
భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్లో చాలా విలువైనది ఓటు హక్కు. ప్రజలకు మంచిపాలన అందించే ప్రధాన ఆయుధం. కానీ చాలా మంది ఓటర్లు పోలింగ్ రోజు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. నా ఒక్క ఓటే కదా వేయకపోతే ఏమవుతుందనే ధోరణిలో కొందరు ఉన్నారు. కానీ గెలుపోటముల్లో ప్రతి ఓటు కీలకమే.
కొన్ని రాజకీయపార్టీలు అమలుకు నోచుకోని హామీలు ఉచితాలు’ ఆర్థిక ప్రలోభాలు ప్రకటిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు చూస్తున్నాయి. కాబట్టి ఓటర్లు తమ కున్న ఓటు హక్కును ఉత్తమ అభ్యర్థుని ఎన్నుకోవడంలో విజ్ఞత ప్రదర్శించాలి. ఎన్ని కలపై నిర్లక్ష్యం వద్దు.. ఎన్నికలు అంటే అవి నాయకులకే పరి మితమైనవని సాధారణ పౌరసమాజం ఎన్నికల పట్ల ఆసక్తి చూపకపోవడం వల్ల అవినీతి పరులు చట్ట సభలకు ఎన్నికై రాజకీయ అవినీతికి పాల్పడి కోట్లాది సంపాదనకు రాజకీయాలు మార్గమైనాయి. కాబట్టి ప్రశ్నించే నీ ఓటును తప్పకుండా ఉపయోగించుకో. ఓటు వేయకుంటే ప్రశ్నించే తత్వం బలహీన పడుతుందని నిపుణులు అంటున్నారు.
అంతేకాదు ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల ధైర్యంగా స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి ఆయా సమస్యలను నేరుగా తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా అన్ని ప్రధాన పార్టీలు నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలను తయారు చేసి కాలనీలు, అపార్ట్మెంట్లలో పంచుతున్నారు. తాగునీరు, రోడ్లు ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల గెలిచిన అభ్యర్థి ఆయా సమస్యలపై దృష్టి పెట్టకపోతే నిలదీసే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అసలు ఓటే వేయకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోయినట్లేనని నిపుణులు వివరిస్తున్నారు. కాబట్టి ఇంతటి అమూల్యమైన నీ ఓటుని తప్పకుండా ఉపయోగించుకుని అవినీతిలేని సమజాన్ని సృష్టిద్దాం.






