Telugu Special Stories

సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసిన గొప్ప ఆధ్యాత్మికవేత్త.. స్వామి వివేకానంద! 

విశిష్టమైన ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు స్వామి వివేకానంద దాటించిన గొప్ప వ్యక్తి.. చికాగోలో విశ్వమత సభలలో పాల్గొని, అద్భుత ప్రసంగంతో పాశ్చాత్యుల హృద‌యాలను, అభిమానులను సొంతం చేసుకున్న భారతీయ తత్వవేత్త, గొప్ప వక్త. అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకులు, సంఘసంస్కర్త… స్వామి వివేకానందుడు.

‘‘లేవండి.. మేల్కోండి, గమ్యం చేరే వరకూ విశ్రమించకండి… బలమే జీవితం, బలహీనతే మరణం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలి” అంటూ యువతను ప్రభావితం చేసిన  మహనీయుడు, యోగి.. వివేకానందుని వర్ధంతి ఈ నెల(జూన్ 4న)  కావడంతో, ఈ సందర్బంగా అయన జీవిత, ఆధ్యాత్మిక జీవన విశేషాలను మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:

జననం

1863, జనవరి 12న కలకత్తాలోని ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించారు స్వామి వివేకానంద. తల్లిదండ్రులు విశ్వనాథ్ దత్త, భువనేశ్వరీ దేవిలు. తండ్రి న్యాయవాది. కుటుంబసభ్యులంతా వివేకానందను పిలుచుకునే పేర్లు.. నరేంద్రనాధ్ దత్తా, నరేన్. తన ఎనిమిదవ ఏటా.. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెట్రో పాలిటన్ పాఠశాలలో చేరాడు. చిన్న వయసులోనే ఎన్నో పాశ్చ్యాత, తత్వశాస్త్ర గ్రంథాలు, నవలలు, జీవిత చరిత్రలు, అన్ని మతాల గ్రంథాల్ని ఔపోసన పట్టాడు. వీరి కుటుంబం చదువులోనూ, ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబం. ఈయన తాతగారు దుర్గాచరణ్ దత్త సైతం సంస్కృతం, పర్షియన్ భాషల్లో అపార పాండిత్యాన్ని గడించారు. న్యాయవాది కూడా. విశ్వనాథ్ అనగా నరేంద్రుని తండ్రి జన్మించాక.. దుర్గాచరణ్ 25ఏళ్ల వయసులో సన్యసించారు. ఇక తండ్రి విశ్వనాథ్ గారు.. అప్పటి కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా ఉన్నారు. ఆంగ్ల, పర్షియన్ భాషల్లో ఈయనకు ఎంతో ప్రావీణ్యం ఉంది. బైబిల్ గ్రంథాన్ని, సంస్కృతంలో హిందూ శాస్త్రాలను చదివారు. హేతువాది, అభ్యుదయభావాల్ని కలిగి ఉండేవారు. ఇకపోతే అమ్మ భువనేశ్వరీదేవి పనులన్నింటినీ చక్కబెట్టడంలో దిట్ట. ఈమెకు కలిగిన సంతానం..

పుట్టిన వాళ్లంతా కుమార్తెలు కావడంతో, ఈసారి కొడుకు పుట్టాలనే ఆశతో వారణాసిలోని వీరేశ్వర శివునికి ప్రత్యేక పూజలు జరిపించవలసిందిగా తన బంధువులలో ఒకర్ని వేడుకుందట. ఆ ప్రకారమే, ఆమెకు కలలో శివుడు కనిపించి, నీకు పుత్రుడిగా జన్మిస్తానని మాట ఇచ్చినట్లు ఓ గాథ ఉంది. కొంత కాలానికి కొడుకు పుట్టాడు. అతడే నరేంద్ర. చిన్నతనంలో నరేంద్ర.. ఎంతో అల్లరి పిల్లవాడు. అయినప్పటికీ ఆధ్యాత్మిక అంశాలపట్ల ఎంతో ఆసక్తి కనబర్చేవాడట. దేవుళ్ల ప్రతిమలను పూజిస్తూ, ఆడుకునేవాడట. తన తల్లి చెప్పిన రామాయణ, మహాభారతాలలోని కథలు అతని మనసుపై బలమైన ముద్ర వేశాయి. పెద్దవుతూనే ధైర్యం, నిక్కచ్చితనం, జాలి, దయ, ఎదైనా తెలుసుకోవాలనే తృష్ణ వంటి భావజాలాన్ని పెంపొందించుకున్నాడు. ఎవరు ఏది చెప్పినా.. రుజువు చేయమని అనే మనస్తత్వం ఆయనది. మదికి, చెప్పేవాటికి పొంతన ఉండాలంటారు.

