HISTORY CULTURE AND LITERATURE

అత్యంత శక్తివంతమైన పార్వతీ దేవీ ఆలయాలు, అష్టాదశ శక్తి పీఠాలు..

ఈ చరాచర సృష్టి అంతా మాతృ స్వరూపమే. జగన్మాత అయిన ఆదిపరాశక్తి సృష్టి స్థితిలయాలకు కారణభూతురాలిగా, త్రిగుణ స్వరూపిణిగా, త్రిలోక పూజ్య గా, యుగయుగాలుగా ఎందరో దేవ దానవ మానవాది గణాలచేత కీర్తించబడుతోంది. ప్రపంచంలో అన్ని దేశాలకన్నా మన భారతదేశం ఎంతో పుణ్యప్రదమైనది. అందుకే ముక్కోటి దేవతలు ఈ పవిత్ర దేశంలో ఎన్నో రూపాలతో స్వయంభూలుగా నిలిచి భక్తులందరినీ తరింపజేస్తున్నారు. ఆ సేతుశీతాచల పర్యంతం శక్తి దేవాలయాలు మనకు అసంఖ్యాకంగా దర్శనమిస్తాయి.

ఉత్తర భారతంలో దుర్గారాధన, ఈశాన్య ప్రాంతంలో కాళీ, తార ఆరాధనలు దక్షిణ భారత దేశంలో శ్రీ లలితాదేవి ఆరాధనలు బహుళ ప్రాచర్యంలో ఉన్నాయి. ఇక దివ్యక్షేత్రాల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఎన్నో పేర్లతో, ఎన్నో రూపాల శక్తి ఆలయాలు విశేషంగా ఉన్నాయి. అయితే వీటన్నిటిలో విశ్వవిఖ్యాతమైనవి అష్టాదశ శక్తి పీఠాలు. పురాణాలను అనుసరించి 108 దివ్య శక్తి పీఠాలు, 52 శక్తిపీఠాలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ అష్టాదశ శక్తి పీఠాలు వీటన్నిటికన్నా దివ్య శక్తి సంపన్నమైనవిగా మహిమాన్వితమైనవిగా ఖ్యాతి పొందాయి.

హిందువులు, పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను “శక్తి పీఠాలు” అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. ఇవి 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను “అష్టాదశ శక్తి పీఠాలు” అని అంటారు.

శ్లోకం…

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం:

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే

ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా

కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా

ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ

జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ

అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్

సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్.

అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి, అవి అలంపురం, పిఠాపురం, శ్రీశైలం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో పన్నెండు మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా మన దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి. అందులో ఒకటి ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ, మరొకటి శ్రీలంకలోనూ ఉంది. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ(గయ – శిరోగయ, పిఠాపురం – పాదగయ, జాజ్‌పూర్‌ – నాభిగయ), రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం కూడా మరో విశేషం.

కథ సంక్షిప్తంగా…

దక్ష ప్రజా పతి కుమార్తె అయిన సతీదేవిని శివునికి వివాహము జరిపించినారు. ఒకానొక యజ్ఞ సందర్భముగా మామ, అల్లుళ్ళ మధ్య విభేదం తలెత్తినది. దక్ష ప్రజాపతి అల్లుని (శివుని) పై కక్ష సాధించడానికి దక్షుడు యజ్ఞం తలపెట్టి కూతురుని, అల్లుడిని తప్ప అందరినీ ఆహ్వానించాడు. ఈ సంగతి ఎలాగో సతీదేవికి తెలిసి తమకు ఆహ్వానం లేనందుకు మదనపడి అయినా పని తొందరలో మరచిపోయి ఉండవచ్చునని పిలవకపోయినా వెళ్లి చూచి రావచ్చునని తలపోసినది. పిలవని పేరంటానికి వెళ్ళవద్దని శివుడెంత చెప్పినా అమ్మవారు వినలేదు. తప్పనిసరియె శివుడామెకు నందీశ్వరాదులను తోడిచ్చి పంపించినాడు. శివుడు చెప్పినట్లే యజ్ఞవాటికలో ఘోరమైన అవమానము జరిగినది. ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు.

