Telugu Special Stories

వేదవ్యాసుడు జన్మించిన విశిష్టమైన రోజు.. గురు పూర్ణిమ!

అజ్ఞానం నుంచి జ్ఞానంవైపు వేదవ్యాసుడు నడిపించి… 

జీవితానికి ఓ అర్థం, పరమార్థం కల్పించే గురువులను పూజించే అత్యంత విశిష్టమైన రోజు.. ఆషాఢ పూర్ణిమ… దీన్నే గురుపూర్ణిమగానూ పిలుస్తాం. ఈ తిథిరోజునే ఆదిగురువైన వ్యాస మహర్షి జన్మించాడని ప్రతీతి. అందుచేత ‘వ్యాస పూర్ణిమ’ పర్వదినంగానూ జరుపుకుంటాం. ఈ రోజున గురువులను భక్తిశ్రద్ధలతో పూజిస్తే త్రిమూర్తులను సేవించినట్లేనని పురాణాలు చెబుతున్నాయి. వేదమంత్రాలను చతుర్వేదాలుగా..

పంచమవేదంగా స్తుతించే మహాభారతాన్ని సృజించి.. సృష్టిలో ఆది నుంచి అంతంవరకు జరిగే వివిధ పరిణామాలు, కాలస్వరూపాన్ని విశదపరిచే అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలూ రచించిన

వేదవ్యాసుడు నారాయణసంభూతుడుకాక మరేంటి.. ఇంతటి విశిష్టతలను కలిగిన గురు పూర్ణిమ/ వ్యాస పూర్ణిమ విశేషాలను ఈరోజున మనం తప్పక తెలుసుకుందాం…

త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను గురువుకు ప్రతీకగా భావిస్తాం. 

‘గు’ అంటే అజ్ఞానం/చీకటి. ‘రువు’ అంటే నశింపజేసేదని అర్థం. గురువు.. అజ్ఞానం అనే అంధకారాన్ని నశింపజేసి వెలుగువైపు నడిపిస్తాడని అర్థం. అందుకే సనాతన భారతీయ సంస్కృతి సైతం..

“మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ..” అంటూ గురువుకు తల్లిదండ్రుల తరువాత అంతటి విశిష్ట స్థానాన్ని కల్పించింది. 

ప్రతి వ్యక్తికీ ఆదిగురువు తల్లి అయితే… ఆ తరువాత మంచిచెడుల విచక్షణను తెలియజేసేది గురువు ఒక్కరే. పుట్టినప్పటి నుంచీ మరణించేవరకూ ప్రతి దశలోనూ ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు మనిషి. అలా నేర్చుకునే ప్రతి అంశం వెనుకా ఓ గురువు పాత్ర తప్పక ఉంటుంది. అందుకే మన భారతీయ సంప్రదాయంలో గురువుకీ, గురుపూజకీ అంతటి ప్రాధాన్యం ఉంటుంది. 

ముక్తివైపు నడిపించే గురువులను ఆషాఢ పౌర్ణమినాడే పూజించీ, గౌరవించడానికీ, ఈ రోజును వ్యాస పూర్ణిమగా జరుపుకోవడానికీ వెనుక పురాణ గ్రంథాలు మనకు ఎంతో చెబుతున్నాయి.

వ్యాసుడి పుట్టుక

ఆదిగురువుగా పిలిచే వ్యాస మహర్షి, వేదవ్యాసుడు మత్స్యగంధి గర్భమందు పరాశర మహర్షిలకు జన్మించాడు. మత్స్యగంధి.. దాశరాజు పెంపుడు కుమార్తె. చేపలకంపు వల్ల ఆమెకు మత్స్య గంధి అనే పేరు వచ్చింది. ఆమే అసలు పేరు సత్యవతి. పరాశర మహర్షి ఆమెను మోహించి దుర్గంధమును పోగొట్టి.. ఆపై వ్యాస మహర్షి జన్మకు కారకుడవుతాడు. వేదవ్యాసుని అసలు పేరు.. కృష్ణ ద్వైపాయనుడు.

