1510 నుంచి దాదాపు 451 ఏండ్ల పాటు గోవా ప్రాంతం పోర్చుగీస్ పాలనలో ఉండేది. 1947లో భారత్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత కూడా గోవా పోర్టుగీస్ కాలనీగానే కొనసాగింది. స్వతంత్ర భారత ప్రభుత్వం పోర్చుగీస్ పాలకులతో 1950లో దౌత్యపరమైన చర్చలు జరిపినప్పటికీ ఇండియాలో విలీనం చేయడానికి ఇష్టపడని కారణంగా మరో మార్గం లేకపోవడంతో నాటి భారత ప్రభుత్వం తీసుకున్న మిలటరీ, దౌత్య చర్యలతో గోవా స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపు రావడం, 19 డిసెంబర్ 1961 రోజున 36 గంటల “ఆపరేషన్ విజయ్” మిలిటరీ చర్యతో గోవా భూభాగం, సముద్ర తీరం, గగనతలాలను 30,000 మంది భారత ఆర్మీ/నావీ/ఏయిర్ఫోర్స్కు చెందిన సాయుధ దళాలు ఆక్రమించి విజయవంతంగా గోవా, డయ్యూ, డమన్ ప్రాంతాలను పోర్చుగీస్ పాలన నుంచి విముక్తం చేయడంతో ఆయా ప్రాంతాలకు స్వతంత్రం కల్పించి భారత్లో అంతర్భాగంగా విలీనం చేయడం జరిగింది. 1987 తర్వాత కేంద్రకాల్తో ప్రాంతమైన గోవాకు 25వ రాష్ట్రంగా గుర్తించి రాష్ట్ర హోదా కల్పించారు.
పర్యాటకుల స్వర్గధామం:
పోర్చుగీస్ పాలన నుంచి గోవాను విముక్తం చేయడంలో ఎందరో మహాముభావులు తమ ప్రాణాలను సహితం లెక్కచేయకుండా స్వతంత్రం కోసం శ్రమించారని మరువరాదు. గోవా ప్రజల వైవిధ్యాలు, ఆ ప్రాంత సముద్ర తీరాల అందచందాలు, సాంస్కృతిక వికాసం లాంటివి నేటికీ గోవాను ఒక ప్రత్యేక రాష్ట్రంగా నిలుపుతూ, అసంఖ్యాక జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. పశ్చిమ భారత తీరప్రాంతంలో ఉన్న గోవా అందమైన బీచ్లు, చర్చిలు, పండుగలు, సాంస్కృతిక వైభవాలు, ఆకర్షణీయమైన వారసత్వ సంపదలకు నెలవుగా గుర్తింపు పొందింది.
విస్తీర్ణంలో అతి చిన్నది:
జనాభాపరంగా 4వ అతి చిన్న రాష్ట్రంగా, విస్తీర్ణంలో అతి చిన్న రాష్ట్రంగా అవిర్భవించిన గోవా ప్రస్తుత జనాభా 15.8 లక్షలు ఉన్నది. పనాజీ కేంద్రంగా ఏర్పడిన గోవాలో టూరిజం, వ్యవసాయం, మత్స్యపరిశ్రమ, అటవీ ఉత్పత్తులు, మైనింగ్, ఫార్మా పరిశ్రమలకు ప్రసిద్ధి చెంది ప్రతి ఏట అధిక పర్యాటకులను ఆకర్షిస్తున్నది. మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దులతో నైరుతి ప్రాంతంలో సముద్ర తీరాన వెలసిన గోవాలో 25 శాతం క్రిస్టియన్లు, 66 శాతం హిందువులు, 8 శాతం ముస్లిమ్లతో పాటు స్వల్ప సంఖ్యలో సిక్కులు, భౌద్దులు, జైనులు కూడా ఉన్నారు.
గోవా – రోమ్ ఆఫ్ ది ఈస్ట్:
గోల్డన్ గోవా’, ‘రోమ్ ఆఫ్ ది ఈస్ట్’గా పేరొందిన బహుభాషల కేంద్రమైన విలక్షణ గోవా పర్యాటకుల స్వర్గంగా నిలుస్తున్నది. భారత కిరీటంలో ఒక ఆణిముత్యంగా వర్థిల్లుతున్న గోవా చిన్న రాష్ట్రమైన పెద్ద హృదయాన్ని కలిగి ఉంది. మరాఠీ, కోంకన్, ఆంగ్ల భాషలను అధికంగా మాట్లాడే గోవాలో మండవీ, జువారీ లాంటి కొన్ని పుణ్య నదులు ప్రవహిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ జిల్లాలుగా విభజించబడిన గోవాలో అక్షరాస్యత రేటు 80 శాతంగా నమోదు అయ్యింది.
వాస్కోడె గామా అతి పెద్ద నగరంగా, మార్గామ్ నగరం వాణిజ్య కేంద్రంగా, పోండా సాంస్కృతిక నగరంగా నేడు గోవా రాష్ట్రం సుందర, సుమధుర అనుభవాలను ఆలవాలంగా భరతమాత ఒడిన ప్రశాంత జీవనానికి నెలవుగా నిలుస్తున్నది.