
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పాలకుల వల్ల పెరిగిన నిరుద్యోగం, తరిగిన ఆదాయం మూలాన ఉద్యోగాలు లేవు.. అభివృద్ధి లేదు..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అభివృద్ధి పనులు గాడిన పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇంటి వద్ద ఉండే మహిళల సాధికారత కోసం ఒక సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్రం కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమ్యాటిక్స్ లాంటి కీలక రంగాల్లో ఉన్న మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు.. సైన్స్ రంగంలో వారు సాధిస్తున్న విజయాల పట్ల అభినందనలు తెలియజేశారు. స్టెమ్ కోర్సు రంగాల్లో వృద్ధి అవకాశాలను కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం తేనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఏపీలో మహిళలకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
కొవిడ్ అనంతర పరిణామాలు.. అందుబాటులో ఉన్న సాంకేతికత అనేవి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’, ‘హై బ్రీడ్ వర్క్’ ప్రాముఖ్యతను పెంచాయి.
రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్క్ స్పేస్ వంటి నూతన కాన్సెప్ట్లు అనువైన ఉత్పాదక వాతావరణాన్ని సృష్టించడమే కాక వ్యాపారులు, ఉద్యోగులకు సమర్థవంతమైన ఫలితాలు అందిస్తాయని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి కార్యక్రమాలు మెరుగైన పని, జీవన సమతౌల్యతను సాధించడంలో సహాయపడతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, జీసీసీ పాలసీ 4.0 ఆ దిశగా గేమ్ ఛేంజర్ కానుందని చంద్రబాబు వెల్లడించారు.
ప్రతి నగరం, పట్టణం, మండలంలో ఐటీ కార్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు. అందుకు తగ్గ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా వివరించారు.
అట్టడుగు స్థాయిలో ఉపాధిని సృష్టించేందుకు ఐటీ, జీసీసీ సంస్థలకు పూర్తి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలు ఎక్కువ శ్రామికశక్తి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయన్నారు.
అదే జరిగితే ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యల వల్ల వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెరుగుతుందని, రిమోట్, హైబ్రిడ్ విధానాల్లో పనిచేసే మహిళలకు ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది.