Telugu Special Stories

భారతదేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన తొలి ప్రధాని.. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ!

భారతదేశ రాజకీయాల్లో జవహర్ లాల్ నెహ్రూ కీలకమైన నిర్ణయాలు తీసుకొని, దేశ పురోగతిని సాధించారు. స్వాతంత్ర్యం లభించిన కాలం నుంచి సుదీర్ఘ కాలం ప్రధానిగా కొనసాగిన నేత.. భారతదేశ తొలి ప్రధాని, మేధావి, ప్రపంచ రాజనీతిజ్ఞుడు, రచయిత, చరిత్రకారుడు,   భారత రాజకీయ దురంధరుడు.. నెహ్రూజీ.

రెండువందల సంవత్సరాలుగా దేశం పరాధీనంలో ఉండి, ఆర్ధికంగా అస్తవ్యస్తమైన రోజులవి…. ఈస్టిండియా కంపెనీ, తదుపరి పాలన చేసిన బ్రిటిషు ప్రభుత్వం కూడా దేశాన్ని దోచుకపోవడం..

ఈ దుస్థితిలో దేశాన్ని ఆర్థికంగా సుస్థిరం చేయడం అవసరమని ఆయన భావించాడు. అంతేగాకుండా దేశంలోని సంపద అంతా కొద్దిమంది చేతుల్లోకి చేరడం.

ఎక్కువమంది నిరుపేదలుగా జీవించే పద్ధతిని మార్చి, సోషలిస్టు దృక్పథంతో దేశ ఆర్ధిక పరిస్థితిని పూర్తి స్థాయిలో చక్కదిద్దేందుకు ఆయన పూనుకున్నాడు. 

ప్రపంచ దేశాలన్నిటితో స్నేహసంబంధాలను పెంచి పోషించాడు. ఫలితంగా ప్రపంచ దేశాలకు రాజకీయ సలహాదారుగా భారత్ ను తీర్చిదిద్దిన ఘనత ఆయనదే..

1947 ఆగస్టు నెల 15న స్వాతంత్య్రం సిద్దించిన నేపథ్యంలో ఆ యోధుల చరిత్రలను స్మరించుకోవాల్సిన ఆవశ్యం ఎంతైనా ఉంది.

ఇందులో భాగంగా నేడు జవహర్ లాల్ నెహ్రూ జీవిత, రాజకీయ విశేషాల గురుంచి ప్రత్యేకంగా తెలుసుకుందాం:

నేపథ్యం:

1889 నవంబర్ 14న జన్మించారు జవహర్ లాల్ నెహ్రూ. వీరి కుటుంబీకులు కాశ్మీరు పండిత బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. తండ్రి

మోతీలాల్ నెహ్రూ. తల్లి స్వరూపరాణి. జవహర్ తో పాటు ఇద్దరు కూతుళ్లు విజయలక్ష్మి, కృష్ణలు. తండ్రి మోతీలాల్ అప్పట్లో ప్లీడరు పట్టా పొందారు.

సొంతూరు కాశ్మీరు వదిలి పెట్టి, అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. అక్కడే “ఆనందభవన్” అనే పేరుతో చక్కని గృహాన్ని నిర్మించుకున్నారు.

తర్వాతి రోజుల్లో భారత స్వాతంత్ర్యోద్యమంలో జాతీయ కాంగ్రెసు నాయకులు ఈ ఆనంద భవనాన్నే విడిది గృహంగా, కార్యవేదికగానూ మల్చుకున్నారు.

పేరుమోసిన లాయర్ గా, అప్పటి సంపన్నులలో ఒకరిగా నిలిచారాయన. 

ప్రాథమిక విద్య ఇంటి దగ్గర ప్రైవేటు ఉపాధ్యాయుల వద్దే నడిచింది. 15ఏళ్ల వయసులో ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్ కు వెళ్లారు.