రామకృష్ణ పరమహంసల వద్ద శిష్యరికం

ఈ క్రమంలోనే.. భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటె ఎలాగైనా ఆయన్ని ఖచ్చితంగా చూడాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. ఎవరైనా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు కనిపిస్తే మీరు భగవంతుడిని చూశారా అని అడిగేవాడట. దీంతో చూశామని అన్న వారు ఎవరూ ఆయనకు తారసపడలేదు. అయితే ఒకరోజు, స్కాటిష్ చర్చి కాలేజీ ప్రిన్సిపాల్ అయిన విలియం హేస్టీ.. పాఠం చెప్తూ “పారవశ్యం” అనే అంశం గురుంచి వివరించాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. అప్పుడు ఆయన ఈ పదానికి అర్ధం తెలియాలంటే దక్షిణేశ్వర్ లో ఉండే శ్రీరామకృష్ణ పరమహంసను కలవమని చెప్పారు. అలా ఆ పదానికి అర్ధం తెలుసుకోవడానికి నరేంద్రుడు దక్షిణేశ్వర్ కి సైతం వెళ్ళాడు.

అక్కడ రామకృష్ణ పరమహంసను కూడా అందర్ని అడిగినట్లే, ఈయన్ను.. మీరు దేవుణ్ణి కళ్లారా చూసారా? అని అడుగుతాడు. అప్పుడు పరమహంస ఇలా బదులిచ్చాడు.. అవును చూశాను, నిన్ను ఎలా చూస్తున్నానో, నీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే భగవంతుని కూడా చూశానని, మాట్లాడానని ఆయన అన్నారు. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి దేవుడ్ని చూశానని చెప్పేసరికి నరేంద్రుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు నరేంద్రుడు నాకు దేవుడ్ని చూపించండి అంటాడు. అప్పుడు రామకృష్ణులు… ఆయన కాలును మెల్లిగా నరేంద్రుడి ఒడిలో ఉంచారు. మరుక్షణం నరేంద్రుడికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇలా రామకృష్ణుల సన్నిధిలో ఎన్నో అద్భుతాలను నరేంద్రుడు చవిచూశారు. దీంతో నరేంద్రుడు రామకృష్ణ పరమహంసకు శిష్యునిగా మారిపోయారు.

ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవడంతోపాటు, సన్యాస మార్గంలోకి నడిచాడు. 1884లో బి.ఏ పాస్ అయిన  సమయంలో తండ్రి మరణిచారనే వార్త తెలుసుకొని వస్తాడు. తండ్రి మరణంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయింది. ఆస్తులన్నీ కోల్పోవడంతో  తినడానికి తిండి కూడా ఉండేదికాదట. కుళాయి నీళ్లు తాగి కడుపు నింపుకునేవారట. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు సాగించారు. చివరికి ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం దొరికింది. కొంతకాలానికి రామకృష్ణ పరమహంసకు గొంతు క్యాన్సర్ సోకి, ఆరోగ్యం క్షీణించిందని తెలిసి, ఉద్యోగం మానేసి గురువు వద్దకు వెళ్ళిపోయాడు. మరింత క్షీణించడంతో 1886లో రామకృష్ణ పరమహంస మరణించారు.

రామకృష్ణులవారు చనిపోయిన తరువాత ఆయన శిష్యులందరూ కలిసి ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకుని అందులో ఉన్నారు. వారందరికీ నాయకుడిగా నరేంద్రుడు ఉన్నారు.కొన్నాళ్ళకు వివేకానంద దేశమంతటా పర్యటించాలనుకున్నారు. భారతీయుల  స్థితిగతులను ప్రత్యక్షంగా చూసిన ఆయన ఇక్కడ మనమంతా పేదరికం, బానిసత్వంలో మగ్గిపోవడానికి మూఢనమ్మకాలే మూలకారణమని గుర్తించారు. భారతదేశంలోని వివిధ మతాలను, వాటి తత్వాలలను అవగతం చేసుకున్నారు. దేశమంతా పర్యటిస్తూ చివరికి కన్యాకుమారి చేరుకున్నారు.

