
గుండెపోటు ఈ రోజుల్లో దేశంలో ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. ఇది కేవలం వృద్ధులకే కాకుండా, చిన్న వయసు వారికి కూడా వస్తోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అకాల మరణాల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతోంది. ఇటీవల, కర్ణాటకలోని హాసన్ జిల్లాలో కేవలం 40 రోజుల్లో 22 మంది గుండెపోటుతో మరణించారు. వీరిలో దాదాపు సగం మంది 45 ఏళ్ల లోపు వారు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ భయంకరమైన పరిస్థితిని గమనిస్తే, మన దేశం ఈ హృదయ సంబంధిత జబ్బుల ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అర్థమవుతోంది.
గణాంకాలు ఏం వెల్లడిస్తున్నాయి:
మన దేశంలో గత మూడు సంవత్సరాలుగా గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం, 2022లో గుండెపోటు కారణంగా 32,457 మంది మరణించారు. ఇది అంతకుముందు సంవత్సరంలో నమోదైన 28,413 మరణాల కంటే చాలా ఎక్కువ. ఈ నివేదిక ప్రకారం 2022లోనే గుండెపోటు కేసులలో 12.5% పెరుగుదల నమోదైంది. ప్రపంచ గణాంకాలలో భారతదేశం హృద్రోగ మరణాల రేటులో రెండవ స్థానంలో ఉంది. మన దేశంలో ఏటా మరణిస్తున్న వారిలో సుమారు 20% పురుషులు, 17% స్త్రీలు ఉన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం మన దేశంలో స్త్రీల కంటే పురుషులలో హృదయ సంబంధిత మరణాల రేటు ఎక్కువగా ఉంది. లక్ష మందిలో పురుషులలో 349 మంది, స్త్రీలలో 265 మంది మరణిస్తున్నారు. ఈ రేట్లు యూనైటెడ్ స్టేట్స్ కంటే రెండు నుండి మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. దేశంలో అకస్మాత్తుగా సంభవించే మరణాలలో దాదాపు 57% కేవలం గుండెపోటు వల్లే జరుగుతున్నాయి.
మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులైన పురుషులే ఉన్నారు. అంతేకాకుండా 2020 నుంచి 2023 మధ్య వచ్చిన గుండెపోటు కేసుల్లో దాదాపు సగం మంది 40 ఏళ్ల లోపు వారే. ఇది యువతలో గుండె జబ్బులు వేగంగా, తక్కువ వయసులోనే వస్తున్నాయనే ప్రమాదకరమైన వాస్తవాన్ని తెలియజేస్తోంది. ముఖ్యంగా, 30 ఏళ్ల లోపు వారిలో మరణాలు గత కొన్ని సంవత్సరాలలో 40% పెరిగాయి.
ప్రాంతాల వారీ ప్రభావం:
గుండెపోటు మరణాలు ప్రధానంగా మహారాష్ట్ర, కేరళ, గుజరాత్ రాష్ట్రాలలో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు వంటి ఇతర పెద్ద రాష్ట్రాలలో కూడా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సంక్షోభం కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించి ఉందని ఇది నిరూపిస్తుంది. జీవనశైలి, జనాభా, ఆరోగ్య సంరక్షణ సదుపాయాల కొరత వంటి కారణాల వల్ల పశ్చిమ, దక్షిణ రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువ కనిపిస్తోంది.
హాస్పిటల్ అధ్యయనాలు కూడా 2020 నుంచి దాదాపు సగం మంది గుండెపోటు రోగులు 40 ఏళ్ల లోపు వారే అని చెబుతున్నాయి. గతంలో హృద్రోగాలు వృద్ధులకే వస్తాయనే భావన ఉండేది. కానీ ఇప్పుడు గుండె సమస్యలతో యువకులు అకాల మరణాలకు గురవుతున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా, యువతలో గుండెపోటు సమస్య ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. చాలా మందికి తమకు ప్రమాదం ఉందని కూడా తెలియదు. యువ నిపుణులు, విద్యార్థులు, కార్మికులు వంటి వివిధ వర్గాల వారు కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురవుతున్నారు.
ప్రధాన కారణాలు:
దేశంలో గుండెపోటు కేసులు పెరగడానికి అనేక ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలు దోహదపడుతున్నాయి. అందులో ముఖ్యమైనవి ఫాస్ట్ ఫుడ్, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలతో నిండిన ఆధునిక జీవనశైలి యువతలో ఊబకాయం, అధిక రక్తపోటు, అనారోగ్యకరమైన కొవ్వు నిల్వలకు (లిపిడ్ ప్రొఫైల్లో తేడాలు) దారితీస్తున్నాయి. యువత తమ దినచర్యలో ఎక్కువ భాగాన్ని పనిలో లేదా విశ్రాంతి పేరుతో కూర్చుని గడుపుతున్నారు. ఇది బరువు పెరగడానికి, హృదయనాళ ఫిట్నెస్లో క్షీణతకు, తద్వారా గుండె సమస్యలకు దారితీసే ప్రమాదాన్ని పెంచుతుంది.
పొగాకు వినియోగం, మాదకద్రవ్యాలు, మద్యం వాడకం మరొక ముఖ్య కారణం. ఉద్యోగాల్లో ఒత్తిడి, ఎక్కువ పని గంటలు, సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల దీర్ఘకాలికంగా ఒత్తిడి పెరిగి గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. దీర్ఘకాలిక ఒత్తిడి అనేక విధాలుగా గుండె ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. డిప్రెషన్ను ఎదుర్కొంటున్న యువకులకు, డిప్రెషన్ లేని వారితో పోలిస్తే, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయని కొత్త అధ్యయనాలు కనుగొన్నాయి. దీనికి తోడు, వంశపారంపర్యంగా ప్రజలకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అయితే మన ప్రస్తుత జీవనశైలి ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతోంది. ముఖ్యంగా రద్దీగా ఉండే నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం కూడా గుండె జబ్బుల రేటును పెంచుతోంది.
