ దళాల్లో అత్యంత ప్రమాదభరితమైన వాయుసేనలో చేరారిమే. భారత వాయుసేనలో ఫ్లైయింగ్ ఆఫీసర్గా చేరిన తొలి మహిళ. బెంగళూరులోని ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ అండ్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్లోనూ పనిచేశారు.
జస్టిస్ ఎమ్ ఫాతిమా బీబీ…
సుప్రీంకోర్టులో పనిచేసిన తొలి మహిళా న్యాయమూర్తి. మనదేశంలో అత్యున్నత స్థానంలో పనిచేసిన మొదటి ముస్లిం మహిళ కూడా ఈవిడే. తమిళనాడు గవర్నర్ గా కూడా పనిచేశారు.
సరళ థాక్రల్…
అతిపిన్న వయసు(21)లో, విమానాలు నడిపేందుకు లైసెన్స్ పొందిన తొలి మహిళ. లైసెన్స్ పొందిన తరువాత, వెయ్యి గంటలపాటు విమానాన్ని నడిపి ‘ఏ’ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా రికార్డు పొందింది. ఎయిర్ మెయిల్ పైలెట్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా కూడా రికార్డు సృష్టించారిమే.
హరితా కౌర్ డియోల్…
ఆకాశంలో ఒంటరిగా ప్రయాణించాలంటే ఎంతో ధైర్యం కావాలి.1994లో భారత వైమానిక దళంలో ఒంటరిగా విమానంలో ప్రయాణించిన
మొట్టమొదటి మహిళా పైలెట్గా ఈమె పేరు పొందారు.
ప్రియ ఝింగాన్…
పుట్టి పెరిగింది.. పోలీసు నేపథ్యం ఉన్న కుటుంబంలో… సైన్యంలో చేరి, దేశానికి సేవ చేయాలనుకుంది. 1993లో భారత సైన్యంలో చేరింది. సైన్యంలో చేరి మొట్టమొదటి మహిళా క్యాడెట్గా గుర్తింపు పొందింది ప్రియ.
రోషిణి శర్మ…
దేశంలో తొలి మహిళా బైక్ రైడర్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ బైక్ పై ప్రయాణించి రికార్డు సృష్టించింది.
దుర్గా బెనర్జీ…
ఇండియన్ ఎయిర్లైన్స్ మొదటి మహిళా పైలట్, కెప్టెన్. ‘టొర్నాడో అ–200’ విమానాలను నడిపిన మొట్టమొదటి మహిళ కూడా ఈమెనే.
వీళ్ళే కాదు చేస్తున్న పని మీద ప్రేమ, అంకితభావం కనబరుస్తూ… సమాజాన్ని, కుటుంబాన్ని గొప్ప స్థాయిలో నిలిపిన ఆడవాళ్ళందరూ అదర్శమూర్తులే!