అప్పటి ఇంగ్లాండు రాజకుటుంబీకుల కుమారులతో సమానంగా, జవహర్ లాల్ కాలేజీ విద్యను పూర్తి చేశారు. గుర్రపుస్వారీ, ఈత అంటే ఎంతో ఇష్టం.

జవహర్ అంటే, గులాబీ పుష్పం అని అర్ధం. తన పేరుకు తగినట్లుగానే జవహర్ ఎల్లప్పుడూ తన కోటుకు గులాబీ పుష్పాన్ని ధరిస్తూ ఉంటాడనీ ప్రతీతి.   

యుక్తవయసుకు రాగానే కమలతో వివాహం జరిగింది. అనంతరం లండన్ లో బారిస్టర్ పట్టా పొందారు. తిరిగి 1912లో భారత్ కి చేరుకున్నారు. ఆనాడు అలహాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ గృహం.. ఆనందభవనం.. గాంధీజీ, తిలక్, అజాద్, పటేల్ వంటి జాతీయ నాయకులతో కిటకిటలాడుతూ ఉండేది. జాతీయోద్యమ కార్యక్రమాలు, చర్చలలో చురుగ్గా పాల్గొనేవారు నెహ్రూ. అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి కావటంతో.. పురాతన, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపట్ల అంతగా ఆసక్తి కనబరిచేవారు కాదు. మూఢాచారాలను  వ్యతిరేకించేవారు. కారణం పాశ్చాత్య దేశాలలో ఎక్కువ కాలం ఉండటమే. అయితేనేం దేశదేశాల చరిత్రలను, సంస్కృతిని ఆకళింపు చేసుకున్నారు. ఈ కారణంగానే జాతీయ పోరాటంలో యువకులకు ప్రాతినిధ్యం వహించాడు. 

రాజకీయాల్లో

1929లో తండ్రి మోతిలాల్ నెహ్రూ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగా పదవి విరమణ చేశారు. 

కొన్నాళ్ళకు తండ్రి చేతుల మీదుగానే జవహర్ లాల్ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించారు. కాంగ్రెసు మహాసభలలో భాగంగా హిందూస్తాన్ సేవాదళ్ ఆవిర్భవించింది. దీనికి ప్రథమ అధ్యక్షుడిగా జవహర్ లాల్ ఎన్నిక కావడంతో, రాజకీయాల్లో కీలక అంకం మొదలైంది.

ఇదే ఏడాది లాహోర్ లో జరిగిన కాంగ్రెసు సమావేశానికి నెహ్రూ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలోనే “సంపూర్ణ స్వరాజ్యం” తన అంతిమ ధ్యేయమని కాంగ్రెసు ప్రకటించింది. దీంతో జాతీయ పోరాటంలో నూతన ఘట్టం ప్రారంభమైంది. తన అధ్యక్షోపన్యాసంలో “నేను సామ్యవాదిని, ప్రజాస్వామ్యవాదిని” అని నెహ్రూ స్పష్టంగా ప్రకటించారు.

1931లో మహాత్మాగాంధీ అధ్యక్షతన హిందూస్తాన్ సేవాదళ్ మహాసభలు జరిగి, తరువాయి కాంగ్రెసు పార్టీలో విలీనం చెందాయి. ఈ మహాసభలను హిందూస్థాన్ సేవాదళ్ వాలంటీర్లు కలిసి జాతీయ స్థాయిలో నిర్వహించడం విశేషం.

అప్పటికీ స్వాతంత్రోద్యమం ఉదృతం కావడంతో సేవాదళ్ ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకొని జాతీయ పోరాటంలో భాగస్వామి అయ్యింది.