ఆమెకామెగా కల్పించుకొని త్రిమూర్తులలో సర్వశ్రేష్టుడైన శంకరుని పిలవకుండా యజ్ఞం చేయుట తగదని తండ్రికి హితవు చెప్పింది. తామసం తలకెక్కిన దక్షుడామె మాట వినకుండా సర్వదేవగణాల మధ్యన ఆ యజ్ఞవాటికలో నిలబడి యజ్ఞ పురుషుడైన శివుని అనరాని మాటలు అన్నాడు. ఆ శివదూషణ భరించలేని సతీదేవి ఆ యజ్ఞవాటికలోనే కాలి బ్రొటన వ్రేలితో యోగాగ్నిని కల్పించుకొని దానిలో దూకి తనువు చాలించింది. ఆ సంగతి తెలిసిన శివుడు ప్రళయరుద్రుడై తన జటను పెరికి కైలాస శిఖరానికి తాటించాడు. దానిలో నుండి భద్రకాళీసమేతుడు, అగణిత వీరగణ సహితుడూ అయిన వీరభద్రుడు ఆవిర్భవించాడు.

శివుని పంపున వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. దక్షుని తల నరికివేశాడు. బ్రహ్మాది దేవతల ప్రార్థనతో శివుడు రవంత శాంతించినాడు. కానీ సతీదేవి వినియోగాన్ని తట్టుకోలేక అమ్మవారి కాలిన దేహాన్ని భుజానికెత్తుకుని భువనత్రయాలన్నింటా వెర్రివాడిలా తిరగసాగినాడు. అది చూసి ప్రపంచమంతయు వనకనారంభించెను. దేవతలందరూ విష్ణుదేవుని కడకేగి జరుగుతున్న దానిని వివరించిరి. విష్ణుమూర్తి సంగతి గ్రహించి సతీదేవి శవం శివునకు కనిపించినంత కాలం ఆయన మారడని ఆలోచించిన మహా విష్ణువు సుదర్శన చక్రంతో అమ్మవారి కళేబరాన్ని ఖండ ఖండాలుగా చేసి భూమి మీద పడవేయగా అవి పద్దెనిమిది శక్తి పీఠాలుగా ఆవిర్భవించినాయి.

★ ఆ పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠ క్షేత్రాల గురించిన వివరాలు..

1. శాంకరీదేవి (శ్రీలంక)…

“శ్రీ సతీ శాంకరీదేవీ

త్రింకోమలి పురస్థితా

ఉత్తమాంగ ప్రభా గౌరీ

భక్త కామ ఫల ప్రదా”…

లంకాయాం శాంకరీదేవి అనగా మునులూ, ఋషుల లెక్కప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాకుండా, ఒకప్పుడు భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ఆ శిథిలాలయం ప్రస్తుతం అక్కడ కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసిన తరువాత ఈ ఆలయాన్ని కూలగొట్టేశారని చారిత్రకమైన ఆధారాలున్నాయి. ప్రస్తుతం అక్కడొక కేవలం ఒక స్తంభం మాత్రమే మనకు కనిపిస్తుంది. దగ్గరలో “త్రికోణేశహవర స్వామి” అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో “కాళీమందిరం” ప్రసిద్ధమైంది.

2. కామాక్షి (కాంచీపురం, తమిళనాడు)…

“కాంచీపుర శ్రితేదేవి

కామాక్షీ సర్వమంగళా

చింతాతన్మాత్ర సంతుష్టా

చింతితార్థ ఫలప్రదా”…

ఇక్కడ సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉన్నారు. పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితయై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి. ఈ కామాక్షి ఆలయం మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మహిషాసురుడు అనే రాక్షసున్ని సంహరించిన చాముండేశ్వరీదేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏంచేయాలని శివుణ్ని అడుగగా ప్రస్తుత కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని శివుడు చెప్పాడట. అలా ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని “ఆదిపీఠ పరమేశ్వరి” గా భక్తులు కొలుస్తారు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి “యోగపీఠం” గానూ, కామాక్షీదేవి ఆలయాన్ని “భోగపీఠం” గానూ భావిస్తారు భక్తులు.

3. శృంఖలా (పశ్చిమ బెంగాల్)..

