
సాధారణంగా ఏవైనా వ్యాధి కారకాలు శరీరంలోకి వస్తే వెంటనే రియాక్షన్ కనిపిస్తుంది. సంబంధిత లక్షణాలు బయటపడతాయి. దాన్నిబట్టి డాక్టర్ సలహా తీసుకుంటాం. కానీ, కిడ్నీల విషయంలో అలా జరగదు. ఎందుకంటే కిడ్నీలు అనారోగ్యానికి గురైతే ప్రత్యేకించి ఒక లక్షణం కనిపిస్తుందని చెప్పలేం. లక్షణాలు కనపడకుండానే లోలోపల వ్యాధి ముదిరిపోతూ ఉంటుంది. లక్షణాలు బయటపడే సమయానికి అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చేస్తుంది. దాంతో కిడ్నీలను కాపాడడం కొన్నిసార్లు కష్టమైపోతుంది. అందుకే కిడ్నీలను హెల్దీగా ఉంచుకోవాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.
అయితే, కిడ్నీలు మన ఒంట్లోని వ్యర్థాలు, అదనపు నీటిని బయటకు పంపిస్తాయి. రక్తాన్ని శుద్ధిచేస్తాయి. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కావాల్సిన హార్మోన్ కిడ్నీ నుంచే వస్తుంది. విటమిన్ – డి చివరి రూపం కూడా కిడ్నీలోనే ఏర్పడుతుంది. తద్వారా ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. శరీరంలో నీటి లెవల్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే గుండె తర్వాత బ్లడ్ ప్రెజర్ని కంట్రోల్ చేయడంలో కిడ్నీలదే కీలక పాత్ర.
కిడ్నీ రాళ్లల్లో కాల్షియం ఆక్సలేట్, కాల్షియం ఫాస్పేట్ అని రెండు రకాలుగా ఉంటాయి. మూత్రంలో ద్రావణంతో పాటు పొటాషియం, సోడియం, యూరిక్ యాసిడ్, కాల్షియంతో పాటు రకరకాల పదార్థాలతో కలిగిన సాలిడ్ కంపోనెంట్ ఉంటుంది. ఈ సాలిడ్ కంపోనెంట్లు మూత్రంలో కరగకపోతే.. అవి చిన్న చిన్న గుళికలుగా మారతాయి. ఇవి మూత్రంలోని కొన్ని రసాయనాలు బయటకు వెళ్లకుండా లోపలే పేరుకుపోయేలా చేస్తాయి. దీనివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కాబట్టి, కిడ్నీలో రాళ్ల సమస్యను ముందుగానే గుర్తించగలిగితే సరైన చికిత్స తీసుకుని నివారించుకోవచ్చు.
కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కొంత మంది వ్యక్తులలో అధికంగా ఉంటుంది. అది ఎవరంటే, అధిక బరువు ఉన్నవారు, డయాబెటిస్ పేషెంట్స్, వ్యాయామం చేయనివారు, నీళ్లు తక్కువగా తాగిన వారికి, మాంసాహారం అధికంగా తిన్నవారికి, స్టిరాయిడ్లను ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. టైమ్కు భోజనం చేయకపోయినా, శరీరంలో విటమిన్ బి6, సి లోపం ఉన్నా, విటమిన్ డి అధికంగా ఉన్నా, నిద్రలేమి, కణితులు ఉన్నప్పుడు, కిడ్నీలకు తరచుగా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు కూడా రాళ్లు ఏర్పడవచ్చు. భరించలేని నొప్పి, యూరినేషన్ సమయంలో నొప్పి, యూరిన్లో రక్తం, యూరిన్లో వాసన రావడం లాంటివి కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు కలిగే లక్షణాలు. ఒకవేళ మీలో ఈ లక్షణాలు ఉంటే.. వెంటనే వైద్యులను కలిసి కావాల్సిన చికిత్స పొందండి.
అయితే.. కిడ్నీ సమస్యలు రాకుండా ఉండడానికి మూడు పద్దతులు అయితే తప్పనిసరిగా పాటించాలి. అవి..
*ఎక్కువ నీరు త్రగాడం.
* ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
* సాల్ట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ను తినకూడదు.
ఇక ఒకవేళ కిడ్నీలో పెద్ద రాళ్లు ఉన్నట్లయితే శస్త్రచికిత్స పద్ధతుల ద్వారా చికిత్స పొందవచ్చు. కిడ్నీ స్టోన్ నొప్పిని శాశ్వతంగా వదిలించుకోవడానికి 3 శస్త్రచికిత్స అందుబాటులో ఉన్నాయి. అవి..
* షాక్వేవ్ లిథోట్రిప్సీ
* యురెటెరోస్కోపీ
* పెర్క్యుటేనియస్ నెఫ్రోలిథోటోమీ