1936లో జవహర్ లాల్ అఖిల భారత కాంగ్రెసుకు రెండవసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. లక్నో సమావేశంలో కాంగ్రెసు విధానాలకు ఒక కొత్తదనంతో కూడిన స్వరూపాన్ని జవహర్ లాల్ రూపొందించారు. భారతదేశ విదేశాంగ విధానం ఎలా ఉండాలో నిర్ణయించడంలో ప్రత్యేక పాత్ర పోషించారు. శాంతి, స్వాతంత్ర్యాల కోసం పోరాడడం, ప్రపంచంలో ఎక్కడ స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్నా దాన్ని బలపరచటం, వలస రాజ్య విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించడం… ప్రధాన అంశాలుగా ప్రతిపాదిస్తూ…కాంగ్రెసు పార్టీ అనుసరించవలసిన విదేశాంగ విధానాన్ని నెహ్రూ సూత్రీకరించి, ఆమోదింపచేశారు. అప్పటి జాతీయోద్యమంలోనూ, స్వాతంత్ర్యం లభించిన తరువాత మన విదేశాంగ విధానానికి ఈ సూత్రాలే ప్రధానమయ్యాయి.

1937లో జరిగిన ఫెయిజపూర్ కాంగ్రెసు సమావేశం కూడా నెహ్రూ అధ్యక్షతనే జరిగింది. వ్యవసాయ రంగంపై వివిధ రాష్ట్రాల కాంగ్రెసు కమిటీలు సమర్పించిన నివేదికలను ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. దేశంలోని వ్యవసాయ సమస్యలకు సంబంధించి ఒక సమగ్రమైన తీర్మానాన్ని ఈ మహాసభలో ఆమోదించడం జరిగింది. 

1938లో జరిగిన హరిపురా కాంగ్రెసు మహాసభ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో… అభివృద్ధి ప్రణాళికను రచించడానికి జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ సంఘం ఒక ప్రణాళిక సంఘాన్ని నెలకొల్పింది. స్వాతంత్ర్యం లభించిన తరువాత నెలకొల్పబడిన ‘జాతీయ ప్రణాళిక సంఘానికి’ ఇది మార్గదర్శి అయ్యింది.

కుటుంబం

జవహర్, కమలానెహ్రూల ఏకైక సంతానం ఇందిరా ప్రియదర్శిని. ఇందిరా 17వ ఏటనే కమలానెహ్రూ అనారోగ్యంతో మరణించింది. భార్య మరణం జవహర్ లాల్ ను కృంగదీసింది. పిన్న వయస్కురాలైన ఇందిరను తనతోపాటే ప్రతిచోటుకి వెంట తీసుకువెళ్లేవాడు నెహ్రూ. తల్లిలేని లోటును తెలియకుండా చేయడానికి అతిగారం చేసి పెంచారు. అయితే జాతీయ పోరాటంలో భాగంగా తరచూ జైలుకు వెళ్లవలసి వచ్చేది నెహ్రూ. అప్పుడు జైలు నుంచి ఇందిరాకి ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. ఆ ఉత్తరాల్లో ముఖ్యంగా దేశవిదేశాల చారిత్రిక పోరాట గాథలు, మహాపురుషుల జీవిత ఘట్టాలు, భారతదేశ సంస్కృతి, చరిత్రలతో పాటు ఎన్నో విజ్ఞానదాయకమైన సంగతులను వివరిస్తూ రాసేవారు. ఈ లేఖలు ఒక్క ఇందిరకు మాత్రమే రాసినప్పటికీ, తదుపరి గ్రంథస్థం చేయబడ్డాయి. ఆపై అవి ఎందరో యువతీయువకులకు విజ్ఞానాన్ని అందించాయి.

జాతీయ పోరాటంలో

జాతీయపోరాటంలో గాంధీజీ తరువాత, నెహ్రూ రెండవ స్థానంలో ఉంటారు. నిరంతరం స్వాతంత్య్ర పోరాట కార్యక్రమాల్లో నెహ్రూ తలామునకలై ఉండేవారు. 1946లో ఇంగ్లండ్ లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించి, అట్లీ ప్రధానమంత్రి అయ్యాడు. తదుపరి, భారతదేశానికి స్వాత్రంత్యం ఇవ్వడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. అప్పట్లో ఇండియాకు గవర్నరు జనరల్ గా లార్డ్ మౌంట్ బాటెన్ వచ్చాడు. మౌంట్ బాటెన్ ఆధ్వర్యంలోనే భారత్ కు స్వాతంత్ర్యం వచ్చింది. 