పాశాత్య దేశాలకు వెళ్లి భారతదేశపు గొప్పతనాన్ని చాటి చెప్పాలని, తిరిగి భారత్ కు వచ్చినప్పుడు… నిరాశ నిస్పృహలతో నిండిపోయిన భారతీయులను మేల్కొలపాలని దృఢంగా నిర్ణయించుకున్నారు. ఇలా చికాగోలో జరగబోయే సర్వమత మహా సభలకు హజరవ్వాలని అనుకున్నంతలో.. విదేశాలకు వెళ్ళడానికి కావలసిన డబ్బు ఆయన దగ్గర లేదు. ఈ విషయం తెలిసి కొంతమంది మహారాజులు, దేశ నలుమూల నుంచి ఎంతోమంది విరాళాలను పంపారు. అలా 1893లో బొంబాయి తీరం నుంచి నౌకలో బయలుదేరగా.. జులై నెలలో చికాగో చేరుకున్నారు. అయితే అక్కడకి వెళ్ళాకనే తెలిసింది సర్వ మత మహా సభలు మరో 3 నెలలకు వాయిదా పడ్డాయి.

విదేశాల్లో.. భారతీయ ఖ్యాతి.. పైపైకి

స్వామిజికి చికాగోలో ఎవరూ తెలియదు. అలా వీధులలో తిరుగుతూ కాలం గడిపేవారు. ఆయన వేషధారణను అంతా వింతగా చూసేవారు. కొంతమంది అపహాస్యం చేసేవారు. ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితుల్లో ఆయనకు కేథరిన్ అనే ఒక మహిళ పరిచయమైంది. ఆమె స్వామిజితో మాట్లాడిన కొంతసేపటికే ఆయన గొప్పతనం తెలుసుకుని బోస్టన్ నగరంలోని తన ఇంట్లో కొన్నిరోజులు ఉండమని కోరింది. ఇందుకు స్వామిజి ఒప్పుకున్నారు. అలా ఆయన ఖాళీ సమయానంతా దగ్గర్లోని లైబ్రరీలో పుస్తకాలు చదివేందుకు కేటాయించారు. రోజు ఒక పుస్తకం తెచ్చుకోవడం, తరువాతి రోజు అది ఇచ్చేసి, మరోటి తెచ్చుకోవడం జరిగేది. ఒకరోజు ఆ లైబ్రేరియన్ విసుగు చెంది చదవనిదానికి ఎందుకు తీసుకువెళ్లడం అంటూ కోప్పడ్డారు. అప్పుడు స్వామిజి చదవడం లేదని ఎవరన్నారు?, ఇప్పటివరకు నేను తీసుకెళ్లిన పుస్తకాల్లో ఏదైనా అడగండి అని నిక్కచ్చిగా అనడంతో, ఆమె అలానే ప్రశ్నలు వేశారు. పుస్తకంలో ఉన్నది ఉన్నట్లు చెప్పడంతో, అయన జ్ఞాపకశక్తికి ఆశ్చర్యపోయిందా లైబ్రేరియన్. కొన్ని రోజుల తర్వాత  జె. హెచ్. రైట్ అనే ప్రొఫసర్ పరిచయమయ్యారు. భారత్ నుంచి ఇక్కడికి రావడానికి గల కారణాన్ని ఆయనకు చెప్పారు.

అదే విషయమై విశ్వమత మహా సభల్లో మాట్లాడేందుకు తనకి అనుమతి ఇప్పించాల్సిందిగా అడుగుతాడు స్వామిజి. ఆ ప్రొఫెసర్ ఆ విశ్వమత సభలను నిర్వహించేవారిని ఉద్దేశించి ఒక ఉత్తరం రాశారు.ఆహ్వానం అందింది. ఆ తర్వాత 1893 సెప్టెంబర్ 11న సభలు ప్రారంభమయ్యాయి. ఇతర మతాలకు చెందిన గొప్ప గొప్ప వాళ్ళందరూ.. హుందాగా సూటు బూటుతో వస్తే, మన వివేకానంద స్వామి వారు.. ధరించిన దుస్తులు, వేషధారణ చూసి.. ఎవరూ కూడా గౌరవించలేదు సరికదా చులకనగా చూశారు. సభలో ఒక్కొక్కరుగా వాళ్ళ మతాల గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు. చివరగా స్వామి వివేకానంద వంతు రానే వచ్చింది.

