2026 అక్టోబరుకు ప్రాజెక్టు పూర్తే లక్ష్యం నిర్దేశం..
*టైమ్లైన్కు ముందే పనులు పూర్తిచేసేలా కార్యాచరణ..
*పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనాడి..
పోలవరం ప్రాజెక్ట్ను ఎట్టిపరిస్థితుల్లోనూ 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. నిన్న (సోమవారం) పోలవరం ప్రాజెక్ట్ పనుల గురుంచి అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబరుకు పూర్తవుతుందని అంటున్నారు. 2026 అక్టోబరు నుంచే నీటిని నిల్వ చేసేందుకు వీలుగా నిర్మాణం పూర్తి చేయమని చెప్పాం. ఒకేసారి కాకుండా దశలవారీగా నీళ్లు నిలబెడుతూ పోవాలి’ అని,
ఈ ప్రాజెక్టు కార్యాచరణ గురుంచి ప్రకటించారు.
మా మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దిల్లీ వెళ్లి, కేంద్రజల్ శక్తి మంత్రిత్వ శాఖకు ఈ ప్రణాళికను వివరిస్తారు. విదేశీ నిపుణుల బృందం, కేంద్ర జలసంఘంతో కలిసి చర్చిస్తారు. వారి అభిప్రాయాలు సైతం తీసుకుంటారు. తర్వాత తుది ప్రణాళిక ఖరారవుతుందని సీఎం వెల్లడించారు.
ప్రాజెక్ట్ను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేసేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ, కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో తాము చర్చించామని, ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు దశలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని 2026 అక్టోబర్కల్లా పూర్తి చేస్తామన్నారు. డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ పనులను సమాంతరంగా చేపట్టవచ్చని నిపుణులు సూచించారన్నారు.
ఇకపోతే దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ పనులను వచ్చే ఏడాది జనవరి 2న చేపట్టనున్నట్లు, అందుకు అవసరమైన యంత్ర సామాగ్రిని ఇంజనీరింగ్ అధికారులు సిద్ధం చేస్తున్నారన్నారు. దీంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు 2026 మార్చికి పూర్తి చేస్తామని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారని, కానీ అంతకన్నా ముందే 2025 డిసెంబర్కు పూర్తి చేయాలని కోరారు.
ఈసీఆర్ఎఫ్ గ్యాప్- 1 పనులు ఫిబ్రవరి 2026 నాటికి, గ్యాప్- 2 పనులు 2027 డిసెంబర్లోగా పూర్తి చేస్తామని తెలిపారు. కానీ నిర్దేశించిన దానికన్నా ముందుగానే పూర్తి చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులను కోరుతూ ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించామన్నారు.
ప్రాజెక్ట్ సివిల్ పనులను 2026 మే, జూన్ నాటికి పూర్తి చేస్తే ఒక సీజన్ను కోల్పోకుండా ఉంటామని, 2026 నుంచి ప్రాజెక్ట్లో నీటినిల్వ ఉండేలా చేస్తామన్నారు.
ప్రాజెక్ట్ కుడికాల్వ, ఎడమ కాల్వ కనెక్టివిటీ పనులు 2026 జూన్లోగా పూర్తి చేయాలనీ, స్పిల్ ఛానల్ పనులను జూన్ నాటికి పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనులకు అవసరమైన అనుమతులను త్వరితగతిన తీసుకువచ్చేలా ఇంజనీరింగ్ అధికారులు కృషి చేయాలని ఆయన ఆదేశించినట్టు చెప్పారు.
పోలవరం పునరావాసంపై ప్రత్యేకంగా చర్చించారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యేలా అవసరమైన, ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేస్తానని సీఎం చెప్పారు. పునరావాసం కోసం ఒక ప్రత్యేకాధికారిని నియమిస్తామని వెల్లడించారు. 2026 నాటికి 41.15 మీటర్ల స్థాయికి పునరావాసం పూర్తి చేయాలన్నారు. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సీఎంకు ప్రజంటేషన్ ఇచ్చారు. సీఎం పర్యటనలో మంత్రులతో పాటు తదితరులు పాల్గొన్నారు.