మౌంట్ బాటెన్ దంపతులతో నెహ్రూ బాగా సన్నిహితంగా ఉండేవాడు. చివరి రోజుల్లో మౌంట్ బాటెన్ తో నెహ్రూకు గల సంబంధాలే, స్వాతంత్య్రం అనంతరం కూడా ఇంగ్లండు భారతదేశాల మైత్రి కొనసాగడానికి కారణాలయ్యాయి.

1946లో భారతదేశంలో సాధారణ ఎన్నికలు జరిగాయి. చాలా రాష్ట్రాలలో కాంగ్రెసు అఖండ విజయాన్ని సాధించింది. కొన్నిచోట్ల ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలలో ముస్లింలీగ్ గెలిచింది. మొత్తంగా జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. బాబూ రాజేంద్రప్రసాద్ రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నూతన రాజ్యాంగ రచనా సంఘం ఏర్పడి, భారతదేశానికి నూతన రాజ్యాంగాన్ని రచించాల్సిన అవశ్యకం ఏర్పడింది. కాంగ్రెసును అప్పటిదాకా వ్యతిరేకిస్తూ వచ్చిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ను నెహ్రూ తన మంత్రివర్గంలోకి తీసుకొని, ఆయనకు న్యాయశాఖా మంత్రి పదవిని అప్పగించడం విశేషం. న్యాయశాస్త్ర కోవిదుడు, అభ్యుదయ భావాలు గల అంబేద్కర్ ను భారత రచనా సంఘానికి అధ్యక్షుని చేయడం వెనుక నెహ్రూ దూరదృష్టి లేకపోలేదు.

పార్లమెంటులో హిందూకోడ్ బిల్లును అంబేద్కర్ ప్రవేశపెట్టినప్పుడు దాదాపు పార్లమెంట్ లోని సభ్యులంతా ఈ బిల్లును వ్యతిరేకించారు.

ఆ సందర్భంలో నెహ్రూ ఒక్కరే అంబేద్కర్ ను సమర్ధించారు. హిందూ కోడ్ బిల్లు దేశానికి అవసరమని ప్రధాని నెహ్రూ వాదించాడు.

అయితే బిల్లు పాస్ అవ్వడానికి తగినంత మెజారిటీ లేక వీగిపోయినప్పుడు, ఎంతగానో విచారించారు.

అప్పట్లో పార్లమెంటులో సభ్యులుగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, భుపేశ్ గుప్తా, సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి వంటి హేమాహేమీలు ఉండేవారు.

అయినప్పటికీ పార్లమెంటు వ్యవహారాలను సజావుగా నిర్వహించడంలో నెహ్రూ నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారు.

నెహ్రూ మంత్రి వర్గంలో గోవిందవల్లభ్ పంత్, సర్దార్ వల్లభాయిపటేల్, వి.కె. కృష్ణమీనన్, చింతామణి దేశ్ ముఖ్, మొరార్జీ దేశాయ్, యస్.కె.పాటిల్ వంటి దిగ్దిగంతులు ఉండేవారు.

ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు

1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం లభించిన నాటి నుంచి చనిపోయేంతవరకు సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న నెహ్రూ దేశాన్ని అభ్యుదయ దిశలో పయనింపజేయడానికి ఎంతగానో కృషి చేశాడు.

రష్యాలో జరిగిన అక్టోబర్ విప్లవం ఆయన్ను ఎంతగానో ప్రభావితం చేసిందనే చెప్పాలి.

1955లో ఆవడిలో జరిగిన కాంగ్రెసు సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ రూపుదిద్దుకుంది.