స్వామిజి నిల్చుని గంభీరమైన గొంతుతో ‘సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా’ అని అన్నారట. ఆ ఒక్క పిలుపుకి సభలో ఉన్న 4000మందికి పైగా జనం లేచి, రెండు నిమిషాలపాటు ఆపకుండా చప్పట్లు కొట్టారట. ఎందుకంటే అప్పటివరకు అందరూ “లేడీస్ అండ్ జెంటిల్ మెన్” అంటూనే స్పీచ్ మొదలుపెట్టారు కానీ వివేకానంద స్వామి సోదర సోదరీమణులారా అని పలకరించేసరికి ఆ పిలుపులో ఆత్మీయత వారిలో ఒకరకమైన భావోద్వేగానికి గురయ్యేలా చేసి, ఆయన్ను గౌరవించేలా చేశాయి. ఇక భారతదేశంలోని ఆధ్యాత్మికత, సనాతన ధర్మం, సంసృతి, సంప్రదాయాల గురించి ఏకధాటిగా ప్రసంగిస్తూనే ఉన్నారు.

సభలో ఉన్న మేధావులు, గొప్ప ప్రముఖులంతా స్థాయిని మరిచి ఆయన కరచాలనం కోసం పోటీపడ్డారంటే అతిశయోక్తి కాదు.

తరువాతి రోజు అక్కడి ప్రధాన పత్రికల్లో ఎటు చూసిన వివేకానందులవారి ఫోటోలు, ప్రసంగాలు హైలెట్ గా నిలిచాయి.

ఇలా కేవలం చికాగోలోనే కాదు ప్రపంచమంతా ఈ భారతీయ సన్యాసి గురుంచి చర్చించుకుంది. ఎంతోమంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు.

కొంతమంది ఆయనకి శిష్యులుగా మారిపోయారు కూడా.అప్పటివరకు భారతదేశం అంటే, మూఢ నమ్మకాలతో చెట్లకు పుట్లకు పూజలు చేసే ఒక అనాగరికమైన దేశం అనే భావన ఉన్న వారందరికీ, కళ్ళు తెరిపించి, భారత్ మీద గౌరవం పెరిగేలా చేశారు.

భారతదేశపు స్థాయిని, ఖ్యాతిని అమాంతం పెంచారు. ఈ విశ్వమత సభలు కొన్నిరోజులపాటు జరిగాయి. జరిగినన్ని రోజులు..

ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద ప్రసంగాన్ని చివర్లో ఉంచేవారు. ఎందుకంటే సభలో జనమంతా కూడా చివర్లో ఉండే వివేకానంద స్పీచ్ కోసమీ వేచి ఉండేవారు మరి.

ఇదిలా ఉండగా వివేకానందుడిలో ఉన్న విశేష ప్రజ్ఞను గ్రహించిన హార్వర్డ్‌ యూనివర్సిటీ తమ విశ్వవిద్యాలయంలో ఆసియా మత అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తామని, దానికి స్వామీజీని డైరెక్టర్‌గా ఉండాలని కోరారు.

ఇదేకాక మరెన్నో గొప్ప గొప్ప అవకాశాలు ఆయన్ను వెత్తుకుంటూ వచ్చాయి. కానీ వాటన్నింటినీ ఆయన సున్నితంగా తిరస్కరించారు.

అలా నాలుగు సంవత్సరాలపాటు విదేశాలలో పర్యటించి.. తిరిగి భారతదేశానికి ప్రయాణమయ్యారు. 

భారత్ కు తిరుగు ప్రయాణం

ఎంతోమంది విదేశీయులు స్వామిజితో పాటే ఇండియాకి వస్తామని హైందవ మతంలో చేరుతామని అన్నారు.

కానీ స్వామిజి తాను వచ్చింది మత మార్పిడి కోసం కాదని, ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడిగానూ, ఒక మహ్మదీయుడు మంచి మహ్మదీయుడిగా ఉంటే చాలు అని చెప్తారు.

భగవంతుడిని చేరుకోవడానికి ఈ మతాలనేవి రకరకాల దారులని..

మనం ఏ దారిలో వెళ్లిన అంతా ఒకేచోట ఆ భగవంతుడిని కలుసుకుంటామని ఆయన వివరించారు. అప్పటికే భారతదేశంలో స్వామిజి ఘనత దశదిశలా వ్యాపించింది.

1897లో కొలంబోకి చేరుకోగానే ఒక మహారాజుకి లభించినంత గౌరవమర్యాదలు లభించాయి.

తాము ఎప్పటికి బానిసలమే అనే నిరాశతో నిండిపోయిన కోట్లమంది భారతీయుల హృదయాలు.. స్వామి వివేకానందని చూసి ఆత్మవిశ్వాసంతో నిండిపోయాయి.