సవాళ్లు:
గుండెపోటు సంక్షోభాన్ని పరిష్కరించడానికి భారతదేశం కొన్ని పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో ప్రధానమైనవి. అవగాహన లేకపోవడం, త్వరగా గుర్తించడం తక్కువగా ఉండటం. చాలా మంది ముఖ్యంగా యువత, గుండెపోటు లక్షణాల గురించి సరిగా తెలుసుకోవడం లేదు. అలాగే ముందు జాగ్రత్తగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఇది ముఖ్యంగా ఆరోగ్య సేవలు తక్కువగా ఉండటం వల్ల మరింత తీవ్రమవుతోంది.
గ్రామీణ ప్రాంతాల్లో సరైన అత్యవసర సేవలు, గుండె పరీక్షా కేంద్రాలు లేకపోవడం వల్ల చికిత్స అందించడంలో ఆలస్యం అవుతోంది. అంతేకాకుండా, సాంస్కృతిక అడ్డంకులు కూడా ఉన్నాయి. ఎందుకంటే పెరుగుతున్న పని ఒత్తిడి, చదువుల ఒత్తిడి వంటివాటికి తగినట్లుగా ప్రజారోగ్య కార్యక్రమాలు లేవు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, గుర్తించని దీర్ఘకాలిక జబ్బులు అధిక సంఖ్యలో ఉన్నాయి. అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటివి చాలా మందిలో అసలు ఉన్నట్లు కూడా గుర్తించడం లేదు. ఒకవేళ గుర్తించినా 20% కంటే తక్కువ మంది మాత్రమే వాటిని అదుపులో ఉంచుకుంటున్నారు.
పరిష్కారాలు:
ఈ ప్రమాదకరమైన పరిస్థితిని మార్చడానికి తక్షణమే అనేక చర్యలు తీసుకోవాలి. మొదటగా, పెద్ద ఎత్తున గుండె ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. గుండె ఆరోగ్యం గురించి, దాని లక్షణాల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. అంతేకాకుండా పని ప్రదేశాలు, పాఠశాలల్లో తగిన ఆరోగ్య చర్యలు తీసుకోవాలి. అంటే, ఆఫీసులు, స్కూళ్లలో సరైన పని వేళలు, ఒత్తిడిని తగ్గించే పద్ధతులు, ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉండేలా చూడాలి. తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం హృద్రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కొవ్వు పదార్ధాలు, చక్కెర పానీయాలు వంటి ప్యాకేజీ చేయబడిన, ప్రాసెస్ చేయబడిన ఆహారాల వినియోగాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. తక్కువ చక్కెర, కొలెస్ట్రాల్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్రమమైన వ్యాయామ దినచర్యను నిర్వహించడం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను, రక్తపోటును తగ్గిస్తుంది మరియు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పెద్దలందరికీ ప్రతి వారం కనీసం 150 నిమిషాల మితమైన వ్యాయామం చేయాలని సిఫార్సు చేసింది. అనారోగ్య కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.
కాబట్టి, ధూమపానం మానేయడం హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆల్కహాల్ అధిక వినియోగం హృదయ సంబంధిత వ్యాధులకు దోహదం చేయడంతో పాటు, రక్తపోటుకు కూడా దారితీస్తుంది. చిన్న పట్టణాలు, గ్రామాల్లో అత్యవసర ఆరోగ్య సేవలు, గుండె జబ్బుల మందులు తక్కువ ధరలో అందేలా చూడాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం వల్ల బరువు తగ్గడం, ఇతర సమస్యలు దూరమవుతాయి. చివరగా, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి పేదలకు సబ్సిడీ ఆరోగ్య సేవలు, ఉచిత స్క్రీనింగ్ క్యాంపుల నిర్వహణను తమ ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకోవాలి.
గుండెపోటు ఇప్పుడు చిన్న, మధ్య వయస్కుల జీవితాలను దెబ్బతీస్తోంది. ఛాతీ నొప్పి, చేయి లేదా దవడ వరకు నొప్పి రావడం, అకస్మాత్తుగా ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. ముందస్తు గుర్తింపు ప్రాణాలను కాపాడుతుంది. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నా, జీవనశైలి సరిగా లేకపోయినా, ఈసీజీ, కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి కీలకమైన పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, చురుకైన జీవనం గుండెపోటు ప్రమాదాన్ని సగానికి తగ్గిస్తాయి.
పొగాకును మానేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం కేవలం మందులు వాడటం కంటే మెరుగైన ఫలితాన్నిస్తాయి. పెరుగుతున్న ఈ మరణాలకు తక్షణమే పరిష్కారం చూపాలి. గుండె ఆరోగ్యంపై దృష్టి పెట్టడం, మనందరి ప్రవర్తనలో మార్పు రావడం రాబోయే దశాబ్దంలో అత్యంత కీలకం. ఈ హృద్రోగ సంక్షోభాన్ని కేవలం గణాంకాలుగా చూడకూడదు. ప్రతి గుండెపోటు వెనుక ఒక కుటుంబం విచ్ఛిన్నం అవుతున్న బాధ ఉంది. మన సమాజం ఈ సవాలును స్వీకరించి ప్రతిరోజూ గుండె ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే మన తర్వాతి తరానికి ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్తు లభిస్తుంది.










