
నటీనటులు: బాలకృష్ణ, శ్రుతిహాసన్, హనీరోజ్, వరలక్ష్మి శరత్కుమార్, దునియా విజయ్, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, మురళీ శర్మ, సప్తగిరి, తదితరులు;
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ;
ఎడిటింగ్: నవీన్ నూలి;
సంగీతం: తమన్;
మాటలు: సాయి మాధవ్ బుర్రా;
నిర్మాణ సంస్థ: మైత్రిమూవీ మేకర్స్;
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, రవి శంకర్;
కథ, కథనం, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.
దర్శకుడు గోపీచంద్ బాలకృష్ణకు వీరాభిమాని. సగటు అభిమాని బాలయ్య నుంచి ఏం కోరుకుంటారో.. అందుకు తగట్టుగా ఆయన్ను ఎలా చూపించాలో కూడా బాగా తెలుసు. ఈ ఉద్దేశంతోనే రెండు పాత్రలతో కూడిన ఓ మాస్ కమర్షియల్ కథతో.. బాలకృష్ణను ద్విపాత్రాభినయం చేయించాడు.
కథలోకి వెళ్తే…
జై అలియాస్ జై సింహా రెడ్డి(నందమూరి బాలకృష్ణ), ఆయన తల్లి మీనాక్షి(హనీ రోజ్) ఇస్తాంబుల్లో
ఉంటారు. జైకు హీరోయిన్ ఈషా(శ్రుతి హాసన్) పరిచయమవుతుంది. కొన్నాళ్లకు ఇద్దరూ ప్రేమలో పడతారు. పెళ్లి విషయమై.. ఈషా, తన తండ్రి(మురళీ శర్మ)తో చెప్తుంది. అయితే సంబంధం గురించి మాట్లాడటానికి జై తల్లిదండ్రుల్ని ఇంటికి రమ్మంటాడు. అప్పటివరకు తండ్రి లేడని అనుకుంటున్న జై.. తన తల్లి ద్వారా నిజం తెలుసుకుంటాడు. జనం మీద ప్రేమతో.. సీమపైన అభిమానంతో ఊరిబాగు కోసం కత్తి పట్టిన గొప్ప నాయకుడు.. తన బావ వీరసింహారెడ్డి(బాలకృష్ణ) నీ తండ్రి అని చెబుతుంది. కొడుకు పెళ్లి విషయమై మాట్లాడటానికి ఇస్తాంబుల్ రమ్మని వీరసింహకు మీనాక్షి కబురు పంపుతుంది. అయితే వీరా.. సీమ వదిలి ఇస్తాంబుల్ వెళ్లాడని తెలుసుకున్న ప్రత్యర్థి ప్రతాప్ రెడ్డి(దునియా విజయ్) అతన్ని చంపేందుకుభార్య భాను(వరలక్ష్మీ శరత్ కుమార్)తో కలిసి అక్కడికి వెళ్తాడు. ఆ భాను ఎవరంటే, వీరసింహారెడ్డికి స్వయానా చెల్లెలు. ఎన్నో ఏళ్లుగా తన అన్న చావు కోసం ఎదురుచూస్తోంది. ఇందుకు శత్రువు ప్రతాప్ రెడ్డిని పెళ్లి చేసుకుంటుంది. మరి వీరసింహారెడ్డిని చంపేందుకు ఇస్తాంబుల్ వెళ్లిన ప్రతాప్ రెడ్డి, భానులు అనుకున్నది సాధించారా? అసలు అన్నను చంపాలని భాను ఎందుకు పగ పట్టింది? ప్రతాప్ రెడ్డికి అతనికి ఉన్న విరోధం ఏంటి? తన తండ్రి గతం తెలుసుకున్న జై శత్రువులకు ఎలా బుద్ధి చెప్పాడా?, లేదా? అన్నది మిగతా కథ.
ఎలా ఉందంటే…
ఈ తరహా కథలు మనకేం కొత్త కాదు.. ఇదివరకే వచ్చిన సమరసింహారెడ్డి, చెన్నకేశవ రెడ్డి, నరసింహానాయుడు..లో బాలకృష్ణ చేసిన యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్ తో ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ గా మారాడు. ఇప్పుడొచ్చిన ఈ వీరసింహారెడ్డిలో కాస్త తేడా.. చెల్లెలి సెంటిమెంట్ను జోడించడమే..
ఊరుబాగు కోసం కత్తి పట్టిన అన్న.. అతన్ని చంపి పగ తీర్చుకోవాలని 30ఏళ్లుగా ఎదురు చూసే చెల్లి.. ఈ పాయింటే సినిమాకు చాలా కీలకం.
ఫస్టాప్ లో ప్రతినాయకుడిని పరిచయం చేయడం..
ఆ వెంటనే ఒక యాక్షన్ ఎపిసోడ్తో ఇస్తాంబుల్లో జై పాత్ర పరిచయమవడం జరుగుతాయి. చకచకా జరిగిపోతాయి. కానీ జైకు తల్లి గతం చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక అక్కడ్నుంచి వీరసింహారెడ్డి పాత్ర పరిచయంతో.. ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లతో థియేటర్లో మోత మోగిపోతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ తో చక్కటి ట్విస్ట్ ద్వితీయార్ధంపై అంచనాలు పెంచాయి.
సెకండాఫ్లో వీరసింహారెడ్డికి అతని చెల్లికి మధ్య ఉన్న అనుబంధాన్ని.. అది పగగా మారడానికి గల కారణాన్ని చూపించారు. దీంతో పాటు ప్రతాప్ రెడ్డికి వీరసింహారెడ్డికి ఉన్న విరోధమేంటో తెలుస్తుంది. అయితే వీటన్నింటినీ తెరపై చూసి ఆస్వాదించడమే గొప్ప అనుభూతి.
ఎవరెలా చేశారంటే: వీరసింహారెడ్డిగా బాలకృష్ణ వెండితెరపై ఆయన నటవిశ్వరూపం చూపించారు. ఆ పాత్రే సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆ పాత్ర కనిపిస్తున్నంతసేపు ప్రేక్షకులకు మరో ఆలోచన ఉండదు. డైలాగులు.. పోరాట సన్నివేశాలు
ఆద్యంతం అలరిస్తాయి.
వరలక్ష్మీ శరత్కుమార్ పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగుంది. పగతో రగిలే చెల్లిగా.. అంతకు ముందు అన్నయ్యను ప్రేమించే ఆమె చక్కటి వేరియేషన్ చూపించింది. హనీరోజ్, శృతి హాసన్ లు ఫర్వాలేదనిపిస్తారు. ప్రతాప్ రెడ్డిగా దునియా పాత్రను తీర్చిదిద్దుకున్న విధానం కూడా బాగుంది.
మొత్తంగా సినిమాలో కథ ప్రాధాన్యం కాకున్నా… యాక్షన్, ఎలివేషన్ లనే ఎక్కువగా చూపించారు.
తమన్ సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణ తీసుకొచ్చాయి. రామ్-లక్ష్మణ్ పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