ఆవడి తీర్మానం ప్రాతిపదికగా నెహ్రూ ప్రణాళికా సంఘాలను అమలుపరిచాడు. పంచవర్ష ప్రణాళికలు పేరుతో నిర్దేశించిన విధంగానే ప్రభుత్వం విధానాలను అమలు చేసేలా రూపకల్పన చేశాడు. 

వ్యాపార సరళిలో వ్యవహరించే పాశ్చాత్య దేశాల ఆర్ధిక సహాయాన్ని ఆశించకుండా జవహర్ రష్యాతో స్నేహ సంబంధాలను పెంచుకుని, ఆర్థిక సహకార ఒప్పందంతో దేశంలో భారీ పరిశ్రమలను నెలకొల్పాడు. భిలాయ్ ఉక్కు కర్మాగారమే ఇందుకు నిదర్శనం.

విదేశాంగ విధానాన్ని కూడా ఇదే విధంగా నెలకొల్పాడు. అప్పటి విదేశాంగశాఖ మంత్రి శ్రీ వి.కె. కృష్ణమీనన్.

అంతేగాక రష్యాతో ఆర్థిక ఒప్పందంతో పాటు, చైనాతో పంచశీల ఒప్పందం సాధించడం నెహ్రూ మేధా సంపత్తికి రుజువులు. దీంతో వర్ధమాన దేశాల కూటమికి రూపకల్పన కూడా జరిగింది.

ఇదే తృతీయ కూటమిగా కూడా చెలామణి అయింది. ఇటు పాశ్చాత్య దేశాల కూటమి, అటు కమ్యూనిస్టు దేశాల కూటమిలతో ప్రపంచ రాజకీయాల్లో పోటీ నెలకొంది.

ఈ తరుణంలో చిన్నచిన్న దేశాలు ఏదో కూటమిలో చేరక తప్పలేదు. ఆర్ధిక సహాయం పేరిటనో, ఆయుధ సహాయం పేరిటనో ఆశలు చూపి, తమపై ఆధారపడిన బడుగు దేశాలను లాక్కునే మృత్యున్యాయాన్ని ఎదిరించి జవహర్ లాల్ నెహ్రూ ఈజిప్టు, ఇండోనేషియా, శ్రీలంక వంటి దేశాల సహకారంతో వర్ధమాన దేశాల కూటమిని ఏర్పరచి, తృతీయ రాజకీయ శక్తిగా ప్రపంచానికి అందించారు.

దీంతో ప్రపంచ రాజకీయ మేధావిల జాబితాలో నెహ్రూ కీర్తి గడించారు. ఈ విజయం నెహ్రూ రాజనీతికి కలికితురాయిగా చెప్పొచ్చు.

రష్యా-అమెరికాల మధ్య యుద్ధ వాతావరణం, సూయెజ్ కెనాల్ జాతీయం చేసినప్పుడు ఈజిప్టుతో పశ్చిమ రాజ్యాలకు గల వైరం, శ్రీలంక వద్ద హిందూ మహాసముద్రంలో అమెరికా యుద్ధస్థావరాల ఏర్పాటు, క్యూబాలో ఫైడల్ కాస్ట్రో ఎర్రజెండా ఎగర వేసినందుకు అమెరికా కన్నెర్ర చేయడం, దక్షిణఫ్రికాలో జాతివిచక్షణ.. ఇవేకాక ఇతర సమస్యలలో ప్రపంచం ప్రతిక్షణం యుద్ధం అంచుకు చేరుతూ, దేశదేశాల్లోని ప్రజలు భీతిల్లుతున్న తరుణంలో, మూడవ ప్రపంచ యుద్ధం అనివార్యమేమోననే యుద్ధమేఘాలు ఆవరించిన సమయంలో నెహ్రూజీ శాంతి పావురాన్ని భూమండలం మీద ఎగరవేసి, శాంతి వాతావరణాన్ని ఏర్పరిచారు.

పరిశ్రమల రూపకల్పన….

జవహర్ లాల్ భారత్ లోకి భారీపరిశ్రమలను తీసుకొచ్చాడు. తద్వారా నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించగలదని ఆయన విశ్వసించారు.

