జాతీయ రహదారుల వెంబడి వాహనదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టిసారించిన కేంద్ర ప్రభుత్వం కీలక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పరిశుభ్రమైన టాయిలెట్లు, బేబీ కేర్ రూమ్లతో పాటు మరిన్ని సౌలభ్యాలు కల్పిస్తూ ‘హమ్సఫర్ పాలసీ’ని ఆవిష్కరించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాలసీని ఇటీవల ప్రారంభించారు.
‘హమ్సఫర్ పాలసీ’ ప్రారంభం సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. హమ్సఫర్ బ్రాండ్ దేశ హైవే నెట్వర్క్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తుందని అన్నారు. ప్రయాణికులు, డ్రైవర్లకు అత్యంత భద్రత కల్పిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల వెంబడి సౌకర్యాలకు పర్యాయపదంగా మారుతుందని ఆయన అన్నారు. జాతీయ రహదారుల వెంబడి నాణ్యమైన, ప్రామాణికమైన సేవలను అందించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. హైవే నెట్వర్క్ అంతటా అత్యున్నత స్థాయి సౌకర్యాలను అందించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. అందరికీ వేగవంతమైన, చక్కటి అనుభూతితో నిరంతరాయ ప్రయాణాలను అందించడానికి కేంద్రం సంసిద్దంగా ఉందన్నారు.
జాతీయ రహదారిపై కార్లో వెళుతునప్పుడు సహజంగానే పిల్లలు ఆకలి అంటూ మారాం చేస్తుంటారు. వంటల్లో కల్తీ నూనె, నాసిరకమైన పదార్థాలు వాడతారనే భయంతో చిన్నారులపై పెద్దలు కన్నెర్ర చేస్తుంటారు. అయితే.. ఈ భయాలేవీ లేకుండా పిల్లలతో కలిసి పెద్దలు కూడా ఆ రోడ్డు పక్కనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫుడ్కోర్టులో భేషుగ్గా తినొచ్చు! అలాగే దారిలో అనారోగ్య సమస్య ఎదురైనప్పుడు.. ప్రమాదం సంభవించినప్పుడు కంగారుపడకుండా రోడ్డు పక్కనే ట్రామా సెంటరూ ఉంటుంది! ఈటరీలు, ట్రామా సెంటర్లే కాదు.. ఇబ్బందుల్లేని, సుఖవంతమైన ప్రయాణం కోసం ఫార్మసీలు, పెట్రోలు బంకులు, ఏటీఎంలు, రిపేర్ షాపులు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఇలా ఎన్నో వసతులను పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయరహదారులు, ఎక్స్ప్రెస్ వేల వెంబడి కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది.
ఈ మేరకు జాతీయ రహదారుల వెంబడి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు ఉద్దేశించిన ‘హమ్ సఫర్’ పాలసీని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. హమ్సఫర్ సేవలు అందించేవాళ్లు ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి పలు మినహాయింపులు ఉంటాయి. ప్రయాణికులు ‘రాజ్మార్గ్ యాత్ర’ యాప్ సాయంతో ఈ షాపుల లొకేషన్లను తెలుసుకోవచ్చు. అంతే కాకుండా షాపుల్లో, బంకుల్లో సేవలు, నాణ్యతపై ఈ యాప్ ద్వారా రేటింగ్ కూడా ఇవ్వొచ్చు. వీటిని తరచూ తనిఖీలు చేయడానికి ప్రత్యేక యంత్రాంగం ఉంటుంది. కాగా ఈ పాలసీ ఆవిష్కరణ సందర్భంగా గడ్కరీ మాట్లాడారు.
రాన్నున్న రోజుల్లో రోడ్డు భద్రత, ప్రయాణ సౌకర్యాలకు ‘హమ్ సఫర్’ పర్యాయ పదంగా మారుతుందన్నారు. ఈ సౌకర్యాలన్నింటినీ పర్యావరణ హితమైన పద్ధతిలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. హమ్ సఫర్ పాలసీతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహంతో పాటు ఉద్యోగాల సృష్టి జరుతుందని గడ్కరీ చెప్పారు. ‘‘ఎవరైతే ప్రయాణికుల నుంచి టోల్ వసూలు చేస్తారో.. వాళ్లు ప్రయాణికులకు భద్రత, సౌకర్యాలు కల్పించాలి’’ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
పెట్రోలు బంకుల యజమానులు నిబంధనల ప్రకారం ప్రయాణికులకు కనీస వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. హైవేలపై ఉన్న పెట్రోల్ బంకుల్లో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడం తప్పనిసరని చెప్పారు. చాలా పెట్రోల్ బంకుల్లో టాయిలెట్లకు తాళం వేసి ఉండటం తాను గమనించానని తెలిపారు. అలా ఉంటే పెట్రోల్ బంకులను మూసేస్తామని హెచ్చరించారు.
సౌకర్యాలు ఇవే..
‘హమ్సఫర్ పాలసీ’లో భాగంగా జాతీయ రహదారుల వెంబడి క్లీన్ టాయిలెట్లు, బేబీ కేర్ రూమ్లు, దివ్యాంగులకు వీల్చైర్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, పార్కింగ్ స్థలాలు, ఇంధన ఫిల్లింగ్ కేంద్రాల్లో డార్మిటరీ సేవలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ విధానం హైవే వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. వాహనదారులకు సురక్షితమైన, ఆనందదాయకమైన అనుభూతిని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈ విధానం వ్యవస్థాపకులకు సాధికారత అందిస్తుందని, ఉద్యోగాల సృష్టి, జీవనోపాధిని మెరుగుపరచడంలో తోడ్పాటునిస్తుందని కేంద్రం భావిస్తోంది.