వ్యాసుడు పుట్టిన వెంటనే.. పన్నెండేళ్ళ ప్రాయమునకు ఎదుగుతాడు.. ఆపై తల్లికి నమస్కరించి, తనను స్మరించినపుడు తిరిగి వచ్చి తల్లిని దర్శించుకుంటానని మాట ఇచ్చి వెళ్ళిపోతాడు. సత్యవతి తర్వాత కురువంశ మూల పురషుడైన శంతనుని వివాహం చేసుకుంటుంది.

వ్యాస మహర్షి నాలుగు వేదాలను తన శిష్యుల ద్వారా ప్రపంచానికందించాడు. పైలునికి రుగ్వేదాన్ని, వైశంపాయునికి యజుర్వేదాన్ని, జైమునికి సామవేదాన్ని, సుమంతునికి అధర్వణవేదాన్ని భోదిస్తాడు. పంచమ వేదంగా భావించే మహాభారతాన్ని వ్యాసుడే రచించగా,  వినాయకుడు స్వయంగా లిఖించటం విశేషం.

వ్యాసుడు వసిష్ఠుడికి మునిమనమడు. శక్తి మహర్షికి పౌత్రుడు. పరాశరుడి పుత్రుడు. తపోనిధి అయిన పరాశరుడు యమున దాటడానికి పడవ ఎక్కడమేమిటి? దాటించేందుకు తండ్రి స్థానంలో దాశ పుత్రి తాను పడవ నడపడమేమిటి? మహర్షి అకస్మాత్తుగా మత్స్య గంధిని మోహించడమేమిటి? తన తపశ్శక్తి ద్వారా ఆమె అభ్యంతరాలన్నిటినీ తొలగించటమేమిటీ? ఆ యమునా నదీ ద్వీపంలో ఆమెకు అయాచితంగా పుత్రుడిని ప్రసాదిం చటమేమిటి? అప్పటికప్పుడే సకల శాస్త్రవేత్త అయిన పుత్రుడు పుట్టుకురావడమేమిటి? పుడుతూనే తల్లిని విడిచి తపోవనాలకు వెళ్లిపోవట మేమిటి? ఇదంతా లోక కల్యాణం కోసం లోకాతీతుడిని అవతరింపజేసేందుకు జరిగిన మాయలా అనిపిస్తుంది.

ఆ కారణజన్ముడి జన్మకు ప్రయోజనం మానవాళికి చతుర్విధ పురుషార్థ సాధన రహస్యాలను బహువిధాలుగా బోధించటమే. 

అందుకే ఆయన జగద్గురువులకే గురువుగా నిలిచిపోయారు. అగమ్యంగా ఉన్న వేదరాశి చిక్కులు విప్పి, చక్కబరచి, అధ్యయనానికి అనువుగా చతుర్వేదాలుగా విభజించి, వైదిక ధర్మప్రవర్తనం చేసిన ఆదిగురువులు.. వేదవ్యాసుడు. పంచమవేదమైన భారతేతిహాసం ద్వారా ‘ధర్మాన్ని ఆచరించండి. అన్నీ లభిస్తాయి’ అని పదేపదే ఎలుగెత్తి చాటిన సకల లోకహితైషి సాత్యవతేయుడు. అర్థ, కామ, సాధనల విషయాలను విస్తరించి, అనేక నీతి కథల సమాహారంగా అష్టాదశ పురాణాలను అందరికీ అందుబాటులోకి తెచ్చారు వ్యాసుడు.

బాదరాయణ బ్రహ్మ సూత్రాల ద్వారా వేదాంత సారాన్ని సూత్రీకరించి, మనుషులందరికీ మహత్తర లక్ష్యమైన మోక్ష పురుషార్థాన్ని వివరించారాయన. 