భిలాయ్, దుర్గాపూర్ లలో ఉక్కు, ఇనుప కర్మాగారాలు, చిత్తరంజనలో రైలు ఇంజిన్ ల తయారీ, పెరంబూరు రైలు పెట్టెల కర్మాగారం వంటి భారీపరిశ్రమల స్థాపన వెనుక నెహ్రూ కార్యాచరణ ఉందని చెప్పుకోవాలి.

ఆంధ్రరాష్ట్ర నిర్మాణంలో కూడా జస్టిస్ వాంఛూ నివేదిక ప్రకారం ఆంధ్రుల కోర్కెను మన్నించి, రాష్ట్ర నిర్మాణాన్ని తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపాడు.

ఆంధ్ర ప్రదేశ్ పట్ల నెహ్రూ చూపిన ప్రేమాభిమానాలకు చిహ్నం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణమే. 

ఇతరాంశాలు

*జవహర్ లాల్ మంచి రచయిత కూడా. దేశదేశాల సంస్కృతులను భౌగోళిక, రాజకీయ స్థితిగతులను వివరిస్తూ భారతదేశ చరిత్రపై ఓ గ్రంథాన్ని రచించారు. “డిస్కవరీ ఆఫ్ ఇండియా” పేరుతో రచించిన ఈ గ్రంథం ఎన్నోసార్లు ముద్రణ జరిగింది.   1933-34లో ‘భారతదేశ గమ్యం ఎటు?’ అనే గ్రంథాన్ని నెహ్రూ ప్రచురించారు. సామ్యవాదం గురించి ప్రజల్లో అవగాహన రావడానికి ఉద్దేశించి రాసినది. 

*నెహ్రూజీ బాలలంటే ఎంతో ఇష్టపడేవాడు. అందుకే నెహ్రూ జన్మదినం బాలల దినోత్సవంగా నేటికీ నిర్వహిస్తున్నాం. ‘నేటి బాలలే రేపటి భావిభారత పౌరులం’టూ నెహ్రూజీ బాలల మీద ప్రేమానురాగాలను చూపేవాడు. చాచానెహ్రూ అంటూ పిల్లల దృష్టిలో నెహ్రూ స్థిరపడిపోయినాడు.

*విశాల దృక్పథం, అభ్యుదయ భావాలు, ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర వహించిన  నెహ్రూకి అనుకోకుండా చైనా భారత్ పై దాడి చేయడంతో నిర్వీణులయ్యారు.

తాను పెంచి పోషించిన పంచశీల వ్యర్థమైందని ఆవేదన చెందారు.(కారణం: టిబెట్టు బౌద్ధాచార్యుడు దలైలామా శరణార్థిగా భారతదేశం వచ్చినప్పుడు ఆయనకు ఆశ్రయమిచ్చి హిమాచల్ ప్రదేశ్ లో వసతి ఏర్పాటు చేసినందుకు కోపగించిన చైనా భారతదేశంపై కక్షగట్టి, దాడి చేసింది.) ఈ   సంఘటన నెహ్రూజీని బాగా క్షోభ పెట్టింది. 

*అప్పటికే కూతురు, శ్రీమతి ఇందిరాగాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించి, దేశ రాజకీయరంగంలోకి ప్రవేశించేలా చేసి, భవిష్యత్ భారతదేశ రాజకీయ సారథిగా ఆమెను తీర్చిదిద్దారు. 

*1964 మే 27న, నెహ్రూ తన 75వ వయస్సులో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు.   

నెహ్రూజీ ఆశయం మేరకు అలహాబాద్ లోనీ ఆనంద్ భవన్ మ్యూజియం, ఢిల్లీలో త్రిమూర్తి భవనంలో నెహ్రూజీ స్మృతి చిహ్నంగా నేటికీ అమరజ్యోతి వెలుగుతూనే ఉంటుంది.

Show More
Back to top button