“ప్రద్యుమ్నే వంగరాజ్యాయాం

శృంఖలా నామభూశితే

విశ్వ సంమోహితే దేవి

శృంఖలా బంధ నాశనీ”…

అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరూ కోల్‌కతకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటూ ఉంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న “చోటిల్లామాత” ను అక్కడివారు శృంఖలా (శృంగళా) దేవిగా భావిస్తారు. కానీ నిజానికి పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో ఉన్న “పాండువా” నే అసలైన శక్తి క్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ప్రతీ సంవత్సరం మాఘమాసం లో మాత్రం అక్కడ “మేళతాళ” పేరుతో ఒక ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూ, ముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.

ప్రద్యుమ్న నగరం అనేది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లో ఉంది. ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని “గంగాసాగర్” కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.

4. చాముండి (కర్ణాటక)…

అమ్మవారి తల వెంట్రుకలు పడిన చోటు (క్రౌంచ పట్టణం, మైసూరు, కర్ణాటక).

క్రౌంచపుర స్థితామాతా

చాముండా దుష్టనాశనీ

సర్వసిద్ధి ప్రదాదేవి

భక్త పాలన దీక్షితా…

హరుని రుద్రతాండవంలో “అమ్మవారి తల వెంట్రుకలు” వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం చెబుతోంది. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతీ శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.

5. జోగులాంబ (తెలంగాణ)…

“జోగులాంబా మహాదేవీ

రౌద్రవీక్షణ లోచనా

అలంపూరి స్థితామాతా

సర్వార్థఫల సిద్ధిదా”… 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు శక్తిపీఠాల్లో వెుదటిది ఈ జోగులాంబ క్షేత్రం. కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో “తుంగభద్ర” & “కృష్ణ” నదులు కలిసే స్థలంలో ఉంది. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఈ ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. దాంతో అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీనముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి.

6. భ్రమరాంబిక (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ )..

“శివపార్శ్వ స్థితా మాతా

శ్రీశైలే శుభ పీఠకే

భ్రమరాంభా మహాదేవి

కరుణారస వీక్షితా”…

ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీశైల క్షేత్రం. ఈ క్షేత్రం కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లికార్జునస్వామి సమేతులై ఉంది. 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం కుడా ఒకటి. విష్ణుచక్రభిన్న అయిన సతీ మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి.

అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతి “శక్తి” భ్రమర (తుమ్మెద) రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందనేది స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే శంకరాచార్యులవారు “సౌందర్య లహరి” కూడా రచించారని చెబుతుంటారు.

7. మహాలక్ష్మి (కొల్హాపూర్, మహారాష్ట్ర)..

“మహాలక్ష్మ్య బిదా దేవీ

కరవీర పుర స్థితా

పురుషార్ధ ప్రదామాతా

సంపూర్ణామృత వర్షిణీ”…

రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి “అంబాబాయి” గా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందనేది ప్రతీతి. ఇక్కడ సతీదేవి మూడు నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాత గానూ, కరవీరవాసిని గానూ కొలుస్తారు. ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయకాలంలో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణ ప్రతీతి. అందుకే కొల్లాపూర్‌ను “అవిముక్త క్షేత్రం” గా వ్యవహరిస్తారు.

8. ఏకవీరాదేవి (మాహు గ్రామం, నాందేడ్ వద్ధ, మహారాష్ట్ర)..

“ఏకవీరా మహాశక్తిః

మాహు గ్రామ గుహా స్థితా

భవానీ వీర విఖ్యాతా

ధర్మ రక్షణ తాత్పరా”…

మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు.

9. మహాకాళి (ఉజ్జయినీ, మధ్యప్రదేశ్)…

“ఉజ్జయిన్యాం మహకాళీ

మహాకాళేశ్వరేశ్వరి

సిప్రాతీరస్థితామాతా

వాంఛితార్థ ప్రదాయినీ”…

సప్త వోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని “దేవీ భాగవతం” చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. ఇదే ఉజ్జయినీ ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు వ్రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం కూడా.

