CINEMATelugu Cinema

కుక్కకు వాయిస్ ఓవర్ ఇచ్చిన దర్శకుడు..

దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అందమైన సినిమాలలో గోదావరి ఒకటి. దీనికి ముందు శేఖర్ కమ్ముల తీసిన ఆనంద్ బాక్సాఫీస్ వద్ద చాలా పెద్ద విజయం సాధించింది. అందుకే, తర్వాత చిత్రం కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చాలని గోదావరి తీశాడు. మొదట ఈ చిత్రానికి హీరోగా రవితేజను, పవన్ కల్యాణ్ ను అనుకున్నా వారి కాల్ షీట్లు బిజీగా ఉండటంతో సుమంత్‌ను ఫైనల్ చేశాడు. కథానాయికగా ఆనంద్ మూవీ హీరోయిన్ కమలిని ముఖర్జీని ఎంపికైంది. 

రెండో హీరోయిన్‌గా నీతూ చంద్ర.. మిగిలిన పాత్రలలో కమల్ కామరాజు, తనికెళ్ల భరణి, మధుమణి, కరాటే కళ్యాణి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై జి.వి.జి రాజు నిర్మించారు. సినిమాటోగ్రాఫర్‌గా విజయ్ సి. కుమార్, ఎడిటర్‌గా మార్తాండ్ కె వెంకటేష్ పని చేశారు. సినిమాలో రామ్, సీత పాత్రలలో సుమంత్, కమలిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సీత పాత్రను శేఖర్ కమ్ముల డిజైన్ చేసిన తీరు యువతను కట్టిపడేసింది. 

మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇందులోని కోటిగాడు అనే కుక్క పాత్రకు స్వయానా దర్శకుడు శేఖర్ కమ్ములానే వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ చిత్రం అత్యధిక భాగం షూటింగ్‌ను గోదావరి నది, పాపికొండల ప్రాంతంలోనే చిత్రీకరించారు. ఈ చిత్రానికి సంగీతం కె.ఎం.రాధాకృష్ణన్ అందించారు. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. 

2006వ సంవత్సరం మే 19న విడుదలైన గోదావరి.. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి రూ.4.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి రూ.5.21 కోట్ల షేర్‌ను రాబట్టింది. దాంతో బయ్యర్లకు ఈ చిత్రం రూ.1 కోట్లు వరకూ లాభాలను మిగిల్చి హిట్ లిస్ట్ లోకి చేరింది. అంతేకాకుండా, 2006వ సంవత్సరంలో రెండవ ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ నేపథ్య గాయని వంటి ఐదు విభాగాల్లో నంది అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ తెలుగు గీత రచయితగా సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకుంది. ఈ సినిమా కంటెంట్ పరంగానే కాకుండా మ్యూజిక్ పరంగానూ సూపర్ హిట్ అయ్యింది.

Show More
Back to top button