తొలి వందనం.. గురువుకే

గురువును భగవంతుడికీ, భక్తుడికీ మధ్య సంధాన కర్తగా పేర్కొంటారు. ఒకేసారి భగవంతుడు, గురువు ప్రత్యక్షమైనప్పటికీ, తొలి వందనం అర్పించేది గురువుకే.. మొదట ఆయనకే ప్రణమిల్లాలని చెబుతున్నాయి శాస్త్రాలు. 

ఒక్క గురువునే కాదు… గురు పరంపర అంటే… తన గురువూ, గురువుగారి గురువూ… వారి గురువునూ సైతం భక్తిశ్రద్ధలతో ఆరాధించేరోజు నేడు.

అందుకే ఈరోజున విద్య, విజ్ఞానంతోపాటు జీవితంలో ఒక్కో మెట్టూ ఎదిగేందుకు అడుగడుగునా వెంట ఉండి ఎన్నో అంశాలను నేర్పించిన గురువులనూ, పెద్దలనూ గురుపూజోత్సవం పేరుతో గౌరవించి, శక్తికొద్దీ సత్కరించి, ఆశీస్సులు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. 

అలాగే భక్తులు కూడా తమ గురువులైన శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి, రాఘవేంద్రస్వామి, ఆదిశంకరాచార్య, సాయిబాబా, దత్తాత్రేయుడు, పరమేశ్వరుడు, గౌతమబుద్ధుడు, వేదవ్యాసులను పూజించే విశేషమైన రోజు కూడా ఇదే. 

ఆదియోగి, ఆదిగురువు అయిన పరమేశ్వరుడు ఈరోజునే(ఆషాఢ పౌర్ణమినాడే) సప్త రుషులకు జ్ఞానాన్ని బోధించాడని శివ పురాణంలో ఉంది.

దత్తాత్రేయుడు తన శిష్యులకు ఈరోజునే జ్ఞానబోధను చేశాడని దత్త చరిత్ర చెబుతోంది. 

జగద్గురువైన శ్రీకృష్ణుడు.. స్వయంగా సాందీపుని దగ్గర శిష్యునిగా విద్యాభ్యాసం చేయడం, 

కురుకుమారులు ద్రోణాచార్యుడి శిష్యరికంలో సాటిలేని యోధులుగా తయారవ్వడం, కేవలం గురుభక్తితో ఏకలవ్యుడు సాటిలేని మేటి విలుకాడుగా ప్రసిద్ధిపొందడం… గురువు దైవంతో సమానమని, ఆయన్ని దర్శించుకున్నంతలో పాపాలు తొలగుతాయని చెబుతారు.

*బుద్ధ గయలో జ్ఞానోదయం పొందిన అనంతరం గౌతమ బుద్ధుడు ఈ ఆషాఢ పూర్ణిమ రోజే సారనాథ్‌లో తన శిష్యులకు మొదటి బోధనను చేశాడని ప్రతీతి. అందుకే గురుపూర్ణిమ బౌద్ధులకూ విశేష దినం. ఈ రోజున గురువును పూజించడంతోపాటూ కొందరు ఉపవాసం ఉండేందుకూ ప్రాధాన్యమిస్తారు. అలాగే దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదిశక్తి పేరిట వ్రతాన్ని ఆచరించడం, సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేసుకోవడం వంటి సంప్రదాయాలూ ఉన్నాయి.

గురుర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః
గురుసాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః

వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం|
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్|| వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే|
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః||

మన మనసుల్లో పేరుకున్న అజ్ఞానాన్ని తొలగించేందుకు నారాయణుడు ధరించిన మరో అవతారమే వ్యాసుడి రూపం. 

ఈరోజు ఈ శ్లోకాన్ని పఠిస్తే గురువులందరి ఆశీస్సులూ లభిస్తాయని పెద్దలు చెబుతారు.

Show More
Back to top button