10. పురుహూతిక ( పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ )…

“పురుహూత సతీమాతా

పరికాపుర సంస్థతా

పుత్రవత్పాతికా దేవి

భక్తానుగ్రహ దాయినీ”… 

పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం “పిఠాపురం”. కుక్కుటేశ్వర స్వామి అలయానికి ఒక కిలోమీటర్ దూరం లో అమ్మవారు దర్శనం ఇస్తుంది. కాకినాడ, సామర్లకోట నుంచి 20 కిలోమీటర్ల దూరం లో ఉంటుంది. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా, హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటూ ఉంటుంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో), తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే.

11. గిరిజాదేవి ( ఓఢ్య, జాజిపూర్, ఒరిస్సా)…

“ఓఢ్రదేశే భువనేశీ

గిరిజానామ సంస్థితా

పాలికాఖిలలోకానాం

పల్లవారుణ పాణినా”…

గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని ఓఢ్య, జాజ్‌పూర్‌ జిల్లాలో కొలువైన తల్లి. ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒడిషా – వైతరిణీ నది తీరాన ఉంది. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో అధికసంఖ్యలో ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.

12. మాణిక్యాంబ ( ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ )

“ద్రాక్షావట్యాం స్థితాశక్తిః

విఖ్యాతామాణి కాంబికా

వరదా శుభదా దేవి

భక్త మోక్షప్రదాయినీ”…

సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీ విడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణ ప్రతీతి. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు.

13. కామరూప (హరిక్షేత్రం, గౌహతి, అస్సాం)…

“శ్రీ కామరూపిణీ ఖ్యాతా

హరిక్షేత్రే సనాతనీ

యోనిముద్రా త్రిఖండేని

మాసే మాసే నిదర్సితా”…

అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. ఈ హరిక్షేత్రం గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం బ్రహ్మపుత్రా నది తీరంలో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది. ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో మూడు రోజుల పాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. ఈ ఆలయం కూచ్‌బేహార్‌ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవ్వరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.

14. మాధవేశ్వరి (ప్రయాగ, ఉత్తర ప్రదేశ్)…

మాధవేశ్వరీ మంగల్యా

ప్రయాగ స్థల వాసినీ

త్రివేణీ సంగమ తీరే

భుక్తిముక్తి ప్రదాయినీ…

అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ (అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో – ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ, సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వ్యవహరించడం ఇందుకు నిదర్శనం.

15. వైష్ణవీదేవి (కాంగ్రా , హిమాచల్ ప్రదేశ్)

“తుహినాద్రి స్థితామాతా

జ్వాలాముఖితు విశ్రుతా

జ్వాలా మాలా ప్రభాదేవీ

జ్ఞానవైరాగ్య వర్ధినీ”…

అమ్మవారి నాలుక హిమాచల్‌ప్రదేశ్‌ లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు “జ్వాలాయాం వైష్ణవీదేవి” అంటే అది ఈ గుడి కాదనీ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమనీ చెబుతారు.

16. మంగళగౌరి ( గయ, బీహారు )..

“సర్వమంగళ మంగల్యా

గయామంగల్య గౌరికా

అర్ధదా మోక్షదా దేవి

అక్షయ్య ఫల దాయినీ”…

సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. గయ, బీహారు లోని పాట్నా నుండి 74 కిలోమీటర్లు. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని “శిరోగయ” గా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీ నది. ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీ దేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు.

17. విశాలాక్షి (వారాణసి, ఉత్తర ప్రదేశ్)..

“విశాలాక్షీతి విఖ్యాతా

వారణాస్యాం శివాన్తికే

నిరతాన్న ప్రదాత్రీచ

నిర్భాగ్య జనతోషిణీ”…

సతీదేవి మణికర్ణిక (చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ, అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. ఆలయం వారాణసి, ఉత్తర ప్రదేశ్ లో వుంది. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.

18. సరస్వతి (జమ్ము, కాష్మీరు)..

“జ్ఞానప్రదా సతీమాతా

కాశ్మీరేతు సరస్వతీ

మహావిద్యా మహామాయా

భుక్తి ముక్తి ప్రదాయినీ”…

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. జమ్ము, కాష్మీరు లో ఉన్న ఈ అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకర విజయకావ్యం ద్వారా తెలుస్తోంది.

Show More
Back to top button