ఇండియాకి వచ్చిన తరువాత నిరుపేదలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో.. రామకృష్ణ మఠాన్ని స్థాపించారు.

దాని ప్రధాన లక్ష్యం దేశంలోని పేద, అనారోగ్య ప్రజలకు సేవలు అందించడం. ఇప్పుడు ఈ సంస్థ కేవలం భారత్ కే పరిమితం కాలేదు.

ప్రపంచవ్యాప్తంగా అంతటా విస్తరించింది. ఎన్నో పాఠశాలు, ఆసుపత్రులు వెలిశాయి.

ఆ తరువాత కూడా చాలా కాలం పాటు దేశమంతా పర్యటిస్తూ ప్రసంగాలు చేస్తూ, రామకృష్ణ మఠాన్ని అభివృద్ధి చేస్తూ జీవితాన్నంతా ప్రజల కోసమే కేటాయించారు.

అయితే ఆయన విశ్రాంతి లేకుండా కష్టపడం వలన ఆయన ఆరోగ్యం దెబ్బతింది. ఒకరోజు స్వామిజి ఆయన శిష్యులలో ఒకరిని పంచాంగం తీసుకురమ్మన్నారు.

దానిలో జులై 4వ తేదీ, శుక్రవారం మంచిరోజుగా గుర్తించి మార్క్ చేశారు.

కానీ అది దేనికి సంకేతమో ఆ శిష్యులకు అర్ధం కాలేదు. కానీ ఆ రోజు రానే వచ్చింది..

1902, జులై 4న రాత్రి 9 గంటల సమయంలో కొంత సేపు ధ్యానం చేసుకున్నారు. తరువాత మంచం మీద పడుకుని ఆయన తన శ్వాసని విడిచారు.

అలా తాను ఏ రోజు మరణించాలో.. ముందే ముహూర్తం పెట్టుకున్న గొప్ప యోగి ఆయన.

యువతకు మార్గదర్శకులు.. 

భారతదేశ భవిష్యత్తుని మార్చగలిగేది యువతేనని.. వారికోసం ఆయన ఎంతో తపించారు.

“డబ్బులేని వాడు కాదు, జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడు అసలైన పేదవాడు అంటారు” వివేకానంద. ఇనుప కండరాలు, ఉక్కునరాలు..

కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశం స్వరూపాన్నే మార్చేస్తాను” అని వివేకానందులు తరచూ అంటుండేవారు.

యువత మనసులో నిండైన స్ఫూర్తి నింపినవారిలో వివేకానంద అంతటి వారు మరొకరు లేరు.

అందుకే మనదేశంలో ఆయన పుట్టినరోజు(జనవరి 12)ను పురస్కరించుకొని “నేషనల్ యూత్ డే”గా జరుపుకుంటున్నాం.

ఆయన తన ప్రసంగాలతో, సూక్తులతో పుస్తకాలతో, యువతరాన్ని ఉత్తేజపరిచి, సరైన మార్గర్దర్శనం చేశారు.

జీవితం నిరాశనిస్పృహలతో నిండిపోయినప్పుడు లేదా భయభ్రాంతులకు గురైనపుడు లేదా మనసు చెడు మార్గాలవైపు మళ్ళినప్పుడు..

ఎదైనా దిక్కు తోచని పరిస్థితులలో ఉన్నపుడు ఒక్కసారి స్వామి వివేకానందకి సంబంధించిన పుస్తకాలు, సూక్తులను  చదవండి చాలు.

ఆయన సందేశాలు సూటిగా మన మనసుని తాకుతాయి. తెలియని ఒక ధైర్యం, ఆలోచనలో మార్పు కలుగుతుంది. జీవితానికి అసలైన అర్ధం తెలుస్తుంది.

ఆయన ఉపన్యాసాలు, రచనలు, లేఖలు, కవితలు స్వామి వివేకానంద పూర్తి రచనలుగా ప్రచురించారు. అద్వితీయమైన ఆ రచనలు ఎల్లప్పుడూ మనకు జ్ఞానోదయాన్ని అందిస్తాయి.

‘బలమే జీవనం, బలహీనతే మరణం’ అన్న ఆయన ప్రవచనం జగద్విఖ్యాతం. ప్రపంచానికే తేజస్సు పంచిన మహామూర్తి వివేకానందుడు.

ఈయన యువతకే కాదు, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, తిలక్, బిపిన్ చంద్ర పాల్ వంటి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులకు కూడా ఆదర్శప్రాయులయ్యారు. 

Show More
Back to top button