
ప్రస్తుతం ఎండలు విపరీతంగా మండిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఉదయం 10గంటలైతే కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. తెలుగు రాష్ట్రాల్లో 40 నుంచి 45డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితితుల్లో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వడదెబ్బకు గురైనప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే ఒక్కోసారి ప్రాణాపాయం ఉంటుంది. మరి వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి? వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం.
వడదెబ్బ లక్షణాలు
* వడదెబ్బ తగిలిన వ్యక్తికి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.
* వాంతులు, నీరసంతో పాటు శరీరం పొడిబారుతుంది.
* కండరాల్లో తిమ్మిరి, శరీరంలో కొద్దిగా వాపు వస్తుంది.
* అధికంగా చెమటలు పడతాయి
వడదెబ్బకు ప్రథమ చికిత్స
వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లటి ప్రదేశానికి చేర్చాలి. శరీరం మీద దుస్తులు వదులు చేసి, చల్లటి నీటిలో ముంచిన తడిబట్టతో శరీరం తుడవాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు ఇలా చేస్తూ.. బాధితుడికి చల్లని గాలి తగిలేలా చూడాలి
వడదెబ్బ తగిలిన వ్యక్తికి కొబ్బరినీరు, చెరుకు రసం, పెరుగు, మజ్జిగ, పళ్లరసాలు, గ్లూకోజ్, ఓఆర్ఎస్ వంటివి తాగించాలి.
వడదెబ్బ.. ముందస్తు జాగ్రత్తలు
– ఎక్కువగా ద్రవ పదర్థాలు అంటే మంచి నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, తాజా జ్యూస్లు అధికంగా తీసుకోవాలి.
– ఉదయం 11నుంచి సాయంత్రం 4గంటల మధ్య ఎండలో తిరగడం మానుకోవాలి.
– బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ వంటివి తీసుకెళ్లాలి.
– వేసవిలో లేత రంగు, తేలికైన, కాటన్ దుస్తులు ధరించడం మంచిది.
– నల్ల రంగు దుస్తులు వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. కాబట్టి, వీటిని ధరించకండి.
– ఆల్కహాల్ శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తుంది. కనుక వేసవిలో మద్యపానానికి దూరంగా ఉండండి.
– వేసవిలో తరచుగా ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన నిమ్మరసం వంటివి తీసుకోవాలి. ఇవి శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేస్తాయి.
– నీటి శాతం ఎక్కువగా ఉండే దోసకాయలు, పుచ్చకాయలు, దానిమ్మ, బత్తాయి వంటి పండ్లు తినాలి.
– వ్యాయామం చేసే వారు ఉదయం 8గంటలలోపే పూర్తి చేయడం ఉత్తమం.